![Not support To TDP Janasena Leaders FOR BJP - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/04/17/Kothapalli-Geetha.jpg.webp?itok=HgLlyU1a)
టీడీపీ, జనసేన నుంచి కానరాని సహకారం
2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి భారీ ఆధిక్యత
గిరిజనులకు జగనన్నపై తరగని అభిమానం
గ్రామస్థాయిలో మరింత పటిష్టం
అరకు పార్లమెంట్ పరిధిలో ఏమాత్రం క్యాడర్లేని బీజేపీ ఈ ఎన్నికల్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో నేరుగా పోటీచేస్తే కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చినా ఓటమి తప్పలేదు.వైఎస్సార్సీపీ 2014 ఎన్నికల్లో 91,398 ఓట్లు, 2019లో 2,23,999 ఓట్ల ఆధిక్యతతో అరకు ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ పరిస్థితుల్లో కూటమి తరఫున బీజేపీ అభ్యర్థగా పోటీచేస్తున్న కొత్తపల్లి గీతకు మిగతా పార్టీల శ్రేణుల నుంచి సహకారం లభించే పరిస్థితి కానరావడం లేదు.
రంపచోడవరం: అరకు పార్లమెంట్ పరిధిలో ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలు పాలకొండ, కురుపాం, సాలూరు, అరకువేలీ, పాడేరు, రంపచోడవరంతో పాటు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం పార్వతీపురం ఉంది. వైఎస్సార్ సీపీ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి గిరిజనులు జగన్మోహన్రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థులను ఆఖండ మెజారిటీతో గెలిపించారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తరఫున అరకు ఎంపీ సీటును బీజేపీకి కేటాయించారు. గత రెండు దఫాల ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఆ పార్టీ పరిస్థితి దయనీయంగానే ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లే స్తున్నారు. ఈ పరిస్థితుల్లో అభ్యర్థి కొత్తపల్లి గీతకు వ్యతిరేకంగా గిరిజన సంఘాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. గిరిజన వ్యతిరేకి అయిన ఆమెను ఓడించాలని పిలుపునిస్తున్నాయి.
కూటమిపైనే ఆశలు..
అరకు పార్లమెంట్ పరిధిలో బీజేపీకి సొంత బలం లేకపోయినా సీట్లు సర్దుబాటులో భాగంగా టికెట్ దక్కంచుకున్నా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ పార్లమెంట్లోని అసెంబ్లీల పరిధిలో ఆ పార్టీకి పెద్దగా క్యాడర్ కూడా లేదు. టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీ శ్రేణులు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు.
2014లో వైఎస్సార్సీకి 91,398 ఓట్ల ఆధిక్యత..
2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 4,13,191 ఓట్లు దక్కించుకుని విజయం సాధించింది. టీడీపీ, బీజేపి ఉమ్మడి అభ్యరి్థకి 3,21,793 ఓట్లు, కాంగ్రెస్కు 52,884 ఓట్లు వచ్చాయి. వైఎస్సార్సీపీ అభ్యరి్థకి 91,398 ఓట్ల మెజారిటీ వచ్చింది. రెండు పార్టీల ఓట్లు కలిపితే 3,74,677 ఓట్లు వచ్చాయి. ఇలా రెండింటిని కలిపినా వైఎస్సార్సీకి 38,514 ఓట్ల ఆధిక్యత ఉంది.
2019లోనూ 2,23,999 ఓట్ల మెజారిటీ..
2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఎటువంటి పొత్తులు లేకుండా ఒంటరిగా ఎన్నికల బరిలో నిలవగా కేవలం 17,867 ఓట్లు మాత్రమే సాధించింది. అంటే నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. వైఎస్సార్ సీపీ 5,62,190 ఓట్లు సాధించగా టీడీపీకి 3,38,101, జనసేనకు 42,794 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 2,24,089 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. ఈ రెండు దఫాల ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే బీజేపీకి సొంత బలం లేనట్టేనని స్పష్టమవుతోంది.
బలమైన పార్టీగా..
అరకు పార్లమెంట్ పరిధిలోని గ్రామాల్లో వైఎస్సార్సీపీ గ్రామస్థాయిలో మరింత పటిష్టంగా ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అరకు పార్లమెంట్ పరిధిలో ఒక అసెంబ్లీ స్థానం మినహా అన్నింటిని కైవసం చేసుకుంది. 2019 ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ స్థానాలను దక్కించుకుని క్షేత్రస్థాయిలో మన్యంలో బలమైన పునాది వేసింది.
కూటమి క్యాడర్ చెల్లాచెదురు
అరకు పార్లమెంట్ పరిధిలోని రంపచోడవరం, అరకువేలీ, పాడేరు నియోజకవర్గాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన (కూటమి) పార్టీల క్యాడర్ వర్గపో రు కారణంగా చెల్లాచెదురైంది. టీడీపీ విషయానికొస్తే రెండుగా చీలిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ఎంపీ అభ్యర్థి (బీజేపీ) కొత్తపల్లి గీతకు ఎంతవరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకమే.
♦ అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు సివేరి అబ్రహం, సియ్యారి దొన్నుదొర తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. దీనివల్ల ఆ పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితి ఎదుర్కొంటోంది.
♦ పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆ పార్టీ అధిష్టానంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. రెబల్గా పోటీచేసి అమీతుమీ తేల్చుకుంటానని ఆమె ఇప్పటికే హెచ్చరించారు.
♦ రంపచోడవరం అసెంబ్లీ మిరియాల శిరీషాదేవికి టికెట్ కేటాయింపు నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు అరకు ఎంపీ బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీతపై గుర్రుగా ఉన్నారు. ఈ టికెట్ను మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరితోపాటు మరో మాజీ ఎమ్మెల్యే కూడా ఆశించారు. వీరి కాకుండా పారీ్టలోకి కొత్తగా వచ్చిన మిరియాల శిరీషా దేవికి టికెట్ కేటాయింపుపై వారు జీర్ణించుకోలేకపోతున్నారు. శిరీషకు సహకరించేది లేదని వారి అనుచరులు ఇప్పటికే ప్రకటించారు. కూటమి అభ్యర్థికి అరకు, పాడేరు, రంపచోడవరంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment