తాడిపత్రి అర్బన్: నోటుకు ఓటెయ్యనని ఓ విశ్రాంత ఉద్యోగి వినూత్న రీతిలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఓటుకు ఎలాంటి కానుకలు తీసుకోబడవు. భారత రాజ్యాంగాన్ని కాపాడుదామంటూ రాసిన కాగితాన్ని నోటీసులాగా తన ఇంటికి అతికించారు. వివరాల్లోకి వెళితే.. తాడిపత్రి పట్టణానికి చెందిన డి.షాషావలి దివ్యాంగుడు. స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో పనిచేసి రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. బుగ్గయ్య కాంపౌడ్లో నివాసముంటున్న షాషావలి తన ఇంటి ముందు ‘ఓటుకు ఎలాంటి కానుకలు తీసుకోబడవు....భారత రాజ్యాంగాన్ని కాపాడుదాం’ అంటూ రాసిన కాగితాన్ని తన ఇంటి ముందు గోడకు అతింకించాడు. దీంతో మంగళవారం అటుగా ప్రచారానికి వచ్చిన రాజకీయపార్టీల నాయకులు షాషావలి ఇంటికి అతికించిన పేపరును చూసి వెనక్కు వెళ్లిపోయారు. మరికొందరు షాషావలి నిర్ణయాన్ని అభినందించారు. ఏదైనా మార్పు ఒక్కరి నుండే సాధ్యమౌతుందని, అది తననుండే ప్రారంభిస్తున్నానని విశ్రాంత ఉద్యోగి షాషావలి అంటున్నారు.
ఇస్రో విజయాలు గర్వకారణం●
పుట్టపర్తి అర్బన్: ఉపగ్రహ వ్యవస్థలో ఇస్రో గర్వించ దగ్గ విజయాలు నమోదు చేసిందని బెంగళూరు ఇస్రో శాటిలైట్ సెంటర్ సైంటిస్ట్ శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తి సమీపంలోని సంస్కృతి ఇంజినీరింగ్ కళాశాలలో రీసెంట్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాస్ ప్రసంగిస్తూ ఉపగ్రహ రూపకల్పన, పరీక్ష, ట్రాకింగ్ తదితర విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సాంకేతిక విప్లవానికి భారతదేశం ఊపిరి పోస్తూ ప్రపంచానికి ఎన్నో అంశాలలో మార్గదర్శిగా ఉందన్నారు. అనంతరం పోస్టర్ ప్రజెంటేషన్, ఆకట్టుకునే 95 ప్రదర్శనల్లో ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ లోగనాథన్ వీరముత్తు, తైపీ యూనివర్సిటీ సైంటిస్ట్ డాక్టర్ నీలేష్, సైంటిస్ట్ వరోరా, అబుదాబీ ఖలీఫా యూనివర్సిటీ సైంటిస్ట్ రామచంద్రన్, సంస్కృతి కళాశాల చైర్మన్ విజయ్భాస్కర్రెడ్డి, డైరెక్టర్ అశోక్, ప్రిన్సిపాల్ డాక్టర్ సెంథిల్కుమార్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.