
ప్రభుత్వ రంగ బ్యాంకులు సమర్థంగా పని చేసేందుకు వీలుగా కేంద్రం చర్యలు చేపడుతోంది. బ్యాంకులను సారథ్యం వహిస్తున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, హోల్టైమ్ డైరెక్టర్ల పనితీరును పరిగణనలోకి తీసుకుని ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్(పీఎల్ఐ)’లో సవరణలు చేస్తున్నట్లు ప్రకటించింది.
పీఎల్ఐ అందుకోవాలంటే అర్హతలు
రిటర్న్ ఆన్ అసెట్స్ (ఆర్ఓఏ): బ్యాంకులకు పాజిటివ్ ఆర్ఓఏ ఉండాలి. మొత్తం బ్యాంకు మిగులుపై మెరుగైన రాబడులుండాలి.
ఎన్పీఏ: నికర నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 1.5 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. ఒకవేళ అంతకంటే ఎక్కువగా ఉంటే ఆర్థిక సంవత్సరంలో కనీసం 25 బేసిస్ పాయింట్లు ఎన్పీఏ తగ్గించాలి.
కాస్ట్ టు ఇన్కమ్ రేషియో (సీఐఆర్): సీఐఆర్ 50% లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. వచ్చే ఆదాయం, చేసే ఖర్చుల మధ్య నిష్పత్తిని అది సూచిస్తుంది. ఒకవేళ ఇది 50 శాతం కంటే ఎక్కువగా ఉంటే ఏడాదిలో మెరుగుదల చూపించాలి.
ప్రోత్సాహకాలు.. ఇతర వివరాలు
నిబంధనల ప్రకారం బ్యాంకులు మెరుగ్గా పనితీరు కనబరిస్తే వారి సారథులకు పీఎల్ఐలో భాగంగా ఒకే విడతలో నగదు చెల్లిస్తారు. లేటరల్ నియామకాల్లో వచ్చిన వారు, డిప్యుటేషన్ పై ఉన్న అధికారులు సహా స్కేల్ 4, ఆపై అధికారులు ఈ పథకానికి అర్హులు. ఉద్యోగం నుంచి తొలగించిన వారు దీనికి అనర్హులు.
ఇదీ చదవండి: రూ.25 వేలతో మూడేళ్లలో రూ.33 కోట్ల వ్యాపారం!
2023-24 ఆర్థిక సంవత్సరం పనితీరును పరిగణనలోకి తీసుకుని ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఆర్థిక సంవత్సరం మార్చి 31 నాటికి బ్యాంకు ఆడిట్ చేసిన గణాంకాల ఆధారంగా పనితీరును లెక్కించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment