
మధ్యప్రదేశ్లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన అనంతరం ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పించిన మొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ అవతరించింది.
శివరాజ్ సింగ్ చౌహాన్ తనను తాను మధ్యప్రదేశ్ మహిళల సోదరునిగా అభివర్ణించుకుంటారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సారధ్యంలోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఇప్పటికే మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వడం, వితంతువులకు పింఛన్ ఇవ్వడం వంటి అనేక పథకాలను శివరాజ్ ప్రభుత్వం అమలు చేసింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం మహిళల కోసం ఏఏ పథకాలు అమలు చేస్తున్నదో ఇప్పుడు తెలుసుకుందాం.
1. లాడ్లీ బెహన్ యోజన
శివరాజ్ ప్రభుత్వం ‘లాడ్లీ బెహన్’ పథకాన్ని అమలు చేస్తోంది. గతంలో ఈ పథకం కింద అక్కాచెల్లెళ్లకు రూ.1,000 ఆర్థిక సాయం అందించేవారు. ఇప్పుడు ఈ మొత్తాన్ని నెలకు రూ. 1,250కి పెంచారు.
2. నారీ సమ్మాన్ కోష్
శివరాజ్ ప్రభుత్వం రూ. 100 కోట్లతో నారీ సమ్మాన్ కోష్ను ఏర్పాటు చేసింది. ఈ పథకంలో చిన్న వ్యాపారాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తోంది. ఈ మొత్తాన్ని పీఎం స్వనిధి యోజన, ముఖ్యమంత్రి వీధి వ్యాపారుల పథకాల కింద అందజేస్తారు.
3. లాడ్లీ లక్ష్మీ యోజన
ఈ పథకాన్ని మధ్యప్రదేశ్లో ఆడపిల్లలు పుడితే ప్రోత్సాహం, లింగ నిష్పత్తిలో మెరుగుదల, విద్యా స్థాయి, బాలికల ఆరోగ్య స్థితిపై ప్రజల్లో సానుకూల ధోరణి పెంపొందేందుకు ప్రారంభించారు. ఈ పథకం 2007 నుండి అమలులో ఉంది. లాడ్లీ ఇ-సంవాద్ యాప్ ద్వారా, ప్రజలు నేరుగా శివరాజ్ సింగ్ చౌహాన్ను కలుసుకోవచ్చు.
4. ముఖ్యమంత్రి కన్యా వివాహ పథకం
మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి కన్యా వివాహ-నిఖా పథకం అమలవుతోంది. దీని కింద పేదలకు రూ.51వేలు ఆర్థిక సహాయంగా అందజేస్తారు.
5. ఉజ్వల పథకం
మధ్యప్రదేశ్లో శివరాజ్ ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్ను రూ. 450కి అందిస్తోంది. లాడ్లీ బెహనా లబ్ధిదారులతో పాటు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ వినియోగదారులు, ప్రత్యేక వెనుకబడిన తెగల (బైగా, భరియా, సహరియా) మహిళలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతారు.
6. స్కూటీ పథకం
ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మహిళల కోసం స్కూటీ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 12వ తరగతి టాపర్లు స్కూటీ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిధులు విడుదల చేస్తుంది.
7. మహిళా జర్నలిస్టులకు..
ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మహిళా జర్నలిస్టులకు ఫెలోషిప్తో పాటు చిన్న వార్తాపత్రికలకు ప్రకటనల హామీని కూడా ప్రకటించారు. పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ ద్వారా అభివృద్ధి పనులపై అధ్యయనం చేయడానికి ప్రతి సంవత్సరం ఐదుగురు మహిళా జర్నలిస్టులకు ఫెలోషిప్ అందజేస్తారు.
ఇది కూడా చదవండి: వీధి కుక్కలను చంపడం తప్పుకాదని గాంధీ ఎందుకన్నారు?
Comments
Please login to add a commentAdd a comment