ఓటేసిన కలెక్టర్
గజ్వేల్: పట్టణంలోని ఐవోసీ (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)లో ఏర్పాటు చేసిన ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్లో సోమవారం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం. మనుచౌదరి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని శేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న తన ఓటును ఇక్కడ వినియోగించుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్లో ఇబ్బందులు కలగకుండా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించామన్నారు. కలెక్టర్ వెంట గజ్వేల్ ఆర్డీవో బన్సీలాల్ అధికారులు ఉన్నారు.
ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు సోమవారం జిల్లా కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం తోటి ఉద్యోగులతో కలిసి ఓటు వేశామని తమ దరహాసాన్ని ప్రదర్శించారు. అలాగే హుస్నాబాద్ డివిజనల్ రెవెన్యూ కార్యాలయంలో ప్రధానోపాధ్యాయులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. 381 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు – ప్రశాంత్నగర్(సిద్దిపేట)/ హుస్నాబాద్రూరల్:
ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
సిద్దిపేటరూరల్: లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఈవీఎం మిషన్ల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఈవీఎం సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ను అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 4 నియోజకవర్గాలకు 11 బ్యాలెట్ యూనిట్లు, 10 కంట్రోల్ యూనిట్లు, 20 వీవీప్యాట్ యూనిట్లను నియోజకవర్గాల ఏఆర్ఓలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల సూపరింటెండెంట్ మధుసూదన్, ఎన్నికల డీటీ శ్రీనివాస్, ఆపరేటర్ ప్రసాద్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.