● ఉద్యోగుల నిర్లక్ష్యమా? అధికారుల బాధ్యతారాహిత్యమా?
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో కాలం చెల్లిన మందులు పంపిణీ చేస్తూ పేషెంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సోమవారం ఆస్పత్రికి వెళ్లిన ఓ పేషెంట్కు గడువు ముగిసిన మందులు ఇవ్వడంతో అధికారుల బాధ్యతా రాహిత్యం వెలుగులోకి వ చ్చింది. బాధితుడి కథనం ప్రకారం.. గోదావరిఖని కల్యాణ్నగర్కు చెందిన కారు డ్రైవర్, ట్రావెల్స్ నిర్వాహకుడు.. బత్తిని రవి రెండు రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. సోమవారం జీజీహెచ్కు వెళ్లగా పరీక్షించిన వైద్యులు మందులు రాశారు. ఆస్పత్రి కౌంటర్లో డాక్టరు రాసిచ్చిన చీటీ చూపించి మూడు రకాల మందులు తీసుకున్నాడు. అందులో రెండు రకాలు నాణ్యతగా ఉండగా, మూడోరకానికి చెందిన 10 టాబ్లెట్లు తీసుకున్నాడు. ఓ రాజకీయ పార్టీ ప్రచారం కోసం కారు పంపించే హడావుడిలో ఎన్టీపీసీ వెళ్లిన రవి.. అక్కడే మందులు వేసుకోవడానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న ఓ మిత్రుడు వాటిని చూసి కాలం చెల్లిన మందులని చెప్పాడు. దీంతో చప్పరించే మందులను వాడకుండా పక్కన పెట్టాడు. అనుమానంతో ఓ ప్రైవేట్ మెడికల్ షాప్కు వెళ్లి ఆ మందుల గురించి ఆరా తీశాడు. గతనెల వరకే గడువు ఉందని షాపు నిర్వాహకులు స్పష్టం చేయడంతో బాధితుడు రవి ఆందోళన చెందాడు. మందులు, టానిక్లు, ఇంజక్షన్లు తరచూ తనిఖీచేసి, కాలం చెల్లిన వాటిని పక్కన పెట్టాల్సిన ఉద్యోగులు, అధికారులు.. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ఇంకా ఎంతమందికి ఇచ్చారో?
మరోవైపు.. కాలం చెల్లిన మందులు ఆస్పత్రి కౌంటర్లో ఇంకా ఎన్నిఉన్నాయి? ఇప్పటివరకు ఇంకా ఎంతమందికి ఇచ్చారు? వైద్యులకు తెలిసే గడువు ముగిసిన మందులు పంపిణీ చేశారా? లేక వారికి తెలియకుండా, పొరపాటున మందులు పంపిణీ చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ విచారణ చేపడితే వెలుగులోకి వస్తాయని పేషెంట్లు అభిప్రాయపడుతున్నారు.
విచారణ జరువుతాం
గడువు తీరిన మందులు ఇచ్చారనే ఘటనపై విచారణ చేపడతాం. ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ అరుణ, ఆర్ఎంవో,
జీజీహెచ్