కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో భానుడి భగభగలు పెరిగిపోయాయి. వడగాడ్పుల తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గురువారం మంత్రాలయంలో అత్యధికంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు జిల్లాలోని ఐదు మండలాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలులో 44 డీగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల జిల్లాలో ఎండలు, వడగాడ్పుల తీవ్రత రి కార్డు స్థాయికి చేరుతోంది. ఈ జిల్లాలో 8 మండలాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బనగానపల్లి, డోన్, రుద్రవరం మండలాల్లో 45.6 డిగ్రీలు, ఆళ్లగడ్డలో 45.4, మిడుతూరులో 45.2 ఆత్మకూరు, బండిఆత్మకూరుల్లో 45.1, గోస్పాడులో 45.0 డిగ్రీల ప్రకారం నమోదయ్యాయి. నందికొట్కూరులో 44.5, మహానందిలో 44.4, సంజామలలో 44.3, పాణ్యంలో 44.2 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 46 నుంచి 48 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని, వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.