ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం  | Sakshi
Sakshi News home page

ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం 

Published Sat, Jun 10 2023 5:19 AM

Formation of 12th PRC without asking - Sakshi

సాక్షి, అమరావతి: అడగకుండానే 12వ పీఆర్సీని ఏర్పాటు చేసినందుకు.. సీపీఎస్‌ ఉద్యోగులకు ఊరటనిస్తూ జీపీఎస్‌ విధానాన్ని తెచ్చి నందుకు.. పది వేలకుపైగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించినందుకు.. ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ను ప్రభుత్వంలో విలీనం చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వారు సీఎంతో సమావేశమైన అనంతరం మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు ఉద్యోగుల సంక్షేమం కోసం కూడా సీఎం పాటుపడుతున్నారని ప్రశంసించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..   

ఉద్యోగుల కోసం పరితపిస్తున్న సీఎం జగన్‌
ప్రజలతో పాటు  ఉద్యోగుల సంక్షేమానికీ పెద్దపీట వేస్తున్నారు. అడగకుండానే 12వ పీఆర్సీ ఏర్పాటు చేశారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులు 25 ఏళ్లుగా పనిచేసినా.. చనిపోతే మట్టి ఖర్చులు ఇవ్వలేని పరిస్థితి గతంలో ఉంది. ఇప్పుడు ఒక్క నిర్ణయంతో వారి ఉద్యోగాలను క్రమబద్దీకరించారు. ఏపీవీపీని ప్రభుత్వంలో విలీనం చేసి... ఆ శాఖలో పనిచేసే ఉద్యోగులకు 010 ద్వారా వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను 36 విడతల్లో ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. అన్ని జిల్లాల్లో ఒకే హెచ్‌ఆర్‌ఏ ఇచ్చారు. సీపీఎస్‌ ఉద్యోగులకు జీపీఎస్‌ ద్వారా 50 శాతం ఫిట్‌మెంట్‌తో పెరిగే ధరలకు అనుగుణంగా డీఏలు ఇచ్చి పెన్షన్‌ ఇస్తామని చెప్పడం ద్వారా భవిష్యత్‌కు భరోసా ఇచ్చారు.  మా కోసం ఇంతగా పరితపిస్తున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. జగన్‌ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం. సీఎం వైఎస్‌ జగన్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు భారీ ఎత్తున పాలాభిషేకాలు చేస్తున్నారు.  
 – బండి శ్రీనివాసరావు, అధ్యక్షుడు, ఏపీఎన్జీవో సంఘం 
 
మానవతామూర్తి సీఎం వైఎస్‌ జగన్‌ 
వైఎస్సార్‌  2008లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. 2014 ఎన్నికల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధికరిస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మోసం చేశారు.  సీఎం జగన్‌ ఇచ్చి న మాట మేరకు 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించి.. వారి జీవితాల్లో వెలుగులు నింపిన మానవతామూర్తి. గతంలో పీఆర్సీ కోసం రోడ్డెక్కితే టీడీపీ సర్కార్‌ గుర్రాలతో ఉద్యోగులను తొక్కించింది. ఇప్పుడు ఎవరూ అడగకుండానే సీఎం వైఎస్‌ జగన్‌ పీఆర్సీని ప్రకటించి.. ఉద్యోగుల పట్ల తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు.   – శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఏపీఎన్జీవో సంఘం

ఎప్పటికీ రుణపడి ఉంటాం..
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు.  ఎప్పటికీ రుణపడి ఉంటాం. 
– రత్నాకర్‌ బాబు, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సంఘం నేత 

 
జీపీఎస్‌తో మేలు జరుగుతుందని భావిస్తున్నాం 
జీపీఎస్‌లో పది శాతం ఉద్యోగి షేర్, ప్రభుత్వ షేర్‌ కొనసాగుతుందని సీఎం జగన్‌ చెప్పారు. ఉద్యోగి రిటైర్‌ అయ్యాక గ్యారెంటీ పింఛన్‌ వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. జీపీఎస్‌తో ఉద్యోగులకు 60 శాతం ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నాం.     
– మురళీ మోహన్, సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నేత 

 
15 ఏళ్ల సమస్యకు సీఎం పరిష్కారం 
ఆస్పత్రుల్లో 15 ఏళ్లుగా ఉన్న సమస్యలను సీఎం జగన్‌ పరిష్కరించారు. రెగ్యులర్‌ ఉద్యోగులమైనా మాకు జీతాలు రావటం లేదు. కానీ సీఎం జగన్‌ దృష్టికి రాగానే ఒకే ఒక్క సంతకంతో సమస్య తీర్చారు. వైద్య విధాన పరిషత్‌ ద్వారా అత్యంత మెరుగైన సేవలు అందిస్తాం. 
 – సురేష్‌ కుమార్, ఏపీవీపీ సంఘం నేత  

నా 23 ఏళ్ల సర్విసులో ఇది అద్భుతం   
నా 23 ఏళ్ల సర్విసులో ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని రకాల పరీక్షలకు సంబంధించి పరికరాలు ఏర్పాటు చేయడం అద్భుతం. కాంట్రాక్టు ఉద్యోగులమైన మమ్మల్ని రెగ్యులరైజ్‌ చేసినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు.   
– వీఏవీఆర్‌ కిశోర్, ఏపీ కాంట్రాక్టు ఫార్మాసిస్టు, ల్యాబ్‌ టెక్నీషియన్‌ల  సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  

Advertisement
 
Advertisement
 
Advertisement