అనంతపురం అర్బన్: జిల్లా ప్రజలకు కలెక్టర్ వి.వినోద్కుమార్ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. గణనాథుని ఆశీస్సులతో జిల్లా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో అనందమయ జీవితం గడపాలని ఆకాంక్షించారు. పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించాలని సూచించారు.
పకడ్బందీగా పశుగణన
ఉరవకొండ: పశుగణన కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ వెంకటస్వామి ఆదేశించారు. డిసెంబర్ 31 వరకు కొనసాగే పశుగణన ప్రక్రియపై ఉరవకొండలోని లయన్స్ క్లబ్ కార్యాలయంలో డివిజన్ స్థాయి అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షించారు. గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం ఈ నెల 18 వరకు కొనసాగుతుందన్నారు. పశువుల షెడ్ల నిర్మాణానికి 90శాతం, గొర్రెల, మేకల షెడ్లకు 70శాతం రాయితీని ప్రభుత్వం ఇస్తోందన్నారు. కార్యక్రమంలో పశుసంవర్దక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వెంకటేష్, పశు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
సెంట్రల్ యూనివర్సిటీకి
ఐసీఎస్ఎస్ఆర్ ప్రాజెక్ట్లు
బుక్కరాయ సముద్రం: మండలంలోని జంతలూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీకి నీతి ఆయోగ్, న్యూఢిల్లీకి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ఐసీఎస్ఎస్ఆర్) వారి రెండు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్లు దక్కాయి. ఈ మేరకు ఆ వర్సిటీ వీసీ డాక్టర్ కోరి శుక్రవారం తెలిపారు. ఏపీలో కెపాసిటీ బిల్డింగ్ యూనివర్సిటీలను పర్యవేక్షించడం, మూల్యాంకణం చేయడమనే పేరుతో కేంద్ర ప్రాయోజిత పథకాలైన రాస్ట్రీయ బాల వ్యవస్థ (ఆర్బీఎస్కే), రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య, శక్తి నిర్మాణ్ ప్రభావాన్ని అంచనా వేయడం నీతి ఆయోగ్ ప్రాజెక్ట్ లక్ష్యం అన్నారు. ఈ ప్రాజెక్ట్ను యూనివర్సిటీ విద్యార్థులను క్లిష్టమైన విధాన పరిశోధనలలో చేర్చడం ద్వారా వారి విద్య, ఆచరణాత్మక సామర్థ్యాలను మెరుగు పరుస్తుందన్నారు. ఈ విభాగానికి చెందిన పీహెచ్డీ, ఎంఎస్సీ, బీఎస్సీ విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల నుంచి సమాచారాన్ని సేకరిస్తారన్నారు. ఈ ప్రాజెక్ట్ల పర్యవేక్షణ బాధ్యతలు దక్కిన ఆర్థిక శాఖ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కేశవరెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బ్రజరాజ్ మిశ్రాను వీసీతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment