న్యూఢిల్లీ, సాక్షి: లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఇవాళ కీలకం కానుంది. తన అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.
మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేయడం చట్టబద్ధమేనంటూ ఢిల్లీ హైకోర్టు సమర్థించగా.. ఆ ఉత్తర్వులనే సుప్రీం కోర్టులో కేజ్రీవాల్ సవాల్ చేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్ట్పై తొలిసారి సుప్రీంలో విచారణ జరుగుతుండడం గమనార్హం.
ఇదిలా ఉంటే.. లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో తీహార్ జైలు అధికారులు ఆయన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరచనున్నారు. లిక్కర్ పాలసీ స్కాం కేసులో ఈడీ సమన్లను సీఎం కేజ్రీవాల్ పదేపదే నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఈడీ మార్చి 21వ తేదీన ఆయన్ని అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. 15వ తేదీ వరకు ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు.
అదే సమయంలో లిక్కర్ కేసులో మరో నిందితుడు, ఆప్ మాజీ మంత్రి మనీష్ సిసోడియా బెయిల్ విచారణ కూడా నేడు జరగనుంది. రౌస్ అవెన్యూ కోర్టులో మనీష్ సిసోడియా దాఖలు చేసిన రెండో పిటిషన్ ఇది.