
గువాహటి: రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర దూకుడుతో.. అస్సాం(అసోం) రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి. తాజాగా రాహుల్ మరోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విమర్శలు సంధించారు. ఈ క్రమంలో మరోమారు సంచలన ఆరోపణలే చేశారాయన.
అసోంలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ కీలక నేతలపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయినా ఆయన వెనక్కి తగ్గడం లేదు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు హిమంత శర్మ అని బుధవారం ఉదయం రాహుల్ గాంధీ మరోసారి వ్యాఖ్యానించారు. అంతేకాదు అమిత్ షా గుప్పిట్లో శర్మ ఉండిపోయారని.. షానే ఆయన్ని వెనకుండి నడిపిస్తున్నారంటూ ఆరోపించారు.
ఇదీ చదవండి: రాహుల్కు ప్రమాదం పొంచి ఉంది.. షాకు ఖర్గే లేఖ
బుధవారం ఉదయం బారాపేటలో భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ‘‘ఆయన దేశంలో అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి. ఈ విషయాన్నే నేను అన్నట్లు ఆయనకు మీరు(మీడియాను ఉద్దేశించి..) తెలియజేయండి. అసోం ముఖ్యమంత్రి అమిత్ షా నియంత్రణలో ఉన్నారు. షాకు గనుక వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే ఆయన్ని పార్టీలో నుంచి గెంటేస్తారు’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఎవరెన్ని ఆటంకాలు కలిగించినా.. అనుకున్న మార్గంలోనే జోడో న్యాయ్ యాత్ర ముందుకు సాగుతుందని స్పస్టం చేశారాయన.
Comments
Please login to add a commentAdd a comment