kagaznagar
-
రూట్లు రెడీ.. నాగ్పూర్– సికింద్రాబాద్ మార్గంలో వందే భారత్ రైలు?
సాక్షి, కరీంనగర్: దేశ రైల్వే చరిత్రలోనే అత్యంత వేగవంతమైన రైలుగా పేరొందిన ‘వందే భారత్ రైలు’ను పూర్తిస్థాయిలో నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. జనవరి 15వ తేదీన సికింద్రాబాద్– విశాఖపట్నం రైలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పట్టాలపైనా వందేభారత్ పరుగులు తీస్తుందా? అన్న సామాన్యుల అనుమానాలకు దక్షిణ మధ్య రైల్వే తెరదించింది. పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల జిల్లాలో రైల్వే లైను ఉంది. సిరిసిల్లకు రూటు ప్రగతిలో ఉంది. ఇటీవల దక్షిణ మధ్య రైల్వే అధికారులు వందేభారత్కు అనుగుణంగా ఈ రూట్లలో వేగాన్ని పెంచారు. పెద్దపల్లి– కరీంనగర్, కరీంనగర్– జగిత్యాల, జగిత్యాల–నిజామాబాద్ రూట్లలో ఈ రైలును నడపగలిగితే.. పొరుగున ఉన్న మహారాష్ట్రకు కేవలం మూడు నాలుగు గంటల్లోనే చేరుకునే వీలుంది. ముఖ్యంగా సిరిసిల్ల, జగిత్యాలలోని నేత, వలస కార్మికులకు ఇది ఎంతో అనువుగా ఉంటుంది. అన్ని డివిజన్లలో.. దక్షిణ మధ్యరైల్వే పరిధిలో మొత్తం ఆరు డివిజన్లు సికింద్రాబాద్, నాందేడ్, విజయవాడ, గుంటూరు, గుంతకల్, హైదరాబాద్ ఉన్నాయి. అన్ని రూట్లలోనూ గరిష్ట వేగంతో వెళ్లేలా ఇటీవలే రైల్వేలైన్లను ఆధునీకరించారు. విభజన అనంతరం సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు తెలంగాణలో ఉన్నాయి. వందేభారత్ రైలు గరిష్ట వేగం 160 నుంచి 180 కి.మీలతో ప్రయాణించగలదు. అందుకు అనుగుణంగా రైలు పట్టాల సామర్థ్యం పెరగాలి. దక్షిణ మధ్య రైల్వే ఇటీవల చేపట్టిన అప్గ్రేడేషన్ పనులతో ఇక్కడ గరిష్ట వేగం 130 కి.మీలకు చేరుకుంది. తెలంగాణలోని మూడు డివిజన్లలో వందే భారత్ రైలును నడపాల్సి వస్తే.. చాలా సెక్షన్లలో 130 కి.మీ గరిష్ట వేగంతో నడిపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. గరిష్ట వేగం 130 కి.మీ.. కనిష్టవేగం 30.కి.మీ ఈ రైలును మూడు డివిజన్లలోని పలు సెక్షన్లను పరిశీలిస్తే.. సామర్థ్యాన్ని బట్టి వేగం మారుతోంది. ఖాజీపేట– బల్లార్షా సెక్షన్లో 130 కి.మీ గరిష్ట వేగంతో దూసుకెళ్లగలదని అధికారులు తెలిపారు. అదే సమయంలో అతి తక్కువగా మల్కాజిగిరి– మౌలాలి సెక్షన్లో కేవలం 30.కి.మీ స్పీడుకే పరిమితం కావడం గమనార్హం. అయితే, వేగంపై లైన్ అప్గ్రేడేషన్తోపాటు లెవెల్ క్రాసింగ్స్, రైల్ ట్రాఫిక్ కూడా ప్రభావం చూపుతుంది. అత్యాధునిక సౌకర్యాలు.. ఆటోమేటిక్ డోర్స్, స్మోక్ అలారం, సీసీ టీవీ కెమెరాలు, బయో వ్యాక్యూమ్ టాయ్లెట్స్, సెన్సార్తో పనిచేసే నల్లాలు, ఫుట్రెస్ట్లు వంటి ఆధునిక సదుపాయాలున్నాయి. మిగిలిన రైళ్లతో పోలిస్తే.. దీని నిర్వహణ పూర్తిగా భిన్నం. తొలి వందే భారత్ రైలు సర్వీసు 2019 ఫిబ్రవరి 15న ఢిల్లీ– వారణాసి మధ్య ప్రారంభమైంది. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా మొత్తం ఏడు సర్వీసులు నడుస్తుండగా.. సికింద్రాబాద్– విజయవాడ మధ్య సర్వీసు ప్రారంభమైతే ఆ సంఖ్య ఎనిమిదికి చేరుకుంటుంది. దేశవ్యాప్తంగా దాదాపు 20కిపైగా ప్రాంతాల నడుమ వందేభారత్ ఎక్స్ప్రెస్ నడపాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. అందులో హైదరాబాద్– తిరుపతి, హైదరాబాద్– బెంగళూరు, హైదరాబాద్– నాగ్పూర్ మార్గాలు ఉండటం విశేషం. రూటు స్పీడు ►సికింద్రాబాద్– బల్లార్షా 130 కి.మీ. ►ఖాజీపేట–కొండపల్లి 130 కి.మీ. ►సికింద్రాబాద్– ఖాజీపేట 130 కి.మీ. ►మానిక్నగర్– విరూర్ (3వలైన్) 110 కి.మీ. ►మందమర్రి– మంచిర్యాల కి.మీ(3వలైన్) 110 కి.మీ. ►మంచిర్యాల– పెద్దంపేట (3వలైన్) 100 కి.మీ. ►పెద్దంపేట– రాఘవపురం (3వ లైన్) 110 కి.మీ. ►రాఘవపురం– కొలనూరు–పొత్కపల్లి (3వలైన్) 90 కి.మీ. ►బిజిగిరి షరీఫ్– ఉప్పల్ (3వలైన్) 100 కి.మీ. ►పెద్దపల్లి– కరీంనగర్ 100 కి.మీ. ►కరీంనగర్– జగిత్యాల(లింగంపేట) 90 కి.మీ. ►జగిత్యాల(లింగంపేట)– నిజామాబాద్ 100 కి.మీ మేడ్చల్– మనోహరాబాద్ 110 కి.మీ మల్కాజిగిరి– మౌలాలి కార్డ్లైన్ సెక్షన్లలో 30 కి.మీ. ఈ ప్రాంతానికి ఎంతో మేలు ‘వందేభారత్’ రైలును బల్లార్షా– కాజీపేట మార్గంలో నడపాలి. నాగ్పూర్– సికింద్రాబాద్ మార్గంలో వందేభారత్ రైలు ప్రస్తుతం ప్రతిపాదనలో ఉంది. ఈ మార్గంలో రైలు వస్తే.. రామగుండం లేదా మంచిర్యా లకు హాల్టింగ్ కల్పిస్తే.. కోల్బెల్ట్ పారిశ్రామిక ప్రాంతాలు, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. – కామని శ్రీనివాస్, సామాజిక కార్యకర్త రవాణా సదుపాయాలకు పెద్దపీట కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రవాణా సదుపాయాలకు, మౌలిక వసతులకు పెద్దపీట వేస్తుందనడానికి వందేభారత్ రైలే పెద్ద ఉదాహరణ. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైలు దేశంలోనే అత్యధిక వేగంతో వెళ్లడం విశేషం. భవిష్యత్తులో దేశంలోని ముఖ్యప్రాంతాలకు దీని సేవలు అందుబాటులోకి వస్తాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు సైతం త్వరలో దీని సేవలు అందుతాయి. – బండి సంజయ్, కరీంనగర్ ఎంపీ -
తెలంగాణ: కాగజ్నగర్ గురుకులంలో ఫుడ్పాయిజన్
ఆసిఫాబాద్: కొమరంభీం జిల్లా కాగజ్నగర్లోని మైనారిటీ గురుకులంలో ఫుడ్పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. భోజనం వికటించి యాభై మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో రాత్రికి రాత్రే వాళ్లందరినీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షలోనే వాళ్లంతా ఉన్నారు. ఇదిలా ఉంటే.. భోజనంలో పురుగులు వస్తున్నాయంటూ విద్యార్థులు ఫిర్యాదు చేయడం విశేషం. -
అటవీశాఖ అధికారులపై గ్రామస్తుల దాడి
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ ఫారెస్ట్ రేంజ్ అటవీ అధికారులపై దాడి జరిగింది. తప్పించుకునే క్రమంలో పరుగెడుతూ 8 నెలల గర్భిణీ అయిన ఎఫ్బీవో అస్వస్థతకు గురయ్యారు. కాగజ్నగర్ ఫారెస్ట్ రేంజ్ ఆధ్వర్యంలో అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించడం కోసం కుమురంభీం జిల్లా కాగజ్నగర్ మండలం ఊట్పల్లిలో మంగళవారం కళాజాత నిర్వహించారు. వంట చెరుకును తీసుకోనివ్వకుండా అధికారులు అడ్డుకుంటున్నారని, గొడ్డళ్లు, సైకిళ్లను స్వాధీనం చేసుకుంటున్నారని అధికారులను గ్రామస్తులు ఘెరావ్ చేశారు. దీంతో కళాజాత బృందం సభ్యులు అర్ధాంతరంగా కార్యక్రమాలను ఆపేసి వెళ్లిపోయారు. కోసిని ఎఫ్బీవో శిరీష, వాచ్మేన్లు దేవ్సింగ్, రాములు, శంకర్ తమ ద్విచక్ర వాహనాలపై బయల్దేరుతుండగా గ్రామస్తులు అడ్డుకొని కర్రలతో దాడికి దిగారు. శిరీష ఎడమ చేతికి గాయాలయ్యాయి. దాడి నుంచి తప్పించుకోవడానికి పరుగెత్తడంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న శిరీష భర్త బైక్పై ఆమెను పట్టణంలోని ప్రైవేటు హాస్పిటల్కు తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం అటునుంచి ఆమెను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. -
ఆడపిల్ల పుట్టిందని.. కొడుకంటే ఇష్టం లేదని.. చంపేశారు..
సాక్షి,కాగజ్నగర్: కన్న ప్రేమ కనికరం చూపలేకపోయింది. కన్నతండ్రే కాల యముడయ్యాడు. ఆడపిల్లగా పుట్టినందుకు 40 రోజుల పసికందును బండరాయితో కొట్టి చంపేశాడు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. కాగజ్నగర్ మండలం మారేపల్లి పంచాయతీ లైన్గూడ గ్రామానికి చెందిన మెస్రం బాపురావు–మానస దంపతులు వ్యవసాయ పనులు చేస్తుంటారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. మూడో సంతానంలోనూ ఆడపిల్ల పుట్టింది. భారంగా భావించిన బాపురావు తాగిన మైకంలో సోమవారం అర్ధరాత్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 40 రోజుల పసికందును తల్లి పొత్తిళ్ల నుంచి తీసుకెళ్లి రోడ్డుపై పడేసి, బండతో మోది చంపేశాడు. భార్య వారిస్తున్నా వినకుండా ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇంకా లోకం కూడా చూడని చిన్నారిని కిరాతకంగా హత్య చేశాడు. పక్కలోని బిడ్డను తీసుకెళ్లి తన కళ్లముందే చంపడంతో తల్లి కంటికి పుట్టెడుగా శోకిస్తోంది. కుటుంబ సభ్యులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు. నిందితుడిని అదుపులోనికి తీసుకున్నట్లు కాగజ్నగర్ రూరల్ సీఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు. చదవండి: నయా ట్రెండ్: నోరూరిస్తున్న బిర్యానీ.. తింటే వదల‘మండీ’ ఆరేళ్ల బాలుడిని చితకబాది హతమార్చిన మారుతండ్రి పటాన్చెరు టౌన్: ఆరు సంవత్సరాల బాలుడిని మారు తండ్రి చితకబాదడంతో మృతి చెందాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామానికి చెందిన నర్సింహులుకు 11 సంవత్సరాల క్రితం అరుణతో వివాహం జరిగింది. వీరికి జాన్పాల్, జస్వంత్, అరుణ్ (6) ముగ్గురు కుమారులు. కాగా నర్సింహులు మద్యానికి బానిసై సంవత్సరం క్రితం మృతి చెందాడు. అరుణ గద్వాలలో పనిచేస్తున్న సమయంలో వినయ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. నెలరోజుల క్రితం వినయ్, అరుణ మెదక్ చర్చిలో వివాహం చేసుకున్నారు. అనంతరం ఇస్నాపూర్కు వచ్చి పద్మారావునగర్ కాలనీలో నివాసముంటున్నారు. చదవండి: బాలికపై టీఆర్ఎస్ సర్పంచ్ అత్యాచారం.. బాధితురాలికి బండి పరామర్శ అయితే వివాహం జరిగినప్పటి నుంచి వినయ్కు అరుణ్ అంటే ఇష్టం ఉండేది కాదు. చిన్నచిన్న విషయాలకు బాలుడిని కొట్టేవాడు. మంగళవారం కూడా అరుణ డ్యూటీకి వెళ్లిన సమయంలో ఇంట్లోనే ఉన్న అరుణ్ని వినయ్ తీవ్రంగా కొట్టాడు. స్పృహ తప్పి పడిపోయిన బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిశీలించిన వైద్యులు అరుణ్ మృతిచెందినట్లు తెలిపారు. దీంతో బాలుడిని ఇంట్లో పడుకోబెట్టి వినయ్ పారిపోయాడు. డ్యూటీనుంచి తిరిగొచ్చిన తల్లికి కుమారుడు మృతిచెంది కనిపించాడు. అరుణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉచ్చుకు మరో పెద్ద పులి బలి..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జాతీయ జంతువు పులి వరుసగా వేటగాళ్ల ఉచ్చుకు బలైపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. రెండు నెలల్లో మూడు పులులు మృత్యువాతపడటం.. వన్యప్రాణుల సంరక్షణలో నిఘా, పర్యవేక్షణ లోపాలను బట్టబయలుచేస్తోంది. ఈ వరుస ఘటనల పట్ల పర్యావరణవేత్తలు, పరిశోధకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కొంతకాలంగా ‘వన్యప్రాణి సంరక్షణ’ ప్రత్యేక విభాగం పనిచేయడం లేదు. దానికి ప్రత్యేకంగా ఒక ఉన్నతాధికారిని నియమించలేదు. దాదాపు పదేళ్లు గడుస్తున్నా కవ్వాల్ టైగర్ రిజర్వ్ పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. అక్కడ యూనిఫైడ్ కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు కాలేదు. వీటికి తోడు వన్యప్రాణుల సంరక్షణపై నిఘా పెట్టాల్సిన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నామమాత్రంగానే పనిచేస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. కాగజ్నగర్లో ఒకటి.. గత శనివారం (అక్టోబర్ 30న) కాగజ్నగర్లో అక్రమంగా పులిచర్మం కలిగి ఉన్న ఇద్దరు పట్టుబడ్డారు. దీనిపై విచారణ చేయగా.. పత్తి చేలోకి అడవిపందులు రాకుండా బిగించిన ఉచ్చులకు చిక్కి గత నవంబర్, డిసెంబర్లోనే పులి హతమైనట్టుగా తెలిసింది. పులి కింది దవడ, ఇతర ఎముకలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతం పూర్వాపరాలు, ఇతర అంశాలపై అటవీశాఖ వివరణ, స్పష్టీకరణ ను ‘సాక్షి’ఫోన్ద్వారా తీసుకునే ప్రయత్నం చేస్తే పీసీసీఎఫ్ ఆర్.శోభ, అదనపు పీసీసీఎఫ్ సిదానంద్ కుక్రేటీ, ఇతర అటవీ అధికారులు స్పందించలేదు. సెప్టెంబర్లో ములుగు జిల్లాలో రెండు! ఇక సెప్టెంబర్లో ములుగు జిల్లాలోని తాడ్వాయి అటవీ ప్రాంతంలో... చత్తీస్గఢ్ నుంచి వచి్చనట్టుగా భావిస్తున్న ఓ పులి గుత్తికోయ వేటగాళ్లు పెట్టిన ఉచ్చుకు బలైంది. అధికారులు ఒకటే పులి అని చెప్పి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేశారు. కానీ రెండు పెద్ద పులులు బలై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ సందర్భంగానే పులుల పర్యవేక్షణ, ట్రాకింగ్, రక్షణ ఏర్పాట్లకు సంబంధించిన లోటుపాట్లు, వైఫల్యాలు బయటపడ్డాయి. వేటగాళ్లు ఏ ఒక్క చోటో, ఒక్క రోజో పెట్టిన ఉచ్చుకే పెద్దపులులు బలైపోయే అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు. మెప్పుకోసం అధికారుల తిప్పలు... పర్యావరణానికి మూలాధారమైన వన్యప్రాణులు ముఖ్యంగా పులుల సంరక్షణను రాష్ట్రం ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం లేదన్న పర్యావరణవేత్తల వాదనకు ఈ వరుస ఘటనలు బలం చేకూరుస్తున్నాయి. రాష్ట్రంలో అటవీశాఖ అధికారులు అడవులు, వన్యప్రాణుల సంరక్షణ పక్కనపెట్టి.. హరితహారం పనుల్లోనే బిజీగా గడుపుతున్నారని, ఉన్నతాధికారులు, రాజకీయ నేతల మెప్పుకోసం ప్రయతి్నస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో వెంటనే వైల్డ్లైఫ్ వింగ్, డివిజన్ను పూరి్థస్థాయిలో ఏర్పాటుచేయాలి. టైగర్ రిజర్వ్లో క్షేత్రస్థాయిల్లో ఈ బేస్క్యాంప్లతో పెట్రోలింగ్, ట్రాకింగ్ కార్యకలాపాలు సాగేలా చర్యలు తీసుకోవాలి. కొంత డబ్బుకే జంతువులను చంపేందుకు సిద్ధమయ్యే స్థానిక వేటగాళ్లకు అడ్డుకట్ట వేయాలి. ఈ దిశలో అటవీశాఖ కట్టుదిట్టమైన కార్యాచరణ అమలు చేయాలి. పచ్చదనం పెంచేందుకు కృషి చేస్తున్నామంటున్నారే తప్ప వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తున్నట్టు కనిపించడం లేదు. – కె.సందీప్రెడ్డి, వన్యప్రాణి సంరక్షణ కార్యకర్త, ఎన్విరాన్మెంట్ సైన్స్ టీచర్ రాష్ట్రంలో వేటగాళ్ల ఉచ్చులకు మరో పెద్దపులి బలి కావడం ఎంతో వేదన కలిగిస్తోంది. పులుల పర్యవేక్షణ కోసం నిఘా ఉండాలి. ఆనుపానులు గ్రహించి అది సాగే దారిలో ప్రమాదానికి గురికాకుండా నియంత్రించాలి. జాగ్రత్త చర్య తీసుకోవాలి. ఫుట్ పెట్రోలింగ్, ట్రాకింగ్ తదితరాలను సీరియస్గా చేస్తున్నట్టు కనిపించడం లేదు. ఫీల్డ్లోనే ఉంటూ అడవులకు దగ్గరగా ఉన్న స్థానిక సర్పంచ్లు, ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, లోకల్గా సమాచార సేకరణ వంటివి జరుగుతున్నట్టు లేదు. – రాష్ట్ర అటవీ శాఖ, రిటైర్డ్ అధికారి -
ఎలక్ట్రిక్ బైక్ నుంచి పొగలు
-
కొమరం భీం జిల్లా కగజ్ నగర్ లో అగ్ని ప్రమాదం
-
రౌడీషీటర్ దారుణహత్య
సాక్షి, కాగజ్నగర్టౌన్ : కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని గోల్బజార్ ఏరియాకు చెందిన రౌడీషీటర్ గుర్రం సంతోష్ అలియాస్ సంతు (35) హత్యకు గురయ్యాడు. శనివారం అర్ధరాత్రి గాంధీ చౌక్ మెయిన్ మార్కెట్ ఏరియాలో సంతోష్ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పట్టణ సీఐ డి.మోహన్ తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని గోల్బజార్ ఏరియాకు చెందిన గుర్రం సత్యమ్మ, రమణమ్మ దంపతుల కుమారుడైన సంతోష్ ఇటీవల పీడీయాక్టు కేసులో జైలుశిక్ష అనుభవించి విడులైయ్యాడు. ప్రస్తుతం తల్లివద్దనే ఉంటున్నాడు. వ్యసనాలకు బానిసైన సంతోష్పై 11 క్రిమినల్ కేసులు ఉన్నాయి. (పగబట్టిన ప్రేమ; సాఫ్ట్వేర్ యువతికి..! ) అందులో హత్య, హత్యాయత్నాలు, దాడులు వంటివి కూడా ఉన్నాయి. మే 7న జైలు నుంచి విడుదలైన సంతోష్ శనివారం రాత్రి తీరందాజ్రోడ్డు గల్లిలో మరికొంత మంది నేరస్తులతో కలిసి మద్యం సేవిస్తుండగా గొడవపడ్డారు. వారి మధ్య ఉన్న పాత గొడవలపై ఘర్షణ చోటు చేసుకోవడంతో ఒకరు తమ ఇంటి నుంచి గొడ్డలి తీసుకువచ్చి సంతోష్పై దాడిచేశాడు. ఈ ఘటనలో సంతోష్కు తల, ఇతర భాగాల్లో తీవ్రగాయాలై మృతి చెందాడు. ఆదివారం ఉదయం ఈ వార్త పట్టణవ్యాప్తంగా విస్తరించడంతో ఈ హత్య వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సంఘటన స్థలాన్ని కాగజ్నగర్ డీఎస్పీ బి.లక్ష్మీనర్సింహాస్వామి, సీఐ మోహన్, ఎస్సైలు రవికుమార్, తదితరులు పరిశీలించారు. సంఘటన స్థలంలో పడి ఉన్న పగిలిన మద్యం సీసాలు, ఇతర వివరాలను సేకరించారు. (కరోనా: రికార్డు స్థాయిలో కేసులు) ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను పోలీసులు సేకరిస్తున్నారు. హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. మరికొంత మంది అనుమానితుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడి తల్లి సత్యమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ మోహన్ విలేకరులకు తెలిపారు. -
మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కన్నుమూత
కాగజ్నగర్: కుమురం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు కావేటి సమ్మయ్య (63) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య కావేటి సాయిలీల, ముగ్గురు కుమారులు ఉన్నారు. తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమ్మయ్య 2007లో టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాగజ్నగర్ పట్టణంలో సాగిన 300 రోజుల రిలే దీక్ష శిబిరాన్ని ముందుండి నడిపించారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచి కాంగ్రెస్ అభ్యర్థి కోనేరు కోనప్పపై 7 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాష్ట్ర సాధనలో భాగంగా 2010లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఉప ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిపై 15 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 2012లో అసెంబ్లీ భవనంపై ఎక్కి నల్ల జెండాతో నిరసన తెలిపారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కావేటి సమ్మయ్య బీఎస్పీ అభ్యర్థి కోనేరు కోనప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. కొన్ని కారణాల వల్ల 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమ్మయ్య మళ్లీ కాంగ్రెస్లో చేరారు. కావేటి మృతిపై కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కావేటి చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. తెలంగాణ ఉద్యమంలో కావేటి పాత్ర మరువలేనిది: కేటీఆర్ కావేటి సమ్మయ్య మరణం పట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్సహా పలువురు సంతాపం తెలిపారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో సమ్మయ్య చురుగ్గా పనిచేశారని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమకారుడిగా కావేటి పాత్ర మరువలేనిదని ఆర్థిక మంత్రి హరీశ్రావు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, పువ్వాడ అజయ్, శ్రీనివాస్గౌడ్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తదితరులు సమ్మయ్య మరణం పట్ల సంతాపం ప్రకటించారు. మండలి చైర్మన్, స్పీకర్ సంతాపం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకుగా పనిచేసిన కావేటి సమ్మయ్య మరణం పట్ల శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. సమ్మయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
వేధింపులకే వెళ్లిపోయాడా?
సాక్షి, సిర్పూర్(టి)(కాగజ్నగర్): సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో పదోతరగతి చదువుతున్న పిట్టల నవీన్ (16) అనే విద్యార్థి శనివారం పాఠశాల వెనుకాల ఉన్న రైల్వేలైను పక్కన శవమై కనిపించాడు. పాఠశాల నుంచి ఈనెల 11న మధ్యాహ్నం బయటికి వెళ్లిన పిట్టల నవీన్ తిరిగిరాకపోవడంతో పాఠశాల ప్రిన్సిపాల్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు వచ్చిన తర్వాత గురువారం సిర్పూర్(టి) పోలీసుస్టేషన్లో విద్యార్థి అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు. సిర్పూర్(టి) ఎస్సై వెంకటేష్ దర్యాప్తు చేస్తుండగా శనివారం సాయంత్రం సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల వెనుకాల ఉన్న రైల్వేలైను పక్కన చెట్ల పొదల్లో ఓ మృతదేహాన్ని చూసిన పశువుల కాపరి పోలీసులకు సమాచారం అందించాడు. దాంతో పోలీసులు నవీన్ తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో విద్యార్థి తల్లితండ్రులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించి మృతదేహం తమ కుమారునిదే అని గుర్తించారు. తల్లితండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చిన విద్యార్థి ఆత్మహత్య తన కొడుకు ఉన్నత విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించి కుటుంబానికి చేదేడు వాదోడుగా నిలుస్తాడని కోటి ఆశలతో సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో తల్లితండ్రులు చేర్పించగా తన కొడుకు అర్ధాంతరంగా పాఠశాల నుంచి వెళ్లిపోయి ఆత్మహత్యకు పాల్పడటంతో విద్యార్థి తల్లితండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. బందువులు, ఎమ్మార్పీఎస్ నాయకుల ధర్నా బాలుర గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్, పీడీ, ఆర్మీ ఇన్స్స్ట్రక్టర్ల వేధింపులకు పాఠశాల నుంచి పారిపోయి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న నవిన్ కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా చేశారు. బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, 20లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని, మూడు ఎకరాల భూమి ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. పీడీ సుమిత్, ఆర్మీ ఇన్స్స్ట్రక్టర్ శ్రీనివాస్లను సస్పెండ్ చేస్తున్నామని, ప్రిన్సిపాల్ ప్రవీణ్కుమార్పై విచారణ చేపడుతున్నామని సాంఘిక సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లా ఆర్సీవో గంగాధర్ తెలిపారు. అంత్యక్రియల కొరకు తక్షణ ఆర్థిక సహాయంగా 30వేల రూపాయల నగదును అందజేయడంతో పాటు బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. శోకసంద్రం నడుమ విద్యార్థి అంత్యక్రియలు కౌటాల(ఆసిఫాబాద్): నవీన్ అంత్యక్రియలు ఆదివారం కౌటాలలో శోకసంద్రంనడుమ ముగిశాయి. మృతుడి తండ్రి శ్రీనివాస్ కౌటాల గ్రామ పంచాయతీలో కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. మృతుడికి తమ్ముడు ప్రవీణ్, చెల్లి నవ్య ఉన్నారు. వేధింపులతోనే మృతి తమ కుమారుడు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, పీడీ, ఆర్మీ టీచర్, తెలుగు టీచర్ వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లిదండ్రులు, బందువులు ఆరోపించారు. -
కాగజ్నగర్ ఎఫ్ఆర్వోకు గోల్డ్మెడల్
సాక్షి, కాగజ్నగర్ : మురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ ఫారెస్ట్ రేంజి అధికారి ఛోలె అనిత కేవీఎస్ బాబు మెమోరియల్ గోల్డ్మెడల్ అవార్డుకు ఎంపికైనట్లు కాగజ్నగర్ ఎఫ్డీఓ రాజరమణారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఫారెస్ట్ ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆర్.శోభ పంపించిన ఉత్తర్వుల ప్రకారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని దూలపల్లి అటవీ శిక్షణ అకాడమీ ప్రాంగణంలో ఈ అవార్డు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. అవార్డుతో పాటు రూ.15వేల నగదు, ప్రశంసపత్రం అందిస్తారన్నారు. 2018 జూన్ 30 నుంచి ఈ ఏడాది జూన్ 30 వరకు కాగజ్నగర్ రేంజిలో అనేక సవాళ్లను ఎదుర్కొందన్నారు. చింతగూడలో అక్రమ కలప వ్యాపారాన్ని అరికట్టడంలో ఆమె ధైర్య సాహసాలు ప్రదర్శించిందని, గార్లపేట రిజర్వు ఫారెస్ట్లో 2013 నుంచి పోడు భూమిలో వ్యవసాయం చేసుకుం టున్న 16 మంది గిరిజ న గోండు గ్రామస్తులను తొలగించడంలో ప్రము ఖ పాత్ర పోషించిందన్నారు. ఆమె ధైర్య సాహసాలను పరిగణలోకి తీసుకొని ఫారెస్ట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేసిన సిఫార్సులను దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారులు ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు చెప్పారు. -
విలన్ కోనేరు కృష్ణనే!
సాక్షి, ఆసిఫాబాద్: కాగజ్నగర్ మండలం సార్సాలలో అటవీ అధికారులపై జరిగిన దాడుల్లో బుధవారం మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ హల్చల్ సృష్టించినట్లు దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దాడుల్లో మొదటి నుంచి పకడ్బందీగా అన్నీ తానై వ్యవహరించారు. ఆ వీడియో ప్రకారం.. ఆదివారం ఉదయం సార్సాల గ్రామస్తులను వెంట బెట్టుకుని అటవీ అధికారుల వద్ద ఉన్న ట్రాక్టర్ యజమాని మేకల తిరుపతిపై దాడికి పాల్పడ్డాడు. తిరుపతిని విచక్షణారహితంగా కర్రలతో కొట్టినట్లు కనిపిస్తోంది. తన ట్రాక్టర్ రాలేదని అతను ఎంత చెప్పినా వినకుండా దాడికి తెగబడ్డాడు. కాగజ్నగర్ టౌన్ సీఐ కిరణ్కుమార్ అటవీ అధికారులను అడ్డుకున్న వారందరినీ జీపులో ఎక్కించుకుని వెళ్లే క్రమంలో పోలీసులను బెదిరించి జీపులో ఉన్న వారిని కృష్ణ కిందకు దింపేశారు. అనంతరం ఎఫ్ఆర్వో అనితను దుర్భాషలాడారు. ఆగ్రహంతో ఊగిపోతూ ఆమెపై కర్రతో దాడి చేశారు. అనంతరం అక్కడ కనిపించిన వారిపై దాడి చేస్తూ వెళ్లారు. కృష్ణ సార్సాల గ్రామానికి రాకముందు అటవీ అధికారులు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చేటు చేసుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆయన అండతో గ్రామస్తులు సైతం కర్రలు చేతబూని దాడులకు తెగబడ్డారు. పోలీసుల ప్రేక్షక పాత్ర ఈ దాడుల్లో పోలీసుల ప్రేక్షక పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. సీఐ కిరణ్కుమార్ జీపులో ఉన్న వారందరినీ దింపుతున్నా కృష్ణకు ఎదురు చెప్పకపోగా.. ఆయన దాడులను చూస్తూ ఉండిపోయారు. 31 మంది అరెస్టు అటవీ అధికారులపై దాడులు చేసిన వారిలో బుధవారం వరకు మొత్తం 38 మంది నిందితులను గుర్తించగా.. ఇందులో 31 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు కోనేరు కృష్ణతో సహా వీరంతా ప్రస్తుతం ఆదిలాబాద్ జైలులో ఉన్నారు. -
ఎఫ్ఆర్వోపై దాడి సీఎం కేసీఆర్ ఆగ్రహం
-
కోనేరు కృష్ణ తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : విధి నిర్వహణలో ఉన్న మహిళా అటవీశాఖ అధికారిణిపై దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే సోదరుడు, జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి సమగ్ర విచారణ జరిపించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని టీఆర్ఎస్ నాయకత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. చదవండి: నేను బతుకుతానని అనుకోలేదు: ఎఫ్ఆర్వో అనిత కాగా ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం కొత్త సారసాల గ్రామంలో అటవీ శాఖ అధికారులపై తన అనుచరులతో హంగామా సృష్టించి, దాడికి పాల్పడ్డ కోనేరు కృష్ణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం మధ్యాహ్నం జెడ్పీ వైస్ చైర్మన్, జడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. కోనేరు కృష్ణ తన రాజీనామా లేఖను జిల్లా కలెక్టర్కు పంపించారు. అయితే పార్టీ ఆదేశాల మేరకు ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాగా ఎఫ్ఆర్వో అనితపై దాడి చేసిన కేసులో కోనేరు కృష్ణ సహా 16మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి 30మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. చదవండి: మహిళా ఎఫ్ఆర్వోపై ఎమ్మెల్యే సోదరుడి దాడి.! దాడి ఘటన ఖండించిన మంత్రి అల్లోల మరోవైపు అధికారులపై జరిగిన దాడిని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలే తప్ప, భౌతిక దాడులకు పాల్పడటం సరికాదని అన్నారు. అలాగే అటవీశాఖ సిబ్బందిపై దాడిని ఐఎఫ్ఎస్ అధికారుల సంఘం ఖండించింది. విధి నిర్వహణలో ఉన్న వారిని అడ్డుకోవడం, మహిళా అధికారిని తీవ్రంగా గాయపరచడం తీవ్రమైన చర్య అని, బాధ్యులపై వెంటన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. -
ఎఫ్ఆర్వోపై దాడి కోనేరు కృష్ణపై కేసు నమోదు
-
నేను బతుకుతానని అనుకోలేదు: ఎఫ్ఆర్వో అనిత
సాక్షి, సిర్పూర్ కాగజ్ నగర్ : ఎఫ్ఆర్వో అనితపై దాడికి తెగబడ్డ ఘటనలో ఎమ్మెల్యే సోదరుడు కోనేరు కృష్ణ సహా 16మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిపై 147,148, 207,332,353,427 సెక్షన్ల కింద ఈజ్గామ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. కాగా దాడిలో గాయపడ్డ మహిళా అధికారిణి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కోనేరు కృష్ణ మొదటగా నాపై దాడికి పాల్పడ్డారు. తర్వాత మరో 10మంది కోనేరు కృష్ణ అనుచరులు కర్రలతో నా తలపై కొట్టారు. ఆ క్షణంలో నేను బతుకుతానని అనుకోలేదు.’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సిర్పూర్ కాగజ్నగర్ ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్రత్యామ్నాయ అటవీకరణ పనులు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో కాగజ్నగర్ అటవీ ప్రాంతంలోని సార్సాలా గ్రామంలో 20 హెక్టార్లలో చెట్లు నాటేందుకు అటవీ అధికారులు సిద్ధమయ్యారు. చెట్లు నాటేందుకు వీలుగా భూమిని చదును చేసేందుకు ట్రాక్టర్లు, సిబ్బందితో కలిసి ఆదివారం ఉదయం అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని సిర్పూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీ వైఎస్ చైర్మన్ కృష్ణ తన అనుచరులతో అడ్డుకోవడమే కాకుండా అటవీ శాఖ అధికారులపై దాడికి తెగబడ్డారు. -
మహిళా ఎఫ్ఆర్వోపై ఎమ్మెల్యే సోదరుడి దాడి.!
కాగజ్నగర్ : విధి నిర్వహణలో ఉన్న అటవీ అధికారులపై ఓ ఎమ్మెల్యే తమ్ముడు దౌర్జన్యం చేశాడు. స్థానికులను ఉసిగొల్పి రణరంగం సృష్టించాడు. వివరాలు.. సిర్పూర్ కాగజ్నగర్ ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్రత్యామ్నాయ అటవీకరణ పనులు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో కాగజ్నగర్ అటవీ ప్రాంతంలోని సార్సాలా గ్రామంలో 20 హెక్టార్లలో చెట్లు నాటేందుకు అటవీ అధికారులు సిద్ధమయ్యారు. చెట్లు నాటేందుకు వీలుగా భూమిని చదును చేసేందుకు ట్రాక్టర్లు, సిబ్బందితో కలిసి ఆదివారం ఉదయం అక్కడికి చేరుకున్నారు. అయితే, ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించిన సిర్పూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరుకోనప్ప సోదరుడు, జెడ్పీ వైస్ చైర్మన్ కృష్ణ అధికారులపట్ల అమానుషంగా ప్రవర్తించాడు. అనుచరులతో కలిసి మహిళా ఎఫ్ఆర్వోపై ఒక్కసారిగా కర్రలతో దాడికి పాల్పడ్డాడు. అతనితోపాటు మరికొంతమంది కర్రలు చేతబూని అధికారులను బెదిరింపులకు గురిచేశారు. ఈ దాడిలో ఎఫ్ఆర్వో అనిత తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మొదటగా కోనేరు కృష్ణ, అనంతరం అతని అనుచరులు తనపై అకారణంగా దాడికి పాల్పడ్డారని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనిత ఆవేదన వ్యక్తం చేశారు. పదిమంది ఒక్కసారిగా కర్రలతో తలపై కొట్టారని, ఆక్షణంలో తాను బతుకుతానని అనుకోలేదని కన్నీటిపర్యంతమయ్యారు. ఘటనాస్థలంలో 50 మంది పోలీసులు ఉన్నా దాడిని అడ్డుకోలేకపోవడం గమనార్హం. -
ఇంత దారుణమా!
ఆదివాసీ పోరాటయోధుడు కొమరం భీం ఎనిమిది దశాబ్దాల క్రితం ‘జంగల్, జల్, జమీన్ హమారా’ నినాదాలే ఇరుసుగా పోరాడారు. ఆ పోరాటక్రమంలో అమరుడయ్యారు. ఇన్నేళ్లు గడిచాక కూడా తమ జీవిక కోసం, నిలువనీడ కోసం ఆదివాసీలు ఉద్యమించక తప్పడం లేదు. కన్నెర్రజేస్తున్న అధికార యంత్రాంగం ధాటికి కష్టాలుపడక తప్పడంలేదు. ఈ దుస్థితిలో తెలంగాణ హైకోర్టు ఆదివారం నాడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలు మానవతావాదులందరికీ ఊరటనిస్తాయి. కొమరం భీం జిల్లా కాగజ్నగర్ మండలం కొలాంగోందిగూడలో 67మంది గిరిజనులను టింబర్ డిపోలో నిర్బంధించారని పౌరహక్కుల సంఘం దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ షమీమ్లతో కూడిన ధర్మాసనం ఆదివారమైనా అత్యవసర అంశంగా భావించి విచారణ జరిపి వారందరికీ ఆర్నెల్లలో భూమి, ఏడాదిలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆదేశిం చింది. అంతవరకూ వారి బాగోగులకు ప్రభుత్వమే పూచీ పడాలని తేల్చి చెప్పింది. విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది చేసిన వాదనలు యదార్థమే అయి ఉండొచ్చు. పులుల సంరక్షణ కేంద్రంగా ఉంటున్న ఆ ప్రాంతానికి ఆదివాసీలు అయిదారేళ్లక్రితం వచ్చి ఉండొచ్చు. ఆయనన్నట్టు ప్రభుత్వం దృష్టిలో అది ఆక్రమణే కావొచ్చు. ఇవన్నీ నిజమే అనుకున్నా జిల్లా అధికార యంత్రాంగం వారిపట్ల వ్యవహరించిన తీరు అత్యంత అమానుషమైనది. క్షమార్హం కానిది. ఈ నెల 12న పూజ కోసం అందరూ బయటికెళ్లిన సమయంలో అధికారులు మందీమార్బలంతో వచ్చి బుల్డోజర్లతో తమ ఇళ్లు, పశువుల పాకల్ని కూల్చేశారని... అడ్డుకోవడానికి ప్రయత్నించినవారిని పోలీసులు, అటవీ సిబ్బంది కొట్టారని ఆదివాసీలు ధర్మాసనానికి చెప్పడాన్ని గమనిస్తే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అన్న సంశయం కలుగుతుంది. కొమరం భీం జిల్లాకు కలెక్టర్ ఉన్నారు. ఆదివాసీల సంక్షే మాన్ని కాంక్షించి పనిచేసే సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ఉంది. గిరిజనుల అభ్యున్నతి కోసం, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించడం కోసం ప్రజా ప్రతినిధులు న్నారు. ఇంతమంది ఉన్నా, ఇన్ని వ్యవస్థలు పనిచేస్తున్నా చివరకు ఆదివాసీలను అక్కడినుంచి పంప డానికి పోలీసులు, అటవీ సిబ్బంది, బుల్డోజర్లు తప్ప మరో మార్గం లేదనుకోవడం అధికారుల తీరును పట్టిచూపుతుంది. తాము అనుకుంటున్నవిధంగా ఆదివాసీలకు నచ్చజెప్పి ఒప్పించడానికి వారు ప్రయత్నించి ఉంటే, అందుకు సమయం పట్టినా ఓపిగ్గా వేచి ఉంటే బాగుండేది. పర్యావరణ సమతూకం సాధనకు, ఆ వ్యవస్థ మనుగడకు పులుల సంరక్షణ అత్యవసరమని, పట్టణీకరణ నానాటికీ విస్తరిస్తున్న వేళ వన్యప్రాణులను సంరక్షించడానికి వాటికోసం ప్రత్యేక ప్రాంతాలను ఏర్పర్చడమే మార్గమని వన్యప్రాణి సంరక్షణ కోసం పాటుబడేవారు చెబుతారు. అమెరికా, యూరప్లలో ఉండే ఈ భావన 70వ దశకంలో మన దేశానికి కూడా చేరింది. 1973లో ఇప్పటి జార్ఖండ్లోని లతేహార్ జిల్లాలో తొలిసారి పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటయింది. మొదట్లో 9గా ఉన్న ఈ కేంద్రాలు ఇప్పుడు 50 అయ్యాయి. ఇవి దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ సంరక్షణ కేంద్రాల్లో పులుల సంఖ్య 2,226కు చేరుకుందని 2014నాటి గణన చెబు తోంది. తాజాగా నిరుడు పులుల గణన ప్రారంభమైంది. ఈ కేంద్రాల నిర్వహణకు దేశంలో జాతీయ పులుల సంరక్షణ అథారిటీ(ఎన్టీసీఏ) పనిచేస్తోంది. వన్యప్రాణులను కాపాడి పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడం సదాశయమే. అవసరమైనదే. కానీ ఆ క్రమంలో సహజంగానే ఎన్నో సమస్యలు వస్తున్నాయి. తమకు వన్యమృగాలు, వాటికి తాము కొత్త కాదని, తరతరాలుగా వాటితో సహజీవనం చేస్తున్నామని ఆదివాసులు చెబుతున్నారు. వాటిని సంరక్షించే పేరిట అడవి నుంచి వెళ్లగొడితే తమ జీవనం ప్రమాదంలో పడుతుందని వాపోతున్నారు. 2011నాటి జనాభా లెక్కల ప్రకారం ఆదివాసీల జనాభా దాదాపు 11 కోట్లు. ఇది దేశ జనాభాలో 8.6 శాతం. 461 తెగలుగా ఉన్న ఈ ఆదివాసీల్లో దాదాపు 95 శాతంమంది అటవీ ప్రాంతాల్లోనే వ్యవసాయం చేసుకుంటున్నారు. వేట, అటవీ ఉత్పత్తులపై ఆధారపడుతున్నారు. సరిగ్గా ఈ కారణం వల్లనే వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలుండే ప్రాంతాల్లో తరచు సమస్యలు తలెత్తుతున్నాయి. ఆదివాసీల మంచికోసమే వారిని తరలిస్తున్నామని, ఇది ప్రగతిశీలమైన చర్య అని, దీనివల్ల వారు ‘ఆధునికం’ కావడానికి అవకాశాలు ఏర్పడతాయని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇలా తరలించే సందర్భాల్లో ఆదివాసీ కుటుంబాలకు కలిగే నష్టాన్ని బట్టి రూ. 20 నుంచి రూ. 25 లక్షల వరకూ పరిహారం చెల్లించాలని నిరుడు నవంబర్లో జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ సిఫార్సు చేసింది. కుటుంబానికి ఇంటి స్థలం, రెండున్నర ఎకరాల వ్యవ సాయ భూమి, కుటుంబంలో కనీసం ఒకరికి తగిన శిక్షణనిచ్చి, నైపుణ్యాభివృద్ధికి తోడ్పడి పులుల సంరక్షణ కేంద్రంతో ముడిపడి ఉండే ఉద్యోగాన్ని చూపాలని కూడా సూచించింది. ఆదివాసీలకు పునరావాసం ఏర్పరిచేచోట రోడ్లు, పారిశుద్ధ్యం తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలని తెలిపింది. ఈ సిఫార్సులన్నీ తుచ తప్పకుండా అమలు చేస్తే ఆదివాసీలకు మేలు కలుగుతుందా లేదా అన్న సంగతలా ఉంచి కనీసం వాటినైనా కొలాంగోంది గ్రామంలో అమలు చేద్దామని అధికార యంత్రాంగం చూడలేదు. పైగా ఆదివాసీలతో ఎంతో మొరటుగా ప్రవర్తించింది. ట్రాక్టర్లలో తీసుకెళ్లి కనీస సదుపాయాలు లేని టింబర్ డిపోలో అక్రమంగా నిర్బంధించింది. వన్యప్రాణులపట్ల దయ కలిగి ఉండటం, వాటి క్షేమం కోసం ఆత్రుతపడటం మంచిదే. కానీ తోటి మనుషుల పట్ల తమ ప్రవ ర్తన ఎలా ఉందో, ఎలా ఉండాలో... ఇలాంటి విపరీత పోకడ ఈ వ్యవస్థపై ఆదివాసీల్లో ఎలాంటి అభిప్రాయం కలగజేస్తుందో ఆ అధికారులు కాస్తయినా ఆలోచించారా? హైకోర్టు ధర్మాసనం జోక్యంతో ఆదివాసీలకు ఇప్పటికైతే ఉపశమనం దొరికింది. ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలన్నిటినీ పాటించి నిర్దిష్ట వ్యవధిలో వారికి పూర్తి న్యాయం చేకూర్చడానికి అధికారులు కృషి చేస్తారని ఆశిద్దాం. -
అడవి నుంచి గెంటేశారు..
కాగజ్నగర్ : గిరిజనులపై అటవీ అధికారుల దౌర్జన్యాలు హెచ్చు మీరుతున్నాయి. కుమురం భీం జిల్లా కాగజ్నగర్ మండలం కొలాంగొంది గిరిజనులను అటవీ అధికారులు అడవి నుంచి గెంటేశారు. నివాసాలను కూల్చివేసి సామగ్రితో సహా పంపేయడంతో కలప డిపోలో గిరిజనులు తలదాచుకుంటున్నారు. 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటూ సమీపంలో పోడు వ్యవసాయం చేసుకుంటూ నివాసముంటున్న మొత్తం 16 గిరిజన కుటుంబాలను రిజర్వు ఫారెస్టు భూమి పేరుతో అధికారులు ఖాళీ చేయించారు. గిరిజనులు ఉంటున్న స్థలం రిజర్వు ఫారెస్టు భూమిగా పేర్కొంటూ అటవీ అధికారులు గతంలో చాలాసార్లు సర్వేలు నిర్వహించారు. గతంలోనే ఖాళీ చేయించేందుకు ప్రయత్నించిన అధికారులు ప్రత్యామ్నాయంగా వేరే చోట వ్యవసాయ భూమి, డబుల్ బెడ్రూం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ సమయంలోనే గిరిజనుల నుంచి సంతకాలు కూడా తీసుకున్నారు. మరోవైపు అటవీ శాఖ భూమిలో పోడు వ్యవసాయం చేస్తున్నారని పేర్కొంటూ 2017లో 13 మంది గిరిజనులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. కోర్టు తీర్పు రాకముందే..! గతంలో సర్వేలు చేసిన అటవీ అధికారులు ఖాళీ చేయాలని గిరిజనులకు నోటీసులు కూడా జారీ చేశారు. దీనిపై గిరిజనులు అప్పట్లో కాగజ్నగర్కు చెందిన న్యాయవాదిని సంప్రదించడంతో ఆయన వారి తరుఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చట్ట ప్రకారం గిరిజనులకు పునరావాసం కల్పించాలని ఈ ఏడాది మార్చి 25న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి అటవీ అధికారులు కౌంటర్ ఫైల్ దాఖలు చేశారు. 2013 నుంచి మాత్రమే గిరిజనులు ఇక్కడ నివాసముంటున్నారని కోర్టుకు నివేదిక అందజేశారు. చట్ట ప్రకారం 2006కు ముందు నుంచి ఉంటున్న వారికే హక్కులు వర్తిస్తాయని పేర్కొన్నారు. కొలాంగొంది గిరిజనులకు ఎలాంటి హక్కు లు లేవని అటవీ అధికారులు వాదించారు. మంగళవారం కేసు వాదనకు రావడంతో ఒక రోజు గడువు కావాలని సదరు న్యాయవాది కోరినట్లు సమాచారం. ఆ మరుసటి రోజు బుధవారం అటవీ అధికారులు జీపీఆర్ఎస్ మ్యాప్ ఆధారంగా అక్కడ ఎలాంటి నివాసాలు లేవని, ఎప్పుడో తరలించామని సూచిం చి కోర్టును తప్పుదోవ పట్టించినట్లు తెలిసింది. అది నిజం చేయడానికే అటవీ శాఖ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా గిరిజనులను కాగజ్నగర్ కలప డిపోకు తరలించారు. కోర్టు ఆదేశాల ప్రకారమే ఖాళీ చేయించామని తెలుపుతున్న అటవీ అధికారులు సదరు కాపీ ఇవ్వాలని కోరగా స్పందించడం లేదు. ఆగమేఘాల మీద తరలింపు.. బుధవారం ఉదయం కొలాంగొందికి వచ్చిన అటవీ అధికారులు గిరిజనులను బలవంతంగా జీపులో ఎక్కించి కాగజ్నగర్ కలప డిపోకు తరలించారు. వారికి సంబంధించి పూరి గుడిసెలను ధ్వంసం చేశారు. అధికారులు అక్రమంగా తమను ఖాళీ చేయించారని, కలప డిపోలో తిండి లేక గోస పడుతున్నామని వాపోతున్నారు. చెట్టుకొకలం.. పుట్టకొకలం అయ్యాం.. మాకు ఉన్న నీడను అధికారులు కూల్చివేశారు. మేం ఇప్పడు ఎలా బతికేది. దౌర్జన్యంగా ఇళ్లను కూల్చివేశారు. ఇప్పడు మేం చెట్టుకొకలం, పుట్టకొకలం అయ్యాం. – సిడాం బాపురావు, కొలాంగొంది కోర్టు ఆదేశాల మేరకే.. కోర్టు ఆదేశాల మేరకే గిరిజనులను తరలించాం. గిరిజనులు చెప్పే మాటల్లో వాస్తవం లేదు. హైకోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు చట్ట పరిధిలో చర్యలు తీసుకున్నాం. పునరావాసం కోసం ఉట్నూర్ ఐటీడీఏ పీవో క్రిష్ణ ఆదిత్యకు నివేదిక పంపాం. అప్పటి వరకూ గిరిజనులకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం. – రాజరమణారెడ్డి, ఎఫ్డీవో, కాగజ్నగర్ -
కాగజ్నగర్లో భారీ దోపిడీ
సిర్పూర్(టి) : కుమురం భీం జిల్లా కాగజ్నగర్లోని రాజరాజేశ్వర రైసుమిల్లులో సోమవారం రాత్రి అంతర్రాష్ట్ర దొంగల ముఠా భారీ దోపిడీకి పాల్పడింది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనే నంబర్ ప్లేట్లు కలిగిన వాహనాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దుస్తుల్లో వచ్చిన దుండగులు రైస్మిల్లులోకి చొరబడి సిబ్బందిని బెదిరించి, రూ.16 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. రైసుమిల్లు యజమానులు పోలీసులకు సమాచారమివ్వడంతో వారు ఆ ప్రాంతంలోని అన్ని ఠాణాల సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో సిర్పూర్(టి) పోలీస్స్టేషన్ వద్ద 12 మంది దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కాగజ్నగర్ డీఎస్పీ హబీబ్ఖాన్ ఆధ్వర్యంలో ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
పోరుగడ్డ.. ఆసిఫాబాద్
ఆదివాసీల ఖిల్లా.. ఈ జిల్లా కొమురం భీమ్ పేరిట ఏర్పాటు నిజాం కాలం నాటి ఆనవాళ్లు ఎన్నో జల్..జంగల్..జమీన్.. అంటూ నినదించిన గిరిజన పక్ష పోరాట యోధుడు కొమురం భీమ్ పురిటిగడ్డ ఈ ఆసిఫాబాద్. ఆయనతో పాటు మరెందనో పోరాట యోధుల జన్మస్థలాలున్నది ఈ ప్రాంతంలోనే. కెరమెరి ఘాట్ల అందాలు.. సిర్పూర్ పేపర్మిల్లు, హైమన్డార్ఫ్ దంపతుల సేవలు.. మినీ ఇండియూగా కనిపించే కాగజ్నగర్.. ఇక్కడి విశేషాలు. ఒకప్పుడు జిల్లా కేంద్రం ఇప్పుడు మళ్లీ జిల్లాగా..- ఆసిఫాబాద్ ఆజంజాహి వంశ కాలంలో.. హైదరాబాద్ సంస్థానాధీశుడిగా ఉన్న ఆజంజాహి వంశానికి చెందిన నిజాం నవాబు 1907లో ఈ ప్రాంతాన్ని ఆసిఫాబాద్గా నామకరణం చేశారు. ఈ ప్రాంతం గుండా రెబ్బెనలో ఉన్న రైల్వేస్టేషన్ను ఆసిఫాబాద్ రోడ్గా మార్చారు. 1913 నుంచి 1940 వరకు ఇది జిల్లా కేంద్రంగా ఉండేది. ఆ తరువాత జిల్లా కేంద్రం ఆదిలాబాద్ తరలిపోయినా, ఆసిఫాబాద్ మాత్రం విశిష్టతను కాపాడుకుంటూ వస్తుంది. నిజాం నాటి కార్యాలయ భవనాలు నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తాయి. ఆసిఫాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మొన్నటి వరకు నిజాం కాలం భవనంలోనే కొనసాగింది. జిల్లా ప్రత్యేకత జల్ జంగల్ జమీన్ కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన గోండు వీరుడు కొమరం భీమ్ వర్ధంతి ఏటా ప్రభుత్వం కెరమెరి మండలం జోడేఘాట్లో నిర్వహిస్తుంది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ నియోజకవర్గ మొదటి ఎమ్మెల్యే కావడం, రాష్ట్రంలో మొదటి గిరిజన పట్టభద్రుడు కొట్నాక భీమ్రావు నియోజకవర్గానికి చెందిన వారు కావడం విశేషం. నిజాం మెచ్చిన గ్రామంగా పేరొందిన ఆసిఫాబాద్ ఒకప్పటి జిల్లా కేంద్రం. మొట్టమొదటి ఆర్టీసీ డిపో కూడా ఇక్కడే ఏర్పాటైంది. జైనూరు మండలం మార్లవాయిలో గిరిజనులకు సంక్షేమ ఫలాలందించిన శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ హెమండార్ఫ్ దంపతుల సమాధులున్నాయి. కెరమెరి ఘాట్లు ప్రకృతి అందాలకు కనువిందు, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పూలాజీ బాబా క్షేత్రం కూడా నియోజకవర్గంలోనే ఉంది. దీంతో పాటు పట్టణంమలోని శిర్డీ సాయి మందిరం కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది. ఆసిఫాబాద్ మండలంలో కొమురం భీమ్, వట్టివాగు, తిర్యాణిలో చెలిమెల వాగు, కాగజ్నగర్ నియోజకవర్గంలో జగన్నాథ్పూర్ ప్రాజెక్టులున్నాయి. రెబ్బెన మండలంలోని గంగాపూర్లో వేంకటేశ్వర దేవాలయం, కాగజ్నగర్ మండలం ఈజ్గాంలో శివమల్లన్న దేవాలయం, టొంకిని హనుమాన్ ఆలయం ప్రసిద్ది చెందినవి. ఇక్కడి రైతులు రికార్డు స్థాయిలో పత్తి పండిస్తారు. దీంతో పారిశ్రామికంగా జిన్నింగు, ఆయిల్ మిల్లులు వెలిశాయి. రెబ్బెన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైల్వేస్టేషన్కు ఆసిఫాబాద్ రోడ్ పేరు పెట్టారు. కాగజ్నగర్లో రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఎస్పీఎం పేపర్ మిల్లు, సర్సిల్క్ మిల్లులు మూత పడ్డాయి. క్రీశ 1700 శతాబ్దంలో ఆసిఫాబాద్ను సుమారు 200 సంవత్సరాలు గోండు రాజులు పరిపాలించినట్లు చరిత్ర చెబుతుంది. అభివృద్ధి వైపు... ఆసిఫాబాద్ను కొమురం భీమ్ జిల్లాగా ప్రకటించడంతో ఇ క్కడి ప్రజల్లో అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇక్కడ కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతో పాటు సుమారు 60 శాఖలకు చెందిన జిల్లా కార్యాలయాలు ఏర్పాటుతో సుమారు 2 వేలకు పైగా ఉద్యోగుల సంఖ్య పెరగనునుంది. జిల్లా కేంద్రంలో విద్య, వైద్యం, రోడ్లు, కనీస సౌకర్యాలు లేవు. తాజాగా జిల్లా ప్రకటనతో జిల్లాలో రోడ్లు, తాగునీరు, డ్రెయినేజీ వ్యవస్థ, వైద్య సేవలు మెరుగుపడనున్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆస్పత్రి 500 పడకల ఆస్పత్రిగా స్థాయి పెరిగింది. హోటళ్లు, లాడ్జిల సంఖ్య పెరగనుంది. జిల్లా ఏ ర్పాటుతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అద్దె ఇళ్లకు సై తం డిమాండ్ పెరిగింది. జిల్లా నలుమూలల నుంచి ఇక్కడ వివిధ పనుల కోసం వచ్చే ప్రజలతో వ్యాపారం గణనీయం గా అభివృద్ధి చెందుతుందే అవకాశాలున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మించే అవకాశాలున్నా యి. జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలతో ఆర్టీసీ బస్సుల సంఖ్య, ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. జిల్లాలో వ్యవసా యాభివృద్ధికి సమృద్దిగా వనరులున్నాయి. మండలంలోని కొమురంభీమ్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా 45,500, వట్టివాగు ప్రాజెక్టు ద్వారా 24,500 ఎకరాల ఎకరా ల ఆయకట్టుకు సాగునీరందనుంది. దీంతో పంట పొలాలు, చేలు సస్యశామలమవుతాయి. వ్యవసాయాభివృద్ధి జరుగుతుంది. జిల్లా అధికారులతో పాటు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సంఖ్య గణనీయంగా పెరగడంతో జిల్లా కేంద్రంలో కార్పొరేట్ స్థాయి ఆస్పత్రులూ ఏర్పాటవొచ్చు. దీంతో పాటు ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల సంఖ్య పెరిగి గ్రామీణ ప్రాంతంలో అక్షరాస్యత పెరిగే అవకాశాలున్నాయి. -
ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
కాగజ్నగర్ రూరల్ : మండలంలోని న జ్రూల్నగర్ గ్రామ పంచాయతీ పరిధి విలేజ్ నం.5కు చెందిన రమాసహా(24) తన ఇంట్లో ఆదివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతోనే ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని ఈజ్గాం ఎస్సై శివకుమార్ తెలిపారు. కానీ ఆమె ఆత్మహత్యకు పలువురి వేధింపులు కారణమని తెలుస్తోంది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో బోల్తా: ఆరుగురికి గాయాలు
కాగజ్నగర్: ఆటో బోల్తాపడి ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం బోడేపల్లిలో చోటుచేసుకుంది. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. -
ఊయలే ఉరితాడై..
⇒ ఊయలలోనే ఆగిన చిన్నారి ఊపిరి ⇒ ఊపిరాడక చిన్నారి మృతి ⇒ కోయవాగులో విషాదం కాగజ్నగర్ రూరల్ : పిల్లలు సరదాగా ఊగేందుకు చీరతో తయారుచేసిన ఊయలే ఆ చిన్నారి పాలిట ఉరితాడైంది. ఎంతో సంతోషంగా ఊ యలలో ఊగుతున్న ఆ చిన్నారి ప్రాణాలను బ లితీసుకుంది. అప్పటి వరకు ఇంట్లోనే ఆనందంగా గంతులేస్తూ కలి యదిరిగిన తమ బిడ్డ ఇక లేదని తెలుసుకుని ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు అందరినీ కలిచివేసింది. కాగజ్నగర్ మండలం కోయవాగులో చోటుచేసుకుందీ ఘట న. కోయవాగు గ్రామానికి చెందిన మారిశెట్టి మల్లేష్-సుజాతలకు ఇద్దరు కూతుళ్లు కీర్తన, అక్షయ, కుమారుడు అభినయ్ ఉన్నారు. రెండో కుమార్తె అక్షయ (7) కాగజ్నగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. తండ్రి ఓ ప్రైవేట్ చిట్ఫండ్ కం పెనీలో పనిచేస్తున్నాడు. గురువారం పాఠశాలకు వెళ్లి వచ్చిన అక్షర ఇంటి వెనకాల చీరతో తయారు చేసిన ఊయలలో ఊగుతోంది. తల్లి ఇంటి ముందున్న బోరు నుంచి నీళ్లు తెచ్చేందుకు వెళ్లింది. కూతురు ఊయల ఊగుతూ ఆడుకుంటోందని ఊహించిందే తప్ప ఆ ఊయలే ఉరితాడై బిగుస్తుందని ఆ తల్లి ఊహించలేదు. బోరు నీటిని తీసుకుని ఇంట్లోకి రాగానే కూతురు ఊయలలోనే సృ్పహతప్పి పడిపోయి ఉండడంతో ఒక్కసారి గా చలించిపోయింది. తన కూతురు ప్రాణాలు దక్కిం చుకోవాలని తల్లి ఇరుగుపొరుగు వారి సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే మార్గమధ్యలో ఆ చిన్నారి ప్రా ణాలు కోల్పోయింది. ఇంట్లో కలియ తిరుగుతూ ఆడు తూ పాడుతూ ఉండే తమ కూతురు ఇక లేదని తెలిసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
పేపర్మిల్లును ప్రభుత్వమే నడపాలి
కాగజ్నగర్ టౌన్ : కాగజ్నగర్లోని సిర్పూర్ పేపర్ మిల్లును ప్రభుత్వమే నడపాలని, ఉత్పత్తి ప్రారంభించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఐ శాసనసభాపక్ష మాజీ నేత, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ డిమాండ్ చేశారు. రోజురోజుకు మిల్లు సమస్య జటిలమవుతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టిం చుకోకపోవడాన్ని నిరసిస్తూ ఎస్పీఎం కార్మిక సంఘాల ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు మిల్లు ప్రధాన ద్వారం ఎదుట ధర్నా నిర్వహించారు. గుండా మల్లేశ్ హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. పని దొరకక, తద్వారా వేతనాలు రాక 1600 మంది కాంట్రాక్టు కార్మికులు అర్ధాకలితో అలమటిస్తుంటే ప్రభుత్వం మౌనం వహించద ని ఆరోపించారు. మరోవైపు యాజ మాన్యం ఉత్పత్తిని పూర్తి స్థాయిలో నిలిపివేసి, మిల్లును మూతబడే దశకు తీసుకువస్తోందని, అయినా ముఖ్యమంత్రి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పేపర్ మిల్లులో ఉత్పత్తి నిలిచిపోవడంతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారని, పట్టణం మొత్తంలో వ్యాపారాలు పడిపోయాయన్నారు. కార్మికుల పక్షాన ఢిల్లీ దాకా పోరాడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు ఈర్ల విశ్వేశ్వర్రావు, ముర ళి, షబ్బీర్ అహ్మద్ (చోటా), ముంజం శ్రీనివాస్, వెంకటేశ్, అంబాల ఓదేలు, వేణు, వొల్లాల సుభాష్, రాజ్గోపాల్, భూమయ్య, హఫిజ్ఖాన్, అన్నం రాజయ్యతో పాటు కార్మికులు పాల్గొన్నారు. మరో వైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా డీఎస్పీ గుమ్మి చక్రవర్తి ఆధ్వర్యంలో పట్టణ సీఐ జలగం నారాయణరావు, ఎస్పై అబ్దుల్మజీద్ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మిల్లును పునరుద్ధరించండి ఆదిలాబాద్ అర్బన్ : సిర్పూర్ కాగజ్నగర్ పేపర్ పరిశ్రమలో ఉత్పత్తి నిలిపివేసి దాదాపు నాలుగు నెలలు గడుస్తుందని, వెంటనే పునరుద్ధరించి కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ నాయకులు కలెక్టర్ ఎం.జగన్మోహన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ పరిశ్రమలో సుమారు పర్మినెంట్ కార్మికులు 1500 మంది, కాంట్రాక్టు కార్మికులు 600 మంది, స్టాఫ్ 600 మంది పని చేస్తున్నారన్నారు. గత నాలుగు నెలలుగా పరిశ్రమ ఉత్పత్తి నిలిపివేయడంతో కాంట్రాక్టు కార్మికులు వీధిన పడ్డారన్నారు. డిసెంబర్ నుంచి పర్మినెంట్ కార్మికులకు సైతం వేతనాలు నిలిపివేశారని, దీంతో ఆ కుటుంబాలు ఇబ్బందుల పాలవుతున్నాయన్నారు. జిల్లాలో ఉన్న ఏకైక పేపర్ పరిశ్రమ మూతపడకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.మల్లేశ్, పోశెట్టి, స్వామి, మయూరిఖాన్ ఉన్నారు. -
కొనసాగుతున్న కార్మికుల ఆందోళన
కాగజ్నగర్టౌన్ : కాగజ్నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు కాంట్రాక్టు కార్మికుల ఆధ్వర్యంలో ఆందోళలు కొనసాగుతూనే ఉన్నాయి. పేపర్ మిల్లులో ఉత్పత్తి నిలిచి 46 రోజులు గడుస్తున్నా యాజమాన్యం గానీ, ప్రభుత్వంగానీ స్పందించకపోవడం, డ్యూటీలు లభించకపోవడంతో కాంట్రాక్టు కార్మికులు ఆందోళన బాట పట్టారు. బుధవారం పట్టణంలో భిక్షాటన చేసిన కార్మికులు, గురువారం మిల్లు ప్రధాన ద్వారం వద్ద వంటావార్పు చేసి నిరసన తెలిపారు. పేపర్ మిల్లులో ఉత్పత్తి నిలిచిపోవడంతో అందులో పని చేసే 1600 మంది కాంట్రాక్టు కార్మికులు రోడ్డున పడ్డారని, విధులు దొరకక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని కాంట్రాక్టు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయకుండా కాంట్రాక్టు కార్మికులకు విధుల నుంచి దూరం చేయడం విడ్డూరమన్నారు. కాంట్రాక్టు కార్మికుల ఆందోళనకు సిర్పూర్ పేపర్ మిల్లు ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) నాయకులు సంపూర్ణ మద్దతు పలికారు. సంఘం నాయకులు అంబాల ఓదెలు వంటావార్పు కార్యక్రమంలో పాల్గొని కార్మికుల పక్షాన ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్తింపు కార్మిక సంఘం నాయకులు కాంట్రాక్టు కార్మికుల సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. పేపర్ మిల్లు పరిస్థితులను చక్కదిద్దే బాధ్యత తీసుకునేందుకు అధికార గుర్తింపు సంఘం నాయకులు ముందుకు రావాలన్నారు. గుర్తింపు సంఘం నాయకుల వైఫల్యంవల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికుల సంఘం 6 మన్ కమిటీ నాయకులు గొలెం వెంకటేశ్, యాకబ్, అంజయ్య, ఎస్కే నవాబ్, ఎమ్మాజీ సంతోష్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ లీక్ ... దంపతులకు తీవ్ర గాయాలు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కాగజ్నగర్లో గురువారం అర్థరాత్రి ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అయింది. దాంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దంపతులకు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్తో మంటలార్పారు. స్థానికుల సహాయంతో పోలీసులు ఆ దంపతులను ఆసుపత్రికి తరలించారు. భర్త పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో అతడికి మెరుగైన వైద్య చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. -
వినియోగంలోకి తెస్తే ప్రతిష్టాత్మకమే..
కాగజ్నగర్ రూరల్ : కాగజ్నగర్ మండలం గన్నారం గ్రామ సమీపంలో 21వ శతాబ్ది గురులకు విద్యాలయం కోసం నిర్మించిన అధునాతన భవనాలు నాలుగేళ్లుగా నిరుపయోగంగా మారాయి. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథాగా మారింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 12 కోట్లతో నిర్మించిన అధునాన భవనాలు నాలుగేళ్లుగా నిరూపయోగంగా ఉండి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఇంటర్ విద్యను పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజనీరింగ్తోపాటూ ఇతర సాంకేతిక విద్యను అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం 21వ శతాబ్ధి గురుకులాలను మంజూరు చేసింది. ఎంసెట్లో సీటు రాని విద్యార్థులకు ప్రత్యామ్నాయంగా ఇంజనీరింగ్ విద్య అందించాలనే లక్ష్యంతో ఐదేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైస్ రాజశేఖర్రెడ్డి 21వ శతాబ్ధి గురుకులాలకు రూపకల్పన చేశారు. వీటి నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర సాంకేతిక విద్యా మండలికి అప్పగించారు. ఇందులో భాగంగా జిల్లాలోని కాాగజ్నగర్ మండలం గన్నారంలో గురుకుల భవనాలు నిర్మించారు. గ్రామ సమీపంలోని 50 ఎకరాల భూమి కేటాయించి రూ. 12 కోట్లు విడుదల చేశారు. 12 కోట్లతో భనవ నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఎనిమిది బ్లాకులు, 384 గదులతో అధునాతన సౌకర్యాలతో భవనాల నిర్మాణం చేపట్టారు. ఒక్కో బ్లాక్కు మూడు అంతస్తులు, ప్రతీ అంతస్తుకు 16 చొప్పున మొత్తం 384 గదులను నిర్మించారు. 2010 సంవత్సరం నాటికే ఈ భవనాల నిర్మాణం పూర్తయ్యింది. సుమారు ఐదు వేల మంది విద్యార్థులకు వసతీసౌకర్యం కల్పించేలా అధునాతన ఏర్పాట్లు చేపట్టారు. కానీ అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి మృతి చెందడంతో అనంతర కాలంలో ఈ గురుకులాల గురించి పట్టించుకునేవారు లేకపోవడంతో ఈ భవనాలు నిరూపయోగంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వమైనా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైనా ఈ భవనాలను పట్టించుకుని వినియోగంలోకి తేవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. 50 ఎకరాల విశాల స్థలంలో అధునాతన భవనాలు నిర్మించి ఉండడంతో ఇక్కడ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు పూర్తి అనుకూల వాతావరణ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇక్కడ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తేనే భవనాలు వినియోగంలోకి రావడమే కాకుండా ఈ ప్రాంతంకూడా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. ఇప్పటికే సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు ఈ భవనాలను వినియోగంలోకి తెచ్చే విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు వివరించారు. ఈ భవనాలను గిరిజన యూనివర్శిటీకి కేటాయించాలని కోరుతూ సీఎం చంద్రశేఖర్రావుకు వివరించడం జరిగిందని, అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విద్యార్థులకు ఈ భవనాలను ఉపయోగంలోకి తీసుకువచ్చేందుకు సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఈ భవనాలను వినియోగంలోకి తీసుకువస్తే జిల్లాకే తలమానికం కానున్నాయి. -
ఆంధ్రప్రదేశ్కు బై బై
కాగజ్నగర్ రూరల్, న్యూస్లైన్ : సమైక్య ఆంధ్రప్రదేశ్కు వీడ్కోలు పలికేందుకు తెలంగాణ సిద్ధమైంది. జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించనుంది. దీంతో సుమారు ఐదున్నర దశాబ్దాలకు పైగా కొనసాగిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన గుర్తులు చెరిగిపోనున్నాయి. ఇక పాత రాష్ట్రానికి సంబంధించిన బోర్డు ఈ ఒక్క రోజు కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై తెలంగాణ ప్రభుత్వం పేరుతో బోర్డులు రాయాలన్న ఆదేశాలను అధికారులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమ కల సాకారం కాబోతోందన్న సంబరాల్లో ఉన్నారు. కోటి ఆశలతో కొత్త రాష్ట్రంలో పని చేయడానికి ఉద్యోగులు, సామాన్యులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ సంబరాలను మే 30, 31న నిర్వహించగా.. ఆదివారం సెలవు దినం కావడంతో ఆంధ్ర రాష్ట్రానికి బై బై చెబుతూ తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం పలికేందుకు అధికారులు, ప్రజలు సిద్ధమవుతున్నారు. జూన్ ఒకటి ఆదివారం కావడం, జూన్ 2న సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఉద్యోగులందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చివరి వర్కింగ్ డే ముగిసింది. ఇప్పటికే మే నెలకు సంబంధించిన వేతనాలు పొందారు. ఫిబ్రవరిలో యూపీఏ ప్రభుత్వం పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేసిన నాటి నుంచి ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు పని చేస్తామా అన్న ఆసక్తితో ఉన్నారు. జూన్ 23వరకు ఎన్నికల కోడ్ ఉండగా.. అది తొలగినప్పటికీ ఎలాంటి పనులు చేయలేకపోయిన ఉద్యోగులు వారి ఆశలకు అనుగుణంగా అపాయింటెడ్ డే దగ్గర పడింది. ఇన్నాళ్లూ సమైక్య రాష్ట్రంలో పనిచేసిన ఉద్యోగులు ఒక్కసారిగా స్వంత రాష్ట్రంలో పనిచేయబోతున్నామనే భావన వారిలో ఆనందాన్ని నింపుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగ సంఘాలు లక్ష్యం నెరవేరడంతో రాష్ట్ర ప్రగతిలోనూ కీలక పాత్ర పోషించాలని సామాన్య ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మారనున్న బోర్డులు ప్రభుత్వ కార్యాలయాల బోర్డులన్నీ ఆదివారం రోజు మారిపోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనే పదాలను తొల గించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనే బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. సకలజనుల సమ్మె కాలంలోనే ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ ఆంధ్రప్రదేశ్ తొలగించి టీజీ అన్న అక్షరాలను ఉద్యమకారులు రాసినప్పటికీ.. అధికారికంగా వాటికి విలువ లేకుం డా ఉన్నాయి. రాష్ట్రం ఏర్పాటు కానుండడంతో జూన్ 2న తెలంగాణ రాష్ట్ర సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనే బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వారి ఆదేశాలకు అనుగుణంగా ఆదివారం బోర్డులు మారనున్నాయి. తమ చిరకాల వాంఛ ఇన్నాళ్లకు తీరుతోందని ఉద్యోగ సంఘాలు, ఉద్యమకారులు సంబరాలకు సిద్ధమవుతున్నారు. -
కొత్త ప్రభుత్వంతో పనిచేయించాలి
కాగజ్నగర్ రూరల్/తాండూర్, న్యూస్లైన్ : ఎన్నో పోరాటాల ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వమే కదా అని ఊరుకోకుండా ప్రభుత్వంతో పనిచేయించాల్సిన బాధ్యత మనపై ఉందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. గురువారం కాగజ్నగర్ పట్టణంలోని ఎస్పీఎం హెచ్ఆర్డీ హాల్లో తెలంగాణ జేఏసీ, విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ‘భవిష్యత్ తెలంగాణలో మన కర్తవ్యం’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుని సాధారణ ప్రజలకు అభివృద్ధి ఫలాలు దక్కేలా చూడాలని పేర్కొన్నారు. ఆంధ్రా పాలకులు కుట్రలు చేస్తున్నారు.. రాష్ట్ర ఏర్పాటు చివరి దశలో ఢిల్లీలో ఆంధ్రాపాలకులు ఎన్నో కుట్రలు పన్నారని, రాష్ట్రం ఏర్పడిన వారి కుట్రలు కొనసాగుతున్నాయన్నారు. పోలవరంలోని ముంపు మండలాలను ఆంధ్రాలో కలపుతూ హడావుడిగా ఆర్డినెన్స్ ఎందుకు జారీ చేయాల్సి వచ్చిందన్నారు. చంద్రబాబు కుట్ర ఫలితంగానే ఇదంతా జరుగుతోందన్నారు. భద్రాచలంలోని ఆదివాసీల అభిమతం పరిగణలోకి తీసుకోకుండా ఆంధ్రాలో కలపడం అప్రజాస్వామ్యమన్నారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసానని చెబుతున్న చంద్రబాబు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులనే అభివృద్ధి చేశారన్నారు. గతంలో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా ఇక్కడ పుష్కలంగా వ్యాపారాలు జరిగేవని, రామగుండం, పెద్దపల్లి, కాగజ్నగర్లను కలుపుతూ పారిశ్రామిక కారిడార్గా ఏర్పాటు చేస్తూ నిజాం సర్కారు రైల్వేమార్గం ఏర్పాటు చేసిందన్నారు. పారిశ్రామికాభివృద్ధి ద్వారానే ఉపాధిమార్గాలు పెంపొందుతాయన్నారు. ఆ దిశగా తెలంగాణ పునఃర్నిర్మాణం చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు కోదండరాంను సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యావంతుల వేధిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు గురిజాల రవీందర్, జిల్లా అధ్యక్షుడు సంజీవ్, జేఏసీ తాలుకా కన్వీనర్ వజ్జల కిశోర్కుమార్, టీవీవీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం విస్తారు, కమల్, జిల్లా ఉపాధ్యక్షుడు దొంతి లింగారెడ్డి, రవీందర్, మధుసూధన్, జేఏసీ నాయకులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, జాకిర్, బాబన్న, సంతానం, తెలంగాణవాదులు పాల్గొన్నారు. విలువలతో కూడిన విద్య బోధించాలి.. కార్పొరేట్ విద్యావ్యవస్థల్లో విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తూ విద్యాబోధన జరుగుతోందని, విలువలతో కూడిన విద్యా బోధనందించాలని కోదండరాం అన్నారు. గురువారం పట్టణంలో సుప్రభాత్ స్కూల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు చారి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాఠశాల, ఇంటర్లో ఒత్తిడికి గురి చేయడం ద్వారా తరువాత విద్యార్థులు పక్కదారి పడుతున్నారన్నారు. అనంతరం తరగతి గదులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గణపురం మురళి, టౌన్ ఎస్హెచ్వో రవికుమార్, మున్సిపల్ కమిషనర్ కుమారస్వామి, కాగజ్నగర్, దహెగాం ఎంఈవోలు దేవాజీ, స్వామి, ప్రముఖ వైద్యులు శ్రీనివాస్, అనిత, జేఏసీ కన్వీనర్ కిశోర్కుమార్, బీజేపీ నాయకుడు అమర్సింగ్ తిలావత్, నాయకులు సత్యనారాయణ, లింగారెడ్డి, పురుషోత్తమచారి, శ్రీనివాస్, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. గిరిజనులకు అన్యాయం చేస్తే సహించం.. తెలంగాణలోని అమాయక గిరిజనులకు అన్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడితే సహించబోమని కోదండరాం హెచ్చరించారు. గురువారం తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులతో కలిసి తాండూర్కు వచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలవరంపై కేంద్ర ప్రభుత్వం ఇరు ప్రాంతాల ప్రభుత్వాలతో చర్చలు జరిపి అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఒక ప్రాంతానికే మద్దతు తెలిపే విధంగా నిర్ణయాలు తీసుకుంటే ఆందోళనలకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఆయన వెంట గురిజాల రవీందర్రావు, జిల్లా అధ్యక్షుడు రవి, పీఓడీఈటీ ఉపాధ్యక్షులు సంతోష్కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కమల్, జిల్లా కో-కన్వీనర్ పురుషోత్తం, సభ్యులు తొగరి శ్రీనివాస్, బాపన్న, మధుసూదన్, శశికుమార్, సుధాకర్ పాల్గొన్నారు. -
‘పుర’ పోలింగ్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ప్రధాన ఘట్టం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భైంసా, బెల్లంపల్లి, కాగజ్నగర్ మున్సిపాలిటీల్లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఆరు బల్దియాల్లో 189 వార్డులు ఉండగా, ఆదిలాబాద్లోని 34వ వార్డు, భైంసాలో మూడో వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 187 వార్డులకు ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆరు పట్టణాల్లో 3.57 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 325 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పర్యవేక్షక అధికారులతో పాటు, ప్రత్యేక అధికారులను నియమించారు. ఎన్నికల సిబ్బంది శనివారం సాయంత్రానికే ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లతో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఎన్నికల ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిశీలించింది. 1,095 అభ్యర్థుల్లో అదృష్టవంతులెవరో.. మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం 2010 సెప్టెంబర్లో ముగిసింది. సుమారు నాలుగేళ్లుగా బల్దియాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఎట్టకేలకు ఈనెల 3న మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 10 నుంచి 14 వరకు నామినేషన్లు స్వీకరించారు. ప్రధాన, ప్రధానేతర పార్టీలతోపాటు, స్వతంత్రులు కౌన్సిలర్ పదవులకు భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. ఈనెల 15న నామినేషన్ల పరిశీలన పూర్తవగా, చాలా మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈనెల 18న బరిలో ఉండే 1095 అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఈ అభ్యర్థులు పది రోజులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ప్రారంభంలో హంగు, ఆర్భాటం లేకుండా సాగిన ప్రచారం, చివరిరోజు శుక్రవారం మాత్రం హోరెత్తింది. శనివారం అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపారు. డబ్బు, మద్యం పంపకాలతో ఓటర్లను ప్రలోభపెట్టారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఓటు హక్కు వినియోగంపై విస్తృతంగా ప్రచారం జరిగింది. ఎన్నికల సంఘంతోపాటు, పలు స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంఘాలు ఓటు హక్కు ప్రాధాన్యతపై ప్రచారం నిర్వహించాయి. భారీ బందోబస్తు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. పోలింగ్ జరుగుతున్న ఆరు మున్సిపాలిటీల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. భైంసా, నిర్మల్ మున్సిపాలిటీల్లో 43 అత్యంత సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రత్యేక బలగాలు మోహరించాయి. ఏపీఎస్పీ, సీఆర్పీఎఫ్ కంపెనీలను దించారు. ఆరు మున్సిపాలిటీల్లో 326 పోలింగ్ కేంద్రాలుండగా, 136 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా పోలీసు శాఖ గుర్తించింది. 165 సమస్యాత్మక కేంద్రాలుగా భావిస్తోంది. జిల్లా ఎస్పీ గజరావు భూపాల్తోపాటు, ఇద్దరు అదనపు ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 80 మంది ఎస్సైలు, 70 ఏఎస్సైలు ఎన్నికల బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. జిల్లా పోలీసు సిబ్బంది.. 220 హెడ్కానిస్టేబుళ్లు, 1,200 మంది కానిస్టేబుళ్లు, 80 మంది హోంగార్డులు, 40 మంది మహిళా కానిస్టేబుళ్లు ఎన్నికల విధులను నిర్వహిస్తున్నారు. ఏపీఎస్పీ నాలుగు కంపెనీలు, ఒక సీఆర్పీఎఫ్ కంపెనీల బలగాలను పట్టణాల్లో మోహరించారు. -
ఆక్రమణల తొలగింపుపై ఉద్రిక్తత
కాగజ్నగర్/కాగజ్నగర్ రూరల్, న్యూస్లైన్ : కాగజ్నగర్లో ఆక్రమణల తొలగింపు పర్వం శుక్రవారం కూడా కొనసాగింది. గురువారం సాయంత్రం ప్రారంభమైన తొలగింపు కార్యక్రమం రాత్రి 3 గంటల వరకు కొనసాగింది. తిరిగి శుక్రవారం ఉదయం 7 గంటలకే తొలగింపు కార్యక్రమం ప్రారంభించారు. శుక్రవారం అంబేద్కర్ చౌరస్తా నుంచి మొదలుకుని పీహెచ్సీ రోడ్డు, ఇందిరామార్కెట్, రైల్వేస్టేషన్ ఏరియా, మెయిన్మార్కెట్, బస్టాండ్ ఏరియా, ఎన్టీఆర్ చౌక్, ఈఎస్ఐ ఆస్పత్రి, వెంకటరమణ థియేటర్ ప్రాంతాల్లోని అక్రమ కట్టడాలను తొలగించారు. ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ బాలాజీ దిగంబర్ నేతృత్వంలో తొలగింపు కార్యక్రమం చేపడుతున్నారు. పట్టణంలో ఐదు జేసీబీలు ఏర్పాటు చేసి వ్యాపారస్తులకు గడువు ఇవ్వకుండా అక్రమ కట్టడాలను తొలగిస్తుండడంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. తహశీల్దార్ మల్లేశ్, ఎంపీడీఓ సత్యనారాయణసింగ్, మున్సిపల్ డీఈ కృష్ణలాల్, సిర్పూర్(టి) తహశీల్దార్ రమేశ్గౌడ్లను ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జేసీబీల వద్ద ఇన్చార్జీలుగా నియమించారు. గతంలో ఎన్నడూలేని విధంగా పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా సమయం ఇవ్వకుండా అధికారులు జేసీబీలతో కూలుస్తుండంపై వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. తమకు కనీసం సమయం ఇవ్వాలని కోరుతున్నా స్థానిక అధికారులు పట్టించుకోవడంలేదు. గాంధీచౌక్ గుండా కొత్తరోడ్డు పట్టణంలో కొందరు ఆక్రమణదారుల వల్ల ఉన్న రోడ్లు కూడా కనిపించకుండా పోయాయి. అధికారుల ఆక్రమణల తొలగింపుతో గాంధీచౌక్ ముందు భాగం నుంచి సరోజినీదేవి రోడ్డు వరకు ఉన్న రోడ్డు వెలుగులోకి వచ్చింది. ఇన్నా ళ్లు అక్రమ కట్టడం ఉండడంతో రోడ్డు మూసివేతకు గురైంది. అక్రమణలు తొలగించేందుకు అధికారులు రాగా స్థానికులు జేసీబీని అడ్డుకున్నారు. సబ్కలెక్టర్ అక్కడికి చేరుకుని మున్సిప ల్ ప్లాన్ను పరిశీలించారు. గల్లిరోడ్డును ఆక్రమించి నిర్మాణం చేపట్టారని, నిర్మాణాన్ని తొల గించారు. ప్రస్తుతం రోడ్డు ఏర్పాటు కావడంతో పట్టణవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారీ బందోబస్తు అక్రమ కట్టడాల కూల్చివేత సందర్భంగా పట్టణంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ సురేశ్బాబు ఆధ్వర్యంలో పట్టణంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఐలు పృథ్వీధర్రావు, రహ్మాన్, ఎస్సైలు సాదిక్అహ్మద్, తిరుపతితోపాటూ ఏఎస్సైలు బందోబస్తు నిర్వహించారు. మంత్రికి ఫిర్యాదు చేస్తా.. - కావేటి సమ్మయ్య, ఎమ్మెల్యే ఆక్రమణల తొలగింపుపై మున్సిపల్ మంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య తెలపారు. ఆయన ఫోన్లో విలేకరులతో మాట్లాడారు. గత కొన్నేళ్లుగా వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న వారికి అధికారుల ఏకపక్ష నిర్ణయంతో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. బాధితులను ఆదుకోవాలి.. - కోనప్ప, మాజీ ఎమ్మెల్యే పట్టణంలోని రోడ్ల వెడల్పు వల్ల జీవనోపాధి కోల్పోతున్న బాధితులను ఆదుకోవాలని సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఎన్టీయార్ చౌరస్తా వద్ద సబ్కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నారు. కొన్ని అక్రమ కట్టడాలను చూసిచూడనట్లు వదిలివేసి అమాయకుల కట్టడాలను కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. నిబంధనల మేరకు అన్ని అక్రమకట్టడాలను తొలగిస్తానని సబ్కలెక్టర్ హామీ ఇచ్చారు. -
అక్రమ కట్టడాల కూల్చివేత
కాగజ్నగర్/కాగజ్నగర్ రూరల్, న్యూస్లైన్ : కాగజ్నగర్ పట్టణంలో గురువారం అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ ఉద్రిక్తతకు దారితీసింది. పట్టణంలో ప్రధాన రహదారుల వెంబడి ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలని బల్దియూ అధికారులు గతంలో వ్యాపారులకు పలుమార్లు నోటీసులు అందించినా వారు ఆక్రమణలను తొలగించలేదు. దీంతో గురువారం సాయంత్రం మున్సిపల్ ప్రత్యేకాధికారి, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ బాలాజీ దిగంబర్ మంజూలే సమక్షంలో సిబ్బంది జేసీబీ సాయంతో అక్రమ కట్టడాల కూల్చివేత ప్రారంభించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆక్రమణలను కూల్చడంపై పలువురు వ్యాపారులు నిరసన తెలిపారు. గతంలోనే నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతోనే తొలగిస్తున్నామని మున్సిపల్ అధికారులు బదులిచ్చారు. దీంతో అధికారులు, వ్యాపారులకు మధ్య వాగ్వాదం తలెత్తి ఉద్రిక్తతకు దారితీసింది. డీఎస్పీ సురేశ్బాబు, టౌన్ ఎస్హెచ్వో పృథ్వీధర్రావు జోక్యంచేసుకుని వ్యాపారులను సముదారుుంచారు. విషయం తెలిసి ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య అక్కడికి చేరుకుని వ్యాపారులతో మాట్లాడారు. అకస్మాత్తుగా దుకాణ సముదాయూల ఎదుట ఉన్న షెడ్లను తొలగిస్తే తాము నష్టపోతామని వ్యాపారులు ఆయనకు విన్నవించారు. జేసీబీపైకి ఎక్కి తొలగింపు ప్రక్రియను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఎమ్మెల్యే సబ్కలెక్టర్తో మాట్లాడి ఆక్రమణల తొలగింపునకు గడువు ఇవ్వాలని కోరారు. ఇందుకు సబ్కలెక్టర్ అంగీకరించకపోవడంతో సుమారు గంటసేపు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. అనంతరం ఎమ్మెల్యే వెళ్లిపోవడంతో అధికారులు తొలగింపు ప్రక్రియను రాత్రి వరకూ కొనసాగించారు. రాజీవ్గాంధీ చౌరస్తా నుంచి తీరందాజ్ టాకీసు పరిసర ప్రాంతాలతోపాటు ఆర్పీ రోడ్ వరకు ఇరువైపులా ఉన్న ఆక్రమ కట్టడాలను తొలగించారు. కార్యక్రమంలో తహశీల్దార్ మల్లేశ్, టీపీబీవో ఖాజాషరీఫ్, డీఈ కృష్ణలాల్, మేనేజర్ మల్లిఖార్జునస్వామి, ఆర్ఐ ముస్తఫా, ఆర్వో అంజయ్య, రూరల్ ఎస్సై తిరుపతి, ఏఎస్సైలు రాజేశ్వర్, మోహన్ప్రసాద్ పాల్గొన్నారు.