యలమంచిలి రూరల్ : మర్రిబంద ప్యూజన్ సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమలో కూలీల నివాసంలో ఈ నెల 5వ తేదీ రాత్రి వంటగ్యాస్ లీకై జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా సువానీ గ్రామానికి చెందిన లోక్నాథ్ మూలి(44) బుధవారం మృతి చెందినట్టు యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర మీడియాకు తెలిపారు. గత శనివారం రాత్రి ప్యూజన్ ఇటుకల తయారీ పరిశ్రమలో కూలీలు నివాసముంటున్న షెడ్లలో ఓ గదిలో వంట గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం జరగ్గా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరు ఈ నెల 6వ తేదీన మృతి చెందగా బుధవారం మరొకరు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం మృతి చెందిన లోక్నాథ్ మూలికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం దినసరి కూలీలుగా ఇటుకల తయారీ పరిశ్రమలో చేరితే ప్రాణాలే కోల్పోవడం మృతుల కుటుంబీకులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. గాయపడిన మరో కూలీ జి.కృష్ణారెడ్డి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలియలేదు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా మృతులంతా ఇతర ప్రాంతాలకు చెందిన వారు కావడంతో వారికి మద్దతుగా ఎవరూ ఆందోళన చేయలేదు. దీనిని ఆసరాగా చేసుకున్న పరిశ్రమ యాజమాన్యం మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఎంత ఇస్తున్నారో ఇప్పటి వరకు ప్రకటించలేదు.
మృతి చెందిన లోక్నాథ్ మూలి
Comments
Please login to add a commentAdd a comment