అనంతపురం కార్పొరేషన్: అనంతపురం అర్బన్ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి నామినేషన్ మహోత్సవం సోమవారం అట్టహాసంగా సాగింది. భారీ జన సందోహం మధ్య ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న అనంత.. రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఆర్ఓ శ్రీనివాస్కు నామినేషన్ పత్రాలు అందజేశారు.
అడుగడుగునా బ్రహ్మరథం..
అనంత వెంకటరామిరెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో వైఎస్సార్ సీపీ శ్రేణులు కదం తొక్కాయి. నగరంలోని 50 డివిజన్లతో పాటు అనంతపురం రూరల్, ఏ. నారాయణపురం, రుద్రంపేట పంచాయతీ, రాజీవ్ కాలనీ ప్రాంతాల నుంచి పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు తరలివచ్చారు. ఉదయం 9.30 గంటలకే పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే నివాసం వద్దకు చేరుకున్నారు. కోర్టు రోడ్డు, సుభాష్రోడ్డు, సప్తగిరి సర్కిల్ రోడ్లు జనసందోహంతో కిక్కిరిసిపోయాయి. సరిగ్గా ఉదయం 11.06 గంటలకు ఎమ్మెల్యే రోడ్ షో ప్రారంభమైంది. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో పాటు ఎంపీ అభ్యర్థి మాలగుండ్ల శంకర నారాయణ రోడ్షోలో అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రజలు వారికి అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు ఆద్యంతం ఉత్సాహంగా పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జోనల్ ఇన్చార్జ్ రమేష్గౌడ్ ఆధ్వర్యంలో 800 మందితో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని రమేష్గౌడ్, వక్ఫ్బోర్డు జిల్లా చైర్మన్ కాగజ్ఘర్ రిజ్వాన్, కార్పొరేటర్ సాకే చంద్రలు వేర్వేరుగా భారీ గజమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, వైఎస్సార్ సీపీ అనంతపురం, హిందూపురం నియోజకవర్గాల డిప్యూటీ రీజినల్ కో ఆర్డినేటర్ రాగే పరుశురాం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య, కార్పొరేటర్లు, సర్పంచ్లు, తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం అర్బన్ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ‘అనంత’ నామినేషన్
కదం తొక్కిన పార్టీ శ్రేణులు
అడుగడుగునా బ్రహ్మరథం