సందట్లో సడేమియా.. ఐటీ కంపెనీలకు వల వేస్తున్న కేరళ! | Sakshi
Sakshi News home page

సందట్లో సడేమియా.. ఐటీ కంపెనీలకు వల వేస్తున్న కేరళ!

Published Thu, Mar 28 2024 7:28 PM

Move to our state Kerala minister to Bengaluru MNCs - Sakshi

బెంగళూరులో నీటి కొరత.. పొరుగు రాష్ట్రాలకు పెట్టుబడుల కోసం ఐటీ కంపెనీలను తమ రాష్ట్రాలకు రప్పించే అవకాశంగా మారింది. ‘ఎకనామిక్ టైమ్స్‌’ ఒనివేదిక ప్రకారం..  కేరళకు మారాలని బెంగళూరులోని కొన్ని ఎంఎన్‌సీ కంపెనీలకు తాను లేఖ రాసినట్లు కేరళ పరిశ్రమలు, న్యాయ శాఖ మంత్రి పి.రాజీవీ తెలిపారు. 

తమ రాష్ట్రంలో కర్ణాటక కంటే మెరుగైన నీటి వనరులు ఉన్నాయని, గణనీయమైన పెట్టుబడులకు కేరళ అనువైన ప్రదేశం అని మంత్రి రాజీవీ పేర్కొన్నారు. ‘బెంగళూరులో తీవ్రమైన నీటి సంక్షోభం ఉందని తెలుసుకున్నాం. కాబట్టి మేము కొన్ని ఐటీ కంపెనీలను సంప్రదించి కేరళకు తరలించమని కోరాము. మా రాష్ట్రం మంచి ప్రణాళికాబద్ధమైన నీటి సదుపాయాలు కలిగి ఉంది. సహజ వనరులతో నిండి ఉంది. మేము వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను అందిస్తాం’ అన్నారు.

ఇదీ చదవండి: కంపెనీ మారే ఆలోచనలో ఉద్యోగి.. స్వయంగా రంగంలోకి గూగుల్‌ కోఫౌండర్‌

కేరళను దేశంలోని కొత్త సిలికాన్ వ్యాలీగా మార్చాలనే తన ఆశయాన్ని మంత్రి రాజీవీ వెల్లడించారు. ‘‘ప్రస్తుతం కేరళలో పెట్టుబడులపై కొన్ని కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయి. మా రాష్ట్రం కొత్త సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారే అవకాశం ఉంది. ఆ దిశగా కంపెనీలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం.  బెంగళూరు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నందున, కంపెనీలకు తదుపరి అతిపెద్ద ఐటీ గమ్యస్థానంగా కేరళ తనను తాను ప్రదర్శించుకోవాలనుకుంటోంది’ అన్నారు. 66వ నెంబర్‌ జాతీయ రహదారి వెంబడి నాలుగు కొత్త ఐటీ కారిడార్లను నిర్మించాలని కేరళ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement