తమిళసినిమా: నటుడు జీవా, నటి ప్రియభవానీశంకర్ జంటగా నటించిన థ్రిల్లర్ డ్రామా కథా చిత్రం బ్లాక్. ప్రొటాన్షియల్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఆర్.ప్రభు, ఎస్ఆర్.ప్రకాశ్బాబు నిర్మించిన ఈ చిత్రానికి జీకే.బాలసుబ్రమణి దర్శకత్వం వహించారు. నటుడు వివేక్ ప్రసన్న, స్వయంసిద్ధా, సింధూరి ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి శ్యామ్.సీఎస్ సంగీతం, గోకుల్ బినాయ్ ఛాయాగ్రహణం అందించారు. కాగా ఇటీవల రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన వేట్టయన్ చిత్రంతో పాటు తెరపైకి వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ కథా చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో సక్సెస్ మీట్ను నిర్వహించారు. దర్శకుడు బాల సుబ్రమణి మాట్లాడుతూ బ్లాక్ చిత్రం అయోయమంగా ఉన్నా, అందులో ఏముందోనన్న ఆసక్తితో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారని చెప్పారు. ఈ చిత్రం మాస్ ఆడియన్స్లోకి వెళ్లడానికి కారణం జీవా ఇమేజే కారణం అన్నారు. చిత్ర నిర్మాత ఎస్ఆర్.ప్రభు మాట్లాడుతూ తాము ఒక్కో చిత్రం చేయడానికి ఎక్కువ సమయమే తీసుకుంటామన్నారు. చిత్రంపై నమ్మకంతోనే రజనీకాంత్ నటించిన వేట్టయన్ చిత్రంతో పాటు బ్లాక్ చిత్రాన్ని విడుదల చేసినట్లు చెప్పారు. జీవా మాట్లాడుతూ దర్శకుడు బాలసుబ్రమణి తనను కలిసి ఒక కథలో ప్రత్యేక పాత్రలో నటించాలని కోరారన్నారు. బ్లాక్ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఈ సంస్థకు తాను రెండు చిత్రాల్లో నటిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. కాగా బ్లాక్కు సీక్వెల్ చేస్తే బాగుంటుందని జీవా పేర్కొన్నారు. కాగా ఈయన ఈ చిత్రానికి పనిచేసిన సహాయ దర్శకులకు ధన్యవాదాలు తెలిపారు. వారితో కలసి సెల్ఫీ తీసుకోవడం విశేషం.
బ్లాక్ చిత్ర యూనిట్
Comments
Please login to add a commentAdd a comment