● జిల్లా పోతుందని సన్నాసులు అంటుండ్రు ● నేతన్నలకు బకాయిలు పెట్టిందే మీరు ● కాళేశ్వరం ప్యాకేజీ–9 పనులు ఎందుకు పూర్తి చేయలేదు ● కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి
సిరిసిల్ల: ప్రజల ఆదరణతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై విషప్రచారం, చిల్లర రాజకీయాలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కె.కె.మహేందర్రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని శివనగర్లోని తన నివాసంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. 2016లో అధికారంలో ఉండి.. సిరిసిల్ల జిల్లా సాధ్యం కాదని కేటీఆర్ చేతులెత్తేస్తే.. ఉద్యమించి మీ మెడలు వంచి జిల్లాను సాధించుకున్నామని గుర్తు చేశారు. వనరులు దోచుకున్న దొంగలు.. కొందరు సన్నాసులు జిల్లా పోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, జిల్లా ఎక్కడికి పోదని స్పష్టం చేశారు. సిరిసిల్ల నేతన్నలకు మూడేళ్లుగా బతుకమ్మ చీరల బకాయిలు, కార్మికులకు యారన్ సబ్సిడీ డబ్బులను పెండింగ్లో పెట్టిన కేటీఆర్ ఇప్పుడు శవరాజకీయాలు చేస్తూ.. కాంగ్రెస్పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఏనాడు సిరిసిల్ల నేతన్నల సమస్యలు పట్టించుకోలేదని, ఇటు వైపు రాలేదన్నారు. ఎన్నికలు రాగానే నేతన్నలపై కపటప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు.
కాళేశ్వరం 9వ ప్యాకేజీని ఎందుకు పూర్తి చేయలేదు
పదేళ్లు అధికారంలో ఉండి కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ పనులు ఎందుకు పూర్తి చేయలేదని కేటీఆర్ను మహేందర్రెడ్డి ప్రశ్నించారు. కొండపోచమ్మసాగర్కు గోదావరి నీళ్లను తరలించారే తప్ప ఎగువమానేరుకు నీరు అందించే ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని అడిగారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు అండగా ఉన్నారని, బీజేపీ, బీఆర్ఎస్కు గుణపాఠం చెబుతారని హెచ్చరించా రు. చొప్పదండి ప్రకాశ్, గడ్డం నర్సయ్య, చెన్నమనే ని కమలాకర్రావు, వైద్య శివప్రసాద్, సూర దేవరా జు, యెల్లె లక్ష్మీనారాయణ, వెల్ముల స్వరూపారెడ్డి, ఆకునూరి బాలరాజు, గుండ్లపల్లి రామానుజం, నేరెళ్ల శ్రీకాంత్గౌడ్, వేముల రవి పాల్గొన్నారు.