![నాణ్యత లేకపోతే విత్తన సంస్థలపై చర్యలు](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/24/23knl22b-200005_mr.jpg.webp?itok=5t0LNaXN)
● వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్లను తనిఖీ చేసిన డీఏవో
కర్నూలు(అగ్రికల్చర్): వేరుశనగలో నిర్దేశించిన మేర నాణ్యత ప్రమాణాలు లేకపోతే సంబంధింత విత్తన సంస్థలపై చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏవో) పీఎల్ వరలక్ష్మి హెచ్చరించారు. సబ్సిడీపై పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన వేరుశనగ ప్రాసెసింగ్ ప్రక్రియను గురువారం ఆమె తనిఖీ చేశారు. వేరుశనగ విత్తనం కాయల నాణ్యతను, మొలక శాతాన్ని కూడా పరిశీలించారు. వేరుశనగ విత్తనం కాయలను రాయితీపై పంపిణీ చేసేందుకు వ్యవసాయ శాఖ ఏపీసీడ్స్తో అవగాహన ఒప్పందం కుదర్చుకుంది. ఏపీ సీడ్స్ తెలంగాణలోని మహంకాలేశ్వర అగ్రీటెక్, కర్నూలు జిల్లాలోని శ్రీచక్రసీడ్స్, శ్రీకృష్ణసీడ్స్, శివసాయి సీడ్స్ కంపెనీల్లో వేరుశనగ ప్రాసెసింగ్ ప్రక్రియను కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, కల్లూరు ఏవో శ్రీనివాసరెడ్డిలతో కలసి డీఏవో తనిఖీలు నిర్వహించారు. వేరుశనగలో నాణ్యత 100 శాతం ఉండాలని ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ ధనలక్ష్మిని ఆదేశించారు. కేటాయించిన మేరకు ఆర్బీకేల వారిగా వేరుశనగను సిద్ధం చేయాలని సూచించారు. సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో వ్యవసాయ విస్తరణ అధికారులు ఉండి నాణ్యతలోపం లేకుండా అనుక్షణం పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. జిల్లాకు 13,969 క్వింటాళ్ల వేరుశనగ కేటాయించగా... ఇప్పటి వరకు 3,500 క్వింటాళ్ల వేరుశనగను ఆర్బీకేలకు తరలించినట్లు తెలిపారు.