నాదెండ్ల: ఈత సరదా ముగ్గురు మృతికి కారణమైంది. ఈ విషాద ఘటన పల్నాడు జిల్లా కనపర్రు నుంచి సాతులూరు వెళ్లే మార్గమధ్యలో సోమవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. నరసరావుపేట రూరల్ మండలం, మొలకలూరు గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులు గేరా పురుషోత్తం(20), బోరుగడ్డ ఆకాష్(20), చలమల రాజు(20) ఆదివారం ఉదయం ఎండుగుంపాలెంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ముగ్గురు ద్విచక్ర వాహనంపై వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో సరదాగా ఈత కొట్టేందుకు కాలువలో దిగారు. కాలువ పక్కనే బైక్ను నిలిపి చెప్పులు, దుస్తులు, సెల్ఫోన్లు గట్టుపై పెట్టి కాలువలోకి దిగారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ తెల్లవారేసరికి ముగ్గురు శవాలుగా తేలారు. సోమవారం ఉదయం అటుగా వెళ్తున్న ఎండుగుంపాలెం వాసులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలాన్ని చిలకలూరిపేట రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డి, నాదెండ్ల ఎస్ఐ జె.బలరామ్రెడ్డి పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈతగాళ్లను పిలిపించి మృతదేహాలను వెలికితీయించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. యువకుల మృతితో మొలకలూరు ఎస్సీ కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది.
ముగ్గురూ స్నేహితులే...
మృతులు ముగ్గురు స్నేహితులు. వేర్వేరు పనులు చేసుకుని జీవిస్తుంటారు. గేరా పురుషోత్తం ఇటీవల ఇంటర్ పరీక్షలు రాశాడు. తండ్రి రాజేష్ వ్యవసాయకూలి. బోరుగడ్డ ఆకాశ్ కార్పెంటర్గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. తండ్రి బాజీ కూలిపనులు చేస్తుంటాడు. చలమల రాజు తెలంగాణలోని నల్గొండ చెక్పోస్టు వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ముగ్గురు మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ముగ్గురు ద్విచక్రవాహనంపై ఆదివారం ఉదయం ఎండుగుంపాలెంలో జరిగే వేడుకకు వెళ్తున్నామని చెప్పి బయలుదేరారు. రాత్రి అయినా ఇంటికి చేరకపోయేసరికి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై వెతుకులాట ప్రారంభించారు. కాలువలో మృతదేహాలున్నాయన్న సమాచారంతో కుటుంబ సభ్యులు తీరని విషాదంలో మునిగిపోయారు.
కనపర్రు – సాతులూరు మధ్య
సాగర్ కాలువ వద్ద ఘటన