బాల్య వివాహం చేశారని తండ్రి ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

బాల్య వివాహం చేశారని తండ్రి ఫిర్యాదు

Published Tue, Apr 23 2024 8:35 AM

-

పెద్దతిప్పసముద్రం : మద్యం మత్తులో ఉన్న తనకు తెలియపరచకుండా తన కుమార్తెకు బాల్య వివాహం చేశారని కన్న తండ్రి జల్లా గంగిరెడ్డి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధిత తండ్రి కథనం మేరకు వివరాలిలా...మండలంలోని కందుకూరు పంచాయతీ నిలువురాతిపల్లికి చెందిన జల్లా గంగిరెడ్డి, భాగ్యమ్మ దంపతులు. వీరి కుమార్తె (14) కందుకూరు జెడ్పీ హైస్కూల్‌లో తొమ్మిదవ తరగతి చదువుతోంది. ఈ దంపతులు తమ కుమార్తెను ఇదే మండలంలోని అంకిరెడ్డిపల్లి పంచాయతీ తోకలవారిపల్లికి చెందిన బాలిక అమ్మమ్మ అయిన రమణమ్మ ఇంట్లో వదలి బతుకుదెరువు కోసం బెంగళూరుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో అమ్మమ్మ అయిన రమణమ్మతో పాటు ఆమె కుమార్తె సుజాతలు కర్నాటక రాష్ట్రం చేలూరు సమీపంలోని నల్లగుట్లపల్లికి చెందిన ఆదినారాయణ అనే యువకుడితో పరిచయం చేసుకున్నారు. అంతేగాక కన్నవాళ్లకు తెలియపరచకుండా తమ బిడ్డ వివాహం గురించి మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఉన్న తమను త్వరగా రావాలని కబురు పెట్టగా ఆదివారం రాత్రి తోకలవారిపల్లికి వచ్చామన్నారు. మద్యానికి బానిసైన తనను పూటుగా మద్యం తాపించారని, తాను మత్తులో ఉండగా తనతో పాటు తన భార్య భాగ్యమ్మను బలవంతంగా నల్లగుట్టపల్లికి కారులో తరలించారన్నారు. అక్కడ ఓ ఆలయంలో జరుగుతున్న తమ బిడ్డ పెళ్లి తతంగాన్ని చూసి తన భార్య కూడా ప్రశ్నించడంతో బలవంతంగా తాళి కట్టి వివాహం జరిపించేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కన్నవాళ్ల అనుమతి లేకుండా మైనర్‌ అయిన తమ బిడ్డకు పెళ్లి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గంగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేసాడు.

Advertisement
Advertisement