బొంరాస్పేట: పార్లమెంటు ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఎంపీడీఓ శ్రీదేవి తెలిపారు. సోమవారం మండల పరిధి రేగడిమైలారంలో 198, 199, 200, 201 నంబరు గల పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీదేవి మాట్లాడారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు నాగరాజు, రవినాయక్, అంగన్వాడీ కార్యకర్తలు వెంకటమ్మ, స్వరూప, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
కలప లారీ పట్టివేత
కుల్కచర్ల: అనుమతులు లేకుండా కలప తరలిస్తున్న లారీని సీజ్ చేసిన సంఘటన కుల్కచర్ల పోలిస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసు కుంది. వివరాలు ఇలా ఉన్నాయి. చౌడాపూర్ గ్రామ శివారులో లారీలో కలప తరలిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకున్నారు. వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా.. కలప లభ్యమయింది. దీంతో లారీని స్వాధీనం చేసుకుని, డైవర్ ఎండీ నజీర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అన్వేష్ రెడ్డి తెలిపారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన
ధారూరు: సమస్యాత్మక కేరెళ్లి, ధారూరు పోలింగ్ కేంద్రాలను సోమవారం వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, ధారూరు సర్కిల్ సీఐ రామకృష్ణ, ఎస్ఐ వేణుగోపాల్గౌడ్లు పరిశీలించారు. పోలింగ్ జరిగే సమయంలో బూత్లలో ఏమైనా గొడవలు జరిగే అవకాశం ఉందా అనే తదితర విషయాలను సీఐ, ఎస్ఐలను డీఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా.. ఉపేక్షించేది లేదని, కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.
పసికందును పొదల్లో
వదిలేసిన ఇద్దరికి జైలు
బంట్వారం: పసికందును ముళ్ల పొదల్లో విడిచి వెళ్లిన కేసుల్లో ఇద్దరికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు, రూ.10 వేల జరిమానా విధిస్తూ వికారాబాద్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఎస్ఐ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి తొర్మామిడికి చెందిన ఇద్దరు వ్యక్తులు 2017లో ఓ పసి కందును పొదల్లో వదిలేశారు. ఈ సంఘటనకు సంబంధించి అప్పటి ఎస్ఐ శేఖర్గౌడ్ కేసు దర్యాప్తు చేసి, వివరాలను కోర్టుకు సమర్పించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ శ్రుతిదూత నిందితులకు పైశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
బాలికను చేరదీసిన
ఆర్పీఎఫ్ పోలీసులు
అనంతగిరి: ఏడుస్తూ కనిపించిన బాలకను చేరిదీసి, సఖీ సెంటర్కు తరలించిన సంఘటన సోమవారం వికారాబాద్లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక రైల్వే స్టేషన్లో విలపిస్తున్న బాలిక (15)ను చేరదీసినట్లు ఆర్పీఎఫ్ సీఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు. సదరు చిన్నారిని వివరాలు అడగగా.. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ ప్రాంతానికి చెందిన అంబిక అని, గొడవల కారణంగా తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటి నుంచి వచ్చానని తెలిపినట్లు సీఐ వెల్లడించారు. మైనర్ను చైల్డ్లైన్కు అప్పగించగా, వారు సఖీ సెంటర్కు తరలించినట్లు పేర్కొన్నారు. బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని సీఐ తెలిపారు.