శత్రు దుర్భేద్యమైన రక్షణ వ్యవస్థ | Modi oath ceremony tight security | Sakshi
Sakshi News home page

శత్రు దుర్భేద్యమైన రక్షణ వ్యవస్థ

Published Mon, May 26 2014 1:21 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

శత్రు దుర్భేద్యమైన రక్షణ వ్యవస్థ - Sakshi

మోడీ ప్రమాణ స్వీకారానికి కట్టుదిట్టమైన భద్రత
 
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ   ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేస్తున్నారు. దుర్భేద్యమైన గగనతల రక్షణ వ్యవస్థను వైమానిక దళం ఏర్పాటు చేయగా, దాదాపు 10 వేల మంది భద్రతా సిబ్బంది కార్యక్రమానికి రక్షణగా నిలుస్తున్నారు. ఢిల్లీ పోలీస్, ఎన్‌ఎస్‌జీ, పారామిలటరీ దళాలు, ఎస్పీజీ తదితర దళాలు అందులో పాల్గొంటున్నాయి. రాష్ట్రపతిభవన్ నుంచి రెండు కిలోమీటర్ల పరిధిని వారు తమ అధీనంలోకి తీసుకున్నారు. విదేశాల అధిపతులు, ప్రముఖులు బస చేసిన అన్ని హోటళ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాగా, ప్రమాణ స్వీకార వేదికను ఐటీబీపీకి చెందిన జాగిలాలు క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నాయి. వీవీఐపీల రాకపోకలకు వీలుగా ట్రాఫిక్‌ను అదుపు చేసేందుకు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లే అన్ని మార్గాలనూ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు మూసివేయనున్నారు.

{పధానిగా మోడీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయినట్లు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కార్యదర్శి ఒమితా పాల్ చెప్పారు. మోడీ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే విషయమై తన వద్ద ఎలాంటి సమాచారం లేదని, మోడీతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల వివరాలు కూడా తెలియదని అన్నారు. ఢిల్లీలో సోమవారం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఒకవేళ వర్షం పడితే, వేదికను దర్బార్ హాలుకు మారుస్తామన్నారు. అయితే, అక్కడ 500 మంది కూర్చోవడానికి, మరో 400 మంది నిల్చోవడానికి మాత్రమే వీలవుతుందని ఆమె వివరించారు.

రాష్ట్రపతి భవన్‌లో ఎక్కువ మంది పాల్గొంటున్న భారీ కార్యక్రమం ఇదే. దాదాపు 4 వేల మంది హాజరు కావచ్చని భావిస్తున్నారు. గతంలో రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో చంద్రశేఖర్, వాజ్‌పేయి ప్రధానులుగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమాల్లో 1200 నుంచి 1300 మంది మాత్రమే పాల్గొన్నారు.భారత ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సార్క్ దేశాల అధిపతులను ఆహ్వానించడం ఇదే ప్రథమం.భారత్‌లోని విదేశీ రాయబారులు, హై కమిషనర్లను ఆహ్వానించడం కూడా ఇదే తొలిసారి.దక్షిణాసియా దేశాల కూటమి ‘సార్క్’లో సభ్య దేశాలైన పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స, అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలా, మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ అబ్దుల్ గయూమ్‌లు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా జపాన్ పర్యటనలో ఉన్నందున ఆమె తరఫున బంగ్లా స్పీకర్ షిరిన్ చౌధురి హాజరవుతున్నారు.

బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, లతా మంగేష్కర్, సల్మాన్ ఖాన్‌లు కూడా హాజరవుతున్నారు.వడోదరా లోక్‌సభ స్థానం నుంచి మోడీ నామినేషన్ దాఖలు చేసినప్పుడు ఆయనకు ప్రతిపాదకులుగా ఉన్న మాజీ రాచకుటుంబానికి చెందిన టీ వర్తకుడు కిరణ్  మహీదా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. గుజరాత్ కొత్త సీఎం ఆనందీబెన్ పటేల్ సహా గుజరాత్ రాష్ట్రానికి చెందిన మొత్తం 21 మంది మంత్రులు, బీజేపీ గుజరాత్ రాష్ట్ర శాఖ కార్యనిర్వాహక సభ్యులందరూ మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. ఇటీవలే బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జితన్‌రామ్ మంజీ కూడా హాజరు కానున్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తన తరఫున ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రదీప్ అమత్‌ను పంపనున్నారు. {పముఖ ఎన్నారైలు సహా దాదాపు 90 మంది విదేశీ ప్రముఖులను కార్యక్రమానికి ఆహ్వానించారు.{పమాణం తర్వాత మోడీ ప్రధాని అధికారిక నివాసమైన 7 రేస్ కోర్సు రోడ్డు భవనానికి వెళ్తారు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement