కడప అగ్రికల్చర్: జిల్లాలో వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి వరకు నిర్వహించనున్న 21వ పశు గణన సర్వేను పక్కాగా నిర్వహించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అదితి సింగ్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని స్పందన హాలులో ఈఆర్ఓ గంగాధర్ గౌడ్, డీపీఓ రాజ్యలక్ష్మి, డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, జిల్లా పశుసంవర్థక అధికారి డాక్టర్ శారదమ్మ, నోడల్ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ రెడ్డి, పశు వైద్యాధికారి డాక్టర్ అనుపమలతో కలిసి 21వ పశు గణన సర్వేకు సంబంధించిన ప్రచార పోస్టర్లు, స్టిక్కర్లను ఇన్చార్జి కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్లు మొదలైన పశు సంపద మన రైతులకు జీవనోపాధినిచ్చే వనరులు మాత్రమే కాదని.. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటివన్నారు. పాడిపశు రంగం మన దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో దాదాపు 4.11 శాతం వాటాను, వ్యవసాయ స్థూల ఉత్పత్తిలో 29.35 శాతం వాటాను కలిగి ఉందన్నారు. ఈ రంగం దేశ వ్యాప్తంగా 8.8 శాతం గ్రామీణ కుటుంబాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఇంతటి ప్రాముఖ్యతను పోషిస్తున్న పశు సంపదను సరిగ్గా లెక్క వేసుకోలేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడే అవకాశం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment