‘ప్రజల సంక్షేమం మోదీతోనే సాధ్యం’ | Sakshi
Sakshi News home page

‘ప్రజల సంక్షేమం మోదీతోనే సాధ్యం’

Published Thu, Apr 18 2024 9:35 AM

సమావేశంలో మాట్లాడుతున్న 
బీజేపీ ఎంపీ అభ్యర్థి భరత్‌ప్రసాద్‌  - Sakshi

నాగర్‌కర్నూల్‌: దేశ అభివృద్ధి, భద్రతతో పాటు, ప్రజల సంక్షేమం మోదీతోనే సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని బీజేపీ పార్లమెంట్‌ అభ్యర్థి పోతుగంటి భరత్‌ ప్రసాద్‌ అన్నారు. బుధవారం నెల్లికొండ మార్కెట్‌యార్డ్‌ సమీపంలో పార్లమెంట్‌ ఎన్నికల కోసం నూతన బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంట్‌ జక్కా రఘునందన్‌ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరులతో మాట్లాడారు. విద్యావంతుడిగా, యువకుడిగా తనపై నమ్మకం ఉంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించడమే కాకుండా, గెలిపించుకునేందుకు మోదీ మొదటి సమావేశం నాగర్‌కర్నూల్‌లో ఏర్పాటు చేశారని చెప్పారు. తన గెలుపునకు కృషి చేస్తే ఐటీ కారిడార్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ తోపాటు ఉపాధి కల్పనకు కృషి చేస్తానని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. 400 సీట్ల పైన బీజేపీ గెలిస్తే దేశ భద్రతకు మరిన్ని చట్టాలు చేయవచ్చన్నారు. నేను బానిస సంకెళ్లను తెంచుకుని బీజేపీలో చేరితే మరో నాయకుడు మాత్రం ఆ బానిస సంకెళ్లలోకి వెళ్లారని అన్నారు. పదేళ్లలో యువకులకు ఉపాధి విస్మరించినందుకే బీఆర్‌ఎస్‌ను సాగనంపారన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌ రావు, వనపర్తి జెడ్పీచైర్మన్‌ లోక్‌నాథ్‌ రెడ్డి, అశోక్‌ రెడ్డి, రాజవర్ధన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేడు సమ్మేళన సమావేశం

గురువారం పట్టణంలోని తీగల వెంకటస్వామి కన్వెన్షన్‌లో నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ బూత్‌ కమిటీల సమ్మేళన సమావేశం నిర్వహించనున్నట్లు విభావరి అశోక్‌ రెడ్డి తెలియజేశారు.

Advertisement
Advertisement