బోనకల్/చింతకాని/ముదిగొండ: రాష్ట్రంలో ప్రతీ పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందు పినపాకలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టగానే ఎన్నికల కోడ్ వచ్చింది.. ఎన్నికలు ముగియగానే ఎమ్మెల్యేలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బోనకల్, చింతకాని, ముదిగొండలో సోమవారం నిర్వహించిన రోడ్డు షోల్లో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ తమ ప్రభుత్వాన్ని కదల్చాలని చూస్తే ప్రజల ప్రభుత్వాన్ని కూల్చినట్లేనని చెప్పారు. ఒక్క రూపాయి కూడా వృఽథా కాకుండా ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతోందని తెలిపారు. త్వరలోనే సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఖమ్మం జిల్లా ప్రజల కాళ్లు కడుగుతామని పేర్కొన్నారు. జిల్లాలో కమ్యూనిస్టులు – కాంగ్రెస్ కలిసి పని చేస్తున్న నేపథ్యాన ఇంకో పార్టీకి ఓటు అడిగేందుకు అవకాశమే లేదన్నారు. తమ కూటమికి టీడీపీ మద్దతు కూడా ఉందని తెలిపారు. కాగా, రాష్ట్రంలో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని భట్టి వెల్లడించారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రధానిగా మళ్లీ మోడీ వస్తే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదని, రిజర్వేషన్లు రద్దవుతాయని తెలిపారు. నామను గెలిపిస్తే మంత్రిగా చేస్తానని కేసీఆర్ చెప్పడం గర్హనీయమన్నారు. పదేళ్లలో దేశాన్ని మోదీ, రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నారని.. ఈ ఎన్నికల్లో వారికి ఓటుతో గుణపాఠం చెప్పాలని.. తద్వారా రాహుల్గాంధీ ప్రధాని కావడం ఖాయమని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి రైతుల కోసం ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేయబోతున్నారని వెల్లడించారు. ఈకార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నాయకులు రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, భాగం హేమంతరావు, పోతినేని సుదర్శన్, అంబటి వెంకటేశ్వర్లు, పావులూరి మల్లికార్జున్రావు, మడుపల్లి గోపాలరావు, కొమ్మినేని రమేష్బాబు, బుల్లెట్ బాబు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో కాంగ్రెస్ – కమ్యూనిస్టులు కలిశారు..
ఇక ఏ పార్టీకీ ఇక్కడ మనుగడ లేనట్లే
ప్రచార సభల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క