గంజాయి రవాణాపై మరింత నిఘా | - | Sakshi
Sakshi News home page

గంజాయి రవాణాపై మరింత నిఘా

Published Thu, Oct 10 2024 3:04 AM | Last Updated on Thu, Oct 10 2024 3:04 AM

గంజాయి రవాణాపై మరింత నిఘా

● ఆధునిక సాంకేతికతతో డైనమిక్‌ వెహికల్‌ చెకింగ్‌ ● గంజాయి రైతులకు ప్రత్యామ్నాయం చూపాలి ● సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన పెరగాలి ● ఎస్పీల సమావేశంలో డీఐజీ గోపీనాథ్‌ జట్టి

సాక్షి, విశాఖపట్నం: ఏజెన్సీ నుంచి గంజాయి అక్రమ రవాణాపై నిఘా పెంచి, నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జట్టి ఆదేశించారు. బుధవారం విశాఖ రేంజ్‌ పరిధిలోని అనకాపల్లి, విజయనగరం, అల్లూరి, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి నియంత్రణలో భాగంగా డైనమిక్‌ వెహికల్‌ చెకింగ్‌ను ఆకస్మికంగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. రేంజ్‌ పరిధిలో ఎక్కడా గంజాయి సాగు జరగకుండా చూడాలని, గంజాయి పండించే రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణకు ’సంకల్పం’ కార్యక్రమం ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి చెక్‌ పోస్టుల వద్ద వాహన తనిఖీలను క్షుణ్ణంగా చేపట్టాలని, స్నిఫర్‌ డాగ్స్‌తో ఇప్పటికే గుర్తించిన హాట్‌ స్పాట్ల వద్ద తనిఖీలు చేయాలన్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గంజాయి కేసుల్లో పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేయాలన్నారు. పేకాట స్థావరాలపై కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి, దాడులు నిర్వహించాలని జిల్లాల ఎస్పీలను రేంజ్‌ డీఐజీ ఆదేశించారు.

దీపావళి వస్తోంది జాగ్రత్త

దీపావళి పండగ సందర్భంగా బాణసంచా దుకాణాలు, గోడౌన్ల వద్ద భద్రత ప్రమాణాలను పర్యవేక్షించాలని డీఐజీ ఆదేశించారు. అనధికారంగా బాణసంచా విక్రయాలు జరగకుండా చూడాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ప్రతి జిల్లాలో నేరాలు ఎక్కువగా జరిగే ఏరియాలను గుర్తించి, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ప్రజలకు సైబర్‌ మోసాల పట్ల అవగాహన కల్పించాలన్నారు. సైబర్‌ మోసానికి గురైతే 1930కు ఫిర్యాదు చేసే విధంగా చూడాలని, గతంలో నమోదైన సైబర్‌ కేసుల్లో బ్యాంకు అకౌంట్లలో ఫ్రీజ్‌ అయిన నగదు బాధితులకు తిరిగి చేరే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. దర్యాప్తులో ఉన్న హత్య కేసులు, లాంగ్‌ పెండింగ్‌ కేసులు, లైంగిక దాడులు, వరకట్న మరణాలు, పోక్సో కేసులను రేంజ్‌ డీఐజీ సమీక్షించి, దర్యాప్తు వేగవంతం చేయాలని జిల్లాల ఎస్పీలను విశాఖపట్నం రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జట్టి ఆదేశించారు. ఈ జూమ్‌ కాన్ఫరెన్సులో అనకాపల్లి ఎస్పీ ఎం.దీపిక, అల్లూరి ఎస్పీ అమిత్‌ బర్దర్‌, విజయనగరం ఎస్పీ వకుల్‌ జిందల్‌, శ్రీకాకుళం ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement