దామరగిద్ద: రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని వ్యవసాయశాఖ జిల్లా అధికారి జాన్ సుధాకర్ అన్నారు. మంగళవారం మండలంలోని విఠలాపూర్, గడిమున్కాన్పల్లి, దామరగిద్ద, బాపన్పల్లి గ్రామాల్లో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలు, ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయా దుకాణాల్లో ఎరువులు, విత్తనాల స్టాక్ రికార్డులను పరిశీలించారు. వానాకాలం పంటసాగుకు సంబంధించి రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల విక్రయానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఈపాస్ మిషన్లో నమోదు చేయాలన్నారు. ఫిజికల్ బ్యాలెన్స్, ఈపాస్ బ్యాలెన్స్ను సరిచూసుకోవాలని తెలిపారు. కాగా, రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే, స్థానిక స్థానిక వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
పీయూకి ఈవీఎంలు,
వీవీప్యాట్ల తరలింపు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఈనెల 13న ఈవీఎంలలో ఓట్లు పోల్ కాగా, వాటిని పాలమూరు యూనివర్సిటీ (పీయూ) కి తరలించారు. మంగళవారం మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని కొడంగల్, నారాయణపేట, జడ్చర్ల, మహబూబ్నగర్, దేవరకద్ర, మక్తల్, షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు, వీవీ ప్యాట్లన్నింటినీ కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు షెవాంగ్ గ్యాచో భూటియా సమక్షంలో ఇక్కడి ఎగ్జామినేషన్ బ్రాంచి, లైబ్రరీ బ్లాక్, ఇండోర్ గేమ్స్ కాంప్లెక్స్, ఇండోర్ స్టేడియం, ఫార్మస్యూటికల్ బ్లాక్లోని స్ట్రాంగ్రూం లలో భద్రపరిచారు. అనంతరం వాటికి ఎక్కడికక్కడ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవినాయక్, ఎస్పీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో సీల్ వేశారు. కాగా, ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూములతో పాటు చుట్టూ పూర్తిగా కేంద్ర బలగాలు, పోలీసులు కాపలా ఉన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మోహన్రావుతో పాటు ఆయా పార్టీల అభ్యర్థులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
నర్సింగ్ అసిస్టెంట్లో ఉచిత శిక్షణ
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ, హెచ్ఎస్బీసీ సంయుక్త ఆధ్వర్యంలో నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ సరిత సింగ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని ప్రథమ్ హెల్త్కేర్ శిక్షణ కేంద్రలో 2 నెల ల పాటు శిక్షణ ఉంటుందని, శిక్షణ పూర్తి కాగా నే ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. 18– 30 ఏళ్లలోపు అభ్యర్థులు పదో తరగతితోపాటు ఏఎన్ఎం, జీఎన్ఎం, డిప్లొమా లేక ఇతర ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులన్నారు. శిక్షణలో స్టడీ మెటీరియల్, యూనిఫాం ఉచితంగా ఇవ్వడంతోపాటు ఉచిత వసతి కల్పిస్తామన్నారు. ఆసక్తి గలవారు సెల్నం.90002 03952 సంప్రదించాలని కోరారు.