ఘనంగా సత్యదేవుని ధ్వజస్తంభ ప్రతిష్ఠ | Sakshi
Sakshi News home page

ఘనంగా సత్యదేవుని ధ్వజస్తంభ ప్రతిష్ఠ

Published Tue, Apr 23 2024 8:20 AM

- - Sakshi

నమూనా ఆలయంలో స్వామి, అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ

పాల్గొన్న దేవదాయ కమిషనర్‌

అన్నవరం: సత్యదేవుని ఆలయ చరిత్రలో మరో చరి త్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సత్యదేవుని ఆల యం ముందు స్వర్ణ ధ్వజస్తంభం, జాతీయ రహదారి పై విశాఖపట్నం – విజయవాడ మార్గంలో డిగ్రీ కళాశాల సమీపంలో నిర్మించిన నమూనా ఆలయంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ శిఖరంపై కలశ ప్రతిష్ఠా మ హోత్సవాలు సోమవారం ఉదయం 10.48 గంటల సుమూహూర్తంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.

ధ్వజస్తంభం ప్రతిష్ఠించారిలా..

రత్నగిరిపై స్వామివారి ఆలయంలోని అనివేటి మండపంలో ఉన్న ధ్వజస్తంభానికి ఉదయం 9 గంటలకు పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ ధ్వజస్తంభాన్ని పైకి లేపి ఆలయం ముందు శ్లాబ్‌కు ఉన్న రంధ్రం ద్వారా నిటారుగా నిలబెట్టి, చివర కలశలు ఏర్పాటు చేశారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠా పూజలను దేవస్థానం ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ దంపతులు నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవదాయ శాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ, నెల్లూరుకు చెందిన దాత దంపతులు, దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ కె.రామచంద్ర మోహన్‌ దంపతులు ధ్వజస్తంభ ప్రతిష్ఠ కోసం తవ్విన గొయ్యిలో నవధాన్యాలు, నవరత్నాలు, పంచలోహాలు, నవపాషాణాలు వేసి, పూజలు చేశారు. తరువాత భక్తులు కూడా వివిధ నాణేలు, నవరత్నాలు సమర్పించారు. పాత ధ్వజస్తంభం పునాదిలో బయటపడిన 15.4 గ్రాముల బంగారు వస్తువులు, నవరత్నాల ఉంగరం, 850 గ్రాముల బరువైన రాగి రేకును కూడా కమిషనర్‌, ఈఓ పునాది గోతిలో వేశారు. దేవస్థానంలో డార్మెట్రీ నిర్మించిన దాత పెన్నాడ రాజామణి కూడా నవరత్నాలు, నవధాన్యాలు సమర్పించారు. అనంతరం భక్తులు జై సత్యదేవ అని భక్తిపారవశ్యంతో నినాదాలు చేస్తూండగా ధ్వజస్తంభాన్ని లాంఛనంగా క్రేన్‌ సహకారంతో అత్యంత చాకచక్యంగా ఆ గోతిలోకి దించి నిలబెట్టారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభాన్ని తాకేందుకు పలువురు భక్తులు పోటీ పడ్డారు. అనంతరం యాగశాలలో నాలుగు రోజులుగా జరుగుతున్న అధివాస పూజలు, హోమాల పూర్ణాహుతి ఘనంగా నిర్వహించారు. యాగశాల నాలుగువైపులా ప్రతిష్ఠించిన కలశాల్లోని పవిత్ర జలాలతో ఆలయ ప్రాకారంలో ప్రదక్షిణ నిర్వహించి, ప్రధానాలయంలోని స్వామి, అమ్మవారు, శంకరుల మూలవిరాట్టులు, ధ్వజస్తంభం, భక్తులపై జల్లారు. ఈ కార్యక్రమాల్లో విశ్రాంత వేద పండితులు ముష్టి కామశాస్త్రి, వేదపండితులు గొల్లపల్లి ఘనపాఠి, చిట్టి శివ, ముష్టి పురుషోత్తం, వైదిక కమిటీ సభ్యుడు, వ్రత పురోహిత ప్రముఖుడు చామర్తి కన్నబాబు, పురోహితులు పాలంకి పట్టాభి, అర్చకులు సుధీర్‌, శర్మ తదితరులు పాల్గొన్నారు. ఏర్పాట్లను ఏఈఓ కృష్ణారావు, డీఈలు, రాంబాబు, ఉదయ్‌ పర్యవేక్షించారు. ధ్వజస్తంభానికి 20 రోజుల్లో బంగారు రేకు తాపడం చేయించనున్నట్టు దాత తెలిపారు.

నమూనా ఆలయంలో..

సరిగ్గా ధ్వజస్తంభం ప్రతిష్ఠించిన ముహూర్తానికే జాతీయ రహదారిపై రూ.4 కోట్లతో నిర్మించిన నమూనా ఆలయంలో కూడా కలశ ప్రతిష్ఠ, సత్యదేవుడు, అమ్మవారు, శంకరుల విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. వేద పండితులు ఉపాధ్యాయుల రమేష్‌, అర్చకులు ఇంద్రగంటి వేంకటేశ్వర్లు, పరిచారకులు యడవిల్లి ప్రసాద్‌, వ్రత పురోహితులు పాలంకి పట్టాభి తదితరులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవదాయ శాఖ కమిషనర్‌ సత్యనారాయణ, చైర్మన్‌ రోహిత్‌, ఈఓ రామచంద్ర మోహన్‌లు నమూనా ఆలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించి, పూజలు చేశారు. ఈఈ నరసింహరెడ్డి, డీఈ గుర్రాజు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Advertisement
Advertisement