![Dharamshala Has Become A Memorable Ground For Jonny Bairstow, As He Played His 100th ODI And 100th Test In This Ground - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/7/Untitled-11.jpg.webp?itok=AmBDfEI2)
ఇంగ్లండ్ క్రికెటర్ జానీ బెయిర్స్టోకు వింత అనుభవం ఎదురైంది. ఇవాళ (మార్చి 7) ధర్మశాల వేదికగా భారత్తో తన వందో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న బెయిర్స్టో.. యాదృచ్చికంగా ఇదే వేదికపై తన వందో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడాడు.
ఇలా తన కెరీర్లో వందో వన్డే, వందో టెస్ట్ మ్యాచ్ ఒకే వేదికపై ఆడటంతో బెయిర్స్టోకు ధర్మశాల మైదానం చిరస్మరణీయంగా మారింది. కెరీర్లో అరుదైన వంద మ్యాచ్ల మైలురాయిని రెండు ఫార్మాట్లలో ఒకే వేదికపై అందుకోవడంతో ఈ మైదానం బెయిర్స్టోకు జీవితాంతం గుర్తుండిపోతుంది.
ఈ వేదికపై జరిగిన తన వందో వన్డేలో హాఫ్ సెంచరీ (వన్డే వరల్డ్కప్ 2023లో బంగ్లాదేశ్పై 52 పరుగులు) సాధించిన బెయిర్స్టో.. తన వందో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో మాత్రం 29 పరుగులకే పరిమితమయ్యాడు.
Dharamsala has been a memorable ground for Jonny Bairstow🏟️❤️ pic.twitter.com/1grLKRQy3o
— CricTracker (@Cricketracker) March 7, 2024
ఈ ఇన్నింగ్స్లో 18 బంతులు ఎదుర్కొన్న అతను 2 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి మాంచి దూకుడుగా కనిపించాడు. అయితే కుల్దీప్ అతని జోరుకు కళ్లెం వేశాడు. కుల్దీప్ బౌలింగ్లో దృవ్ జురెల్కు క్యాచ్ ఇచ్చి బెయిర్స్టో వెనుదిరిగాడు.
ఈ మ్యాచ్లో మరో ఇన్నింగ్స్ మిగిలుంది కాబట్టి, ఆ ఇన్నింగ్స్లోనైనా సెంచరీనో, హాఫ్ సెంచరీలో చేసి ఈ మ్యాచ్ను ప్రత్యేకంగా మార్చుకోవాలని బెయిర్స్టో భావిస్తుంటాడు.
ఇదిలా ఉంటే, ధర్మశాల టెస్ట్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు తొలి ఇన్నింగ్స్లో 218 పరుగులకే కుప్పకూలింది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (57) మెరుపు అర్దశతకం చేసి ఔట్ కాగా.. హిట్మ్యాన్ రోహిత్ శర్మ (52) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని క్రీజ్లో కొనసాగుతున్నాడు.
రోహిత్కు జతగా శుభ్మన్ గిల్ (26) క్రీజ్లో ఉన్నాడు. భారత్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు కేవలం 83 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment