
న్యూఢిల్లీ: కోర్టులో వాదోపవాదాల సమయంలో పదేపదే మై లార్డ్, యువర్ లార్డ్షిప్స్’అంటూ లాయర్లు తమను సంబోధిస్తుండటంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మై లార్డ్స్ అని ఎన్నిసార్లు అంటారు? ఇలా అనడం ఆపేస్తే, నా వేతనంలో సగం మీకిచ్చేస్తా’అని జస్టిస్ పీఎస్ నరసింహ పేర్కొన్నారు. బుధవారం జస్టిస్ ఏఎస్ బొపన్నతో కలిసి ఆయన ఓ కేసు విచారణలో పాల్గొన్నారు.
వాదోపవాదాల సమయంలో ఓ సీనియర్ లాయర్ పదేపదే ‘మై లార్డ్, యువర్ లార్డ్షిప్స్’ అంటుండటంపై పైవిధంగా ఆయన స్పందించారు. వాటికి బదులుగా సర్ అని అనొచ్చు కదా అని తెలిపారు. లేకుంటే ఆ మాటలను ఎన్నిసార్లు వాడేదీ లెక్కపెడ తానని చెప్పారు. ‘మై లార్డ్, యువర్ లార్డ్షిప్’అనే మాటలు వలస పాలన ఆనవాళ్లని, కోర్టు ప్రొసీడింగ్స్ సమయంలో వాడరాదంటూ 2006లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీర్మానం చేసింది.