తిరువళ్లూరు: డీఎంకే ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి విసృతంగా ప్రచారం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు అన్నాడీఎంకే పార్టీ జిల్లా ఇన్చార్జ్ మాజీ మంత్రి జయపాల్ సూచించారు. తిరువళ్లూరు యూనియన్ అన్నాడీఎంకే కార్యకర్తల సమావేశం గురువారం యూనియన్ కార్యదర్శి చంద్రశేఖర్ అధ్యక్షతన పుట్లూరులోని ప్రైవేటు కల్యాణ మండపంలో నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా జిల్లా ఇన్చార్జ్ మాజీ మంత్రి జయపాల్, మరోమాజీ మంత్రి బెంజిమిన్ తదితరులు హాజరై పార్టీ సభ్యత్వ నమోదు, మరో రెండేళ్లలో అన్నాడీఎంకే నేతలు కార్యకర్తలు చేపట్టాల్సి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి జయపాల్ మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు గుర్తింపు కార్డు అందజేయాలని సూచించారు. ఇటీవల డీఎంకే ప్రభుత్వం విద్యుత్ చార్జీలు, ఆస్తిపన్ను పెంపుతో పాటు నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచడంలో పూర్తీగా విఫలమైయ్యిందని ఆరోపించారు. డీఎంకే నేతల అరాచకాలు, అవినీతికి హద్దుపద్దు లేకుండా పోయిందన్న ఆయన, డీఎంకే ప్రజావ్యతిరేక పాలనపై ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్దం కావాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో పాల్గోన్న మరో మంత్రి బెంజిమిన్ మాట్లాడుతూ అన్నాడీఎంకే నేతలు కార్యకర్తల మధ్య ఉన్న చిన్నపాటి మనస్పర్థలను దూరం పెట్టి పార్టీ బలోపేతం కోసం పని చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే మణిమారన్, పార్టీ నేతలు మోహనసుందరం, సుబ్రమణ్యంతో పాటు పలువురు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment