Russia: మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో ఐఎస్‌ఐ ఏజెంట్‌ను అరెస్టు | Sakshi
Sakshi News home page

Russia: మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో ఐఎస్‌ఐ ఏజెంట్‌ను అరెస్టు

Published Sun, Feb 4 2024 12:56 PM

Indian Embassy Employee Posted In Moscow Arrested For Spying For Pakistan - Sakshi

లక్నో: రష్యా రాజధాని మాస్కో లోని భారత దౌత్య కార్యాలయంలో కీలక విధుల్లో ఉంటూ పాకిస్తాన్‌ నిఘా విభాగం ఐఎస్‌ఐకి కీలక సమాచారం చేరవేస్తున్న ఓ అధికారి ఉత్తర ప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) అధికారులు అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం ఏటీఎస్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ జిల్లా షామహియుద్దీన్‌పూర్‌ గ్రామానికి చెందిన సతేంద్ర సివాల్‌ విదేశాంగ శాఖ ఉద్యోగి.

ఇతడు మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో ఇండియా బేస్డ్‌ సెక్యూరిటీ అసిస్టెంట్‌(ఐబీఎస్‌ఏ)గా పనిచేస్తూ 2021 నుంచి దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాడు. పాకిస్తాన్‌లోని ఐఎస్‌ఐ నెట్‌వర్క్‌తో టచ్‌లో ఉంటూ రక్షణ శాఖ కార్యకలాపాలు, విదేశాంగ శాఖ వ్యవహారా లు, భారత సైన్యం కదలికలకు సంబంధించిన కీలక సమాచారాన్ని వారికి చేరవేస్తు న్నాడు.

కీలక సమాచారం అందిస్తే భారీగా ప్రతిఫలం ముట్టజెపుతామంటూ పలువురు ఇతర అధికారులను సైతం తన వైపు తిప్పుకునేందుకు సతేంద్ర ప్రయత్నిస్తున్నట్లు యూపీ ఏటీఎస్‌కు ఉప్పందింది. దీంతో, ఏటీఎస్‌ బృందం ఇతడి కదలికలు, కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచింది. ఆ మేరకు నిబంధనల ప్రకారం ఇతడిని ఇటీవల మీరట్‌లోని ఫీల్డ్‌ యూనిట్‌కు రప్పించి అధికారులు విచారించారు. నేరానికి పాల్పడినట్లు విచారణలో అంగీకరించడంతో సతేంద్ర సివాల్‌పై ఐపీసీ సెక్షన్‌ 121ఏతో పాటు అధికార రహస్యాల చట్టం–1923 కింద కేసులు నమోదు చేసినట్లు ఏటీఎస్‌ వివరించింది.

ఇదీ చదవండి: రాష్ట్ర హోదా కోసం లఢక్‌లో భారీ నిరసనలు

Advertisement
Advertisement