గ్రామ సభలతో భూ సమస్యలు పరిష్కారం
గోనెగండ్ల: రీ సర్వే జరిగిన గ్రామాల్లో భూ సమస్యలు పరిష్కరించేందుకు గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా తెలిపారు. గురువారం మండలంలోని కన్నూరు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం భూ సమస్యలకు సంబంధించి జిల్లా కేంద్రానికి రాకుండా రీ సర్వే జరిగిన గ్రామాల్లోనే గ్రామ సభల్లో సబ్ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, సర్వేయర్ లాంటి అధికారులందరూ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్నారన్నారు. సమస్యలకు సంబంధించి అవసరమైతే ఫీల్డ్కి వచ్చి సర్వే నిర్వహించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారన్నారు. గ్రామ సభలో స్వీకరించిన దరఖాస్తులలో వీలైనన్ని ఈ రోజే పరిష్కరించాలని, అవసరం అయితే సర్వేయర్లు అందరూ ఫీల్డ్కి వెళ్లి వెరిఫై చేయాలన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ వెంకటేష్తో మాట్లాడుతూ గ్రామంలో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని కలెక్టర్ ఆరా తీశారు. సీసీ రోడ్లు మంజూరు చేయాలని కోరగా దీనికి మంజూరు చేస్తామని కలెక్టర్ సర్పంచ్కు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, సర్వే ఏడీ మునికన్నన్, తహసీల్దార్ కుమారస్వామి, ఎంపీడీఓ మణి మంజరి, రీ సర్వే డీటీ శిరీష తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా
Comments
Please login to add a commentAdd a comment