దోమకొండ: లెక్చరర్లు నాణ్యమైన విద్యనందించి ఫలితాలలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శనివారం దోమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ గతేడాది ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్రంలో చివరి స్థానంలో దోమకొండ కళాశాల ఉందన్నారు. విద్యార్థులు రోజూ కళాశాలకు రావాలని, లెక్చరర్స్ చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలని సూచించారు. కళాశాలలో ఏదైనా సమస్య ఉంటే ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. తమ పిల్లలు రోజూ కళాశాలకు వెళ్తున్నారా లేదా అన్న విషయాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవాలన్నారు. విద్యార్థులు కళాశాలకు రాకపోతే వారి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని ప్రిన్సిపాల్ శంకర్కు సూచించారు. వివిధ గ్రామాలనుంచి వచ్చే విద్యార్థులకు రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ అధికారులతో మాట్లాడతానన్నారు. కళాశాల వద్ద బస్సులు ఆపేలా చూస్తానన్నారు. కళాశాలలో 299 మంది విద్యార్థులు చదువుతున్నారని, రోజూ 100 నుంచి 150 మంది మాత్రమే తరగతులకు హాజరవుతున్నారని కళాశాల ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు. ఇకపై ప్రతినెలా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. పిల్లలు కళాశాలకు వచ్చేలా చూడాలని తల్లిదండ్రులను కోరారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సలాం, తహసీల్దార్ సంజయ్రావు, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, మండల ప్రత్యేకాధికారి జ్యోతి, విద్యార్థుల తల్లితండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
లెక్చరర్లు నాణ్యమైన విద్య అందించాలి
విద్యార్థులు రోజూ కళాశాలకు రావాలి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Comments
Please login to add a commentAdd a comment