బీజేపీకి దమ్ముంటే రైతు ఆత్మహత్యలపై కమిషన్‌ వేయాలి● | Sakshi
Sakshi News home page

బీజేపీకి దమ్ముంటే రైతు ఆత్మహత్యలపై కమిషన్‌ వేయాలి●

Published Tue, May 7 2024 4:45 AM

బీజేపీకి దమ్ముంటే రైతు   ఆత్మహత్యలపై కమిషన్‌ వేయాలి●

రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి

హుజూరాబాద్‌/జమ్మికుంట: పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీకి దమ్ముంటే రైతు ఆత్మహత్యలపై కమిషన్‌ వేయాలని, వ్యవసాయ రంగానికి అన్యాయం చేసినందుకు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక, తెలంగాణ జాగో వేదిక నాయకులు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరు మురళి అన్నారు. టీఎస్‌డీఎఫ్‌ జాగో తెలంగాణ ఆధ్వర్యంలో ఓటర్ల చైతన్య బస్సుయాత్ర సోమవారం హుజూరాబాద్‌, జమ్మికుంటలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో నల్ల చట్టాలను తెచ్చి ఎందరో రైతుల ఆత్మహత్యలకు కారణం బీజేపీ కాదా అని ప్రశ్నించారు. వ్యవసాయ రంగానికి సేవలు చేసిన స్వామినాథన్‌కు భారతరత్న ఇచ్చి ఆయన సిఫార్సులను పట్టించుకోకపోవడం ద్వంద నీతికి నిదర్శనమన్నారు. దేశభక్తి గల మన సైన్యం ఉన్నంతకాలం పాకిస్తాన్‌ లాంటి చిన్న దేశంతో మనకేలాంటి ప్రమాదం ఉండదని, దేశ సైనికుల సాహసాలను పార్టీ కోసం ఉపయోగించుకునే నీచ సంస్కృతి బీజేపీదేనని విమర్శించారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అంటూ రాష్ట్రాల్లో అల్లకల్లోలాలు సృష్టించి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను అక్రమంగా పడగొట్టిన బీజేపీ నైతిక విలువల గురించి మాట్లాడడం దురదృష్టకమన్నారు. ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్‌ పద్మజ, షాహ, ఎన్నారై రాయదాస్‌, న్యాయవాది ఝాన్సీ పాల్గొన్నారు.

 
Advertisement
 
Advertisement