ఏడేళ్ల క్రితం మంజూరు ● ఇప్పటికీ ప్రారంభం కాని పనులు
రామాయంపేట(మెదక్): రామాయంపేట ము న్సిపాలిటీ పరిధిలో ఏడేళ్ల క్రితం మంజూరైన మినీ స్టేడియం నిర్మాణం ఇప్పటికీ అతీ గతీ లేదు. కేవలం రూ.20 లక్షల నిధులతో భూమిని చదును చేసి వదిలేశారు. ఆటలు ఆడేందుకు సరైన స్థలం లేక క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారు.
రూ.2.65 కోట్లు మంజూరు
మినీ స్టేడియం ఏర్పాటు కోసం 2017లో గత ప్రభుత్వం రూ.2.65 కోట్లు మంజూరు చేసింది. ఈమేరకు జాతీయ రహదారి పక్కన గతంలో రైతులకు కేటాయించిన ఆరెకరాల వ్యవసాయ భూమిని తిరిగి వారి నుంచి తీసుకొని స్టేడియం నిర్మాణానికి కేటాయించింది. టెండర్ ప్రక్రియ సైతం పూర్తి చేసింది. సదరు స్థలాన్ని కాంట్రాక్టర్ ౖపైపెన చదును చేసి ఏకంగా రూ.20 లక్షల వరకు బిల్లులు డ్రా చేసుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ప్రస్తుతం పట్టణంలోని హైస్కూల్ ఆవరణలో ఉన్న మైదానం క్రీడలకు అనుకూలంగా లేదు. మొదట్లో ఐదెకరాల మేర ఉన్న ఈ మైదానంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం చేపట్టడంతో మైదానం చిన్నగా మారింది. ఆ స్థలంలోనే పోలీస్స్టేషన్, సర్కిల్ కార్యాలయం, పోలీస్ క్వార్టర్స్, సమీకృత హాస్టల్ భవనం, ఆర్డీఓ, పంచాయతీరాజ్ కార్యాలయాలు నిర్మించారు. ప్రతిరోజూ ఉదయం పెద్ద సంఖ్యలో స్థానికులు ఈమైదానంలోనే మార్నింగ్ వాక్ చేస్తారు. పట్టణంలోని ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు క్రీడా మైదానాలు లేకపోవడంతోనే గత్యంతరం లేక ఈ మైదానాన్నే క్రీడాకారులు వినియోగించుకుంటున్నారు.
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా
రామాయంపేటలో ఏడేళ్లుగా నిలిచిపోయిన మినీ స్టేడియం నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యేలా కృషి చేస్తా. స్టేడియం ఉంటే క్రీడాకారులు ఆటల్లో రాణిస్తారు. తరచూ క్రీడోత్సవాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మైదానం ఆటలకు అనువుగా లేదు. సమస్యను ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా.
– నాగరాజు, జిల్లా యువజన క్రీడల అధికారి
స్టేడియం నిర్మించాలి
పట్టణంలో సరైన మైదానం లేకపోవడంతో చాలా మందికి క్రీడలపై ఆసక్తి తగ్గింది. ఏడేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన స్టేడియం పనులు భూమి చదునుతోనే నిలిచిపోయాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే చర్యలు తీసుకొని స్టేడియం నిర్మాణ పనులు ప్రారంభించాలి.
– ఊర నరేశ్, వాలీబాల్ క్రీడాకారుడు