
సాక్షి, అమరావతి: ఔషధాల క్రయవిక్రయాల్లో అవకతవకలు, నకిలీ, నాణ్యత లేని మందుల చెలామణి, మెడికల్ షాపుల్లో అక్రమాలను అరికట్టడానికి డీజీ స్థాయిలో తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. ఔషధ నియంత్రణా విభాగంపై గురువారం మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఔషధ నియంత్రణా విభాగం మరింత సమర్థంగా పనిచేయాలని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది ఖాళీల భర్తీకి నివేదిక తయారుచేయాలని చెప్పారు.
కేంద్ర ఔషధ నియంత్రణ శాఖకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాన్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులకు లేఖ రాయాలన్నారు. సీఆర్యూ ఫిర్యాదుల వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వైద్యశాఖ ప్రత్యేక, ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఔషధ నియంత్రణ డీజీ కొల్లి రఘురామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.