నేటి నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు
● సాక్షి కథనానికి స్పందించిన సీసీఐ,
మార్కెటింగ్ శాఖ
● మద్దతు ధరతో అమ్ముకునేందుకు
ఆర్ఎస్కేల్లో రిజిస్ట్రేషన్
● 8 శాతం లోపు తేమ ఉంటేనే
పూర్తి మద్దతు ధర
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్లో పండించిన పత్తిని మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు ఎట్టకేలకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ముందుకు వచ్చింది. ఈ నెల 26వ తేదీన సాక్షిలో ‘సం‘పత్తి’ అంతా మిల్లులకే’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఇటు మార్కెటింగ్ శాఖ, అటు సీసీఐ స్పందించాయి. ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పెంచికలపాడులోని 12 జిన్నింగ్ మిల్లుల్లో మద్దతు ధరతో పత్తి కొనుగోలుకు ప్రతిపాదించిన సెంటర్లను సీసీఐ ఆమోదించాయి. దీంతో సోమవారం నుంచి పత్తి సాగు చేసిన రైతులు రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే కొనుగోళ్లు ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రాప్, ఈకేవైసీ తదితర వివరాలు సరి చూసుకుని, ఆ తర్వాత రైతులకు తేదీల వారీగా కొనుగోలు కేంద్రాలను కేటాయించనున్నారు. కాగా పత్తిని మద్దతు ధరతో కొనుగోలు చేయడంలో తేమ శాతం కీలకం కానుంది. తేమ 8 శాతం లోపు ఉంటేనే పూర్తి మద్దతు ధర రూ.7,521 లభించనుంది. అంతకు ఎక్కువగా ఒక్కో శాతానికి మద్దతు ధరలో కోత పడుతుంది. ఉదాహరణకు తేమ 9 శాతం ఉంటే మద్దతు ధరలో రూ.75, 10 శాతం ఉంటే రూ.150, 11 శాతం ఉంటే రూ.225, 12 శాతం తేమ ఉంటే రూ.300 కోత పడుతుంది. తేమ 12 శాతానికి మించితే కొనుగోలు చేయరు.
సీసీఐ తరుపున ఇద్దరు ఇన్చార్జీలు..
పత్తిని మద్దతు ధరతో కొనుగోలు చేసే ప్రక్రియను పర్యవేక్షించడానికి సీసీఐ జిల్లాకు ఇద్దరు ఇన్చార్జీలను నియమించింది. ఆదోని సెంటరు జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్గా గౌతం (8106991026), ఎమ్మిగనూరు, మంత్రాలయం, పెంచికలపాడు సెంటర్లకు సీరియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్గా ధరప్ప (8073277390)ను సీసీఐ నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment