● జాయింట్ కలెక్టర్ శోభిక
పార్వతీపురం: ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోభిక పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఆమె కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో టంగుటూరి జయంతి వేడుకలలో భాగంగా టంగుటూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకాశం పంతులు స్వాంతంత్రోద్యమంలో పాల్గొని మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీ గుళ్లకు తన గుండెను ఎదురొడ్డి ఆంధ్రకేసరి అని పేరు పొందారని కొనియాడారు. పొట్టి శ్రీరాములు త్యాగఫలితంగా 1953 అక్టోబర్ 1న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు ఎన్నికయ్యారని, ఆయన పాలనా కాలంలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలను అమలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి జి.కేశవ నాయుడు, కలెక్టరేట్ పరిపానాధికారి ఎం.సావిత్రి, ఈ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీరామమూర్తి, సి సెక్షన్ సూపరింటెండెంట్ సిహెచ్. రాధాకృష్ణ, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment