![సమీకృ](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/26/21kkt101-210105_mr.jpg.webp?itok=d-bQCh-D)
ఇంటిగ్రేటేడ్ మార్కెట్యార్డు నిర్మాణాల్లో కానరాని కదలిక
పనుల్లో వేగం పెంచాలి..
ఇంటిగ్రేటేడ్ మార్కెట్యార్డుల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేస్తే ఫుట్పాత్లపై కూరగాయలు, మాంసం విక్రయాలు చేపట్టే చిరు వ్యాపారులకు మేలు జరుగుతుంది. వ్యాపారులు, వినియోగదారులకు సౌలభ్యంగా మారనున్న వీటి నిర్మాణాలు పూర్తి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవచూపాలి.
– తోట రవి, కూరగాయల వ్యాపారి, ఆత్మకూర్
రెండునెలల్లో పూర్తి..
సమీకృత శాఖాహార, మాంసహార మార్కెట్యార్డు నిర్మాణం పనుల్లో పురోగతిపై దృష్టి సారించాం. కాంట్రాక్టర్ను పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరాం. చేసిన పనులకు డబ్బులు మంజూరుచేస్తే మిగిలిన పనులు చేపడతామని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.
– నాగరాజు, పుర కమిషనర్, ఆత్మకూర్
ఆత్మకూర్: జిల్లాలోని కొత్త పుర కేంద్రాల్లో అన్ని హంగులతో సమీకృత శాఖాహార, మాంసహార మార్కెట్ల సముదాయాల నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్ల కిందట నిధులు మంజూరు చేసింది. అప్పటి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఒక్కో మున్సిపాలిటీకి రూ.2 కోట్లు విడుదల చేస్తూ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్కు ఆదేశాలిచ్చారు. దీంతో అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించినా.. నేటికీ సగం పనులు మాత్రమే పూర్తయ్యాయి. నిర్మాణాలు ఎప్పుడు పూర్తిచేసి తమకు కేటాయిస్తారని వ్యాపారులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో కొత్తగా ఏర్పడిన కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూర్, అమరచింత పురపాలికల్లో అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి.
అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం..
ఇంటిగ్రేటేడ్ మార్కెట్యార్డు నిర్మాణ పనుల టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులపై ప్రత్యేక దృష్టి సారించలేకపోతున్నారు. అప్పట్లో వేసిన టెండర్కు.. ప్రస్తుతం పెరిగిన ధరలకు వ్యత్యాసం ఉండటంతో అదనపు భారం పడుతుందని నిర్మాణాలపై శ్రద్ధ చూపడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు పనుల్లో వేగం పెంచాల్సిన సంబంధిత అధికారులు సైతం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి.
నాలుగేళ్లవుతున్నా .. ముందుకు సాగని పనులు
ఒక్కో మున్సిపాలిటీకి రూ.2 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
జిల్లాలోని కొత్త పురపాలికల్లో ఇదే తీరు..
పూర్తయితే ప్రయోజనం..
ఇంటిగ్రేటేడ్ మార్కెట్యార్డ్ల నిర్మాణాలు పూర్తయితే కూరగాయలు, పండ్లు, పూలు, మాంసాహారం, చేపల విక్రయాలు రహదారులపై ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఒకేచోట జరగనున్నాయి. చిరు వ్యాపారులకు దుకాణాలు కేటాయించి వారి నుంచి అద్దె వసూలు చేసి నిర్వహణ కొనసాగించేలా ప్రణాళికలు రూపొందించారు. కాని నేటికీ నాలుగేళ్లు గడుస్తున్నా పనుల్లో పురోగతి కనిపించడం లేదని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా స్పందించి త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు.
![సమీకృతం.. అసంపూర్ణం](/sites/default/files/gallery_images/2024/05/26/21kkt102-210105_mr.jpg)
సమీకృతం.. అసంపూర్ణం
![సమీకృతం.. అసంపూర్ణం](/sites/default/files/gallery_images/2024/05/26/21kkt103-210105_mr.jpg)
సమీకృతం.. అసంపూర్ణం
![సమీకృతం.. అసంపూర్ణం](/sites/default/files/gallery_images/2024/05/26/21kkt104-210105_mr.jpg)
సమీకృతం.. అసంపూర్ణం