border issue
-
Rahul Gandhi: చైనాను అడ్డుకోలేకపోయారు
వాషింగ్టన్: అమెరికా పర్యటనలో పలు అంశాలపై పదునైన వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా చైనా అంశాన్ని ప్రస్తావించారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక నేషనల్ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆయన పత్రికాసమావేశంలో మాట్లాడారు. ‘‘ 4,000 చదరపు కి.మీ.ల భారత భూభాగంలో చైనా బలగాలు తిష్టవేసిన ఉదంతంలో మోదీ సమర్థవంతంగా వ్యవహరించారా అంటే కాదు అనే చెప్తా. లద్దాఖ్లో ఢిల్లీ అంత పరిమాణంలో భూభాగాన్ని చైనా బలగాలు ఆక్రమించాయి. ఇది తీవ్ర వైఫల్యం. ఒక వేళ అమెరికాకు చెందిన 4వేల చదరపు కి.మీ.ల భూభాగాన్ని పొరుగుదేశం ఆక్రమిస్తే అమెరికా ఊరుకుంటుందా? ఎలా స్పందిస్తుంది?. ఈ విషయాన్ని అద్భుతంగా చక్కదిద్దానని అమెరికా అధ్యక్షుడు చేతులు దులిపేసుకుంటాడా?. అందుకే ఈ కోణంలో చూస్తే మోదీ చైనా విషయంలో విఫలమయ్యారు’’అని అన్నారు. ‘‘ అమెరికా– భారత్ సంబంధాల విషయంలో మోదీని సమరి్థస్తా. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో అనుసరించిన విధానాలనే ఇప్పుడు మోదీ కొనసాగిస్తున్నారు. అయితే భారత అంతర్గత అంశాల్లో అమెరికా ప్రమేయాన్ని నేను ఏమాత్రం ఒప్పుకోను. భారత్లో ప్రజాస్వామ్యం మెరుగు కోసం దేశీయంగా జరుగుతున్న పోరు ఇండియా సొంత విషయం. దీనిని మేమే పరిష్కరించుకుంటాం’’ అని రాహుల్ అన్నారు. నిరాధార ఆరోపణలు: రాజ్నాథ్ భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న రాహుల్ వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ స్పందించారు. ‘‘ లోక్సభలో విపక్షనేత హోదాలో ఉన్న వ్యక్తి ఇలా తప్పుడు, నిరాధార, అబద్దపు వ్యాఖ్యానాలు చేయడం నిజంగా సిగ్గుచేటు. అసంబద్ధంగా మాట్లాడి విదేశీ గడ్డపై భారత పరువు తీస్తున్నారు. గురుద్వారాకు వెళ్లే సిక్కులు తలపాగా ధరించడానికి కూడా పోరాడాల్సి వస్తోందని రాహుల్ సత్యదూరమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రేమ దుకాణాలు తెరిచానని చెప్పుకుని తిరిగే రాహుల్ .. అబద్ధాల దుకాణాలు నడుపుతున్నారు’’ అనిరాజ్నాథ్ అన్నారు. -
సవాల్ విసిరితే.. దేనికైనా సిద్ధమే: రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ: భారత్- చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో డ్రాగన్ కంట్రీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ . భారత్ ఇప్పటి వరకు ఏ దేశంపై దాడి చేయలేదని తెలిపిన కేంద్ర మంత్రి.. ఏ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోలేదని పేర్కొన్నారు. అదే ఒకవేళ ఏ దేశమైన భారత్కు సవాల్ విసిరితే.. తాము ధీటైన సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. చైనా సరిహద్దులో కొంతకాలంగా ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో రక్షణమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ మేరకు ఓ జాతీయ మీడియా నిర్వహించిన ‘ఢిఫెన్స్ సమ్మిట్’లో గురువారం రాజ్నాథ్ సింగ్ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్ల కాలంలో భారత రక్షణ రంగంలో చోటుచేసుకున్న మార్పులను, అభివృద్ధి వంటి అంశాలపై సైతం చర్చించారు. భూమి, గగనతలం, సముద్రం నుంచి ఎవరైనా భారత్పై దాడికి దిగితే తమ బలగాలు ధీటుగా బదులిస్తాయని హెచ్చరించారు. తాము ఏ దేశంపైనా దాడి చేయలేదని.. ఎవరి భూభాగాన్ని అంగుళం కూడా ఆక్రమించలేదన్నారు. కానీ, ఎవరైనా తమపై కన్నెత్తి చూస్తే, తప్పించుకునే పరిస్థితి లేదన్నారు. భారత్పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తే తగిన సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉన్నామని చెప్పారు. 2014లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, రక్షణ రంగానికి తాము ప్రాధాన్యత పెంచామని కేంద్రమంత్రి తెలిపారు. ముఖ్యంగా రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను (స్వయంశక్తి) ప్రోత్సహించామని, స్వదేశీ ఉత్పత్తితోపాటు రక్షణ పరికారల ఎగుమతి, సైనిక ఆధునికీకరణపై దృష్టి సారించామని చెప్పారు.దీని వల్ల భారతదేశ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమైందని పేర్కొన్నారు. చదవండి: విమానంలో సీట్ కుషనింగ్ మాయం! - ఏం జరిగిందంటే.. -
అరుణాచల్ భారత్లో అంతర్భాగం.. చైనాకు గట్టి ఎదురుదెబ్బ..
వాషింగ్టన్: అరుణాచల్ ప్రదేశ్ తమదేనని వాదిస్తున్న చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అరుణాచల్ ముమ్మాటికీ భారత్లో అంతర్భాగమే తప్ప చైనాలో భాగం కాదని అగ్రరాజ్యం అమెరికా తేల్చిచెప్పింది. చైనా, అరుణాచల్ మధ్యనున్న మెక్మోహన్ రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. సరిహద్దు వద్ద యథాతథ స్థితిని మార్చడానికి చైనా ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సెనేటర్లు బిల్ హగెట్రీ, జెఫ్ మెర్క్లీ సెనేట్లో తీర్మానం ప్రవేశపెట్టగా మరో సెనేటర్ జాన్ కార్నిన్ కూడా దాన్ని ప్రతిపాదించారు. ‘‘స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్కు చైనా నుంచి ముప్పు కొనసాగుతున్న తరుణంలో ఈ ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలకు అండగా నిలవడం అమెరికా బాధ్యత. ప్రత్యేకించి భారత్కు మా మద్దతు ఉంటుంది’’ అని హగెట్రీ పేర్కొన్నారు. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద యథాతథ స్థితిని మార్చాలన్న చైనా కుటిల యత్నాలను ఖండిస్తున్నామని చెప్పారు. అమెరికా–భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత ముందుకెళ్లనుందని అన్నారు. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్కు ‘క్వాడ్’ కూటమి మద్దతు ఉంటుందని వెల్లడించారు. సరిహద్దు వెంట వివాదాస్పద ప్రాంతాల్లో గ్రామాల నిర్మాణం, అరుణాచల్ భూభాగాలకు మాండరిన్ భాషలో మ్యాప్లను రూపొందించడాన్ని తీర్మానంలో ప్రస్తావించారు. -
బోర్డర్లో రెచ్చిపోతున్న చైనా.. నివేదికలో పలు సంచలన అంశాలు
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద డ్రాగన్ దేశం చైనా రెచ్చిపోతోంది. డ్రాగన్ సైన్యం భారత భూభాగంలోకి క్రమంగా చొచ్చుకొస్తూ సరిహద్దును సైతం మార్చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఆధునిక మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన డీజీపీల సమావేశంలో చైనా వ్యవహారంపై అధికారులు సమర్పించిన ఓ నివేదికలో పలు సంచలన అంశాలు బహిర్గతమయ్యాయి. సరిహద్దు ప్రాంతంలో చైనా కొత్త సైనిక స్థావరాలను ఏర్పాటుచేస్తున్న నేపథ్యంలో భారత్–చైనా సైనికుల నడుమ మరిన్ని ఘర్షణలు జరగవచ్చని అంచనా వేస్తున్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. దీనిపై అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఒక కథనాన్ని వెలువరించింది. భారత్–చైనాల మధ్య కొన్నేళ్లుగా నెలకొన్న ఉద్రిక్తతలు, నిఘా సంస్థలు సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ‘‘2013–14 తర్వాత రెండు మూడేళ్లకోసారి ఇరు దేశాల నడుమ ఉద్రిక్తతల తీవ్రత పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. సరిహద్దులో ఇరు దేశాలు పోటాపోటీగా సైనిక బలగాలను పెంచుకుంటున్నాయి. చైనా చర్యల వల్ల తూర్పు లద్దాఖ్లో భారత్ ఇప్పటికే పలు కీలక గస్తీ పాయింట్లను కోల్పోయింది. చైనా దూకుడును అడ్డుకోవాలంటే సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధిని వేగవంతం చేయాలి. సరిహద్దు పర్యాటకాన్ని ప్రోత్సహించాలి’’ అని సూచించారు. -
భగ్గుమంటున్న సరిహద్దు వివాదం: తగ్గేదేలే! అన్న బసవరాజ్ బొమ్మై
సరిహద్దు విషయమై మహారాష్ట్ర తీసుకున్న తాజా చర్యపై కర్ణాట ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సీరియస్ అయ్యారు. మహారాష్ట్ర నాయకులు ఆమోదించిన తీర్మానానికి ఎలాంటి అర్థం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని రెచ్చగొట్టి, విభజిస్తామని బెదిరిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. 1956లో తీసుకువచ్చిన రాష్ట్ర పునర్వ్యవస్థికరణ చట్టాన్నిఆమోదించి దశాబ్దాలు గడిచాయన్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రజలు సామరస్యంగా జీవిస్తున్నారని బొమ్మై అన్నారు. అలాంటి తీర్మానాన్ని ఆమోదించి మహారాష్ట్ర రాజకీయ జిమ్మిక్కులకు పాల్పడుతోందంటూ మండిపడ్డారు. మేము మా నిర్ణయాలకు కట్టుబడి ఉన్నామని తెగేసి చెప్పారు. అలాగే కర్ణాటకలో ఒక్క అంగుళం కుడా మహారాష్ట్రకు వెళ్లదని కరాఖండీగా చెప్పారు. అయినా సుప్రీం కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పుడూ అలాంటి తీర్మానాన్ని ఎలా ఆమోదించారని గట్టిగా ప్రశ్నించారు. ఇదిలా ఉండగా కర్ణాటక కూడా మహారాష్ట్ర వివాదంపై ఇటీవలే తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో బొమ్మై తమ తీర్మానానికి చాలా భిన్నంగా ఉందంటూ మహారాష్ట్రపై విరుచుకుపడ్డారు. కర్ణాటకలోని కన్నడ ప్రజలు, కన్నడం మాట్లాడే కమ్యూనిటీల ప్రయోజనాలను కాపాడతాం అని నొక్కి చెప్పారు. ఆ తీర్మానంలో మా కర్ణాటకలోని భూమిని లాక్కుంటామని చెబుతున్నారని, కానీ తాము సుప్రీ కోర్టుని విశ్వసిస్తున్నాం కాబట్టి తమ భూమీని కచ్చితంగా కోల్పోమని బొమ్మై ధీమాగా చెప్పారు. (చదవండి: రాజుకుంటున్న సరిహద్దు వివాదం: ప్రతి అంగుళం మహారాష్ట్రకే చెందుతోందంటూ షిండే తీర్మానం) -
ప్రతి అంగుళం మహారాష్ట్రకే చెందుతోందంటూ షిండే తీర్మానం
మహారాష్ట్ర, కర్ణాటకల మధ్య సరిహద్దు వివాదం రోజు రోజుకు మరింత వివాదాస్పదంగా మారుతోంది. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మంగళవారం మరాఠీ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ.. అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు కూడా. వాస్తవానికి మహారాష్ట్రతో ఉన్న సరిహద్దు వివాదంపై కర్ణాటక శాసన సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన కొద్దిరోజుల తర్వాత షిండే ఈ తీర్మాన్ని ప్రవేశపెట్టడం గమనార్హం. వచ్చే ఏడాది కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం జోక్యం చేసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పైగా బీజేపీ పాలిత రెండు రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతోందేగానీ తగ్గడం లేదు. ఐతే మహారాష్ట్ర తీర్మానం ప్రకారం.. బెల్గాం, కార్వార్, బీదర్, నిపాని, భాల్కీలోని ప్రతి అంగుళం సహా 865 మరాఠీ మాట్లాడే గ్రామాలు ఉన్నాయని, ఆయా గ్రామాల్లో ప్రతి అంగుళం మహారాష్ట్రకే చెందుతోందని చెబుతోంది. కానీ కర్ణాటక ఈ వాదనను తోసిపుచ్చటమే గాక తీవ్రంగా ఖండించింది. కర్ణాటక నేల, నీరు, భాష, కన్నడిగుల ప్రయోజనాల విషయంలో రాజీ పడేదే లేదని కరాఖండీగా చెప్పింది. ఇది కర్ణాటక ప్రజల భావాలకు సంబంధించినదని, ఈ విషయంలో తాము ఐక్యంగా కట్టుబడి ఉన్నాం అని తేల్చి చెప్పింది. అంతేగాదు రాష్ట్రప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామంటూ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శాసనసభలో ఇటీవలే తీర్మానం కూడా చేశారు. గతంలో బొమ్మై హోం మంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, 1956లో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకతో సరిహద్దును పునర్నిర్మించాలని డిమాండ్ చేయడంతోనే ఈ సరిహద్దు వివాదం రాజుకుంది. అంతేగాక బెలగావి, కార్వార్, నిప్పావితో సహా కర్ణాటకకు ఇచ్చిన 865 గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఇరువర్గాల రాజకీయ నేతలు పరస్పరం దాడులు చేసుకోవడంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా, ఉథవ్ ఠాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ డిసెంబర్ 21న చైనా సరిహద్దు వివాదాన్ని తెర మీదకు తీసుకువస్తూ..చైనా ప్రవేశించినట్లు కర్ణాటకలో అడుగుపెడతాం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అధికారం కోల్పోయిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వంపై దాడి చేస్తూ..కర్ణాటకపై బలమైన వైఖరి అవలంభించ లేదంటూ ఆరోపణలు చేస్తోంది. (చదవండి: భారత్ జలాల్లోకి పాక్ ఫిషింగ్ బోట్..అప్రమత్తమైన అధికారులు) -
కేంద్రం చేతిలోనే కేవోఎం సమస్యకు పరిష్కారం
నాగ్పూర్: దాదాపు అరవై ఐదేళ్ల నుంచి కొనసాగుతున్న సరిహద్దు సమస్యకు పుల్స్టాప్ పడాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన(యూబీటీ) అధినేత ఉద్దవ్ థాక్రే కోరుతున్నారు. కర్ణాటక ఆక్రమిత మహారాష్ట్ర(Karnataka Occupied Maharashtra)ను.. కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఆయన మాట్లాడుతూ.. ఇది కేవలం సరిహద్దు, భాషలకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు. మానవత్వానికి సంబంధించింది. మరాఠా మాట్లాడే ప్రజలు సరిహద్దు గ్రామాల్లో తరతరాల నుంచి జీవిస్తున్నారు. వాళ్ల దైనందిన జీవితం మరాఠీతో ముడిపడి ఉంది. సుప్రీం కోర్టులోనూ ఈ అంశం పెండింగ్లో ఉంది. అంతకంటేముందే కేంద్రం ఈ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలి. కేంద్రం చేతుల్లోనే ఈ సమస్యకు పరిష్కారం ఉంది అని అసెంబ్లీ సాక్షిగా ఉద్దవ్ థాక్రే కేంద్రాన్ని కోరారు. రాష్ట్రాలకు సంరక్షకుడిగా వ్యవహరించాల్సిన కేంద్రం ఈ విషయంలో ఏం చేస్తోందని ఆయన నిలదీశారు. ఈ క్రమంలో.. కర్ణాటక ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వంపైనా ఆయన విమర్శలు గుప్పించారు. సీఎం షిండే ఈ వ్యవహారంలో ఒక్క మాటైనా మాట్లాడాలని నిలదీశారు. బెలగావి మున్సిపల్ కార్పొరేషన్ మహారాష్ట్రలో విలీనం చేయాలనే తీర్మానాన్ని ఆమోదించినప్పుడు, కార్పొరేషన్పై చర్యలు తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా థాక్రే గుర్తు చేశారు. అదే విధంగా మహారాష్ట్రలోని కొన్ని గ్రామ పంచాయతీలు తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేశాయి. ఈ గ్రామ పంచాయతీలపై చర్యలు తీసుకునే ధైర్యం షిండే ప్రభుత్వానికి లేదా? అని థాక్రే ప్రశ్నించారు. థాక్రే ప్రసంగించిన సమయంలో.. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విజిటర్స్ హాల్ నుంచి వీక్షించడం గమనార్హం. ఈ సరిహద్దు సమస్య ఈనాటిది కాదు. భాషా పరంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత(1957) నుంచి నడుస్తోంది. మరాఠీ మాట్లాడే జనాభా ఎక్కువగా ఉండడంతో.. మునుపటి బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమైన బెలగావి తమకే చెందుతుందని మహారాష్ట్ర వాదిస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో భాగమైన 800 కంటే ఎక్కువ మరాఠీ మాట్లాడే గ్రామాలు తమకే సొంతమని అంటోంది. ఇక కర్ణాటక మాత్రం.. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా, 1967 మహాజన్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సరిహద్దులను ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతోంది. -
కర్ణాటకతో సరిహద్దు వివాదంపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
ముంబై: మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దు వివాదంపై శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా బలగాలు భారత్లోకి ప్రవేశించినట్లే తాము కూడా కర్ణాటకలోకి వెళ్తామన్నారు. ఈ విషయంలో తమకు ఎవరి అనుమతి అవసరం లేదన్నారు. కర్ణాటక సీఎంతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని తాము భావించామని, కానీ ఆయనే అగ్గి రాజేసి రెచ్చగొడుతున్నారని రౌత్ విమర్శించారు. ఇటు మహారాష్ట్రలో ప్రస్తుతం బలహీన ప్రభుత్వం అధికారంలో ఉందని, సరిహద్దు వివాదంపై తటస్థంగా ఉంటూ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఈమేరకు రౌత్ బుధవారం మీడియాతో మాట్లాడారు. #WATCH | Like China has entered, we will enter (Karnataka). We don't need anyone's permission. We want to solve it through discussion but Karnataka CM is igniting fire. There is a weak govt in Maharashtra & is not taking any stand on it: Sanjay Raut, Uddhav Thackeray's faction pic.twitter.com/d0okV6Wq8X — ANI (@ANI) December 21, 2022 మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదం ఆందోళనకర స్థాయికి చేరింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటివలే చర్చలు జరిపారు. అయితే ఈ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేమన్నారు. చదవండి: జోడో యాత్రపై రాహుల్కు కేంద్రం హెచ్చరిక.. -
అందరి చూపు సుప్రీం వైపు.. సరిహద్దుల్లో భారీగా బలగాలు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక–సరిహద్దు వివాదంపై బుధవారం సుప్రీంకోర్టులో అతి ముఖ్యమైన విచారణ జరగనుండగా, అందరి చూపు సర్వోన్నత న్యాయస్థానంపై కేంద్రీకృతమైంది. తీర్పు ఎలా వస్తుందోనన్న ఉత్కంఠ సర్కారుతో పాటు ప్రజల్లోనూ నెలకొంది. దశాబ్దాలుగా నానుతున్న ఈ సున్నితమైన అంశం వల్ల ఘర్షణలు తలెత్తకుండా కర్ణాటక– మహారాష్ట్ర సరిహద్దుల్లో ఇరు రాష్ట్రాల పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలో సీఎం మంతనాలు రాష్ట్రం తరఫున గట్టిగా వాదనలు వినిపించాలని సీఎం బసవరాజ బొమ్మై ప్రముఖ న్యాయవాదులతో చర్చలు జరిపారు. సరిహద్దు వివాదంపై మహాజన్ నివేదికే తుది తీర్పు అని, కానీ మహారాష్ట్ర సుప్రీంకోర్టులో కేసులు వేయడం సబబు కాదని పేర్కొన్నారు. సీఎం మంగళవారం ఢిల్లీలో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గిని కలిసి ఈ అంశంపై చర్చించారు. మంగళవారం బెళగావి జిల్లా నిప్పాణి వద్ద మహారాష్ట్ర సరిహద్దుల్లో ఏడీజీపీ అలోక్కుమార్ తనిఖీలు మహారాష్ట్ర నాయకుల వల్లనే గొడవ తరువాత బొమ్మై విలేకరులతో మాట్లాడుతూ సరిహద్దు వివాదంపై చట్టపరమైన పోరాటాలను రోహత్గీకి వివరించానని, సుప్రీంకోర్టులో పటిష్టంగా వాదనను వినిపించేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం సమరి్పంచిన అభ్యంతర పిటిషన్ గురించి విచారణ జరగనుంది. దీనిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మహారాష్ట్ర నాయకులు సరిహద్దు వివాదంపై సీరియస్గా ఉన్నామని చెప్పుకునేందుకు పదే పదే వివాదాన్ని లేవనెత్తుతున్నారని ధ్వజమెత్తారు. మహారాష్ట్రలో కర్ణాటక బస్సులపై దాడులు జరగకుండా పోలీసు అధికారులతో చర్చించినట్లు తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో సరైన సౌకర్యాలు లేనందున ఆ గ్రామాలవారు కర్ణాటకలో చేరుతామని చెబుతున్నారన్నారు. సరిహద్దుల్లో అలర్ట్ కర్ణాటక–మహారాష్ట్ర సరిహద్దు వివాదంపై సుప్రీంకోర్టులో బుధవారం ముఖ్యమైన వాదనలు జరగనున్నందున మంగళవారం బెళగావి నిప్పాణిలో ఏడీజీపీ అలోక్కుమార్ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. మహారాష్ట్రలోని కొల్హాపుర ఐజీపీ, సాంగ్లి ఎస్పీ, బెళగావి ఐజీ, బెళగావి కమిషనర్, ఎస్పీ, డీఎస్పీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం అలోక్కుమార్ మాట్లాడుతూ.. గతవారం కర్ణాటక బస్సులపై మహారాష్ట్రలో కొందరు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీనిపై మూడు కేసులు నమోదయ్యాయి, ఇకపై ఇలాంటివి జరగరాదన్నారు. సుప్రీంకోర్టులో తీర్పు వెలువడనున్నందున సమావేశం నిర్వహించామని తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక పోలీసులతో ఉమ్మడిగా 21 చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. నిత్యం 4 వేలకు పైగా కర్ణాటక బస్సులు మహారాష్ట్రలో సంచరిస్తాయని, మహారాష్ట్ర నుంచి కర్ణాటకకు 176 బస్సులు వచ్చి వెళ్తుంటాయని తెలిపారు. తరువాత నిప్పాణి వద్ద మహారాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ను అలోక్కుమార్ సందర్శించి అక్కడ ప్రయాణికులతో మాట్లాడారు. మహారాష్ట్ర డ్రైవర్లకు, ప్రయాణికులకు గులాబీ పూలు అందించి రెండు రాష్ట్రాల్లో శాంతి కాపాడాలని మనవి చేశారు. -
అస్సాం-మేఘాలయ బార్డర్ చిచ్చు.. ఆరుగురి మృతి.. ఇంటర్నెట్ బంద్
సరిహద్దులో కాల్పుల ఘటన ఉద్రిక్తతలతో మేఘాలయ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఏడు జిల్లాల్లో 48 గంటలపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అసోం(పూర్వ అస్సాం)-మేఘాలయ సరిహద్దు వెంట జరిగిన కాల్పుల్లో రాష్ట్రానికి చెందిన ఐదుగురు మరణించారు. దీంతో.. సోషల్ మీడియాలో వందతులు వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇరు రాష్ట్రాల సరిహద్దులో పశ్చిమ జైంటియా హిల్స్ వద్ద అక్రమ కలప రవాణాను అడ్డుకునే క్రమంలో ఘర్షణలు తలెత్తినట్లు తెలుస్తోంది. అస్సాం పోలీసులు-ఫారెస్ట్ అధికారులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మేఘాలయకు చెందిన వ్యక్తులతో పాటు ఘర్షణల్లో అస్సాంకు చెందిన ఓ ఫారెస్ట్ గార్డు చనిపోయినట్లు మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా మంగళవారం వెల్లడించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. ఈ ఉదయం(మంగళవారం) 10.30 నుంచి 48 గంటలపాటు ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపిన మేఘాలయ పోలీసులు.. ఎఫ్ఐఆర్ నమోదు అయినట్లు వెల్లడించారు. మరోవైపు అసోం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో మాత్రం ఉద్రిక్తతలు చల్లారడం లేదు. మంగళవారం ఉదయం అక్రమ కలప రవాణా చేస్తున్న ట్రక్కును అడ్డగించడంతో అస్సాం-మేఘాలయ సరిహద్దులో హింస చెలరేగింది. అసోం పరిధిలోని పశ్చిమ కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని ముక్రు ప్రాంతంలో అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో.. మేఘాలయలోని పశ్చిమ జైంటియా హిల్స్ జిల్లా ముఖో వైపు అక్రమంగా కలప తరలిస్తున్న టింబర్ను అసోం అటవీ శాఖ బృందం అడ్డుకుంది. ఈ క్రమంలో వాళ్లు పారిపోయే క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఈ ఘటన తర్వాత ఫారెస్ట్ సిబ్బంది జిరికెండింగ్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని భద్రతను పెంచారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న తర్వాత.. మేఘాలయ నుంచి ఆయుధాలతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉదయం ప్రాంతంలో అక్కడకు వచ్చారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ఫారెస్ట్ గార్డులు, పోలీసు సిబ్బందిపై దాడి చేశారని తెలిపారు. ఈ క్రమంలోనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కాల్పులు జరపాల్సి వచ్చిందని అస్సాం పోలీసులు వివరణ ఇచ్చుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉండగా.. మేఘాలయ సరిహద్దు పంచుకుంటున్న జిల్లాల్లో అసోం పోలీసులు భద్రతను పెంచారు. ఐదుగురు కూడా బుల్లెట్ గాయాలతో మరణించారా లేదా మరేదైనా ఆయుధం తగలడంతో మృతిచెందారా? అసోం ఫారెస్ట్ మరణానికి కారణం ఏంటన్న దానిపై అసోం పోలీసుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. అస్సాం గార్డులే మొదటగా టింబర్ల టైర్లను కాల్చారని చెప్తున్నారు. నలుగురు ఘటనా స్థలంలోనే మరణించగా.. మరొకరు చికిత్స పొందుతూ చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో ఫారెస్ట్ గార్డు గాయపడి మరణించినట్లు సమాచారం. 1972లో మేఘాలయ అస్సాం నుండి వేరు అయ్యింది. అప్పటి నుంచి అస్సాం పునర్వ్యవస్థీకరణ చట్టంపై చర్చ నడుస్తూనే వస్తోంది. ఇరు రాష్ట్రాలు గతేడాది ఆగస్టులో మూడు ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని ఈ సమస్య పరిష్కారానికి సిద్ధం అయ్యాయి. ఇరు రాష్ట్రాల సీఎంలు.. ఓ డ్రాఫ్ట్ రెజల్యూషన్ను హోం మంత్రి అమిత్ షాకు జనవరి 31వ తేదీన సమర్పించాయి. ఒప్పందాల నడుమే ఉద్రిక్తతలు ఇరు రాష్ట్రాలకు సంబంధించి 884.9 కిలోమీటర్ల సరిహద్దు వెంట 12 వివాదాస్పద ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో ఆరింటికి సంబంధించి పరిష్కారం కోసం మార్చి నెలలో.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా ఒక ఒప్పందం చేసుకున్నారు. దీంతో.. ఐదు దశాబ్దాల నాటి వివాదాన్ని ఓ కొలిక్కి వస్తుందని అంతా అనుకున్నారు. ఇక.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఈ ఒప్పందం చారిత్రాత్మకమని, సంతకంతో 70% వివాదం పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. ఆగస్టులో మిగిలిన ప్రాంతాల్లో వివాదాన్ని పరిష్కరించేందుకు శర్మ, సంగ్మా చర్చలు జరిపారు. అవి ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఈలోపు.. అస్సాం 18.51 స్క్వేర్ కిలోమీటర్లు, మేఠాలయా 18.21 స్క్వేర్ కిలోమీటర్లు ఉంచేసుకోవాలని ప్రతిపాదించాయి. తొలిదశలో 36 గ్రామాలకు సంబంధించి ఒప్పందం కుదిరింది కూడా. ఇదిలా ఉంటే.. మిజోరాంతోనూ గతంలో ఇలాగే సరిహద్దు విషయంలో ఘర్షణలు తలెత్తాయి. 2021లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు అస్సాం పోలీసులు దుర్మరణం పాలయ్యారు. -
సరిహద్దులను రాజకీయం చేయొద్దు
న్యూఢిల్లీ: సరిహద్దు సమస్యను రాజకీయం చేయరాదని భారత్–నేపాల్ అంగీకారానికి వచ్చాయి. భారత్లో పర్యటిస్తున్న నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా శనివారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఈ సందర్భంగా వీరు అంగీకారానికి వచ్చారు. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం కూడా చర్చకు వచ్చింది. సమస్య పరిష్కారానికి ద్వైపాక్షిక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని దేవ్ బా కోరగా, రెండుదేశాల మధ్య ఉన్న కాపలాలేని సరిహద్దులను అవాంఛనీయ శక్తులు దుర్వినియోగం చేయడంపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇద్దరు నేతలు కలిసి భారత్–నేపాల్ మధ్య మొట్టమొదటి బ్రాడ్గేజ్ రైలు మార్గాన్ని, విద్యుత్ సరఫరా లైన్ను, నేపాల్లో రూపే చెల్లింపుల వ్యవస్థను వర్చువల్గా ప్రారంభించారు. రైల్వేలు, విద్యుత్ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు ఉద్దేశించిన నాలుగు ఒప్పందాలపైనా సంతకాలు చేశారు. దేవ్ బా భారత్లో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు. ఐదోసారి పీఎం అయ్యాక ఇదే ఆయన తొలి విదేశీ పర్యటన. చర్చల అనంతరం విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రింగ్లా మీడియాతో మాట్లాడుతూ.. సరిహద్దు సమస్యను రాజకీయం చేయడం మాని చర్చల ద్వారా బాధ్యతాయుతంగా పరిష్కరించుకోవాలని రెండు దేశాలు భావిస్తున్నాయని చెప్పారు. భారత్– బంగ్లాదేశ్ సరిహద్దు సమస్యలకు సామరస్యపూర్వక సమాధానం దొరికినట్లే, నేపాల్తో విభేదాలకు కూడా పరిష్కారం లభిస్తుందన్నారు. రెండు దేశాల సరిహద్దుల్లోని భారత భూభాగాలైన లింపియధురా, కాలాపానీ, లిపులేఖ్లు తమవేనంటూ నేపాల్ ప్రభుత్వం కొత్త మ్యాప్ను ప్రచురించడంపై 2020 నుంచి వివాదం నడుస్తోంది. -
హింసాత్మకంగా మారిన అసోం, మిజోరాం సరిహద్దు వివాదం
న్యూఢిల్లీ: అసోం, మిజోరాం సరిహద్దు వివాదం హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణలో ఆరుగురు పోలీసులు మృతిచెందారు. మిజోరం పోలీసుల కాల్పుల్లో ఆరుగురు అసోం పోలీసులు మృతిచెందినట్లు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. పోలీసుల మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అలాగే కాచర్ ఎస్పీ నింబల్కర్ వైభవ్ చంద్రకాంత్ సహా కనీసం 50 మంది సిబ్బంది కాల్పులు, రాళ్లు రువ్వడంతో గాయపడ్డారని పేర్కొన్నారు. ఈ ఘర్షణ అనంతరం రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో హోంమంత్రి అమిత్షా మాట్లాడారు. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించి, శాంతియుతంగా ఉండాలని సూచించారు అయితే అస్సాం పోలీసులు మిజోరాంలోని కోలాసిబ్ సరిహద్దు దాటి వచ్చిన తరువాతే హింస ప్రారంభమైందని మిజోరాం హోం మినిస్టర్ తెలిపారు. అంతేగాక అస్సాం పోలీసులు జాతీయ రహదారిపై తమ వాహనాలను దెబ్బతీశారని, రాష్ట్ర పోలీసులపై కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా గత ఏడాది ఆగష్టు మాసంలో ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం మొదలవ్వగా. ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం కారణంగా అసోంలోని కచార్, మిజోరాంలోని కోలాసిబ్ సరిహద్దులో ఇవాళ హింసాత్మక ఘటనలు చోటు చేసుకొన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య సోమవారం దాదాపు యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరువైపులా వాహనాలను ధ్వంసం చేశారు. సమస్య పరిష్కారం అయ్యేదాకా సరిహద్దు గుండా ప్రయాణించొద్దంటూ కార్లు, బైకులను చిత్తుచిత్తు చేశారు. దాడుల ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. సదరు వీడియోలను కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ట్యాగ్ చేస్తూ మిజోరాం, అస్సాం ముఖ్యమంత్రులు ట్విటర్లనే మాటల యుద్ధం చేసుకున్నారు. ‘‘అమిత్షా గారూ... దయచేసి ఈ విషయాన్ని పరిశీలించండి.. దీనికి ముగింపు కావాలి'' అంటూ మిజోరం సీఎం జోరమంతుంగా రాయగా, ‘‘గొడవలు సద్దుమణిగే వరకూ పోలీస్ పోస్టులను వదిలేసి వెళ్లాలని మిజోరాం ఎస్పీ సూచిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో మేం ప్రభుత్వాన్ని ఎలా నడుపుతాం?'' అంటూ అస్సాం సీఎం హిమంత శర్మ కూడా అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. -
బలగాల ఉపసంహరణపై చైనాతో డీల్
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లోని సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతల తొలగింపు లక్ష్యంగా ఇరుదేశాల మధ్య కీలకమైన ఒప్పందం కుదిరిందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం పార్లమెంటులో వెల్లడించారు. ఉద్రిక్తతలకు ప్రధాన కారణమైన పాంగాంగ్ సో సరస్సుకు ఇరువైపుల మోహరించిన బలగాలను రెండు దేశాలు వెనక్కు తీసుకునే విషయంలో ఒప్పందం కుదిరిందన్నారు. ఈ ఒప్పందం మేరకు సరస్సుకు ఉత్తర, దక్షిణ తీరాల వద్ద మోహరించిన ఫ్రంట్లైన్ సైనికులు ‘దశలవారీగా, సమన్వయంతో, నిర్ధారించుకోదగిన విధానంలో’వెనక్కు వెళ్తారని పేర్కొన్నారు. దాదాపు గత 9 నెలలుగా రెండు దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా చైనాతో కుదిరిన ఒప్పందం వివరాలను రాజ్నాథ్ సింగ్ రాజ్యసభకు వెల్లడించారు. తాజా ఒప్పందంతో గత సంవత్సరం మే 5 నాటి కన్నా ముందున్న స్థితికి సరిహద్దుల్లో పరిస్థితులు చేరుకుంటాయన్నారు. అన్ని ద్వైపాక్షిక నిబంధనలు, ఒప్పందాలను గౌరవిస్తూ, సాధ్యమైనంత తొందరగా ఉపసంహరణ జరగాలని ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయన్నారు. పాంగాంగ్ సొ సరస్సునకు ఇరువైపులా గత సంవత్సరం ఏప్రిల్ తరువాత నిర్మించిన అన్ని నిర్మాణాలను తొలగించేందుకు అంగీకారం కుదిరిందన్నారు. ఏ విషయాన్ని దాచి పెట్టలేదు ఆయా ప్రాంతాల్లో గస్తీ సహా అన్ని మిలటరీ కార్యకలాపాలపై తాత్కాలిక నిషేధం విధించినట్లు వెల్లడించారు. గస్తీ పునః ప్రారంభంపై ఇరుదేశాలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయన్నారు. చైనాతో చర్చల విషయంలో భారత్ ఏ విషయాన్ని దాచి పెట్టలేదని ఈ సందర్భంగా రాజ్నాథ్ స్పష్టం చేశారు. అలాగే, భారత భూభాగంలోని అంగుళం భూమిని కూడా ఎవరూ తీసుకోవడానికి అంగీకరించబోమన్నారు. తాజా ఒప్పందం ప్రకారం, చైనా తమ సైనిక బలగాలను పాంగాంగ్ సరస్సు ఉత్తర సరిహద్దు నుంచి తూర్పు దిశగా ‘ఫింగర్ 8’ వరకు వెనక్కు తీసుకుంటుందని రాజ్నాథ్ తెలిపారు. అలాగే, భారత దళాలు ‘ఫింగర్ 3’ సమీపంలోని శాశ్వత మిలటరీ కేంద్రం ధన్సింగ్ థాపా పోస్ట్ వరకే పరిమితమవుతాయన్నారు. ఈ ఒప్పందం బుధవారం నుంచి అమల్లోకి రావడం ప్రారంభమైందన్నారు. ఈ ఉపసంహరణ ముగిసిన 48 గంటల్లోపు రెండు దేశాల మిలటరీ కమాండర్ స్థాయిలో మరో విడత చర్చలు జరుగుతాయన్నారు. అప్పుడు, ఇతర అపరిష్కృత అంశాలపై చర్చిస్తారని వెల్లడించారు. ‘ప్రణాళికాబద్ధ విధానంతో చైనాతో క్రమం తప్పకుండా చర్చలు కొనసాగించిన కారణంగా, పాంగాంగ్ సరస్సుకు ఉత్తర, దక్షిణ తీరాల వెంట మోహరించి ఉన్న ఇరుదేశాల బలగాల ఉపసంహరణకు ఒప్పందం కుదిరింది’అని రాజ్నాథ్ రాజ్యసభలో ప్రకటించారు. పాంగాంగ్ సరస్సుకు ఉత్తర, దక్షిణ తీరాల వెంట చైనా, భారత్ దళాల ఉపసంహరణ ప్రారంభమైందని చైనా బుధవారమే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు ఈ సందర్భంగా రాజ్నాథ్ కృతజ్ఞతలు తెలిపారు. సైనికులు చేసిన త్యాగాలను దేశం గుర్తుంచుకుంటుందన్నారు. పాంగాంగ్ సరస్సుకు ఉత్తరంగా ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 వరకు చైనా తన బలగాలను ఉపసంహరించాలని ఆ దేశంతో జరిగిన 9 విడతల చర్చల్లోనూ భారత్ గట్టిగా వాదించింది. ప్రతిగా, సరస్సు దక్షిణ తీరం వెంట ఉన్న కొన్ని వ్యూహాత్మక ప్రాంతాల నుంచి భారత దళాలు వైదొలగాలని చైనా డిమాండ్ చేసింది. ముఖపరి, రెచిన్ లా, మగర్ హిల్ తదితర వ్యూహాత్మకంగా కీలకమైన పర్వత ప్రాంతాలను ఐదు నెలల క్రితం భారత దళాలు స్వాధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజా ఒప్పందం ప్రకారం.. ఫింగర్ 3 నుంచి ఫింగర్ 8 వరకు తాత్కాలికంగా ‘నో పెట్రోలింగ్ జోన్’గా మారుతుంది. ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 మధ్య చైనా పలు బంకర్లను నిర్మించింది. ఫింగర్ 4 ను దాటి ముందుకు వచ్చేందుకు ప్రయత్నించిన భారత దళాలను అడ్డుకుంది. చైనా దళాలు ఫింగర్ 8 వరకు వెళ్లేందుకు అంగీకరించడం గొప్ప విజయంగా భావించవచ్చని రక్షణ రంగ నిపుణులు వ్యాఖ్యానించారు. రాజ్యసభలో మాట్లాడుతున్న రాజ్నాథ్ -
సరిహద్దు ఉద్రిక్తత : రాజ్నాథ్ కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దులో పరిస్థితులపై రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. తూర్పు లడఖ్లో ఇరుదేశాల సైనిక బలగాల ఉపసంహరణ దిశగా చర్చలుకొనసాగుతున్నాయని పార్లమెంట్లో గురువారం వెల్లడించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు తెరపడేలా చైనాతో కీలక ఒప్పందం చేసుకున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ మూరకు చైనా రక్షణమంత్రితో చర్చించల అనంతరం, పూర్తిస్థాయిలో సైనిక బలగాల ఉపసంహరణపై అంగీకారం కుదిరిందని ప్రకటించారు. మిగిలిన సమస్యలను కూడా పరిష్కరించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేయనున్నామని రాజ్నాథ్ రాజ్యసభకు వివరించారు. దీంతో భారత, చైనా సరిహద్దుల్లో గతకొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉద్రికత్తకు ఎట్టకేలకు తెరపడినట్టయింది. (చైనా బలగాల ఉపసంహరణ ప్రారంభం) చైనాకు ఒక్క అంగుళం భూమి కూడా వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఆయన సైనికులు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించారంటూ భారత జవాన్లపై ప్రశంసలు కురిపించారు. మూడు సిద్ధాంతాల ఆధారంగా సమస్య పరిష్కరించుకోవాలని చైనాకు సూచించామనీ రక్షణమంత్రి వెల్లడించారు. ఏ దేశమైనా ఏకపక్షంగా వాస్తవ నియంత్రణ రేఖను మార్చే ప్రయత్నం చేయకూడదనీ ఇరువైపుల నుంచి ప్రయత్నాలు ఉంటేనే ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతాయన్నారు. లడఖ్ సరిహద్దులో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడేలా బలగాల ఉపసంహరణపై చైనాతో కీలక ఒప్పందానికొచ్చామనీ ఈ ఒప్పందంతో ఇరుదేశాలు దశల వారీగా పరస్పర సమస్వయంతో బలగాలను ఉపసంహరించుకోనున్నాయని ఆయన తెలిపారు. ప్యాంగ్యాంగ్ సరస్సుకు ఉత్తరాన ఉన్న ఫింగర్ 8 వద్ద చైనా బలగాలు ఉంటాయి. భారత బలగాలు ఫింగర్ 2 వద్ద ఉన్న పర్మనెంట్ బేస్ వద్ద ఉంటాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ‘తూర్పు లడఖ్లో ప్రస్తుత పరిస్థితి’ పై రాజ్నాథ్ సింగ్ ఈ రోజు సాయంత్రం 5.00 గంటలకు లోక్సభలో ఒక ప్రకటన చేయనున్నారని రక్షణ మంత్రి కార్యాలయం వెల్లడించింది. -
విస్తృత బంధాల్లో సరిహద్దు ఒక భాగం
న్యూఢిల్లీ: భారత్, చైనాలు పరస్పరం మునుపెన్నడూ ఎరగని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని సరిహద్దు వివాదాన్ని ప్రస్తావిస్తూ విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. అయితే, ఇరుదేశాల మధ్య ఉన్న విస్తృత ద్వైపాక్షిక సంబంధాల్లో సరిహద్దు సమస్య ఒక భాగం మాత్రమేనని స్పష్టం చేశారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో గురువారం వర్చువల్గా ఆయన పాల్గొన్నారు. అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో రెండు దేశాలు సర్దుబాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే వివాద పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. ‘మునుపెన్నడూ లేని పరిస్థితిని రెండు దేశాలు ఎదుర్కొంటున్నాయన్నది వాస్తవం. అయితే, దీర్ఘకాలిక దృష్టితో చూస్తే.. ఇరు దేశాల మధ్య నెలకొన్న విస్తృత ద్వైపాక్షిక సంబంధాల్లో సరిహద్దు సమస్య ఒక భాగం మాత్రమేనని అర్థమవుతుంది’ అని జైశంకర్ వ్యాఖ్యానించారు. మరోవైపు, చైనాతో సరిహద్దు వివాదం ముగిసేందుకు ముందుగా, క్షేత్రస్థాయిలో శాంతి, సుస్థిరత నెలకొనాల్సిన అవసరం ఉందని భారత్ స్పష్టం చేసింది. తూర్పు లద్దాఖ్లోని సరిహద్దుల్లో ఉన్న అన్ని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ ప్రక్రియ కొంత సంక్లిష్టమైందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం పేర్కొన్నారు. ఇందుకు పరస్పర ఆమోదనీయ నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే ప్రయత్నాలను విరమించుకోవాల్సి ఉందన్నారు. ఇరు దేశాల మధ్య ‘వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్’ కింద మరో విడత చర్చలు త్వరలో జరుగుతాయని తెలిపారు. తదుపరి రౌండ్ కమాండర్ స్థాయి చర్చల కన్నా ముందే అవి ఉంటాయన్నారు. ఇరుదేశాల కమాండర్ స్థాయి 6వ విడత చర్చలు సోమవారం జరిగిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లోని పరస్పర సమీప ప్రాంతాల వద్దకు మరిన్ని బలగాలను పంపకూడదని, ఉద్రిక్తతలు పెరిగే చర్యలు చేపట్టవద్దని ఆ చర్చల్లో నిర్ణయించారు. చైనా ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతోంది: తైవాన్ తైపీ: తమ దేశ ఎయిర్ డిఫెన్సు జోన్లోకి చైనా నిఘా విమానాలు అక్రమంగా ప్రవేశించడంతో తైవాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా తమను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతోందని తైవాన్ డిప్యూటీ మినిస్టర్ చియ్ చుయ్ షెంగ్ వ్యాఖ్యానించారు. తమకు వ్యతిరేకంగా సైనిక శక్తిని ప్రయోగించాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. భావసారుప్యత ఉన్నదేశాలతో కలిసి పని చేస్తామని అన్నారు. ద్వీప దేశమైన తైవాన్కు స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. కానీ, తైవాన్ తమ దేశంలో అంతర్భాగమేనని చైనా వాదిస్తోంది. -
పబ్జీ ‘ఆట’కట్టు
-
బ్లూచిప్ షేర్ల దన్ను
ట్రేడింగ్ చివర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగడంతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభపడింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, వివిధ దేశాల తయారీ రంగ గణాంకాలు ఆర్థిక ‘రికవరీ’ సంకేతాలిస్తుండటం, అమెరికా అదనంగా ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వనున్నదన్న అంచనాలు కలసివచ్చాయి. అయితే చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు, డాలర్తో రూపాయి మారకం విలువ బలహీనపడటం ప్రతికూల ప్రభావం చూపడంతో లాభాలకు కళ్లెం పడింది. సెన్సెక్స్ 185 పాయింట్ల లాభంతో 39,086 పాయింట్ల వద్ద, నిఫ్టీ 65 పాయింట్లు పెరిగి 11,535 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 18 పైసలు క్షీణించి 73.03 వద్దకు చేరింది. 5 సార్లు నష్టాల్లోంచి లాభాల్లోకి... సెనెక్స్ నష్టాల్లోనే ఆరంభమైంది. మధ్యాహ్నం వరకూ పరిమిత శ్రేణిలో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. నష్టాల్లోంచి ఐదుసార్లు లాభాల్లోకి వచ్చిందంటే ఒడిదుడుకులు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక దశలో 165 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ మరో దశలో 245 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 406 పాయింట్ల రేంజ్లో కదలాడింది. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు ముదురుతుండటంతో ఒడుదుడుకులు చోటు చేసుకుంటున్నాయని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ► మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ 5.7 శాతం లాభంతో రూ. 642.75 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా లాభపడిన షేర్ ఇదే. సూచిస్తున్నారు. ► రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 2 శాతం లాభంతోరూ. 2,128 వద్దకు చేరింది. సెన్సెక్స్ మొత్తం లాభాల్లో ఈ షేర్ వాటాయే మూడింట రెండు వంతులు ఉండటం విశేషం. సెన్సెక్స్ మొత్తం 185 పాయింట్ల లాభంలో రిలయన్స్ వాటాయే 120 పాయింట్ల మేర ఉంది. సూచిస్తున్నారు. ► జీ ప్లెక్స్ పేరుతో సినిమా–టు–హోమ్ సర్వీస్ను అందించనుండటంతో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ షేర్ ధర 8 శాతం వృద్ధితో రూ.217 వద్ద ముగిసింది. సూచిస్తున్నారు. ► ఆగస్టులో వాహన విక్రయాలు పుంజుకోవడంతో వాహన షేర్లు లాభపడ్డాయి. సూచిస్తున్నారు. ► దాదాపు వంద షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. వీఎస్టీ టిల్లర్స్, అదానీ గ్రీన్, జుబిలంట్ ఫుడ్వర్క్స్, గోద్రెజ్ ఇండస్ట్రీస్, ఎస్కార్ట్స్ షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. సూచిస్తున్నారు. ► నిధుల సమీకరణ వార్తల కారణంగా వొడాఫోన్ ఐడియా షేర్ 11 శాతం లాభంతో రూ.9.91కు చేరింది. సూచిస్తున్నారు. ► ఫ్యూచర్ గ్రూప్ షేర్లతో సహా మొత్తం 300కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. మరోవైపు 256 షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. -
పబ్జీ ‘ఆట’కట్టు
సాక్షి, న్యూఢిల్లీ: చైనా కవ్వింపు నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పబ్జీ సహా 118 చైనా మొబైల్ యాప్లను నిషేధిస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పబ్జీ మొబైల్ లైట్, బైదు, బైదు ఎక్స్ప్రెస్ ఎడిషన్, అలీపే, వాచ్లిస్ట్, వీచాట్ రీడింగ్, కామ్కార్డ్తో పాటు పలు గేమింగ్ యాప్లు నిషేధానికి గురైన వాటిలో ఉన్నాయి. దేశ భద్రతకు ముప్పుగా పేర్కొంటూ కేంద్రం వీటిపై కొరడా ఝళిపించింది. పబ్జీ గేమ్ పిల్లలు, యువత మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందనే అభిప్రాయం ఉంది. భారత్లో పబ్జీ క్రియాశీల వినియోగదారులు 3.3 కోట్ల మంది ఉన్నారు. ప్రతిరోజూ మనదేశంలో 1.3 కోట్ల మంది దీన్ని ఆడుతున్నారు. లద్దాఖ్లో చైనాతో ఘర్షణల నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 29న కేంద్ర ప్రభుత్వం... అత్యంత ప్రజాదరణ కలిగిన టిక్టాక్, యూసీ బ్రౌజర్తో సహా మొత్తం 59 చైనా యాప్లను నిషేధించిన విషయం తెలిసిందే. తర్వాత మరో 47 యాప్లను నిషేధిత జాబితాలో చేర్చింది. బుధవారం వేటుపడిన వాటితో కలిపితే ఇప్పటిదాకా భారత్ మొత్తం 224 చైనా యాప్లపై నిషేధం విధించింది. భారత్ లాంటి పెద్దమార్కెట్లో ఉనికి కోల్పోవడం ఈ చైనా కంపెనీలకు ఆర్థికంగా పెద్దదెబ్బే. టిక్టాక్పై భారత్ నిషేధం విధించాక... అమెరికా కూడా అదేబాటలో నడిచిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 15కల్లా టిక్టాక్ అమెరికా వ్యాపారాన్ని అమ్మివేయాలని, లేని పక్షంలో నిషేధం అమలులోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీచేశారు. దేశ భద్రతకు ముప్పు... ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లోని సెక్షన్ 69 (ఎ), ప్రజల సమాచారం సంగ్రహించడాన్ని నిరోధించే విధానం, భద్రతల నిబంధనలు– 2009 పరిధిలో ఈ 118 యాప్లను నిషేధించింది. అందుబాటులో ఉన్న సమాచారం దృష్ట్యా ఆయా మొబైల్ యాప్లు భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, దేశ రక్షణ, ప్రజాభద్రతకు హాని కలిగించే కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నందున వాటిపై నిషేధం విధించినట్టు కేంద్రం వెల్లడించింది. కేంద్ర ఐటీ, టెలికమ్యూనికేషన్ల శాఖకు వివిధ వర్గాల నుంచి ఆయా యాప్లపై అనేక ఫిర్యాదులు అందాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫామ్లలో లభ్యమయ్యే కొన్ని మొబైల్ యాప్లను దుర్వినియోగం చేయడం, వినియోగదారుల డేటాను దొంగిలించడం, అనధికారికంగా భారతదేశం వెలుపల ఉన్న సర్వర్లకు రహస్యంగా పంపించడం చేస్తున్నట్టు కేంద్రం గ్రహించింది. ఈ డేటా సంకలనం భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను చివరికి జాతీయ భద్రతను ప్రభావితం చేయడం ఆందోళన కలిగించే విషయమని, దీనిని నిరోధించే తక్షణ చర్యలో భాగంగా ఈ యాప్లను నిషేధిస్తున్నట్టు తెలిపింది. వ్యక్తిగత డేటా చౌర్యానికి పాల్పడుతున్నాయని పేర్కొంది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, హోం మంత్రిత్వ శాఖ కూడా ఈ హానికరమైన మొబైల్ యాప్స్ నిరోధించటానికి సమగ్రమైన సిఫారసు పంపింది. ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి కూడా వీటిని నిషేధించాలన్న డిమాండ్ ఉందని కేంద్ర ఐటీ శాఖ వివరించింది. -
మళ్లీ చైనా దుస్సాహసం
న్యూఢిల్లీ: చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సరిహద్దుల్లో మరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. గల్వాన్ ఘటన అనంతరం ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో మరోసారి రెచ్చగొట్టేందుకు పీఎల్ఏ చేసిన ప్రయత్నానికి భారత్ గట్టిగా బదులిచ్చింది. తూర్పు లద్దాఖ్లో యథాతథ స్థితిని కొనసాగిం చాలంటూ కుదిరిన ఒప్పందాన్ని కాలరాస్తూ ఆగస్టు 29వ తేదీ అర్ధరాత్రి పాంగోంగ్ సో సరస్సు దక్షిణం ఒడ్డుకు చైనా బలగాలు చేరుకున్నాయి. పసిగట్టిన భారత సైన్యం వేగంగా స్పందించింది. ఆ ప్రాంతంలోకి పెద్ద ఎత్తున బలగాలను తరలించి, వారి ప్రయత్నాన్ని వమ్ము చేసింది. అయితే, ఎలాంటి భౌతిక పరమైన ఘర్షణలు చోటుచేసుకోలేదని కేంద్రం తెలిపింది. పాంగోంగ్ సో సరస్సు చుట్టుపక్కల అన్ని వ్యూహాత్మక ప్రాంతాల్లో బలగాలను, ఆయుధ సంపత్తిని మరింత పెంచినట్లు వెల్లడించింది. తూర్పు లద్దాఖ్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో సైనిక, దౌత్యవర్గాల మధ్య చర్చల్లో కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఆగస్టు 29/30 రాత్రి పీఎల్ఏ బలగాలు యథాతథ స్థితిని మార్చేందుకు రెచ్చగొట్టేలా సైనిక కదలికలకు పాల్పడ్డాయని ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్ ఆనంద్ తెలిపారు. ‘క్షేత్రస్థాయిలో యథాతథ పరిస్థితులను ఏకపక్షంగా మార్చాలన్న చైనా ప్రయత్నాలను భారత సైన్యం తిప్పికొట్టింది. ఆ ప్రాంతంలోని కీలక పోస్టుల్లో బలగాలను సమీకరించడం సహా అన్ని చర్యలు చేపట్టింది’అని కల్నల్ ఆనంద్ తెలిపారు. ‘పాంగోంగ్ సో సరస్సు దక్షిణ ఒడ్డున పీఎల్ఏ కదలికలు కనిపించాయి. వెంటనే భారత ఆర్మీ ఆ ప్రాంతంలో బలగాల సంఖ్యను భారీగా పెంచింది. యథాతథ స్థితిని మార్చేందుకు చైనా చేసిన ప్రయత్నాన్ని అడ్డుకుంది. ఈ వ్యవహారంపై చుషుల్లో బ్రిగేడ్ కమాండర్ స్థాయి చర్చలు కొనసాగుతున్నాయి’ అని కల్నల్ ఆనంద్ వివరించారు. ‘శాంతి, సామరస్యాలు కొనసాగేందుకు భారత ఆర్మీ కట్టుబడి ఉంది. అంతే స్థాయిలో, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించేందుకు కృత నిశ్చయంతో ఉంది’ అని వివరించారు. ఆగస్టు 29వ తేదీ అర్ధరాత్రి చైనా బలగాలు పెద్ద సంఖ్యలో తూర్పు లద్దాఖ్లోని పాంగోంగ్ సో దక్షిణం వైపునకు చేరుకున్నాయి. ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుని, తిష్టవేసేందుకు ప్రయత్నిం చాయి. పసిగట్టిన భారత బలగాలు వారిని నిలువరించేందుకు వెంటనే భారీ సంఖ్యలో ఆ ప్రాంతానికి తరలివెళ్లాయి. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఎలాంటి భౌతిక దాడులు చోటుచేసుకోలేదు’అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాంగోంగ్ సో సరస్సు ఉత్తర తీరం వైపు రెండు దేశాల బలగాలు గతంలో తలపడ్డాయి. కానీ, దక్షిణం వైపు ఇలాంటి ఘటన జరగడం ఇదే ప్రథమం అని వెల్లడించాయి. ఈ పరిణామంపై రక్షణ మంత్రి రాజ్నాథ్, విదేశాంగ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులు చర్చించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చైనా ప్రయత్నాన్ని ఆర్మీ సీరియస్గా తీసుకుందనీ, పాంగోంగ్ సో ఉత్తర, దక్షిణ తీరం, చుట్టుపక్కల కీలక ప్రాంతాల్లోకి బలగాలతో పాటు ఆయుధ సంపత్తిని తరలించింది. భారత్ గట్టిగా డిమాండ్ చేస్తున్న విధంగా ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై చైనా కట్టుబడి ఉన్నట్లు కనిపించడం లేదని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. కాగా, జూన్ 15వ తేదీన గల్వాన్ ఘటన తర్వాత చైనా కవ్వింపు చర్యలకు పాల్పడటం ఇది మొదటిసారి. ఉద్రిక్తతలను సడలించుకు నేందుకు ఇరు దేశాలు అంగీకరించినా పాంగోంగ్ సో, డెప్సాంగ్, మరో రెండు ఘర్షణాత్మక ప్రాంతాల్లో చైనా సైన్యం తిష్టవేసుకుని ఉంది. దీంతో భారత్ భారీగా సైన్యాన్ని మోహరించింది. అత్యాధునిక ఆయుధ సంపత్తిని తరలించింది. మిరేజ్–2000, సుఖోయ్ 30 ఎంకేఐ వంటి ఫైటర్ జెట్లను ఎల్ఏసీ వెంట మోహరించింది. అతిక్రమించలేదు: చైనా చైనా విదేశాంగ ప్రతినిధి ఝావో లిజియాన్ స్పందించారు. చైనా సైన్యం వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)కు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. ఆ రేఖను వారెప్పుడూ అతిక్రమించలేదు. సరిహద్దుల్లో రెండు వైపుల సైన్యం క్షేత్ర స్థాయి అంశాలపై ఎప్పటికప్పుడు చర్చించుకుంటున్నాయి’ అని వివరించారు. ‘గతంలో అంగీకరిం చిన అంశాలను భారత్ ఉల్లంఘించింది. పాంగోంగ్ సో సరస్సు దక్షిణతీరంతో పాటు రెకిన్ పాస్ను ఆగస్టు 31వ తేదీన భారత్ బలగాలు అతిక్రమించాయి. తీవ్రమైన రెచ్చగొట్టే చర్య సరిహద్దుల వెంట ఉద్రిక్తతలకు కారణమైంది. చైనా సైన్యం ఇటువంటి వాటిని దీటుగా ఎదుర్కొంటుంది’ అంటూ పీఎల్ఏ పశ్చిమ కమాండ్ ప్రతినిధి కల్నల్ ఝాంగ్ షుయిలీ చేసిన ప్రకటనను అధికార జిన్హువా ప్రచురించింది. -
ఆ వార్తల్ని ఖండించిన నేపాల్
న్యూఢిల్లీ : నేపాల్ భూభాగాన్ని చైనా ఆక్రమిస్తోందన్న మీడియా వార్తల్ని నేపాల్ ఖండించింది. నేపాల్ వ్యవసాయ శాఖకు సంబంధించిన ఓ సర్వే విభాగం ఇచ్చిన నివేదిక ఆధారంగా.. చైనా అక్రమంగా సరిహాద్దు జిల్లాలలోని నేపాల్ భూభాగాన్ని ఆక్రమించిందని ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. దీనిపై నేపాల్ విదేశాంగ శాఖ స్పందించింది. నేపాల్ వ్యవసాయ శాఖ, లైవ్స్టాక్ డెవలప్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సదరు న్యూస్ ఏజెన్సీ ఆరోపణలు చేస్తోందని, వాస్తవానికి అటువంటి నివేదిక ఏదీ లేదని తెలిపింది. గతంలో ఈ విషయంపై వివరణ ఇచ్చామని పేర్కొంది. (నేపాల్ సంస్థతో ఫ్లిప్కార్ట్ జోడీ..) ఇరు దేశాల మధ్య ఎటువంటి సమస్యలు ఉత్పన్నమైనా స్నేహ పూర్వకంగా వాటిని పరిష్కరించుకుంటామని స్పష్టం చేసింది. ఆరోపణలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు వాస్తవాలను ధ్రువీకరించుకోవాలని మీడియా సంస్థలను కోరింది. తప్పుడు ఆరోపణల ద్వారా రెండు దేశాల మధ్య గొడవలు చెలరేగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. సరిహద్దుల ఒప్పందం అక్టోబర్ 5 ,1961కి చైనా కట్టుబడి ఉందని తెలిపింది. -
‘మోదీ చైనా ఒత్తిడికి లొంగిపోయారు.. అందుకే ఇలా’
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దు వివాదంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల ముందు మోదీ జనంలో తాను చాలా బలమైన నేతననే అభిప్రయాన్ని ఏర్పర్చరని అన్నారు. కానీ ఆ ఇమెజ్ నేడు భారత్కు అతి పెద్ద బలహీతగా మారిందని రాహుల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తన ట్విట్టర్లో ఈ రోజు ఓ వీడయోను పోస్ట్ చేశారు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో రాహుల్ మోదీని విమర్శించడమే కాక.. చైనా వక్ర బుద్ధిని దుయ్యబట్టారు. వీడియోలో రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చేందుకు మోదీ తానో బలవంతుడినన్న బూటకపు ఇమేజ్ను క్రియేట్ చేశారని విమర్శించారు. కానీ ఇప్పుడు అది భారత్కు బలహీనంగా మారిందన్నారు. మోదీ ప్రతిష్టకు, చైనా ప్రణాళికలకు ఏ రకంగా సంబంధం ఉంటుందో రాహుల్ తన వీడియోలో వివరించారు. ('ఆ దాడి ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది') యావత్ భూమండలాన్ని చేజిక్కించుకోవాలని చైనా ఎత్తుగడలు వేస్తున్నట్లు రాహుల్ తన వీడియోలో ఆరోపించారు. ప్రణాళిక లేకుండా చైనీయులు ఏమీ చేయరని, వారు తమ మధిలో ఓ ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నారన్నారు. దానికి తగినట్లుగా వాళ్లు ఆ ప్రపంచాన్ని తయారు చేసుకుంటున్నారన్నారు రాహుల్. గదార్, బెల్ట్ రోడ్ దానిలో భాగమే అన్నారు. వాళ్లు పూర్తిగా భూగ్రహాన్ని మార్చేస్తున్నట్లు రాహుల్ విమర్శించారు. అయితే ఇలాంటి వ్యూహాత్మక సమయంలో.. కీలకమైన గల్వాన్, డెమ్చోక్, పాన్గాంగ్ సరస్సుల వద్ద చైనా తన ప్రాభవాన్ని పెంచుకున్నట్లు రాహుల్ తెలిపారు. మన హైవేల వల్ల చైనీయులు ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. చైనా.. పాకిస్తాన్తో కలిసి కశ్మీర్లో హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తుందని రాహుల్ ఆరోపించారు. (మేడిన్ చైనా రామాయణం) PM fabricated a fake strongman image to come to power. It was his biggest strength. It is now India’s biggest weakness. pic.twitter.com/ifAplkFpVv — Rahul Gandhi (@RahulGandhi) July 20, 2020 భారత్, చైనా మధ్య ఉన్న ఉద్రిక్తలు కేవలం సరిహద్దు సమస్యగా చూడరాదన్నారు రాహుల్. బోర్డర్ సమస్యతో ప్రధాని మోదీపై ఒత్తిడి తెస్తున్నారని, మోదీ ప్రతిష్టపై చైనీయులు దాడి చేస్తున్నారన్నారు రాహుల్. తాము చెప్పినట్లు చెప్పకుంటే, మోదీ బలమైన నేత అన్న భావాన్ని రూపుమాపే విధంగా వ్యవహరిస్తామని చైనా మోదీని బెదిరిస్తుందని తెలిపారు. ప్రస్తుతం మోదీ తన ప్రతిష్ట పట్ల ఆందోళన చెందుతున్నట్లు అర్థమవుతుందన్నారు. చైనీయులు మన భూభాగంలోకి ప్రవేశించారన్నారు రాహుల్. కానీ మోదీ మాత్రం మన దేశంలోకి ఎవరు రాలేదని అంటున్నారు. దీన్నిబట్టే మోదీ, చైనా ఒత్తిడికి తలొగ్గతున్నట్లు అర్థమవుతుందన్నారు. చైనా చెప్పినట్లు మోదీ వింటే, ఆయన ఈ దేశానికి ప్రధాని కాదు అని రాహుల్ వీడియోలో విమర్శలు చేశారు.(మేక్ ఇన్ ఇండియా అంటూ చైనావే కొంటోంది) -
సాధ్యమైనంత త్వరగా శాంతి
సాక్షి, న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతలను సాధ్యమైనంత త్వరగా తగ్గించుకోవాలని భారత్, చైనా నిర్ణయించాయి. తూర్పు లద్దాఖ్లోని సరిహద్దుల్లో గత 7 వారాలుగా నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ‘వేగవంతమైన, క్రమానుగత, దశలవారీ’ ప్రక్రియను ప్రారంభించడం ప్రాధాన్యతాంశంగా గుర్తించే విషయంలో రెండు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఇరుదేశాల కమాండర్ స్థాయి చర్చలు మంగళవారం దాదాపు 12 గంటల పాటు జరిగాయి. బాధ్యతాయుత విధానంలో ఈ సమస్యను పరిష్కరించుకోవాలని రెండు దేశాల విదేశాంగ మంత్రులు జై శంకర్, వాంగ్ యి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే చర్చల ప్రక్రియలో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య తీవ్రస్థాయి ఘర్షణలు చోటుచేసుకున్న తరువాత జూన్ 17న రెండు దేశాల విదేశాంగ మంత్రులు ఫోన్లో మాట్లాడుకున్న విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట బలగాలను ఉపసంహరించుకోవడం క్లిష్టమైన ప్రక్రియ అని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఎల్ఏసీకి భారత్ వైపు ఉన్న చూషుల్లో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి రెండు దేశాల మధ్య ఆర్మీ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. భారత ప్రతినిధి బృందానికి 14 కాప్స్ కమాండర్ లెఫ్ట్నెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వం వహించగా, చైనా బృందానికి టిబెట్ మిలటరీ డిస్ట్రిక్ట్ మేజర్ జనరల్ లియు లిన్ నేతృత్వం వహించారు. ఈ రెండు బృందాల మధ్య జూన్ 6న తొలి విడత చర్చలు జరిగాయి. ఆ తరువాత గల్వాన్ లోయలో ప్రాణాంతక ఘర్షణల అనంతరం జూన్ 22న మరోసారి ఈ రెండు బృందాలు సమావేశమయ్యాయి. తాజాగా భేటీ మూడోది. కాగా, ఉద్రిక్తతల సడలింపుపై రెండు దేశాలు నిజాయితీతో ఉన్నాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. పూర్తి స్థాయి ఒప్పందం కుదిరేందుకు ఆర్మీ, దౌత్య మార్గాల్లో మరికొన్ని విడతలు చర్చలు జరగాల్సిన అవసరం ఉందన్నాయి. సరిహద్దుల్లోని అన్ని వివాదాస్పద ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించాలని, ఏప్రిల్ ముందునాటి యథాతథ స్థితి నెలకొనేలా చూడాలని గత రెండు విడతల చర్చల్లో భారత్ గట్టిగా డిమాండ్ చేసిందని వెల్లడించాయి. రేపు లద్దాఖ్లో రాజ్నాథ్ పర్యటన! రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం లద్దాఖ్లో పర్యటించే అవకాశముంది. సరిహద్దు పోస్ట్లను సందర్శించి, భారత ఆర్మీ సన్నద్ధతను పరిశీలిస్తారని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. మిలటరీలోని సీనియర్ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారని వెల్లడించాయి. -
పాక్తో చేతులు కలిపిన చైనా?
దుష్ట పన్నాగాల డ్రాగన్ దేశం ఒక వైపు చర్చలంటూనే మరోవైపు కయ్యానికి కాలు దువ్వుతోంది. భారత్పై ఒత్తిడి పెంచడానికి పాక్తో చేతులు కలిపింది. లద్దాఖ్లో వాస్తవాధీన రేఖకు తూర్పు దిక్కున చైనా సైనికులు మోహరించి రంకెలు వేస్తూ ఉంటే, ఉత్తరాన నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యాన్ని మోహరించి ఉరుముతోంది. ఎటు నుం చైనా ఎలాంటి విషమ పరిస్థితి ఎదురైనా రెండు దేశాలకు గట్టి బుద్ధి చెప్పడానికి భారత్ సన్నద్ధమైంది. సాక్షి, న్యూఢిల్లీ: సరిహద్దుల్లో సంక్షోభ నివారణకు ఒక వైపు భారత్తో చర్చలు సాగిస్తూనే చైనా తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంటోంది. భారత్పై ఒత్తిడి పెంచడానికి పాకిస్తాన్తో చేతులు కలుపుతున్నట్టుగా తెలుస్తోంది. తూర్పు దిశగా తమ సైన్యం, ఉత్తరాన పాక్ సైన్యాన్ని మోహరించి, జమ్ము కశ్మీర్లో హింస రాజేసే ముక్కోణపు కుట్రకు డ్రాగన్ దేశం తెరతీసింది. ఉగ్రవాద సంస్థ అల్బదర్తో చైనా అధికారులు మంతనాలు సాగిస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయని జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేసింది. లద్దాఖ్లో నియంత్రణ రేఖ వెంబడి ఉత్తరం దిశగా గిల్గిట్ బాల్టిస్తాన్ సమీపంలో పాకిస్తాన్ 20 వేల మంది సైనికుల్ని మోహరించింది. ఈ ప్రాంతమంతా పాక్ రాడార్లు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్టు సమాచారం. జమ్మూ కశ్మీర్ విభజన తర్వాత గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతం కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్లోకి వచ్చింది. అయితే ఈ ప్రాంతం పాక్ ఆక్రమిత కశ్మీర్ పరిధిలో ఉంది. లద్దాఖ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పుదిక్కున చైనా 20 వేల మందికి పైగా సైనికుల్ని మోహరిస్తే, వాళ్లతో సరిసమానంగా పాకిస్తాన్ ఉత్తరం దిశగా సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఇక చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మరో 10 నుంచి 12 వేల మంది సైనికులు సరిహద్దులకి వెయ్యి కిలో మీటర్ల దూరంలో ఉత్తర జిన్జియాంగ్ ప్రాంతంలో మోహరించారు. వారితో పాటు వాయువేగంతో పరుగులు తీసే వాహనాలు, ఆయుధాలు కూడా ఉన్నాయి. అవసరమైతే ఈ సైనికులు 48 గంటల్లో భారత్ సరిహద్దుకు చేరుకునేలా డ్రాగన్ దేశం సన్నాహాలు చేసిందని ప్రభుత్వంలో ఉన్నత స్థాయి అధికారి తెలిపారు. అయితే భారత ప్రభుత్వం ఈ సైనికుల కదలికలపై పూర్తిగా నిఘా ఉంచిందని చైనా వ్యూహాలను దీటుగా ఎదుర్కొంటామని ఆ అధికారి వెల్లడించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థతో అల్బదర్తో చైనా అధికారులు చర్చలు జరుపుతున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. జమ్ము కశ్మీర్లో రక్తపాతం సృష్టించిన చరిత్ర ఈ సంస్థకి ఉంది. అల్బదర్ను మళ్లీ పునరుద్ధరించడానికి చైనా మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం. వేడెక్కుతున్న పాంగాంగ్ సరస్సు తీరం పాంగాంగ్ సరస్సుకి ఉత్తరంగా భారత్ భూభాగంలోకి 8 కి.మీ. మేర లోపలికి చొచ్చుకు వచ్చిన చైనా ఆ ప్రాంతం తనదేనని చాటి చెప్పడానికి చిహ్నాలను ఏర్పాటు చేసింది. ఫింగర్ 4–5 మధ్య 80 మీటర్ల పొడవున శాసనాల మాదిరి చిహ్నాలను నిర్మించింది. వీటిపై చైనాకు చెందిన మాండరిన్ గుర్తులను ఉంచి ఆ ప్రాంతమంతా తమదేనని చెప్పడానికి ప్రయత్నిస్తోంది. ఇక ఫింగర్ 4–8 మధ్య ఎనిమిది కిలో మీటర్ల పొడవునా తాత్కాలిక శిబిరాలు, బంకర్లు ఏర్పాటు చేసి భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది. చైనా ఆర్మీకి ఈ ప్రాంతం నుంచి వెనక్కి తగ్గే ఆలోచన లేదని, అందుకే డ్రాగన్ దేశాన్ని ఎదుర్కోవడానికి భారత్ సైన్యాన్ని, యుద్ధ ట్యాంకుల్ని మోహరిస్తూ ప్రణాళికలు రచిస్తోందని ఉన్నతాధికారులు వెల్లడించారు. పాంగాంగ్కు భారత్ ఉక్కు పడవలు పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో నిఘా మరింత పెంచడానికి భారత నావికా దళం సమాయత్తమైంది. డజనుకు పైగా ఉక్కు పడవల్ని లద్దాఖ్ వైపు మళ్తిస్తోంది. ఇప్పటికే పాంగాంగ్లో చైనా ఆర్మీ అత్యంత భారీ నౌకలైన టైప్ 928 బీలను మోహరించింది. దీనికి ప్రతిగా భారత్ కూడా భారీ నౌకలను తరలించే దిశగా ప్రణాళికలు సిద్ధంగా చేస్తోంది. ఈ లోగా పరిస్థితుల్ని పర్యవేక్షించడానికి ఈ ఉక్కు పడవలు పాంగాంగ్ తీర ప్రాంతానికి చేరుకుంటాయి. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా కవ్వింపు చర్యలకు దిగుతుండడంతో కేంద్రం సరిహద్దుల్లో ఆర్మీకి సర్వాధికారాలు కట్టబెట్టింది. చైనా ఏదైనా చర్యలకు పాల్పడితే వాటిని తిప్పికొట్టడమే లక్ష్యంగా భారత్ సర్వసన్నద్ధంగా ఉంది. -
సరిహద్దు వివాదం : చర్చలు అసంపూర్ణం
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దు వివాదం పరిష్కారం దిశగా భారత్, చైనాల మధ్య మంగళవారం జరిగిన సైనికాధికారుల మూడో విడత సమావేశం అసంపూర్తిగా ముగిసిందని, వివాదం సమసిపోయేందుకు మరిన్ని భేటీలు అవసరమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత్-చైనా సరిహద్దు వెంట వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ భూభాగంలోని చుసుల్లో ఇండో-చైనా సైనికాధికారులుమూడో విడత సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ చర్చలు అసంపూర్తిగా ముగిశాయని, సరైన పరిష్కారం కోసం రానున్న రోజుల్లో సైనిక..దౌత్యాధికారుల స్ధాయిలో మరిన్ని సమావేశాలు జరగనున్నాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. శాంతియుత పరిష్కారానికి, వాస్తవాధీన రేఖ వెంబడి సాధారణ పరిస్థితి నెలకొనేనాల ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రోటోకాల్స్ ప్రకారం చర్చలు ముందుకు సాగుతాయని వెల్లడించాయి. సత్వరమే దశలవారీగా ఇరు దేశాల సైనికులు సరిహద్దుల నుంచి వెనక్కిమళ్లడం అవసరమని భారత్-చైనాలు గుర్తించాయని తెలిపారు. కాగా జూన్ 22న జరిగిన భేటీ సందర్భంగా చర్చలు సామరస్యనపూర్వకంగా సుహృద్భావ వాతావరణంలో జరిగాయని ఇరు పక్షాలు ప్రకటించిన క్రమంలో తాజా చర్చలు అసంపూర్తిగా ముగిశాయని పేర్కొనడం గమనార్హం. మరోవైపు చర్చలు సాగుతుండగానే డ్రాగన్ సేనలు సరిహద్దుల్లో పెద్దసంఖ్యలో మోహరించడంతో భారత సేనలు సర్వసన్నద్ధమయ్యాయి. చదవండి : చైనాకు భారత్ మరో షాక్ -
నోరువిప్పిన చైనా.. కమాండర్ మృతి!
బీజింగ్ : భారత్-చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో ఈనెల 15న చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై చైనా నోరువిప్పింది. ఘర్షణకు సంబంధించి తొలిసారి ఓ మరణాన్ని అధికారికంగా ప్రకటించింది. గల్వాన్ ఘటనలో తమ సైన్యానికి చెందిన సీనియర్ కమాండింగ్ అధికారి మృతిచెందినట్లు తెలిపింది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య జరుగుతున్న కమాండర్ స్థాయి అధికారుల చర్చల సందర్భంగా చైనా ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. అయితే మొత్తం ఎంతమంది సైనికులకు మృతి చెందారన్న దానిపై మాత్రం స్పందించేందుకు విముఖత వ్యక్తం చేసింది. అంతేకాకుండా గల్వాన్ లోయకు సంబంధించి పలు కీలక విషయాలను డ్రాగన్ పంచుకున్నట్లు తెలుస్తోంది. (సరిహద్దుల్లో సైన్యం మోహరింపు) భారత సైనిక వర్గాల సమాచారం ప్రకారం గల్వాన్ హింసాత్మక ఘర్షణలో భారత్కు చెందిన 20 మంది సైనికులు మృతిచెందగా.. చైనాకు చెందిన 40 మంది జవాన్లు మరణించారు. అయితే భారత ఆర్మీ ప్రకటనను ఇప్పటికే చైనా తోసిపుచ్చింది. కాగా రెడ్ ఆర్మీ దాడిలో గాయపడిన 76 మంది భారత సైనికులు చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వీరంతా త్వరలోనే కోలుకుని విధుల్లో చేరుతారని సైనిక వర్గాలు ప్రకటించాయి. ఇదిలావుండగా ఓ వైపు ఇరు దేశాల సైనిక అధికారుల మధ్య చర్చలు సాగుతున్నా.. వాస్తవాధీన రేఖ వెంట మాత్రం చైనా దురాక్రమణ కొనసాతూనే ఉంది. తాజాగా అస్సాం సరిహద్దు ప్రాంతంలో చైనా సైన్యం చొరబాట్లకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దాడిని భారత సైనికులు తీవ్రంగా ప్రతిఘటించినట్లు తెలుస్తోంది. తాజా ప్రతిష్టంభన నేపథ్యంలో ఇరు దేశాల నడుమ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. (భారత్- చైనా మధ్య చర్చలు ప్రారంభం) -
గల్వాన్లో బయటపడ్డ చైనా కుట్రలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు సంబంధించి చైనా కుట్రలు ఒక్కొక్కటిగా బయపడుతున్నాయి. ప్రణాళికా బద్ధంగానే భారత సైనికులపై దాడికి పాల్పడినట్లు తాజా సమాచారం ద్వారా స్పష్టమవుతోంది. దాడికి వారం ముందే గల్వాన్ లోయలో చైనా 200 బుల్డోజర్లు, యుద్ధ ట్యాంకులు, ఆయుధ సామాగ్రిని తీసుకెళ్లే ట్రక్కులను తరలించినట్లు తెలిసింది. ఈ మేరకు జూన్ 6 నుంచి 16 మధ్య చిత్రీకరించిన శాటిలైట్ చిత్రాల్లో చైనా జిత్తులు బయటపడ్డాయి. ఈ వాహనాలను తరలిస్తున్న ఉపగ్రహ దృశ్యాలు ఓ జాతీయ మీడియా ఆదివారం ప్రచురించిన కథనంలో పేర్కొంది. కాగా ఇరు దేశాల మధ్య చోటుచుసుకున్న ఘర్షణలో భారత్కు చెందిన 20 మంది సైనికులు మరణించిన విషయం తెలిసిందే. (గల్వాన్ వంతెన నిర్మాణం విజయవంతం) ఆ చిత్రాల ప్రకారం జూన్ 9 నుంచే వివాదాస్పద ప్రాంతాల్లో చైనా సైన్యాన్ని మోహరించింది. గుట్టుచప్పుడు కాకుండా ఒక్కో వాహనాన్ని తరలిస్తూ జూన్ 15 నాటికి భారీగా ఆయుధ సామాగ్రి, బుల్డోజర్ వాహనాలను గల్వాన్ లోయకు చేర్చింది. పై చిత్రం ప్రకారం వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)కి 2.8 కిమీ దూరంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)కి చెందిన 127 వాహనాలు మోహరించబడ్డాయి. (చైనా కాఠిన్యంపై అమెరికా ఆగ్రహం) వివాదాస్పద గల్వాన్ ప్రాంతంలో చైనా ఏర్పాటు చేసిన ఆర్మీ క్యాంపు. ఇది వాస్తవాధీన రేఖకు 2.9 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రకారం చైనా అక్కడేదో నిర్మాణం చేపడుతున్నట్లు తెలుస్తోంది. జూన్ 16 నాటికి చైనా మరింత దూకుడు పెంచింది. ఎల్ఏసీకు కేవలం 1.3 కిలోమీటర్ల దూరంలో (భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో) ఏకంగా 79 వాహనాలను చేర్చింది. భారత్ చెబుతున్నట్లు ఇదంతా కూడా ఎల్ఏసీకి ఇవతలి వైపు (భారత్వైపు) ఉన్న ప్రాంతం. అయినప్పటికీ చైనా సైన్యం సరిహద్దును ఉల్లంఘించి భారత భూభాగంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే ఇరు పక్షాల మధ్య చెలరేగిన హింసలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. -
చైనాకు హెచ్చరికలు జారీ చేయండి : సీఎం
చండీగఢ్ : ముగ్గురు జవాన్ల మృతదేహాలకు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ నివాళులు అర్పించారు. గాల్వాన్లో చైనా, భారత జవాన్లకు మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లేహ్ నుంచి చండీగఢ్ ఎయిర్ఫోర్స్ స్టేషన్కు చెరుకున్న ముగ్గురు ఆర్మీ జవాన్ల మృతదేహాలకు అమరీందర్సింగ్ శుక్రవారం నివాళులు అర్పించారు. (మణిపూర్లో బీజేపీ పడిపోతుందా లేదా!?) భారత భూభాగాన్ని వెంటనే ఖాళీ చేసి వెళ్లకపోతే, ధీటుగా ప్రతి దాడి చేస్తామని చైనాకు హెచ్చరికలు జారీ చేయాలని కేంద్ర ప్రభాత్వాన్ని అమరీందర్ సింగ్ కోరారు. దీని వల్ల ఎలాంటి పర్యావసనాలు ఎదురైనా, అవి శాశ్వతంగా ఉండవన్నారు. 60 ఏళ్ల దౌత్యం విఫలమయిందని, 20 మంది జవాన్లను దారుణంగా దాడిచేసి హతమార్చారని పేర్కొన్నారు. 60 ఏళ్ల దౌత్యం పనిచేయలేదు, చైనా అగ్రదేశం అయితే, భారత్ కూడా అందుకు సమానమే అని పేర్కొన్నారు. ఇప్పుడు కాదు 1962 నుంచి చైనా ఆక్రమణలు చేస్తూనే ఉన్నారని అమరీందర్ తెలిపారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ 1963-1966 మధ్య ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. (ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రకు ప్లాస్మా థెరఫీ) -
సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు..!
సాక్షి, న్యూఢిల్లీ : గాల్వన్ లోయపై పొరుగు దేశం చైనా ఆక్రమణకు దిగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లో చైనా ఆగడాలను అరికట్టేందుకు పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరిస్తోంది. తన అమ్ములపొదిలో దాగిఉన్న అస్త్రాలను బయటకు తీస్తోంది. భారత సైన్యంలో కీలకమైన సుఖోయ్-300 ఎయ్కేఐ, మిగ్-29, జాగ్వార్ ఫైట్ జెట్స్ను రంగంలో దింపింది. అలాగే అమెరికా నుంచి దిగుమతి చేసుకుని అత్యాధునికమైన యుద్ధ విమానం అపాచీలను సైతం చైనా సరిహద్దులకు తరలించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా శ్రీనగర్, అవంతిపుర, లేహ్ ప్రాంతాల్లో చైనా చొరబాట్లను పసిగట్టేందుకు వాయు సేనను సైతం సన్నద్ధం చేసింది. మరోవైపు హిందు మహాసముద్ర తీరంలో నౌకాదళాన్ని కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలోనే భారత వైమానిక దళాధిపతి చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా గురు, శుక్రవారాల్లో లేహ్, శ్రీనగర్ల్లో పర్యటించారు. సరిహద్దుల్లో ఎయిర్ఫోర్స్ సన్నద్ధతను పరిశీలించారు. (వాయుసేన.. సిద్ధంగా ఉండాలి) మరోవైపు భారత్కు ధీటుగా చైనా సైతం భారీగా సైన్యాన్ని, యుద్ధ విమానాలను సరిహద్దుకు తరలిస్తోంది. వీటి గర్జనలు, సైనికుల కవాతుతో చల్లని హిమాలయ కొండలు వేడెక్కుతున్నాయి. పాంగాంగ్ సరస్సు సమీపంలో డ్రాగన్ సైనిక క్యాంపును ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. భారత్ సైతం మొత్తం 3400 కిమీ గల సరిహద్దుల్లో ఆర్మీని అప్రమత్తం చేసినట్లు సైనిక వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇరు దేశాలు సైనిక దళాలను సరిహద్దుల్లోకి తరలిస్తుండటంతో యుద్ధ వాతావరణం కనబడుతోంది. అయితే సైనిక సన్నద్ధపై మాత్రం కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడక పోవడం గమనార్హం. (చైనా కాఠిన్యంపై అమెరికా ఆగ్రహం) కాగా ఈనెల 15 జరిగిన ఇరు వర్గాల ఘర్షణలో భారత్కు చెందిన 20 మంది సైనికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎయిర్ చీఫ్ భారత్-చైనా సరిహద్దుల్లో పర్యటించారు. మరోవైపు సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై శుక్రవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చైనా దురాక్రమనకు దిగిన నేపథ్యంలో భవిష్యత్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ క్లిష్ట సమయంలో అన్ని పక్షాలు కేంద్ర ప్రభుత్వానికి, భారత ఆర్మీకి మద్దతుగా నిలవాలని మోదీ పిలుపునిచ్చారు. ఇంచు భూభాగం కూడా వదలుకునే ప్రసక్తే లేదని మోదీ ప్రకటించారు. ఇక ప్రధాని మోదీ ప్రకటకపై చైనా ఘాటుగా స్పందించింది. గాల్వన్ లోయ ముమ్మాటికీ చైనాలో అంతర్భాగమేనని మరోసారి ఘంటాపథంగా స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం ఉదయం మరో ప్రకటన విడుదల చేసింది. భారత ఆర్మీ వాదిస్తున్నట్లు గాల్వన్ లోయ వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)కి అవతలవైపు లేదని, తమ భూభాగంలోనే ఉందని పేర్కొంది. అంతేకాకుండా భారతకు చెందిన పదిమంది జవాన్లను చైనా నిర్బంధించిందంటూ వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించింది. ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, తమ కస్టడీలో ఎవరూ లేరని స్పష్టం చేసింది. -
చైనా చెర నుంచి సైనికులు విడుదల..!
సాక్షి, న్యూఢిల్లీ : గాల్వన్ లోయ వద్ద ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణ నేపథ్యంలో భారత్కు చెందిన సైనికులను చైనా అపహరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన భారత సైనిక అధికారులు గడిచిన రెండు రోజులుగా చైనా ఆర్మీ అత్యున్నత స్థాయి అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం చర్చల అనంతరం భారత్కు చెందిన పదిమంది సైనికులు, ఇద్దరు మేజర్ అధికారులను చైనా చెర నుంచి విడిపించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా పలు కథనాలు ప్రచురించింది. వారంత క్షేమంగా ఉన్నారని తెలిపింది. అయితే భారత సైనిక వర్గాలు మాత్రం దీనికి భిన్నంగా ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా దాడిలో 20 మంది జవాన్లు మృతి చెందగా.. మొత్తం 76 మంది గాయపడ్డారని ప్రకటించింది. ఇక చైనా కస్టడీలో ఎవరూ లేదని స్పష్టం చేసింది. (ఒక్క జవాను మృతికి ఐదుగురిపై ప్రతీకారం) కాగా డ్రాగన్ తొలిసారి 1962 యుద్ధం సమయంలో భారత సైనికులను బంధీలను చేసింది. డజన్ల కొద్ది సిబ్బందిని రోజుల తరబడి తన చెరలో ఉంచుకుంది. అనంతరం భారత ప్రభుత్వ శాంతియుతమైన చర్చలతో వారికి విముక్తి కల్పించింది. మరోవైపు తాజాగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మేజర్ జనరల్ స్థాయి అధికారులు సరిహద్దు సమస్యలను చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు దాదాపు కొలిక్కి వచ్చినట్లు సైనిక వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. (76 మంది జవాన్లకు గాయాలు : భారత ఆర్మీ) -
చైనా ఆక్రమించినవి స్వాధీనం చేసుకుంటాం
సాక్షి, కశ్మీర్ : సరిహద్దు ప్రాంతాల్లో చైనా దుశ్చర్యలకు తగినబుద్ధి చెప్పే రోజులు ముందులోనే ఉన్నాయని బీజేపీ లద్దాక్ ఎంపీ జమ్యాంగ్ సెరింగ్ నంగ్యాల్ అన్నారు. చైనా ఆక్రమించిన ఆక్సియాచిన్ ప్రాంతం కూడా భారత్ సరిహద్దుకు అతి సమీపంలోనే ఉందని, ఒక్కప్పుడు అది లద్దాక్లో భాగమేనని స్పష్టం చేశారు. భారత సైనికులు శాంతిసూత్రాన్ని చైనా ఆర్మీ చేతగానితనంగా భావిస్తోందని, వారి ఆకృత్యాలకు కచ్చితంగా ప్రతీకారం తీసుకుంటామని హెచ్చరించారు. కాగా ఇరు దేశాల సైనికల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో భారత్కు చెందిన 20 మంది సైనికులు అమరులైన నేపథ్యంలో నంగ్యాల్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. భారత జవాన్ల మృతి బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. (ఆయుధాలు లేకుండా సరిహద్దుల్లో ఎలా) ‘1962 నుంచి చైనా అనేకసార్లు భారత్పైకి దురాక్రమనకు దిగుతోంది. ఇప్పటికే మన దేశానికి చెందిన అనేక ప్రాంతాలను అక్రమంగా ఆక్రమించింది. ప్రస్తుతం చైనా ఆధీనంలోని ఆక్సియాచిన్ ముమ్మాటికీ భారత భూభాగమే. దానిని తిరిగి స్వాధీనం చేసుకోవడం అంతసులువైన అంశం కాదు. భారత సైన్యానికి అంత కష్టమైన పనికూడా కాదని అనుకుంటున్నా. చైనా ఆక్రమిత భూభాగాన్ని తిరిగి పొందుతామనే నమ్మకం నాకుంది. ఎందుకుంటే 1962 నాటి రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం మన దేశంలో లేవు. కేంద్రంలో బలమైన, సమర్థవంతమైన నాయకత్వంతో కూడిన ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇంతకుముందులా చైనా కయ్యానికి కాలుదువ్వడాని ఏమాత్రం అదునులేదు. లద్దాక్ ప్రజలు ఎప్పటికీ భారత ప్రభుత్వం, సైనికులు వెంటే ఉంటుంది’ అని సెరింగ్ నంగ్యాల్ పేర్కొన్నారు. (చైనా, భారత్ వ్యూహాలు ఏమిటి?) -
చైనా వస్తువుల బహిష్కరణకు సిద్ధమే..కానీ
సాక్షి, న్యూఢిల్లీ : గాల్వాన్ లోయలో డ్రాగన్ దుశ్చర్య, తరువాత ఇండియాలో చైనా వస్తువులను బహిష్కరించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ముఖ్యంగా ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీవాసులు చైనా వస్తువులపై ఏకంగా "యుద్ధం" ప్రకటించారు. ఇంట్లోని ప్రతి చైనా వస్తువును రోడ్డుపైకి విసిరేయాలని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మేజర్ రంజిత్ సింగ్ పిలుపునిచ్చారు. దురదృష్టవశాత్తు తుపాకులు, బుల్లెట్లతో ప్రత్యక్షంగా చైనాపై యుద్ధానికి దిగలేకపోయినా వస్తువులు బహిష్కరణ ద్వారా చైనా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్నారు. అయితే ఈ పిలుపునకు పెద్దగా స్పందన రాలేదు. పైగా ఎయిర్ కండిషన్డ్ గదుల్లో కూర్చుని యుద్ధ నినాదాలు ఇవ్వడం సరైంది కాదంటూ డిఫెన్స్ కాలనీకి చెందిన భవ్రీన్ కంధారి విమర్శించారు. (చైనా ఉత్పత్తులపై నిషేధం) మరోవైపు ఢిల్లీలోని అతిపెద్ద హోల్ సేల్ మార్కెట్ గా పేరుగాంచిన సదర్ బజార్ వ్యాపారులు భిన్నంగా స్పందించారు. చైనా వస్తువుల బహిష్కరణకు సంసిద్దతను వ్యక్తం చేస్తూనే కొన్ని షరతులతో మాత్రమే ఇది సాధ్యమవుతుందని తేల్చి చెప్పారు. సదర్ బజార్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజేందర్ శర్మమాట్లాడుతూ, తాము కూడా చైనా ఉత్పత్తుల నిషేధానికి సిద్ధమే. 'హిందీచీనీ బైబై' నినాదానికి తమ మద్దతు ఉంటుంది, కానీ ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం, చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సహకాలతోపాటు, అధికారుల దాడులు, ఇతర వేధింపులనుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. (చైనాకు షాక్ : చైనా పరికరాల వాడకం తగ్గించండి!) దాదాపు 70 శాతం ఎలక్ట్రికల్ వస్తువులు చైనానుంచే వస్తాయనీ మరో వ్యాపారి తరుణ్ గార్గ్ తెలిపారు. ముఖ్యంగా దీపావళి సందర్భంగా బిలియన్ డాలర్ల విలువైన కొనుగోళ్లు జరుపుతామని వెల్లడించారు. అనేక మేడ్ ఇన్ ఇండియా వస్తువులకు సంబంధించిన విడిభాగాలు కూడా చైనా నుండే దిగుమతి అవుతాయన్నారు. దాదాపు 40 వేల దుకాణాలను కలిగి ఉన్న సదర్ బజార్లో అలంకరణ వస్తువులు, బొమ్మలు, గడియారాలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, ఇలా దాదాపు ప్రతీది చైనానుంచి దిగుమతి అయినవే ఉంటాయన్నారు. దీంతో చైనా ఉత్పత్తుల బహిష్కరణ, దిగుమతులపై నిషేధం సాధ్యమేనా అనే ప్రశ్న కూడా వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. కాగా దేశీయంగా 7 కోట్ల మంది వ్యాపారులు, 40 వేల ట్రేడ్ అసోసియేషన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఐఐటి) చైనా దిగుమతులను బ్యాన్ చేయాలని పిలుపు నిచ్చింది. వచ్చే ఏడాది చివరి నాటికి చైనా దిగుమతులు 13 బిలియన్ డాలర్లు తగ్గించాలంటూ ఒక ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. అంతేకాదు బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండూల్కర్ వంటి క్రికెటర్లు చైనా ఉత్పత్తులకు ప్రచారం చేయొద్దని కోరింది. ప్రస్తుతం, ప్రతి ఏటా చైనా నుంచి దేశానికి దిగుమతి అయ్యే వస్తువుల విలువ 70 బిలియన్ డాలర్లకు పై మాటే. -
ఒక్క జవాను మృతికి ఐదుగురిపై ప్రతీకారం
చంఢీగఢ్ : గాల్వన్ లోయలో భారత్-చైనా మధ్య చోటుచేసుకున్న ఘర్ణణలో భారత జవాన్ల మృతిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చైనా దొంగదెబ్బకు ప్రతీకారం తీసుకోవాల్సిందేనని ప్రజలంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారు. డ్రాగన్ ఉద్దేశపూర్వకంగానే భారత జవాన్లపైకి దాడికి పాల్పడిందని, ఎలాంటి ప్రణాళికలు లేకుండా ఘర్షణకు దిగే ప్రయత్నం చేసేవీలులేదని మాజీ సైనికులు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులపై సైన్యంలో పనిచేసిన అనుభవమున్న పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ స్పందించారు. శుక్రవారం ఉదయంం ఓ జాతీయ మీడియాతో సీఎం మాట్లాడుతూ.. భారత్-చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఆయుధాలు లేకుండా భారత సైనికులను సరిహద్దుకు ఎందుకు పంపారని ప్రశ్నించారు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలో కేంద్రమే నిర్ణయించుకోవాలని అన్నారు. (చైనా కాఠిన్యం: భారత జవాన్లపై కర్కశం) భారత సైనికుల మృతికి చైనాపై తప్పనిసరిగా ప్రతీకారం తీసుకోవాల్సిందేనని, వారు ఒక్కళ్లు చంపితే మనం ఐదుగురిని చంపాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు. పుల్వామా, బాలాకోట్ ఉగ్రదాడులకు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించిందో.. చైనా దుస్సాహాసాన్ని కూడా అదే రీతితో తిప్పికొట్టాలని అమరిందర్ సింగ్ స్పష్టం చేశారు. అయితే చైనాతో యుద్ధమంటే పాకిస్తాన్తో పోరాడినంత సులువు కాదని, చైనా ఆర్మీ ప్రత్యర్థిపై అత్యంత కాఠిన్యంగా వ్యవహరిస్తుందని తన అనుభవాలను పంచుకున్నారు. తాను సైన్యంలో చేరిన తొలినాళ్లలో చైనా సరిహద్దులో విధులు నిర్వర్తించానని, వారి ఆగడాలను ఎదుర్కొవడం అంత సమాన్యమైన విషయం కాదని గుర్తుచేసుకున్నారు. ఇప్పటికైనా కేంద్రం ప్రభుత్వం మేలుకోని పాకిస్తాన్, చైనా, నేపాల్ సరిహద్దుల్లో గస్తీకాస్తున్న జవాన్లకు అత్యాధునికమైన ఆయుధాలను అందించాలని కోరారు. (భారత్ను దెబ్బతీసేందుకు త్రిముఖ వ్యూహం) కాగా ఈనెల 16వ తేదీని ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో భారత్కు చెందిన 20 మంది చైనాకు చెందిన మరికొంత జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజా ఘటన నేపథ్యంలో భారత్-చైనా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు ఇరు పక్షాల జరనల్ స్థాయి అధికారులు చర్చలు జరుపుతున్నారు. -
సరిహద్దు వివాదం: ప్రధాని అఖిలపక్ష భేటీ
న్యూఢిల్లీ: లడక్లోని గాల్వన్ లోయ ప్రాంతంలో భారత్-చైనా ఆర్మీ మధ్య తలెత్తిన ఘర్షణలో కల్నల్ సహ 20 మంది సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సరిహద్దులో తాజా పరిస్థితులపై చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం(జూన్ 19) సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులు పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా ప్రధాని కార్యాలయం బుధవారం ట్వీట్ చేసింది. (సరిహద్దు ఘర్షణ : రాజ్నాథ్ మళ్లీ కీలక భేటీ) In order to discuss the situation in the India-China border areas, Prime Minister @narendramodi has called for an all-party meeting at 5 PM on 19th June. Presidents of various political parties would take part in this virtual meeting. — PMO India (@PMOIndia) June 17, 2020 తూర్పు లడఖ్లోని గాల్వన్ వ్యాలీలో జరిగిన పోరాటంలో 45 మంది చైనా సైనికులు మరణించడం లేదా గాయపడి ఉండవచ్చని సమాచారం. ఇరుదేశాల సైనికులు పరస్పరం రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. -
‘సరిహద్దుల్లో అంతా అదుపులోనే ఉంది’
న్యూఢిల్లీ: చైనాతో ఉన్న మన సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నారావనే తెలిపారు. చైనాతో కార్ప్స్ కమాండర్ స్థాయిలో శాంతి చర్చలు జరిగాయని, ఆ తర్వాత స్థానిక స్థాయి కమాండర్లతోనూ మీటింగ్లు జరిగినట్లు ఆయన వెల్లడించారు. ఇవాళ డెహ్రాడూన్లో జరిగిన ఆర్మీ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్లో పాల్గొన్న ఎమ్ఎమ్ నారావనే మీడియాతో మాట్లాడారు. నిరాటంకంగా చర్చలు నిర్వహించడం వల్ల చైనాతో సమస్య సద్దుమణిగే అవకాశం ఉందన్నారు. అలానే ఉత్తరాఖండ్లోని కాలాపానీ ప్రాంతంపై నేపాల్తో ఇటీవల జరిగిన సరిహద్దు వివాదాల గురించి ఆయన మాట్లాడుతూ... ‘మనకు నేపాల్తో చాలా బలమైన సంబంధాలు ఉన్నాయి. భౌగోళిక, సాంస్కృతిక, చారిత్రక, మత సంబంధాలు ఉన్నాయి. నేపాల్-భారత్ ప్రజల మధ్య మంచి బంధం ఉంది. ఆ దేశ ప్రజలతో మా సంబంధం ఇప్పుడు, ఎల్లప్పుడూ బలంగానే ఉంటుంది’ అన్నారు.(కాలాపానీ కహానీ) నివేదికల ప్రకారం, గల్వాన్ వ్యాలీ, పాంగోంగ్ త్సోలోని ఎల్ఏసీ భారత సరిహద్దు వైపు అధిక సంఖ్యలో చైనా దళాలు శిబిరాలు ఏర్పాటు చేశాయి. తూర్పు లదాఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఐసి) వెంబడి అనేక ప్రాంతాల్లో భారత్, చైనా దళాల మధ్య నెల రోజులుగా భీకర పోరటాలు జరుగుతున్నాయి. వివాదాన్ని పరిష్కరించడానికి ఇరు దేశాలు సైనిక, దౌత్య స్థాయిలో చర్చలు జరుపుతున్నాయి. గల్వాన్ వ్యాలీలోని డార్బుక్-షాయోక్-దౌలత్ బేగ్ ఓల్డీ రహదారిని అనుసంధానించే మరో రహదారిని నిర్మించడంతో పాటు.. పాంగోంగ్ త్సో సరస్సు ప్రాంతంలో భారత్ మరో కీలక రహదారిని నిర్మిస్తోంది. అయితే ఈ ప్రయత్నాలని చైనా వ్యతిరేకిస్తుంది. అలానే భారతదేశానికి ఆమోదయోగ్యం కాని ఫింగర్ ప్రాంతంలో చైనా కూడా రహదారిని నిర్మించింది. (‘భారత్ చర్యలతో.. సంబంధాలు సంక్లిష్టం’) 3,488 కిలోమీటర్ల పొడవైన ఎల్ఏసీ వెంబడి భారతదేశం-చైనా సరిహద్దు వివాదం ఉంది. అరుణాచల్ ప్రదేశ్ను దక్షిణ టిబెట్లో భాగంగా చైనా పేర్కొంటుండగా, భారత్ వ్యతిరేకిస్తోంది. సరిహద్దు సమస్యకు సంబంధించి అంతిమ పరిష్కారం ఇంకా పెండింగ్లో ఉన్నందున.. సరిహద్దు ప్రాంతంలో ఇరు పక్షాలు శాంతితో మెలగాలని కోరుకుంటున్నారు. -
‘చైనా మన భూభాగాన్నిఆక్రమించిందా?’
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి, కేంద్రానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం రాహుల్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మీద ప్రశ్నల వర్షం కురిపించారు. లడాఖ్లో భారత భూభాగాన్ని చైనీయులు ఆక్రమించుకున్నారా ఏంటి చెప్పాలి అని ప్రశ్నించారు. ‘రాజ్నాథ్ సింగ్ హస్తం గుర్తుపై కామెంట్ చేసిన తర్వాత ఈ ప్రశ్నకు సమాధానం చెప్తారు. లడాఖ్లో చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందా ఏంటి’ అని రాహుల్ ట్వీట్ చేశారు. భారత్ - చైనా సరిహద్దుల్లో గత నెల రోజులుగా ఉద్రిక్త వాతావారణం నెలకొన్న సంగతి తెలిసిందే. చర్చల ద్వారా ఈ ప్రతిష్టంభనను ముగింపు పలకాలని ఇరుదేశాలు నిర్ణయించి, ఆ దిశగా ముందుకెళుతున్నాయి. (డ్రాగన్ అంతపని చేసిందా..?) ఈ నేపథ్యంలో ఆదివారం నాడు ‘బిహార్ జన్సంవద్ వర్చువల్ ర్యాలీ’లో భాగంగా అమిత్ షా మాట్లాడుతూ.. పుల్వామా, ఉరి ఉగ్రదాడుల తర్వాత సర్జికల్, ఎయిర్ స్ట్రయిక్స్ ద్వారా భారత్ రక్షణ విధానంపై బలమైన సందేశం పంపిందని, సరిహద్దులను ఎలా రక్షించుకోగలమో చెప్పిందన్నారు. ‘సరిహద్దుల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులు ఏంటో అందరికీ తెలుసు. హృదయాన్ని సంతోషంగా ఉంచడానికి మంచి ఆలోచన అవసరం’ అని రాహుల్ ఎద్దేవా చేశారు. ప్రముఖ ఉర్దూ-పర్షియా కవి మీర్జా గలీబ్ రాసిన కవితను రాహుల్ తన ట్వీట్లో వాడారు. దీనిపై రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ.. 20 వ శతాబ్దపు కవి మంజార్ లఖ్నవి రచించిన కవితను పోస్ట్ చేశారు. ‘చేతికి నొప్పి అయితే మందు తీసుకుంటాం.. కానీ చేయ్యే నొప్పికి కారణం అయితే ఏం చేస్తాం’ అంటూ ఓ కవితను ట్వీట్ చేశార. అయితే దీనిలో రాజ్నాథ్ సింగ్ 'హృదయం' ఉన్న చోట 'చేతి'ని మార్చి ట్వీట్ చేశారు. मिर्ज़ा ग़ालिब का ही शेर थोड़ा अलग अन्दाज़ में है। ‘ ‘हाथ’ में दर्द हो तो दवा कीजै, ‘हाथ’ ही जब दर्द हो तो क्या कीजै.. https://t.co/k1fhnI6K4N — Rajnath Singh (@rajnathsingh) June 8, 2020 -
‘ఇది 1962 కాలం కాదు’
చండీగఢ్: భారత్–చైనా సరిహద్దుల మధ్య వివాదాలు ముదురుతున్న వేళ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ దీనిపై స్పందించారు. ఇది 1962 కాలం కాదని.. చైనా ఇప్పుడు మనల్ని తేలీకగా తీసుకోకూడదని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కేంద్రం చైనాతో సరిహద్దు వివాదాన్ని దౌత్య ప్రయత్నాల ద్వారా పరిష్కరించలేకపోతే.. ఉక్కు పిడికిలితో సమాధానం చెప్పాలి. భారత్, చైనా వంటి సార్వభౌమ దేశాలు సమస్యకు దౌత్యపరమైన పరిష్కారం కనుగొనాలి. భారతదేశం యుద్ధాన్ని కోరుకోదు. కాని చైనా బెదిరింపులను మేము అంగీకరించము. మాకు శాంతి కావాలి. అలానే చైనీయులు భారత భూభాగం నుంచి వెనక్కు వెళ్లాలి. చైనీయుల దూకుడుకు మనం భయపడకూడదు. వారిని ధైర్యంగా ఎదుర్కొవాలి’ అన్నారు. (బాయ్కాట్ చైనా) అలానే చైనా తాను ఆక్రమించిన భారత భూభాగాన్ని వదిలి వెళ్లాలని.. దానిపై చైనాకు ఎలాంటి హక్కు లేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత సాయుధ బలగాలు.. 1962 కంటే బలంగా, మరింత ఆధునికీకరించబడ్డాయని అన్నారు. ఇప్పుడు చైనా భారత్ను తేలికగా తీసుకోకూడదని అమరీందర్ హెచ్చరించారు. -
సరిహద్దు ఉద్రిక్తత : మోదీ, ట్రంప్ చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ సంభాషణ ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఇండో-చైనా వివాదం తదితర సమస్యలపై ఇరువురు నేతలు చర్చించారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అటు మిత్రుడు ట్రంప్తో ఫలవంతమైన చర్చలు జరిగాయనీ, కోవిడ్-19, జీ7 సహా వివిధ అంశాలపై చర్చించామని స్వయంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భారత్, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యం మోహరింపు, ఉద్రిక్తతల నడుమ వీరి చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే తూర్పు లదాఖ్ ప్రతిష్టంభనపై ఇరువురు నాయకులు చర్చపై ప్రత్యేక వివరణ లేకవడం గమనార్హం. ఇరు దేశాలలో కరోనా పరిస్థితి, ప్రపంచ ఆరోగ్య సంస్థలో సంస్కరణల అవసరం లాంటి సమస్యలపై ఇరువురు చర్చించారని ప్రభుత్వ ప్రకటన వివరించింది. జార్జ్ హత్యోందంతపై అమెరికాలో ప్రస్తుతం జరుగుతున్న ప్రజాందోళనలపై మోదీ ఆందోళన వ్య క్తం చేశారని, సమస్య త్వరగా సమసిపోవాలని ఆకాంక్షించారనీ, అలాగే అమెరికాలో జరిగే జీ7 సదస్సుకు మోదీని ట్రంప్ ఆహ్వానించినట్లు పేర్కొంది. ప్రస్తుత సభ్యత్వానికి మించి దీని పరిధిని విస్తరించాలని, భారతదేశంతో సహా ఇతర ముఖ్యమైన దేశాలను చేర్చాలని కోరుకున్నారని ప్రభుత్వం తెలిపింది. (మోదీపై విశ్వాసం: టాప్-5లో సీఎం జగన్) కాగా చైనా-భారత్ సరిహద్దు వివాదంపై ఇరుదేశాలు కోరుకుంటే తాను మధ్యవర్తిత్వం చేయడానికి సిధ్దమని, దీనిపై మోదీకి ఫోన్ చేస్తే ఆయన మంచి మూడ్ లో లేరని ట్రంప్ గత వారం ప్రకటించారు. అయితే ఇటీవలి కాలంలో ట్రంప్, మోదీ మధ్య అలాంటి చర్చలేవీ జరగలేదని కేంద్రం స్పష్టతనిచ్చింది. మరోవైపు ఈ సమస్యను సామరస్యపూరకంగా పరిష్కరించుకుంటామని భారత్, చైనా ప్రకటించాయి. అంతేకాదు చైనా మరో అడుగు ముందుకేసి ఈ విషయంలో ట్రంప్ జోక్యం అవసరం లేదని తెగేసి చెప్పింది. అటు కరోనా వ్యాప్తిపైమొదటినుంచీ చైనా మండిపడుతున్న ట్రంప్, డబ్ల్యూహెచ్ఓపై సరిగ్గా వ్యవహరించలేదని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత వారం సంబంధాలను తెంచుకున్నట్టు ట్రంప్ ప్రకటించిన సంగతి విదితమే. (డబ్ల్యూహెచ్ఓతో సంబంధాలు రద్దు : ట్రంప్) Had a warm and productive conversation with my friend President @realDonaldTrump. We discussed his plans for the US Presidency of G-7, the COVID-19 pandemic, and many other issues. — Narendra Modi (@narendramodi) June 2, 2020 -
'చైనా ఉత్పత్తులను నిషేదిద్దాం'
లడఖ్ : భారత్, చైనాల మధ్య సరిహద్దుకు సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చైనాకు సంబంధించిన అన్ని ఉత్పత్తులతో పాటు టిక్టాప్ యాప్ను నిషేదిద్దామంటూ ఇంజనీర్ కమ్ సైంటిస్ట్ సోనమ్ వాంగ్ చుక్ పేర్కొన్నాడు. ప్రస్తుతం వాంగ్చుక్ యూట్యూబ్ ద్వారా షేర్ చేసిన వీడియో వైరల్గా మారింది. వాంగ్చుక్ లడఖ్లోని హిమాలయాలు, సింధూ నదిని బ్యాక్డ్రాఫ్గా ఏర్పాటు చేసుకొని ఒక కొండపై కూర్చొని మాట్లాడాడు. (మధ్యవర్తిత్వంపై మోదీకి ఫోన్ చేశా : ట్రంప్) ' 3 ఇడియట్స్ సినిమాలో అమిర్ఖాన్ కారెక్టర్ చెప్పిన ' ఫున్సుక్ వాంగ్డు' డైలాగ్ నాకు ఆదర్శంగా నిలిచింది. చైనీయులకు సంబంధించిన అన్ని సాఫ్ట్వేర్ ఉత్పత్తులను ఒక వారంలోగా, హార్డ్వేర్ ఉత్పత్తులను సంవత్సరం లోగా తిరిగి ఇచ్చేయండి. నేను నా ఫోన్ను వారం లోపలే చైనాకు తిరిగి ఇచ్చేస్తున్నా. మీ వాలెట్ శక్తిని ఉపయోగించండి. లడఖ్లో చైనా బెదిరింపులను ఆపడంతో పాటు చైనాకు వెట్టి చాకిరి చేస్తున్న 1.4 బిలియన్ కార్మికులు, 10 మిలియన్ ఉయ్ఘర్ ముస్లింలు, 6 మిలియన్ టిబెటియన్ బౌద్ధులను విముక్తి చేయడానికి పాటుపడదాం. ఏటా చైనాకు సంబంధించిన సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉత్పత్తులను కొనడంతో పాటు టిక్టాక్ లాంటి యాప్లను డౌన్లోడ్ చేసుకొని వారికి కోట్ల ఎకానమీ సంపదను సృష్టిస్తున్నాం. చైనా భారత్లో తమ వ్యాపారాన్ని పెట్టుబడులుగా పెట్టి ప్రతి ఏటా దాదాపు రూ . 6లక్షల కోట్లు సంపాదిస్తుంది. ఆ డబ్బుతోనే చైనీయులు మన దేశం బోర్డర్ వద్ద కాపలా కాస్తున్న మన సైనికులను కాల్చి చంపుతున్నారు. ప్రస్తుతం భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారతీయులను అర్థిస్తున్నా.. ఈ సమయంలో బులెట్ పవర్ కన్నా ఆర్థిక శక్తి అత్యంత బలం చూపెడుతుంది.. కాబట్టి 130 కోట్ల మంది భారతీయులతో పాటు విదేశాల్లో ఉంటున్న భారతీయులారా.. చైనా ఉత్పత్తులను నిషేధించడానికి సిద్ధమవండి. మనం చేస్తున్న పని సరైనదే అనిపిస్తే ప్రపంచం కూడా మనవెంటే ఉంటుంది' అంటూ పేర్కొన్నాడు. (హద్దు మీరుతున్న డ్రాగన్) కాగా లదాఖ్ లోని ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వద్ద చైనా బలగాలు భారత్ భూభాగంలోకి దూసుకొచ్చే ప్రయత్నం చేయడంతో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తాను మధ్యవర్తిత్వం చేస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ ద్వారా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య థర్డ్పార్టీ (మూడో వ్యక్తి) జోక్యం అవసరం లేదనిభారత్తో పాటు డ్రాగన్ దేశం కూడా తేల్చిచెప్పింది. భారత్-చైనాల మధ్య చోటుచేసుకున్న సరిహద్దు సమస్యను పరిష్కరించుకునే శక్తీసామర్థ్యాలు తమకు (ఇరుదేశాలకు) ఉన్నాయని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సరిహద్దు దేశాలైన తమ మధ్య డొనాల్డ్ ట్రంప్ తల దూర్చాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. -
సరిహద్దు బిల్లుకు ఓకే
బంగ్లాదేశ్తో సరిహద్దు సమస్య పరిష్కారం భారత్కు 510 ఎకరాలు.. బంగ్లాకు 10 వేల ఎకరాలు న్యూఢిల్లీ: బంగ్లాదేశ్తో 41 సంవత్సరాలుగా కొనసాగుతున్న సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు ఉద్దేశించిన చరిత్రాత్మక బిల్లును గురువారం లోక్సభ ఆమోదించింది. ఇరు దేశాలూ కొంత భూభాగాలను ఇచ్చిపుచ్చుకుని సమస్యను పరిష్కరించుకునేలా 1974లో భారత ప్రభుత్వం బంగ్లాదేశ్తో ఖరారు చేసుకున్న భూ సరిహద్దు ఒప్పందం అమలులోకి వచ్చేందుకు రాజ్యాంగ (119వ సవరణ) బిల్లును లోక్సభ అరుదైన రీతిలో ఏకగ్రీవంగా ఆమోదించింది. సభలో ఉన్న 331 మంది సభ్యులూ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో పార్లమెంటు ఆమోదం పొందిన వందో రాజ్యాంగ సవరణ బిల్లుగా ఇది రికార్డులకెక్కింది. బిల్లు ఆమోదం పొందిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిపక్ష స్థానాల వద్దకు వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆ పార్టీ సభాపక్ష నేత మల్లికార్జునఖర్గే, బీజేడీ, టీఎంసీ, అన్నా డీఎంకే నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు.. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ.. ఈ బిల్లు వల్ల ఇరు దేశాలకూ ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఒప్పందం ప్రకారం భారత్కు 510 ఎకరాలు, బంగ్లాదేశ్కు 10,000 ఎకరాలభూమి లభిస్తుందని.. అయితే ఈ లెక్కలు కేవలం అంచనాలు మాత్రమేనని తెలిపారు. భూ సరిహద్దులను ఖరారు చేయ టం వల్ల అక్రమ వలసలను నిరోధించవచ్చని పేర్కొన్నారు. ఇక బంగ్లాదేశ్తో భారత్ పరిష్కరించుకోవాల్సిన ఏకైక సమస్య తీస్తా నదీ జలాల పంపిణీకి సంబంధించినదేనన్నారు. బంగ్లాదేశ్ నుంచి తిరిగివచ్చే భారత జాతీయుల పునరావాసం కోసం పశ్చిమబెంగాల్కు రూ. 3,008కోట్ల ప్యాకేజీని సుష్మా ప్రకటించారు. ఇది దౌత్య విజయం: హసీనా ఢాకా: ఇరు దేశాల సరిహద్దు సమస్యను పరిష్కరించేలా చరిత్రాత్మక బిల్లుకు భారత పార్లమెంటు ఆమోదం తెలపటం... ఒక పెద్ద దౌత్య విజయమని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా అభివర్ణించారు. -
చైనాతో సరిహద్దు సమస్యే ప్రధాన అజెండా: మన్మోహన్
చైనాతో సరిహద్దు సమస్య గురించి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ చర్చించనున్నారు. చైనా, రష్యా దేశాలకు ఐదు రోజుల పర్యటన కోసం ఆదివారం ప్రధాని బయల్దేరి వెళ్లారు. చైనాతో సరిహద్దు సహకార ఒప్పందం తన పర్యటనలో ప్రధాన అజెండా అని అంతకుముందు ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారానికి చైనాతో చర్చించనున్నట్టు మన్మోహన్ తెలిపారు. చైనా, భారత్ మధ్య ఎప్పటినుంచో సమస్యలున్నాయని చెప్పారు. ఇరు దేశాల ప్రభుత్వాలు స్నేహిపూర్వక వాతావరణంలో నిబద్ధతతో చర్చిస్తాయని వివరించాయి. ఈ పర్యటనలో చైనా అధ్యక్షుడు గ్జి జిన్పింగ్.. మన్మోహన్కు విందు ఇవ్వనున్నారు.