Srimantudu
-
కొరటాల శివపై కోర్టు సీరియస్
హైదరాబాద్: 'శ్రీమంతుడు' సినిమా దర్శక నిర్మాతలపై నాంపల్లి న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. హీరో మహేశ్బాబుతో పాటు నిర్మాత ఎర్నేని నవీన్కు మరోసారి సమన్లు జారీ చేసింది. మహేష్ బాబుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వలేమని న్యాయస్థానం పునరుద్ఘాటించింది. హైకోర్టు నుంచి గిరిధర్ పేరుతో మహేశ్కు మినహాయింపు తీసుకురావడం చెల్లదని స్పష్టం చేసింది. మరోవైపు దర్శకుడు కొరటాల శివపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత హాజరు నుంచి హైకోర్టు ద్వారా మినహాయింపు కోరడం పట్ల సీరియస్ అయింది. గతంలో సమన్లు జారీ చేసినా తమ ఎదుట ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించింది. తదుపరి విచారణను ఆగస్టు 7కు కోర్టు వాయిదా వేసింది. స్వాతి మాస పత్రికకు 2012లో తాను రాసిన చచ్చేంత ప్రేమ నవలను కాపీ చేసి శ్రీమంతుడు సినిమా నిర్మించారని, తన అనుమతి లేకుండా తన నవల ఆధారంగా సినిమా నిర్మించడం కాపీ రైట్ ఉల్లంఘనే అవుతుందంటూ ఆర్.డి.విల్సన్ అలియాస్ శరత్చంద్ర నాంపల్లి కోర్టును ఆశ్రయించడంతో విచారణ మొదలైంది. -
శ్రీమంతుడు చిత్ర నిర్మాతకు సమన్లు
హైదరాబాద్ : 'శ్రీమంతుడు' చిత్ర నిర్మాత ఎర్నేని నవీన్ కు నాంపల్లి కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. అంతేకాకుండా ఈ సినిమా హీరో మహేష్ బాబుకు వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. స్వాతి మాస పత్రికకు 2012లో తాను రాసిన చచ్చేంత ప్రేమ నవలను కాపీ చేసి శ్రీమంతుడు సినిమా నిర్మించారని, తన అనుమతి లేకుండా తన నవల ఆధారంగా సినిమా నిర్మించడం కాపీ రైట్ ఉల్లంఘనే అవుతుందంటూ ఆర్.డి.విల్సన్ అలియాస్ శరత్చంద్ర నాంపల్లి కోర్టులో కేసు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన మొదటి అదనపు ఎంఎస్జే కోర్టు మహేశ్బాబు, కొరటాల శివలకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వీరు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు, మహేశ్బాబు, కొరటాల శివలకు కింది కోర్టులో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తూ ఉత్తర్వులిచ్చింది. తాజాగా సోమవారం ఈ వ్యాజ్యంపై నాంపల్లి కోర్టు మరోసారి విచారణ జరిపారు. ఈ మేరకు చిత్ర నిర్మాతకు నోటీసులు ఇవ్వడమే కాకుండా హీరో మహేష్ బాబు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. -
మహేశ్, కొరటాలకు మరో నెల ఊరట
⇒ వ్యక్తిగత హాజరు విషయంలో హైకోర్టు ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: శ్రీమంతుడు సినిమా కాపీరైట్ వివాదానికి సంబంధించి కింది కోర్టులో జరుగుతున్న విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యే విషయంలో హీరో మహేశ్బాబు, దర్శకుడు కొరటాల శివకు మినహాయింపునిస్తూ ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను ఉమ్మడి హైకోర్టు మరో నెల రోజులు పొడిగించింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకరనారాయణ గురువారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. స్వాతి మాస పత్రికకు 2012లో తాను రాసిన చచ్చేంత ప్రేమ నవలను కాపీ చేసి శ్రీమంతుడు సినిమా నిర్మించారని, తన అనుమతి లేకుండా తన నవల ఆధారంగా సినిమా నిర్మించడం కాపీ రైట్ ఉల్లంఘనే అవుతుందంటూ ఆర్.డి.విల్సన్ అలియాస్ శరత్చంద్ర నాంపల్లి కోర్టులో కేసు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన మొదటి అదనపు ఎంఎస్జే కోర్టు మహేశ్బాబు, కొరటాల శివలకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వీరు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు, మహేశ్బాబు, కొరటాల శివలకు కింది కోర్టులో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తూ ఉత్తర్వులిచ్చింది. తాజాగా గురువారం ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి మరోసారి విచారణ జరిపారు. ఫిర్యాదుదారు శరత్చంద్రకు నోటీసులు అందాల్సి ఉందని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి... తాజా ఉత్తర్వులిచ్చారు. -
శ్రీమంతుడు మహేశ్బాబుకు ఊరట
సాక్షి, హైదరాబాద్: శ్రీమంతుడు సినిమా నిర్మాణంలో కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారంటూ దాఖలైన కేసులో సినీ నటుడు మహేశ్ బాబు, ఆ చిత్ర దర్శకుడు కొరటాల శివలకు హైకోర్టులో ఊరట లభించింది. శ్రీమంతుడు సినిమా విషయంలో కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించారని, వారికి సమన్లు జారీ చేస్తూ నాంపల్లి కోర్టు ఈ ఏడాది జనవరి 24న జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. స్వాతి మాస పత్రికకు 2012లో తాను రాసిన చచ్చేంత ప్రేమ నవలను కాపీ చేసి శ్రీమంతుడు సినిమాను రూపొందించారని, తన అనుమతి లేకుండా తన కథ ఆధారంగా సినిమా నిర్మించి కాపీ రైట్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ రచయిత ఆర్డీ విల్సన్ అలియాస్ శరత్ చంద్ర నాంపల్లి కోర్టులో కేసు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన మొదటి అదనపు ఎంఎస్జే కోర్టు, హీరో మహేశ్ బాబు, దర్శకుడు కొరటాల శివ తదితరులకు సమన్లు జారీ చేస్తూ జనవరి 24న ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ మహేశ్బాబు ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, కొరటాల శివ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ శంకర నారాయణ విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి కింది కోర్టు జారీ చేసిన సమన్ల అమలును నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
మళ్లీ ఇస్తారు...
‘ఊరి నుంచి చాలా తీసుకున్నారు.. తిరిగిచ్చేయాలి.. లేకపోతే లావైపోతారు...’ ఈ డైలాగ్ వినగానే గుర్తొచ్చే చిత్రం ‘శ్రీమంతుడు’. మహేశ్బాబు, కొరటాల శివ కాంబినేషన్లో గత ఏడాది వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు, మహేశ్ కెరీర్లో బిగ్ హిట్గా నిలిచి వంద కోట్ల క్లబ్లో చేరింది. అందుకే మళ్లీ మహేశ్-కొరటాల కాంబినేషన్ కోసం అభిమానులు ఎదురుచూశారు. ఆ నిరీక్షణకు బుధవారంతో తెరపడింది. మహేశ్బాబు హీరోగా కొరటాల దర్శకత్వంలో డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ ఎల్ఎల్పీ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్లో ఆరంభమైంది. దేవుడి చిత్ర పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత డి.సురేశ్బాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, మరో నిర్మాత ఎం.శ్యాంప్రసాద్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. మురుగదాస్ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్న మహేశ్ ఈ ప్రారంభోత్సవానికి హాజరు కాలేదు. ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ ప్రారంభ వేడుకలో పాల్గొన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచేలా ఈ చిత్రం తెరకెక్కిస్తాం. ‘శ్రీమంతుడు’ కథ కంటే పవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పటి వరకూ కనిపించని విధంగా మహేశ్ ఓ వైవిధ్య పాత్రలో కనిపిస్తారు. హీరోయిన్ ఎంపిక జరుగుతోంది’’ అని తెలిపారు. ‘‘మహేశ్తో ఓ సూపర్ హిట్ చిత్రం తీయాలనే నా చిరకాల కోరిక ఈ చిత్రంతో తీరుతున్నందుకు ఫుల్ హ్యాపీ. వరుస హిట్లు ఇస్తున్న కొరటాలతో పని చేస్తుండటం గర్వంగా ఉంది. మహేశ్-కొరటాల మళ్లీ సూపర్ హిట్ ఇస్తారు’’ అని నిర్మాత చెప్పారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ- ‘‘కొరటాలగారి చిత్రాలన్ని టికీ నేను సంగీతం అందిస్తుండటం హ్యాపీ. ‘శ్రీమంతుడు’ పాటలు హిట్ అయ్యాయి. ఈ చిత్రం పాటలు అంతకన్నా పెద్ద హిట్ అవుతాయి’’ అన్నారు. కెమెరామ్యాన్ రవి కె.చంద్రన్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
శ్రీమంతులు కాదు.. 'సిరి'మతులే!
‘ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఊరిని అభివృద్ధి చెయ్.. లేదంటే ‘లావై’పోతావ్..’... గ్రామాల దత్తత కథాంశంతో వచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమాలో కథానాయకుడి డైలాగ్ ఇది. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో గ్రామాలను దత్తత తీసుకుని, అభివృద్ధి చేస్తామని హామీలు కురిపించారు. పోటీలు పడి మరీ గ్రామాల్ని దత్తత తీసుకున్నట్లుగా ప్రకటనలు చేశారు. మాటల్లోనే కోట్లు కుమ్మరించారు. కానీ ఆ హామీలు నిలబెట్టుకోకుండా, అసలు పట్టించుకోకుండా ‘లావై’పోతున్నారు. అంతా సిరిమతులే (డబ్బు మనుషులే) అని నిరూపించుకుంటున్నారు. తమ సమస్యలు తీరుతాయన్న ఆశతో ఉన్న ప్రజలకు నిరాశ మిగుల్చుతున్నారు. మన ఊరిని మనమే అభివృద్ధి చేసుకుందామనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ‘గ్రామజ్యోతి’ పథకాన్ని తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. ‘మన ఊరు-మన ప్రణాళిక’ పేరుతో ప్రజాప్రతినిధులు, అధికారులు ఊరూరూ తిరగాలని, అంతా కలసి ఊరికి ఏం కావాలో గుర్తించి, సమకూర్చాలనేది లక్ష్యం. ఈ క్రమంలోనే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, జడ్పీ చైర్పర్సన్లు, ఇతర ప్రముఖులు పలు గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. కానీ ఆ తర్వాత వాటి ఊసే మర్చిపోయారు. కొన్ని చోట్ల మాత్రమే పరిస్థితి కొంత మెరుగ్గా కనిపిస్తోంది. ఈ అంశంపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనే ఈ వారం ఫోకస్.. - సాక్షి నెట్వర్క్ ఆర్భాటంగా దత్తత ప్రకటనలు ఆనక మరిచిపోయిన మంత్రులు, ప్రజాప్రతినిధులు ♦ అన్నీ ఉత్తుత్తి హామీలే.. పనులన్నీ ప్రతిపాదనలకే పరిమితం ♦ సమస్యలతో సతమతమవుతున్న గ్రామాలు ♦ రెండు మూడు చోట్ల మాత్రం పరిస్థితి కొంత మెరుగు ♦ అటకెక్కిన ‘మన ఊరు-మన ప్రణాళిక’ ‘మంత్రించని' అభివృద్ధి మంత్రుల దత్తత గ్రామాల్లో అభివృద్ధి, ప్రగతి పనుల తీరు తీసికట్టుగా ఉంది. దత్తత తీసుకున్నట్టు మంత్రులు ఘనంగా ప్రకటనలు చేసినా... తరువాత నిధుల మంజూరు, పర్యవేక్షణ విషయంలో ఏమాత్రం శ్రద్ధ తీసుకున్న దాఖలాల్లేవు. ఇతర గ్రామాల తరహాలోనే ఈ దత్తత గ్రామాలు కూడా పలు సమస్యలతో సతమతం అవుతున్నాయి. పరిష్కరించదగ్గ చిన్న చిన్న సమస్యలూ తిష్టవేశాయి. దాదాపు అన్నిచోట్లా ఒకట్రెండు పనులకు శ్రీకారం చుట్టి వదిలేశారు. వాటి ప్రగతిని మళ్లీ సమీక్షించిన దాఖలాలు లేవు. నల్లగొండ జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామాన్ని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. మురుగుకాల్వలు, సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు, రక్షిత నీరు వంటి సమస్యలతో ఈ గ్రామం ఇప్పటికీ ఉక్కిరిబిక్కిరవుతోంది. హైస్కూల్ను డిజిటలైజేషన్ చేస్తాననే హామీ నెరవేరలేదు. ఈ గ్రామంలో 268 కుటుంబాలకు నేటికీ వ్యక్తిగత మరుగుదొడ్లు లేవు. అక్కడక్కడా చెత్తకుండీల ఏర్పాటు ఒక్కటే కొత్తగా కనిపిస్తున్న దృశ్యం. నల్లగొండ జిల్లా కొలనుపాక గ్రామంలో కూలేందుకు సిద్ధంగా ఉన్న వాటర్ ట్యాంక్ ⇒ మంత్రుల దత్తత గ్రామాల్లో దుస్థితి అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న (ఆదిలాబాద్ జిల్లా) బేల మండలంలోని బెదోడ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇక్కడ ఏళ్ల క్రితం వేసిన సీసీ రోడ్లు కంకర తేలి వెక్కిరిస్తున్నాయి. గ్రామంలో విద్యాబోధన కుంటుపడింది. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మండలం ఎల్లపెల్లి గ్రామం దేవాదాయ, న్యాయ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్వస్థలం. దీంతోపాటు ఆలూరు, పొన్కల్, మల్లాపూర్, గుండంపల్లి గ్రామాలనూ ఆయన దత్తత తీసుకున్నారు. ఎల్లపెల్లి కాస్త మెరుగ్గా ఉన్నా గృహ నిర్మాణ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన స్వగ్రామంలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి పునాది పడలేదు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించింది. మంత్రి జగదీశ్రెడ్డి (నల్లగొండ జిల్లా) ఆత్మకూరు(ఎస్) మండలం ఏపూరు, సూర్యాపేట మండలం పిల్లలమర్రి, చివ్వెంల గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఏపూరు ఇంతైనా రూపు మారలేదు. వర్షం వస్తే ఊరు-మురుగు ఏకం కావాల్సిందే. ప్రత్యేక నిధులు రూ.5 లక్షలతో సీసీరోడ్లు నిర్మిం చారు. రూ.50 లక్షలతో 420 మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టగా 80 శాతం పూర్తయ్యాయి. పిల్లలమర్రిలో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయింది. మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యం 50 శాతమే పూర్తయింది. చివ్వెంలలో రోడ్ల నిర్మాణం జరిగినా గూడాలలో తాగునీటి సమస్య నెలకొంది. ముఖ్యంగా బస్సు సౌకర్యం లేక విద్యార్థులు 2 కిలోమీటర్లు నడిచి మండల కేంద్రంలోని పాఠశాలలకు వెళ్తున్నారు. వరంగల్ జిల్లా ములుగు మండలం జగ్గన్నపేట గిరిజన మంత్రి చందూలాల్ స్వగ్రామం. ఆ గ్రామాన్ని ఆయన దత్తత తీసుకుని ఏడాదవుతున్నా మచ్చుకైనా ఏ చిన్న పనీ కాలేదు. తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, రోడ్డు సమస్యలది దత్తతకు ముందు నాటి పరిస్థితే. ఆశ్రమ పాఠశాల భవనానికి రూ.95 లక్షలు, బాలికల కళాశాల భవనానికి రూ.3.45 కోట్ల కేటాయింపు ఒకింత ఊరట. సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరైనా పనులు మొదలుకాలేదు. ఇక మండల కేంద్రం వెంకటాపురం కూడా ఆయన దత్తత గ్రామమే. కుగ్రామం కంటే దారుణంగా ఉన్న పరిస్థితులతో ఇక్కడి పది వేల మంది జనాభా ఇక్కట్లు పడుతున్నారు. ఏడాదిగా మంత్రి రూపాయి కూడా మంజూరు చేయించలేదని గ్రామస్తులు అంటున్నారు. * ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్(కరీంనగర్ జిల్లా) చెల్పూ ర్, సిరిసేడు, వీణవంక, కమలాపూర్ గ్రామాలను దత్తత తీ సుకుంటున్నట్టు ప్రకటించారు. దసరా తరువాత రూపురేఖలే మార్చేస్తానన్నారు. కానీ రెండేళ్లుగా వీసమెత్తు పని జరగలేదని గ్రామస్తులు చెబుతున్నారు. చెల్పూర్ అభివృద్ధికి రూ.20 కోట్ల మేరకు తీర్మానాలు చేసి సరిపెట్టారు. * భారీ నీటిపారుదల మంత్రి హరీశ్రావు దత్తత గ్రామం మాటిండ్ల(మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం )లో అభివృద్ధి పనులకు రూ.70 లక్షలు మంజూరయ్యాయి. రూ.67లక్షలతో మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయి. * రంగారెడ్డి జిల్లా ముద్దాయిపేట, కొండాపూర్, నీళ్లపల్లి.. ఈ మూడూ రవాణా మంత్రి మహేందర్రెడ్డి దత్తత గ్రామాలు. సమస్యల్లో ఇవి ఇతర గ్రామాలతో పోటీపడుతున్నాయి. * సోమేశ్వర్, పోచారం, బీర్కూర్, బీర్కూర్ తండా, రుద్రూర్, కోటగిరి, సోంపూర్.. వ్యవసాయ మంత్రి పోచా రం శ్రీనివాసరెడ్డి(నిజామాబాద్ జిల్లా) దత్తత తీసుకున్న ఈ గ్రామాల్లో రూ.కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. సోమేశ్వర్లో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. * మంత్రి లక్ష్మారెడ్డి (మహబూబ్నగర్ జిల్లా) దత్తత తీసుకున్న జడ్చర్ల మండలం కోడ్గల్లో అంతంతగానే అభివృద్ధి కనిపిస్తోంది. సమస్యల్ని ఇంకా గుర్తించే పనిలోనే ఉన్నామని ఆయన చెబుతున్నారు. అధికారుల ‘ఊళ్ల’లో అంతో ఇంతో..! * ఆదిలాబాద్ మండలం అంకోలి గ్రామాన్ని అధ్వానమైన రోడ్లు, మురుగు సమస్య పీడించేవి. జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ దత్తత తీసుకున్నాక గ్రామం రూపురేఖలు కొంత మారాయి. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. * మెదక్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్రోస్ దత్తత తీసుకున్న నవాబుపేట (హత్నూర మండలం)లో సీసీ రోడ్ల రూపు మారాల్సి ఉంది. మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం వంద శాతం పూర్తయింది. ఇంటింటికీ ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేశారు. ఈయనే దత్తత తీసుకున్న రాణాపూర్ (మనూరు మండలం)కు ఏడాదిలోనే రూ.1.25 కోట్లు మంజూరయ్యాయి. ఇక షాదుల్లానగర్ను ఇటీవల బదిలీపై వెళ్లిన ఎస్పీ సుమతి దత్తత తీసుకున్నా అభివృద్ధేమీ చేయలేదు. * ఖమ్మం జిల్లాలో మండల కేంద్రమైన వెంకటాపురాన్ని జెడ్పీ సీఈవో దత్తత తీసుకున్నట్టు ప్రకటించినా.. ఇప్పటికీ ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. 2,000 మరుగుదొడ్ల నిర్మాణాలు చేపడితే వంద మాత్రమే పూర్తయ్యాయి. ప్రకటనలు ఆర్భాటం.. పనులు శూన్యం * మహబూబ్నగర్ జిల్లాలో నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి గన్యాగుల గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పటికీ ఆ ఊరిలో అడుగుపెట్టలేదు. ఇక్కడ తాగునీటి సమస్య ఉంది. వివిధ పనులకు నిధుల కేటాయింపే తప్ప.. పనులు జరుగుతున్న జాడలేదు. గ్రామస్తులు కూడా ఆయా సమస్యల పరిష్కారంపై ఆశ వదులుకున్నారు. * మెదక్ జిల్లాలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ దత్తత తీసుకున్న కల్హేర్ మండలం సిర్గాపూర్, ఝరాసంగం మండలం ఈదులపల్లి గ్రామాల్లో మచ్చుకైనా అభివృద్ధి జాడలేదు. దత్తత తీసుకున్న రోజున హడావుడి చేసిన ఎంపీ.. ఆపై మరిచేపోయారని గ్రామస్తులు అంటున్నారు. బీబీ పాటిల్ దత్తత తీసుకున్న మరో గ్రామం నిజామాబాద్ జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్దీ అదే పరిస్థితి. గాంధారిలో మాత్రం సీసీ రోడ్లు వేశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి దత్తత తీసుకున్న పన్యాల, అహ్మద్నగర్, కోనాపూర్ గ్రామాల్లో మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణాలు నత్తనడక నడుస్తున్నాయి. * ఖమ్మం జిల్లాలో వైరా ఎమ్మెల్యే బానోతు మదన్లాల్ వల్లాపురం గ్రామాన్ని దత్తత తీసుకుని అనేక తీర్మానాలు చేసినా.. కార్యాచరణ కొరవడింది. అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు దత్తత గ్రామంలో హామీలన్నీ నీటి మూటలయ్యాయి. డబుల్ బెడ్రూం ఇళ్లు 20 కట్టిస్తామని ప్రకటించినా.. లబ్ధిదారుల ఎంపికే జరగలేదు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తన ఐదు దత్తత గ్రామాలకు అభివృద్ధి రూపేణా పైసా కూడా ఇవ్వలేదు. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు తన దత్తత గ్రామమైన దంతలబోరులో ఇటీవలే సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. గ్రామానికి బస్సు సర్వీసు ఏర్పాటు, పైప్లైన్ నిర్మాణం వంటి రెండు పనులే జరిగాయి. ప్రధాన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. * నిజామాబాద్ జిల్లాలో ఎంపీ కల్వకుంట్ల కవిత దత్తత గ్రామాలైన కందకుర్తిలో రూ.1.10 కోట్లతో, మాణిక్భండార్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. బాల్కొండ ఎమ్మెల్యే దత్తత గ్రామాలైన వడ్యాట్, చౌట్పల్లి, కొత్తపల్లి, పడగల్, బడాభీమ్గల్లలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. బోధన్ ఎమ్మెల్యే దత్తత గ్రామాల్లో అభివృద్ధి కానరావడం లేదు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దత్తత జాబితాలోని ఇందల్వాయి, సిరికొండ, తొర్లికొండ, ధర్పల్లి, మంచిప్ప గ్రామాల్లో... ఎమ్మెల్సీ వీజీగౌడ్ దత్తత గ్రామమైన రాంపూర్లో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు మాత్రమే తయారయ్యాయి. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తన నియోజకవర్గంలోని ప్రతి మండలం నుంచి ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆయన స్వగ్రామం బస్వాపూర్లో పనులు ఫర్వాలేదనిపిస్తున్నా.. చాలాచోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు నెలకొన్నాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి దత్తత గ్రామాలైన మామిడిపల్లి, వెల్మల్, మాక్లూర్లకు ఇప్పటివరకు హామీలు మాత్రమే ఇచ్చారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రవీందర్రెడ్డి పోచారం, తిమ్మారెడ్డి, ఎర్రపహాడ్, జువ్వాడి, ఉప్పల్వాయి గ్రామాల్ని దత్తత తీసుకుని సీసీ రోడ్లు వేయించారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే దత్తత గ్రామంలో చెప్పుకోదగిన అభివృద్ధేమీ జరగలేదు. * కరీంనగర్ జిల్లాలో మంథని ఎమ్మెల్యే పుట్ట మధు తన నియోజకవర్గంలోని ఏడు గ్రామాలను దత్తత తీసుకున్నా.. ఒక్కోసారి పర్యటించడం మినహా చేసిందేమీ లేదు. వేములవాడ ఎమ్మెల్యే రమేశ్బాబు దత్తత తీసుకున్న తిప్పాపూర్, రుద్రంగి, మామిడిపల్లి, తుర్తి, కట్లకుంట గ్రామాల్లో ఒక్క మామిడిపల్లిలో రూ.43 లక్షలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మిగతా వాటి పరిస్థితి అధ్వానంగా ఉంది. * రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి హాజీపూర్ను దత్తత గ్రామంగా ప్రకటించి చాలా హామీలిచ్చినా.. ఇప్పటి వరకు బీటీ రోడ్డు మాత్రం వేయించగలిగారు. జెడ్పీ చైర్పర్సన్ల ఇలాకాల్లో.. * ఆదిలాబాద్ చైర్పర్సన్ వి.శోభారాణి సొంత గ్రామమైన కడ్తాల్(నిర్మల్ మండలం)లో రోడ్డు పనులు చేయిస్తున్నా.. ఇక్కడి పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు కిచెన్ షెడ్లు కరువయ్యాయి. * మెదక్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ రాజమణి దత్తత గ్రామం నర్సాపూర్ మండలం నత్నాయిపల్లిలో అభివృద్ధి పనులన్నీ ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. * రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి దత్తత గ్రామం తిమ్మాయిపల్లిలో మహిళల ఉపాధికి బాటలు వేయగలిగారు. మంత్రి దత్తత తీసుకున్నా అంతంతే.. ‘‘మంత్రి జగదీశ్రెడ్డి ఏపూరు గ్రామాన్ని దత్తత తీసుకున్నా అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. నీళ్ల కోసం మహిళలు వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నారు. గ్రామాభివృద్ధిపై మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టాలి.’’ - నజీర్, ఏపూరు, నల్లగొండ జిల్లా అంతా ఆర్భాటమే.. ‘‘సమస్యలన్నీ అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులు ఏమేం కావాలో ఆరా తీశారు. అంతే ఇప్పటి వరకు పైసా విడుదల కాలేదు. ‘మన ఊరు-మన ప్రణాళిక’కు బూజు పట్టింది.’’ - మహ్మద్ రఫీఖాన్, కరీంనగర్ జిల్లా సిరిసేడు మాజీ సర్పంచ్ నియోజకవ ర్గం మొత్తాన్ని అభివృద్ధి చేస్తా ‘‘నాకంటూ దత్తత గ్రామాలేవీ లేవు. నియోజకవర్గాన్ని సమదృష్టితో అభివృద్ధి చేస్తా. గిరిజన సబ్ప్లాన్, ఇతర శాఖల నిధుల మంజూరుకు కృషి చేస్తా. పదవీ కాలం ముగిసేలోపు నియోజకవర్గం మొత్తాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం.’’ - మంత్రి చందూలాల్ అభివృద్ధి వేగవంతం చేస్తాం ‘‘నిర్మల్ నియోజకవర్గంలో దత్తత తీసుకున్న గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తా. ఇప్పటికే మరుగుదొడ్లు, మురికి కాలువలు, సీసీరోడ్ల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. ఎల్లపెల్లిలో చేపట్టనున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేస్తాం.’’ - మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దత్తత గ్రామాలపై ప్రత్యేక దృష్టి ‘‘జిల్లాలోని దత్తత గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. బాన్సువాడ నియోజకవర్గానికి గ్రామజ్యోతి కింద రూ.240 కోట్లు కేటాయించాం. వీటితో అభివృద్ధి పనులు చేపడతాం.’’ - మంత్రి పోచారం అభివృద్ధికి చర్యలు చేపట్టాం ‘‘దత్తత గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి దశల వారీగా పరిష్కారానికి కృషి చేస్తా. ఇప్పటికే రోడ్లు, డ్రైనేజీ పనులకు నిధులు మంజూరు చేశాను.’’ - మంత్రి లక్ష్మారెడ్డి గ్రామాల అభివృద్ధే లక్ష్యం ‘‘నా దత్తత గ్రామం ఎగ్లాస్పూర్తో పాటు ఇతర గ్రామాల సమగ్రాభివృద్ధే నా ధ్యేయం. అభివృద్ధి పనులకు రూ.75 లక్షలు మంజూరు చేయించా.’’ - సోమారపు సత్యనారాయణ, ఆర్టీసీ చైర్మన్ ఐదు గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ ‘‘వేములవాడ నియోజకవర్గంలో ఐదు గ్రామాలను దత్తత తీసుకున్నాను. వాటిలో ప్రగతి పనులు వేగవంతం చేసేందుకు నిరంతరం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నా..’’ - ఎమ్మెల్యే రమేశ్బాబు ‘శ్రీమంత’ పల్లెలు * సీఎం దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో * రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు దత్తత తీసుకున్న గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రా మాల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. ఈ గ్రామాలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతానంటున్న ఆయన.. కోట్ల రూపాయలను కేటాయించారు. రెండు పల్లెల్లో రూ.150 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రూ.28.62 కోట్లతో ఎర్రవల్లిలో 330, నర్సన్నపేటలో 200 డబుల్ బెడ్రూం ఇళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. రెండు గ్రామాల్లోని 42 మంది నిరుద్యోగులకు రూ.3.62 కోట్లతో వంద శాతం సబ్సిడీతో 42 ట్రాక్టర్లను అందజేశారు. రూ.1.50 కోట్లతో ఫంక్షన్హాల్, రూ.1.20 కోట్లతో గోదాం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రూ.2కోట్లతో ఇంటింటికీ సోలార్ విద్యుత్ సిస్టమ్ అమర్చుతున్నారు. కూడవెల్లి వాగు పునరుద్ధరణకు రూ.28.80 కోట్లు మంజూరయ్యాయి. రూ.8 కోట్లతో పాండురంగ రిజర్వాయర్ పనులు, రూ.16.90 కోట్లతో వివిధ కుంటల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. 2,800 ఎకరాల్లో బిందు సేద్యానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. -
అభిమానులకు మహేశ్బాబు థాంక్స్
ఫిలింఫేర్ అవార్డులలో ఉత్తమ నటుడి అవార్డు వచ్చినందుకు సూపర్స్టార్ మహేశ్ బాబు తన ఫ్యాన్స్కు థాంక్స్ చెప్పాడు. ముందుగా శ్రీమంతుడు సినిమాలో నటనకు అవార్డు ఇచ్చినందుకు ఫిలింఫేర్కు థాంక్స్ చెప్పిన ప్రిన్స్, ఆ తర్వాత మరో ట్వీట్లో దీన్ని సాధ్యం చేసినందుకు అభిమానులకు పెద్ద థాంక్యూ అని చెప్పాడు. అయితే అవార్డుల కార్యక్రమానికి రాలేకపోయానన్నాడు. ఫిలింఫేర్ అవార్డులలో మహేశ్ బాబుకు ఉత్తమ నటుడి అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. శ్రుతిహాసన్, మహేశ్ జంటగా నటించిన శ్రీమంతుడు మూవీ పలు అవార్డులతో పాటు కలెక్షన్లను కూడా కొల్లగొట్టింది. బాహుబలి తర్వాత తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. Honoured to win the Filmfare Best Actor award for Srimanthudu. Thank you @filmfare and the Times group.. — Mahesh Babu (@urstrulyMahesh) 19 June 2016 A Big Thank You to all my fans for making this possible.. Missed being there on the big night.. — Mahesh Babu (@urstrulyMahesh) 19 June 2016 -
శ్రీమంతుడి తండ్రి వీడియో హల్చల్
శ్రీమంతుడు సినిమాలో కొడుకు పాత్ర పోషించిన మహేష్ బాబు పల్లెల్లో తిరుగుతూ.. వాటి అభివృద్ధి కోసం కృషిచేసే పాత్రలో కనపడితే, అతడి తండ్రి పాత్ర పోషించిన జగపతి బాబు మాత్రం పూర్తి సూటు, బూటు వేసుకుని విమానాల్లో తిరుగుతూ పెద్ద బిజినెస్ మాగ్నెట్లా కనపడతారు. కానీ నిజజీవితంలో జగపతి బాబు ఏం చేస్తున్నారో తెలుసా.. పొలం దున్నుతున్నారు. అవును.. స్వతహాగా గ్రామీణ వాతావరణం అంటే ఇష్టమున్న జగపతి బాబు ట్రాక్టర్ నడుపుతూ మరికొందరితో కలిసి పొలాన్ని దున్నుతున్నారు. ఆ వీడియోను జగ్గుభాయ్ శుక్రవారం మధ్యాహ్నం తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అప్పుడే ఆ వీడియోను దాదాపు 22వేల మంది చూసేశారు. అలాగే దానికి లైకులు కూడా బాగానే వస్తున్నాయి. ఈ వీడియోలో జగ్గుభాయ్ అచ్చతెలుగు పెద్దమనిషిలా పంచెకట్టుకుని, తలపాగా చుట్టుకుని ట్రాక్టర్ నడుపుతూ కనిపిస్తారు. కేవలం 25 సెకన్లు మాత్రమే ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ వీడియో మీరు కూడా చూడండి.. -
సినిమాలు సమాజానికి స్ఫూర్తినివ్వాలి
శ్రీమంతుడు చిత్ర నిర్మాతలకు బి.నాగిరెడ్డి స్మారక పురస్కారం ముఖ్య అతిథులుగా హాజరైన నటులు గొల్లపూడి మారుతీరావు, చంద్రమోహన్ తిరుపతి కల్చరల్: సినిమాలు చక్కటి సందేశం ఇస్తూ సమాజానికి స్ఫూర్తినిచ్చేలా ఉండాలని ప్రముఖ రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు తెలిపారు. ప్రముఖ నిర్మాణ విజయ సంస్థ, విజయ మెడికల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ సినీ నిర్మాత బి.నాగిరెడ్డి స్మారక పురస్కారం-2015 ప్రదానోత్సవం కార్యక్రమం ఆదివారం రాత్రి తిరుపతి మహతి కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. శ్రీమంతుడు చిత్రాన్ని నిర్మించిన యువ నిర్మాతలు వై.రవి, నవీన్లకు నాగిరెడ్డి స్మారక అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులుగా సినీనటులు గొల్లపూడి మారుతీరావు, చంద్రమోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గొల్లపూడి మాట్లాడుతూ నాడు సమాజ సేవా దృక్పథంతో, మానవీయ విలువలతో కూడిన సందేశాత్మక సినిమాలు తీసేవారన్నారు. అయితే నేడు వ్యాపారమే లక్ష్యంగా సినిమాల నిర్మాణాలు సాగడం బాధాకరమన్నారు. గత 65 ఏళ్లుగా సినిమా అంటే ఎలా ఉండాలో తీసి చూపిన వ్యక్తి నాగిరెడ్డి అన్నారు. నిబద్ధత, నిజాయితీ గల వ్యక్తి బి. నాగిరెడ్డి అని కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని వారి కుటుంబం గత ఐదేళ్లుగా ఆయన పేరున ఉత్తమ చిత్రాల నిర్మాతలకు నాగిరెడ్డి స్మారక పురస్కారం అందించడం అభినందనీయమన్నారు. శ్రీమంతుడు చిత్రం స్ఫూర్తితో చాలామంది గ్రామాల అభివృద్ధికి పాటుపడుతున్నారని తెలిపారు. శ్రీమంతుడు చిత్రాన్ని నిర్మించిన యువ నిర్మాతలు వై.రవి, నవీన్లకు నాగిరెడ్డి స్మారక అవార్డు ప్రదానం చేయడం అభినందనీయమన్నారు. చంద్రమోహన్ మాట్లాడుతూ తనకు నటుడిగా బిక్షపెట్టింది విజయా సంస్థ అని కొనియాడారు. ఎన్టీఆర్ తర్వాత ఆ సంస్థలో హీరోగా తానే నటించే భాగ్యం ఆ సంస్థ కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మహానటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ మంచి చిత్రాలకు కేరాఫ్ విజయ సంస్థ అని తెలిపారు. ఆ సంస్థ నిర్మించిన చిత్రాల్లో తన తల్లి సావిత్రి నటించడం వల్ల వారితో తమకు ఎంతో అనుబంధం ఏర్పడిందని తెలిపారు. విజయా మెడికల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు వెంకటరామిరెడ్డి, సతీమణి భారతీ రెడ్డి మాట్లాడుతూ గత నాలుగు ఏళ్లుగా నాగిరెడ్డి స్మారక పురస్కారాలను సమాజానికి హితోదకంగా నిలిచే ఉత్తమ చిత్రాల నిర్మాతలకు అందిస్తున్నామన్నారు. టీటీడీ చైర్మన్గా నాగిరెడ్డి భగవంతుని సన్నిధిలో విశేష సేవలు అందించడంతో ఐదో పురస్కార ప్రధాన సభను తిరుపతిలో నిర్వహిస్తున్నామన్నారు. అలరించిన మాధవపెద్ది సురేష్ సంగీత విభావరి బి.నాగిరెడ్డి స్మారక పురస్కార ప్రధాన సభ సందర్భంగా మహతి కళాక్షేత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి శ్రోతలను ఆకట్టుకుంది. అలనాటి విజయా సంస్థ నుంచి వెలువడిన అద్భుత చిత్రాల్లోని పలు పాటలను ఆలపించారు. గాయనీ గాయకులు బీఆర్. నారాయణ, నిత్యసంతోష్, సునీతారావు, పవన్లు గేయాలతో ఆకట్టుకున్నారు. -
శ్రీమంతుడి దోసె.. చాలా కాస్ట్లీ గురూ...!
హైదరాబాద్ : శ్రీమంతుడు సినిమా పేరు విన్నారు..చూశారు. కానీ శ్రీమంతుడి దోసె చూశారా? రుచి చూశారా? నూతనంగా ఏర్పాటైన కారంపొడి రెస్టారెంట్ ఈ శ్రీమంతుడు దోసెని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెస్టారెంట్ను ఫిలింనగర్ రోడ్ నెం.1లో శుక్రవారం ప్రారంభించారు. శ్రీమంతుడి దోసె ధర రూ.670 ఉంటుందని నిర్వాహకులు శ్యామ్ జంపాల తెలిపారు. బొమ్మిడాల పులుసు, రాగి సంగటి, నాటు కోడి పులుసు, భాగమతి మసాలా పప్పు, జొన్న రొట్టె, నెయ్యి అన్నం ప్రత్యేక రుచులతో అందజేస్తున్నారు. -
ఇరవై ఏళ్ల క్రితమే శ్రీమంతుడు
విశాల ప్రపంచంలో సమాజ శ్రేయస్సు కోసం తపించేవారు బహు అరుదుగా ఉంటారు. సమాజానికి మంచి చేయాలని ఆజన్మాంతం శ్రమిస్తుంటారు. ఇదే కోవకు చెందిన వారు బిక్కవోలు మండలం పందలపాకకు చెందిన దివంగత పడాల కృష్ణారెడ్డి. రెండు దశాబ్దాల క్రితం ఆయన నాటిన విద్యా విత్తు.. నేడు ఎన్నో విద్యా కుసుమాలను పూయిస్తోంది. గ్రామస్తులకు విద్య అందించాలన్న తలంపుతో పందలపాకకు చెందిన పడాల కృష్ణారెడ్డి 23 ఏళ్ల క్రితం శ్రీపడాల పెదపుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మాణానికి అంకురార్పణ చేశారు. విద్యాధికుడు, వ్యాపారవేత్త అయిన కృష్ణారెడ్డి ఓ సామాన్య రైతు కుంటుంబంలో జన్మించారు. కష్టపడి చదివి, ఉన్నతంగా ఎదిగారు. ఉద్యోగ, వ్యాపారాల రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. జన్మభూమికి ఏదైనా చేయాలనే తపనపడ్డారు. గుళ్లూగోపురాలు కట్టించే కన్నా, పది మందికి జీవనమార్గాన్ని చూపే విద్యను అందించాలని నిశ్చయించుకున్నారు. స్నేహితుల సహకారంతో 1993లో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా రూ.30 లక్షల వ్యయంతో అన్ని వసతులు, హంగులతో తన తండ్రి పేరిట గ్రామంలో ఉన్నత పాఠశాలను కట్టించారు. అలాగే రూ.4 లక్షలతో క్రీడా మైదానం అభివృద్ధి చేశారు. అంతటితో ఆగక అమెరికాలో 13 వేల డాలర్లు సేకరించి పాఠశాల అభివృద్ధికి శ్రమించారు. చదువుకుని.. ఉన్నత స్థానాల్లో... ఇప్పటి వరకు వేలాది మంది పందలపాకతో పాటు కొమరిపాలెం, తొస్సిపూడి, వెదురుపాక సావరం తదితర గ్రామాలకు చెందిన వారు ఈ పాఠశాలలో చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అంతేకాక ఇటు చదువులోను, అటు క్రీడల్లోను అనేక మంది రాష్ట్రవ్యాప్తంగా పేరు గడించారు. డాక్టర్లుగా, లాయర్లుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, ఉపాధ్యాయులుగా స్థిరపడిన వారెందరో ఉన్నారు. పాఠశాలపై ఉన్న మక్కువతో కృష్ణారెడ్డి స్థానికంగా ఉన్న ఆత్మీయులతో పాఠశాల అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేశారు. వారి సహకారంతో అనేక అభివృద్ధి పనులు నిర్వహించారు. తిరుగు పయనంలో తిరిగిరాని లోకానికి.. ప్రతిఏటా కృష్ణారెడ్డి స్వదేశానికి వచ్చి.. పాఠశాలపై మమకారంతో సందర్శించి వెళ్లేవారు. 2010లో ఇక్కడకు వచ్చిన ఆయన తిరుగు ప్రయాణంలో హైదరాబాద్లో గుండెపోటుతో కన్నుమూశారు. ఈ సంఘటనతో పాఠశాల పూర్యవిద్యార్థులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. భౌతికంగా ఆయన దూరమైనప్పటికీ.. ఆయన భార్య అనురాధ, కుమారులు ప్రవీణ్రెడ్డి, ప్రశాంత్రెడ్డి ఈ పాఠశాల బాగోగులను చూస్తున్నారు. గ్రామానికి చేసిన సేవలకు గుర్తింపుగా కృష్ణారెడ్డి కాంస్య విగ్రహాన్ని పాఠశాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఆవిష్కరిస్తున్నారు. -
'శ్రీమంతుడు' విలన్ల తరహాలోనే..!
♦ భూపరిహారం నొక్కేసే యత్నం ♦ నెల్లూరు జిల్లాలో ‘భూ’ విలన్లు ♦ కావలిలో అధికార పార్టీ అన్నదమ్ముల బాగోతం ♦ బినామీ పేర్లతో పేదల భూములు కైవసం ♦ పరిహారం కోసం రికార్డులన్నీ తారుమారు ♦ నేతలకు వంతపాడుతున్న అధికారులు సాక్షి టాస్క్ఫోర్స్, నెల్లూరు: ఒక పేద మహిళకు ప్రభుత్వం రెండెకరాలు భూమి కేటాయించింది. ఆ భూమిలో వ్యవసాయం కోసం బ్యాంకులో అప్పు కూడా తీసుకుంది. ఇంతలో భూమి కావాల్సి వచ్చి ప్రభుత్వం సేకరణకు సిద్ధమైంది. అంతే.. ఆ రెండెకరాల భూమికి సంబంధించి రైతు పేరు మారిపోయింది. ప్రభుత్వం ఇచ్చే పరిహారం నొక్కేసేందుకు రంగం సిద్ధమైపోయింది. ఇదంతా శ్రీమంతుడు సినిమాలో విలన్లు చేసిన పనిగా ఉంది కదా! అచ్చం అలాంటిదే నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో జరుగుతోంది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు వందలాది ఎకరాల పేదల భూములను బినామీ పేర్లతో స్వాహా చేసేందుకు వ్యూహం పన్నారు. కావలి నియోజకవర్గంలో విమానాశ్రయం ఏర్పాటు కోసం దామవరంలో 1,075 ఎకరాలు, కొత్తపల్లి కౌరుగుంటలో 323 ఎకరాలు సేకరిస్తున్నారు. వీటిలో పట్టా భూములతో పాటు అసైన్మెంట్, డీఫారం, ప్రభుత్వ భూములున్నాయి. పారిశ్రామిక అవసరాల కోసం ఏపీఐఐసీ మరో 716.41 ఎకరాలు సేకరిస్తోంది. ఇందులో ఉలవపాళ్లలో 400 ఎకరాలు, కొత్తపల్లి కౌరుగుంటలో 192, ఊచగుంటపాళెంలో 124.41 ఎకరాలు సేకరిస్తోంది. ఎకరాకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ పరిహారాన్ని మొత్తం నొక్కేసేందుకు కావలి నియోజకవర్గానికి చెందిన అధికారపార్టీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములతో పాటు పేదలకు గతంలో మంజూరు చేసిన భూములను బినామీ పేర్లతో సొంతం చేసుకుంటున్నారు. అనుచరులు, స్థానికేతరులను జాబితాలో చేర్చి వందలాది ఎకరాలు పక్కదారి పట్టించారు. రెవెన్యూ అధికారులను గుప్పెట్లో పెట్టుకుని రికార్డులన్నీ తారుమారు చేశారు. నైస్గా కాజేసే వ్యూహం.. కౌరుగుంటకు చెందిన దేవరకొండ కావమ్మకు సర్వేనంబర్ 290-3లో ప్రభుత్వం గతంలో రెండెకరాల భూమి ఇచ్చింది. ఆ భూమిపైన అల్లూరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో ఆమె రూ. 44 వేలు క్రాప్లోన్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఏపీఐఐసీ భూ సేకరణలో ఆ భూమి కావమ్మ పేరున కాకుండా బెల్లంకొండ శీనయ్య పేరు వచ్చి చేరింది. రెవెన్యూ అధికారులు నోటీసుల్లో ఈ విషయం తెలుసుకున్న కావమ్మ భోరుమంటోంది. పరుశురాం జానకిరామయ్య అనే వ్యక్తికి 298-3లో ఎఫ్డిఎస్ నంబర్ 208-1407లోరెండెకరాల భూమిని ఇచ్చినట్లు రికార్డుల్లో చూపుతున్నారు. అసలు భూమి మంజూరు చేసిన విషయమే జానకిరామయ్యకు తెలియదు. భూసేకరణ అభ్యంతరాలపై నోటీసు రావడంతో జానకిరామయ్య అవాక్కయ్యాడు. ఇక భూమిని తానే ఇంకొకరికి విక్రయించినట్లు అధికారులు నోటీసులో పేర్కొనడంతో నిర్ఘాంతపోయాడు. వాస్తవానికి జానకిరామయ్య పేరుతో రికార్డులు తారుమారు చేసి.. తమకు ఆ భూమి విక్రయించినట్లు భూ విలన్లు డాక్యుమెంట్లు తయారు చేశారు. ప్రభుత్వమిచ్చే పరిహారాన్ని నొక్కేసేందుకే ఇలా చేశారు. -
తిరిగి ఇచ్చేయాలి... లేకపోతే వాళ్లు రోడ్డున పడతారు!
‘మనకింత చేసిన ఊరికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి.. లేకపోతే లావైపోతాం’ అని ‘శ్రీమంతుడు’ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ చాలామంది పై ప్రభావం చూపించింది. కొంచెం అటూ ఇటూగా హిందీ హీరో, హీరోయిన్ రణ్బీర్ కపూర్, దీపికా పదుకొనె కూడా ఈ డైలాగ్లో ఉన్నట్లుగా చేశారట. ఈ మాజీ ప్రేమికులు ఇటీవల నటించిన ‘తమాషా’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై, పరాజయాన్ని చవిచూసింది. ఈ కాంబినేషన్కి ఉన్న క్రేజ్ని చూపించి, చిత్రనిర్మాతలు ‘తమాషా’ని బాగానే అమ్మారట. కానీ, సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో పంపిణీదారులు భారీ ఎత్తున నష్టపోయారు. కొంతమంది రొడ్డుకొచ్చే పరిస్థితిలో ఉన్నారని టాక్. తాము తీసుకున్న పారితోషికంలో కొంతలో కొంత అయినా తిరిగిస్తే, పంపిణీదారులకు కొంత ఊరట లభిస్తుందని భావించిన రణ్బీర్ 10 కోట్ల రూపాయలు, దీపిక 5 కోట్లు వెనక్కి ఇచ్చేశారట. అంటే.. దీపిక సగం పారితోషికం వెనక్కి ఇచ్చినట్లే. వీరిద్దర్నీ చూసి, దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా స్పూర్తి చెందారట. ఆయన దర్శకత్వం వహించిన ‘బాంబే వెల్వట్’ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దాంతో ఈ చిత్రాన్ని పంపిణీ చేసిన ఫాక్స్ స్టార్ స్టూడియోస్కు తన పారితోషికంలో కొంత తిరిగి ఇచ్చేయాలని అనురాగ్ డిసైడ్ అయ్యారట. భేష్.. బాగుంది కదూ! -
బాహుబలికి 14, శ్రీమంతుడుకి 11
హిందీ సినిమాకు సంబంధించి గడచిన పదహారేళ్ళుగా ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ’ (ఐఫా) ఉత్సవాలు ఈ సారి దక్షిణాదికి విస్తరించాయి. దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రాంతీయ భాషల (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం) సినిమాల ప్రముఖులనూ ఈ ‘ఐఫా ఉత్సవమ్ -2015’ ఒకే వేదికపై తీసుకువస్తోంది. వివిధ కేటగిరీల్లో విజేతలను నిర్ణయించేందుకు ఇప్పుడు నామినేషన్ల హంగామా మొదలైంది. తెలుగు సినిమా నామినేషన్లలో ఉత్తమ చిత్రం, దర్శకుడు, ఉత్తమ నటుడు, నటి, సంగీత దర్శకుడు, పాటలతో సహా 14 విభాగాల్లో ‘బాహుబలి’ నామినేట్ అయింది. ఇక, ‘శ్రీమంతుడు’ చిత్రం ఏకంగా 11 కేటగిరీల్లో నామినేటైంది. ‘బాహుబలి’ చిత్రం నుంచి ఉత్తమ గాయని విభాగానికి ముగ్గురూ, ఉత్తమ గాయకుడి చిత్రానికి ఇద్దరు నామినేట్ అవడం విశేషం. రానున్న డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో మూడు రోజుల పాటు హైదరాబాద్లో జరిగే ఈ ‘ఐఫా - ఉత్సవమ్’లో విజేతల ప్రకటన, అవార్డు ప్రదానం జరుగుతుంది. ఇండస్ట్రీ ప్రముఖులు, సాంకేతిక నిపుణులు వివిధ కేటగిరీలకు సంబంధించి ఓటు వేస్తారు. ఆ ఓట్లన్నిటినీ లెక్కించి, శాస్త్రీయ పద్ధతిలో విజేతలను నిర్ణయిస్తారు. -
శ్రీమంతురాలు
అమలాపురం : ఆస్తులను ఎలా కూడబెట్టుకోవాలా అని ఆలోచించే వారున్న ఈ రోజుల్లో.. తన యావదాస్తిని ప్రభుత్వ పాఠశాలకు దానంగా ఇచ్చిన ఆ వృద్ధురాలు నిజంగా దాతృత్వంలోను ‘శ్రీమంతురాలే’. కామనగరువు గ్రామానికి చెందిన గిడ్డి గనికమ్మ రూ.20 లక్షల విలువైన ఐదు సెంట్ల భూమిని, అందులో ఉన్న భవనం సహా చిట్టమ్మచెరువు ప్రాథమిక పాఠశాలకు ఇవ్వాలంటూ పంచాయతీకి దానమిచ్చారు. ఆమె భర్త గతంలోనే చనిపోయారు. సంతానం లేకపోవడంతో ఆమెను బంధువులే ఆదరిస్తున్నారు. ఆమె ఇంటి సమీపంలో ఉన్న చిట్టమ్మచెరువు పాఠశాలను బైపాస్ రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించనున్నుట్టు తెలుసుకున్నారు. ఆ పాఠశాల విద్యార్థుల పరిస్థితి ఏమిటన్న ఆలోచన ఆమెను కదిలించింది. పిల్లల చదువుకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని భావించారు. తాను వృద్ధాప్యంలో పూరింట్లోనైనా కాలం వెళ్లదీస్తానని నిర్ణయించుకుని, తనకున్న ఐదు సెంట్ల భూమి, తన ఇంటితో సహా పంచాయతీకి దానంగా ఇచ్చేశారు. తాను బతికుండగానే పాఠశాల భవనాన్ని నిర్మించి, తన పేరు పెట్టాలని కోరారు. గ్రామస్తుల సన్మానం కాగా పాఠశాలకు యావదాస్తి దానమిచ్చిన గనికమ్మను శుక్రవారం పాఠశాల ఆవరణలో సర్పంచ్ రాజులపూడి భీముడు అధ్యక్షతన గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ముఖ్యఅతిథి ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు మాట్లాడుతూ పాఠశాలకు యావదాస్తిని విరాళంగా ఇచ్చిన గనికమ్మ ఆదర్శప్రాయురాలని, ఆమెను తాను దత్తత తీసుకుని, బాగోగులు చూస్తానని హామీ ఇచ్చారు. జెడ్పీటీసీ సభ్యురాలు అధికారి జయవెంకటలక్ష్మి మాట్లాడుతూ గనికమ్మ ఈ ఊరిలో పుట్టడం గ్రామస్తుల అదృష్టమని చెప్పారు. గనికమ్మ జీవితాంతం అండగా ఉంటామని గ్రామస్తులు భరోసా ఇచ్చారు. -
సిద్దాపురాన్ని ఫైనల్ చేశాం
మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు మండలం సిద్దాపురం గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు హీరో మహేశ్ బాబు ప్రకటించారు. తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావుతో బాగా ఆలోచించిన తర్వాత.. ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నానన్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. రాబోయే కాలంలో నిర్మాణాత్మకంగా, అర్థవంతంగా వెళ్లాలని చూస్తున్నట్లు మహేశ్ చెప్పారు. ఇంతకుముందు తన తండ్రి సొంత ఊరైన బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేశ్.. తాజాగా సిద్దాపురాన్ని కూడా దత్తత తీసుకుంటున్నాడు. అయితే, దీనికి సంతోషించిన మంత్రి కేటీఆర్.. తనను మాత్రం సర్ అని పిలవొద్దని మహేశ్ను కోరారు. తనకు ఇంకా 'నైట్హుడ్' రాలేదని, అందువల్ల కేటీఆర్ అంటే చాలని సరదాగా చెప్పారు. After much thought @KTRTRS garu and myself have chosen to adopt Siddhapuram village of Kottur mandal in Mahabubnagar district :) — Mahesh Babu (@urstrulyMahesh) September 28, 2015 Looking forward to a constructive and meaningful journey ahead :) — Mahesh Babu (@urstrulyMahesh) September 28, 2015 -
మీ ప్రేమకు థాంక్స్: మహేశ్ బాబు
శ్రీమంతుడు సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికీ పలు కేంద్రాల్లో ఆ సినిమా విజయవంతంగా నడుస్తోంది. దాంతో అభిమానులకు మహేశ్ బాబు థాంక్స్ చెబుతూ ట్వీట్ చేశాడు. బేషరతుగా ప్రేమ, మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని చెబుతూ.. లవ్ యు ఆల్ అన్నాడు. దాంతోపాటు సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ట్రైలర్ను కూడా యూట్యూబ్ ద్వారా విడుదల చేసి, ఆ లింకును తన ట్వీట్తో పాటు అందించాడు. బాహుబలి లాంటి పెద్ద సినిమా విడుదలైన తర్వాత వచ్చిన శ్రీమంతుడు కూడా మంచి హిట్ కావడంతో మొత్తం యూనిట్ అంతా మంచి సంతోషంగా ఉంది. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు దర్శకుడు కొరటాల శివకు మహేశ్ బాబు ప్రత్యేకంగా ఒక ఆడి కారును కూడా బహూకరించిన విషయం తెలిసిందే. Thanking each and everyone for ur unconditional love and support . Love you all :) https://t.co/5qElJa2ypV — Mahesh Babu (@urstrulyMahesh) September 28, 2015 -
న్యూజెర్సీలో 'శ్రీమంతుడు' వేడుకలు
విజయవాడ: 'శ్రీమంతుడు' చిత్రం విజయోత్సవ వేడుకలను అక్టోబర్ 24న అమెరికాలోని న్యూజెర్సీలో జరుపనున్నట్లు ఆ చిత్ర నిర్మాత యలమంచిలి రవిశంకర్ తెలిపారు. ఈ వేడుకల్లో చిత్ర హీరోహీరోయిన్లతో పాటు నటీనటులంతా పాల్గొంటారని ఆయన తెలియజేశారు. విజయవాడలోని తన స్నేహితుల ఇంటికి వచ్చిన సమయంలో రవిశంకర్ మీడియాతో ముచ్చటించారు. మహేశ్బాబు అభిమానులు న్యూజెర్సీలో ఎక్కువగా ఉన్నారని అందుకే ఈ వేడుకలను అక్కడ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ వేడుకల్లో సుమారు 3 వేల మంది తెలుగువారు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. -
ది స్టోరీ రిపీట్స్
బాలీవుడ్ శ్రీమంతుడు... కోటీశ్వరుడైన తండ్రితో ఎడం పాటించే కొడుకుగా ఇటీవల ‘శ్రీమంతుడు’లో మహేష్బాబు కనిపిస్తాడు. కాని దీని కంటే ముందే బాలీవుడ్లో ‘షరాబీ’ (1984) ఇదే కథాంశంతో వచ్చింది. కోట్లాది ఆస్తికి వారసుడైన అమితాబ్ తండ్రి ప్రేమకు అలమటించి డబ్బు సంపాదనలో బిజీగా ఉండే ఆ తండ్రి (ప్రాణ్) పట్ల వ్యతిరేకత పెంచుకుని తాగుబోతుగా మారతాడు. దీనికి హాలీవుడ్లోని సూపర్ డూపర్ హిట్ సినిమా ‘ఆర్థ్రర్’ (1981) మూలం అని అంటారు. షరాబీలో మొదటిసారిగా జయప్రద అమితాబ్ పక్కన నటించింది. బప్పి లహరి చేసిన పాటలన్నీ భారీ హిట్స్గా మోగాయి. వీటిలో ‘దే దే ప్యార్ దే ’... ‘మంజిలే అప్నీ జగా’,.. ‘ఇంతెహా హోగయి ఇంతెజార్కీ’... పాటలు ఇప్పటికీ రేడియోలో మోగుతుంటాయి. ఇంకో విశేషం కూడా ఉంది. దీని దర్శకుడైన ప్రకాష్ మెహ్రా ఈ కథను అమితాబ్కు చెప్పినప్పుడు చాలా బాగుంది కాని కొన్ని సీన్లు తగ్గించి తీసుకురా అన్నాడట అమితాబ్. ఎందుకు అని అడిగితే- ఇందులో నాది తాగుబోతు పాత్ర. ప్రతి డైలాగ్ను తాగిన మత్తులో ఉన్నవాడిలా నెమ్మదిగా చెప్పాలి. డ్యూరేషన్ పెరుగుతుంది. సీన్లు తక్కువ చేస్తే మొత్తం నిడివి సరిపోతుంది అన్నాట్ట. క్రాఫ్ట్ మీద అమితాబ్ కమాండ్కు అంత పెద్ద దర్శకుడు కూడా నోరెళ్లబెట్టక తప్పలేదు. అన్నట్టు ఈ సినిమాలోని ఫస్ట్హాఫ్ను చిరంజీవి నటించిన ‘కిరాతకుడు’కు ఉపయోగించుకున్నారు. ప్రాణ్ పాత్రను జగ్గయ్య పోషిస్తే తాగుబోతు అమితాబ్గా చిరంజీవి తెల్లజుబ్బాలో బాటిల్ పట్టుకుని కనిపిస్తారు. ఆ సినిమా ఫలితం ఏమయ్యిందో ప్రేక్షకులకు తెలుసు. -
శ్రీమంతుడిపై విశ్వనాయకుడు ప్రశంసలు
తమిళసినిమా : ఒక నటుడి నటనను మరో నటుడు అభినందించడానికి చాలా పెద్ద మనసు కావాలి. అలా ప్రశంసించే ఉన్నత వ్యక్తిత్వం విశ్వనాయకుడు కమలహాసన్కు, ఆ అర్హత ప్రిన్స్ మహేశ్బాబుకు మెండుగా ఉన్నాయి. అందుకే ఈ వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. వివరాల్లోకెళితే టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబు నటించిన తాజా చిత్రం శ్రీమంతుడు ఈ నెల 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలై విజయ విహారం చేస్తున్న విషయం తెలిసిందే. మంచి కథ, కథనం, దర్శకత్వం, విలువలతో కూడిన నిర్మాణం, నటీనటుల ఉత్తమ నటన, చక్కని సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన చిత్రం శ్రీమంతుడు అంటూ సర్వత్రా అభినందనలు అందుకుంటున్న నేపథ్యంలో నటుడు కమలహాసన్ ప్రశంసలు చిత్ర యూనిట్ రెట్టింపు సంతోషానికి గురి చేశాయి. ఇందులో కథానాయికిగా శ్రుతీహాసన్ నటించారన్నది తెలిసిన విషయమే. శ్రీమంతుడు చిత్రాన్ని ఆమె ఇటీవల తన తండ్రి కమల్కు చూపించారు. చిత్రం చూసిన కమలహాసన్ మహేశ్బాబు నటన, డాన్స్లపై ప్రశంసల వర్షం కురిపించారు. శ్రుతి డాన్స్ను అభినందిం చారు. సామాజిక సృహ ఉన్న కథాంశంతో రూపొందించిన దర్శకుడిని, నిర్మాతను అభినందించారు. ఇది తెలిసిన మహేశ్బాబు ఇంకా ఖుషీ అవుతున్నారట. కాగా, శ్రీమంతుడు చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి వారానికి 101.25 కోట్లు వసూలు చేసి వంద కోట్ల క్లబ్లో చేరినట్లు ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ అధినేత వెల్లడించారు. -
'సైకిల్ తొక్కండి...లేకపోతే లావైపోతారు'
రాయదుర్గం (హైదరాబాద్) : 'సైకిల్ తొక్కండి.. చాలా మంచిది..లేకపోతే లావైపోతారని...' సినీ హీరో మహేష్బాబు సూచించారు. శనివారం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ ఆధ్వర్యంలో'చక్ దే ఇండియా రైడ్'ను సినీ నటుడు జగపతిబాబు, దర్శకుడు కొరటాల శివతో కలిసి జెండా ఊపి రాయదుర్గంలోని హెచ్బీసీ సైక్లింగ్ స్టేషన్ వద్ద మహేష్బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సైకిల్ తొక్కాలని కోరారు. సైక్లింగ్ ఎంతో ఆరోగ్యకరమని, పర్యావరణ పరిరక్షణకు ఎంతో తోడ్పడుతుందని చెప్పారు. ఇండిపెండెన్స్డే అంటే తనకెంతో ఇష్టమని, ప్రతిసారీ ఉత్సాహంగా జరుపుకుంటానని, ఈ సారి శ్రీమంతుడు విజయంతో మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికే ఈ కార్యక్రమానికి వచ్చినట్లు వివరించారు. సైకిల్ ఎంతో పాపులర్ అయింది : జగపతిబాబు 'శ్రీమంతుడు' సినిమాలో తాను చార్టర్ ప్లేన్లో దిగానని, కానీ హీరో మహేష్బాబు సైకిల్పై వచ్చాడని... దీంతో విలువైన చార్టర్ ప్లేన్ కన్నా సాధారణ సైకిల్ ఎంతో పాపులర్ అయిందని సినీ నటుడు జగపతిబాబు పేర్కొన్నారు. శ్రీమంతుడు సినిమాలో తండ్రీకొడుకులుగా జగపతిబాబు, మహేష్బాబులు నటించిన విషయం తెలిసిందే. ట్రాఫిక్ జామ్... కాగా 'చక్ దే ఇండియా రైడ్'ను జెండా ఊపి ప్రారంభించేందుకు వచ్చిన మహేష్బాబు, జగపతిబాబును చూసేందుకు యువత పెద్ద సంఖ్యలో తరలిరావటంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది. సినీ నటులు వెళ్లేంత వరకు ట్రాఫిక్ పోలీసులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. -
'శ్రీమంతుడూ' మా ఊరిని దత్తత తీసుకోరూ...
ఇటీవల వచ్చిన తెలుగు సినిమాల్లో 'శ్రీమంతుడు' మంచి స్ఫూర్తిదాయకమైన సందేశాత్మకమైన సినిమా. ఈ సినిమా చూసిన ప్రతిఒక్కరికి సొంత ఊరిపై ఖచ్చితంగా ధ్యాస మళ్లుతుంది. సినిమాను వాణిజ్య పరమైన అంశాలతో తీసినప్పటికీ ఓ సందేశాన్ని ప్రజ ల్లోకి వదలడంలో దర్శకుడు సఫలుడయ్యాడు. ఆర్థిక అసమానతలు ఊరితో పాటే పుట్టి పెరిగిన గడపల్లో ఈ సినిమా ఒక ఓదార్పు. సంపన్నులకు సొంత ఊరి పైన మమకారం పెంచేందుకు స్ఫూర్తినిచ్చిన సినిమా శ్రీమంతుడు. సినిమా అనేది చక్కటి ప్రసార మాధ్య మం. విస్తృతంగా ప్రజల్లో వేగంగా వ్యాపిస్తుంది. కాక పోతే సినిమా చూసిన ప్రతి ఒక్కరు వెంటనే మారి పోరు. పరిస్థితులు, పరిణామాలు, సంఘటనలు, బంధాలు, జనజీవన సంబంధాలతో ముడిపడి కొం తమంది స్ఫూర్తి పొందుతారు. ఈ విషయంలో ప్రజల్లో.. ప్రధానంగా బాగా డబ్బున్న సంపన్న వర్గా లలో కొంత ఆలోచన రేకెత్తించడంలో 'శ్రీమంతుడు'కొంతమేరకైనా విజయం సాధించింది. సినిమా దర్శకుడు ఒక ఊరిని కథా వస్తువుగా ఎన్నుకుని సినిమా ద్వారా చేసిన సాహసానికి మహేశ్ బాబు చక్కటి నటనతో ప్రేక్షకుల్లో పండింది. నిర్మాత, సహ నిర్మాత, నటుడు, దర్శకుడు అందరూ మొత్తం హ్యాపీ. ఒక ఊరిని కథా వస్తువుగా ఎన్నుకుని నేటి యువతరానికి తగ్గట్టుగా సినిమా తీర్చిదిద్ది అందిం చడం వల్లే సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో శ్రీమం తుడు సినిమా యూనిట్ను నా ఊరిపైన స్వార్థంతో మా ఊరిని దత్తత తీసుకోవాలని వేడుకుంటున్నాను. శ్రీమంతుడి సినిమాలో ఇచ్చిన ఆదర్శవంతమైన మెసేజ్కు మీ సహాయం తోడైతే ఇతరులకు మీరు కూడా ఆదర్శంగా నిలుస్తారనే ఆశతో మా ఊరిని దత్తత తీసుకోవాలని శ్రీమంతుడు నిర్మాత, సహ నిర్మాత, నటుడు మహేశ్బాబును కోరుతున్నాను. తెలంగాణలోని వరంగల్ జిల్లా కురవి మండలం తట్టుపల్లి మా గ్రామం. స్వాతంత్య్రం సిద్ధించి ఇం తకాలం అయినా గ్రామంలో సమస్యలు మాత్రం అం టువ్యాధిలా పట్టుకుని పీడిస్తూనే ఉన్నాయి. నేను నా ఊరికి ఏదో చేయాలని నా శక్తిమేరకు ప్రయత్నం చేశా ను. రోడ్డు లేకుండా ఇబ్బంది పడుతున్న తండా వాసులకు అప్పటి వరంగల్ ఎంపీ రవీంద్రనాయక్ సహాయంతో రోడ్డు వేయించాను. స్వచ్ఛమైన తాగు నీరు లేక కలుషిత జలాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు మాజీ కేంద్రమంత్రి బలరాంనాయక్ సహాయంతో మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టించాను. ఇంత మేరకు నా శక్తి సరిపోయింది. ఇవి మాత్రమే చేయగ లిగాను. ఇప్పటికీ గ్రామంలో హైస్కూల్ లేదు. హైస్కూల్కు వెళ్లాలంటే 6 కిలోమీటర్లు బురద పొలా ల్లో నుంచి నడిచి వెళ్లిరావాలి. కనీసం గ్రామానికి చెరువు లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమ స్యలే ఉన్నాయి. అందుకే మా గ్రామాన్ని శ్రీమంతుడు సినిమా యూనిట్ దత్తత తీసుకోవాలి. మీరు కేవలం సినిమాలు తీసి సందేశం ప్రజల్లోకి పంపించడమే కాదు, ప్రత్యక్షంగా కూడా సహాయం చేస్తే మరింత మందికి ఆదర్శవంతులవుతారు. మీరు చేసే ఈ పని తో మరింత మంది స్ఫూర్తి పొంది గ్రామాలను దత్తత తీసుకునే వీలు కలుగుతుంది. దొంతు రమేష్ తట్టుపల్లి, కురవి మండలం, వరంగల్ జిల్లా. మొబైల్: 9618399991 -
చారుశీల... స్వప్న బాల!
‘‘ఈ చిత్రకథ విన్నప్పుడే హిట్ ఖాయం అనుకున్నా. అలాగే నేను చేసిన చారుశీల పాత్ర నా కెరీర్లో మెమొరబుల్గా నిలిచిపోతుందని ముందే తెలిసిపోయింది. సినిమా విడుదలయ్యాక కూడా అందరూ ఈ పాత్రను ఇష్టపడుతున్నారు. ఇంత మంచి పాత్ర ఇచ్చిన శివగారికి చాలా థ్యాంక్స్. పాటలపరంగా కూడా ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ‘చారుశీల.. స్వప్న బాల’ చాలా బాగుందని అందరూ అంటున్నారు’’ అని కథానాయిక శ్రుతీహాసన్ చెప్పారు. మహేశ్బాబు, శ్రుతి జంటగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ నిర్మించిన ‘శ్రీమంతుడు’ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం సక్సెస్ మీట్ బుధవారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ-‘‘ ‘శ్రీమంతుడు’ ఇంత పెద్ద శ్రీమంతుడు అవుతాడని ఊహించలేదు. ‘మంచి ఎమోషనల్ టచ్ ఉన్న సినిమా’ అని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. సాధారణంగా ఏ సినిమా అయినా ఒక సెక్షన్కి నచ్చుతుంది, ఇంకో సెక్షన్కు నచ్చదు. కానీ అన్ని వర్గాల వారినీ ఆకట్టుకున్న సినిమా ఇది. ఇంత పెద్ద సక్సెస్ను అసలు ఊహించలేదు. తమిళ పరిశ్రమలోని దర్శక, నిర్మాతలందరూ ఫోన్ చేసి ఓ మంచి యూనివర్శల్ సబ్జెక్ట్తో ఈ సినిమా తీశారని అభినందించారు’’ అని తెలిపారు. ‘‘మేం ఈ సినిమాను చాలా ప్రేమించి చేశాం. విడుదలయ్యాక ప్రేక్షకులు అంతకు మించిన ప్రేమను కురిపిస్తున్నారు. మంచి ఫీల్ గుడ్ మూవీకి చాలా పెద్ద సక్సెస్నిచ్చారు’’ అని జగపతిబాబు చెప్పారు. -
ఘనంగా ‘శ్రీమంతుడు’ సక్సెస్ వేడుకలు
కాచిగూడ: ప్రిన్స్ మహేష్బాబు జన్మదినం, శ్రీమంతుడు సినిమా సక్సెస్ సందర్భంగా ఆదివారం ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన ఆధ్వర్యంలో సంధ్య థియేటర్లో కేక్ కట్చేసి వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో సూపర్స్టార్ కృష్ణ మహేష్ సేన జాతీయ అధ్యక్షుడు, జీహెచ్ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ దిడ్డి రాంబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో కృష్ణ, మహేష్బాబు అభిమానులు మధు, బ్యాంకు రాజు, రాజారెడ్డి, మహేందర్గౌడ్, శ్రీనివాస్ గౌడ్, బిఆర్ రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బ్లాక్ టికెట్ల విక్రేతలు అరెస్టు
విజయవాడ సిటీ : శ్రీమంతుడు సినిమా విడుదలను పురస్కరించుకొని గవర్నరుపేట పోలీసు స్టేషన్ పరిధిలోని సినిమా థియేటర్ల వద్ద టికెట్లను బ్లాకులో విక్రయిస్తున్న 13మందిని శుక్రవారం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నగదు, సినిమా టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ అధికారుల కథనం ప్రకారం.. సినిమా టికెట్లను భారీగా బ్లాకులో విక్రయిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు పలు థియేటర్ల వద్ద ఏసీపీ పి.మురళీధర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా13 మంది పట్టుబడ్డారు. వారి వద్ద రూ.17,340 నగదు, 63 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణ కోసం వారిని గవర్నరుపేట పోలీసులకు అప్పగిం చారు. ఎస్ఐ సురేష్రెడ్డి దాడుల్లో పాల్గొన్నారు. సత్యనారాయణపురంలో.. సత్యనారాయణపురం : శ్రీమంతుడు సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద బ్లాక్లో టికెట్లు విక్రయిస్తున్న 11 మందిని సత్యనారాయణ పురం పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వారి వద్ద రూ.9వేలు స్వాధీనం చేసుకున్నారు. గాంధీనగర్ థియేటర్ల వద్ద వారిని పట్టుకున్నా మని సీఐ సత్యనారాయణ తెలిపారు. -
శ్రీమంతుడు దిల్లున్నోడు
‘అంతా నేనే’ అనుకుంటే అధిపతి అవుతారేమో! ‘అంతా నాది’ అనుకుంటే ఆస్తిపరులు అవుతారేమో! ‘అంతా మనవాళ్లే’ అనుకుంటే శ్రీమంతులవుతారు. ఆస్తి సున్నా అయినా ఫర్వాలేదని... సంతకం పెట్టిన చెక్కుమీద ఎక్కువ సున్నాలుంటే... ఓహ్... దిల్లున్న మహారాజులవుతారు. మనిషి జీవితాన్ని ఎంతగా ప్రేమించాడన్నది విషయం కాదు... మనిషి ఎంతమంది ప్రేమను సంపాదించాడన్నది పరమార్థం. అదే ఈ శ్రీమంతుడి అసలైన బ్యాంక్ బ్యాలెన్స్. తారాగణం: మహేశ్బాబు, శ్రుతీహాసన్, జగపతి బాబు, ముఖేశ్రుషి, రాజేంద్రప్రసాద్, సుకన్య, తులసి; కెమేరా: మది; సంగీతం: దేవిశ్రీప్రసాద్; ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు; నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్; రచన - దర్శకత్వం: కొరటాల శివ; రిలీజ్ డేట్: ఆగస్టు 7; నిడివి: 163 నిమిషాలు. కొత్త సినిమా గురూ! ఆగస్టు 9వ తేదీ. హీరో మహేశ్బాబు పుట్టినరోజు. ప్రతి ఏటా మహేశ్ ఫ్యాన్స్కూ, ఆయన తండ్రి హీరో కృష్ణ ఫ్యాన్స్కూ అది పండగరోజు. కానీ, ఈ సారి పండుగ రెండు రోజులు ముందే వచ్చింది. ఆగస్టు 7... శుక్రవారం... హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని పాపులర్ సినిమా థియేటర్ల దగ్గర కోలాహల వాతావరణమే అందుకు ఉదాహరణ. ఒక్క రాజధానిలోనే కాదు... రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ముఖ్యపట్నాల్లో... దేశవిదేశాల్లో ఇంచుమించు ఇదే సీన్... రిపీట్. ‘శ్రీమంతుడు’ రిలీజ్. వెనక్కి ఇచ్చేయాలనుకున్న ‘శ్రీమంతుడు’ ఇంతకీ ‘శ్రీమంతుడు’లో ఏముంది? సినిమా కథేమిటి? రొటీన్గా వస్తున్న సినిమాలకు భిన్నమైన స్టోరీలైన్ ఇది. ఉద్యోగం, వ్యాపారం కోసం సొంత ఊరొదిలేసి వచ్చేస్తున్న మనం ఎంతో సంపాదించినా, ఆ ఊరికేం చేస్తున్నాం? ఏం చేయాలి? అన్నది బేసిక్ పాయింట్. మొత్తం రెండు గంటల 43 నిమిషాల నిడివి... యు/ఏ సర్టిఫికెట్. రవికాంత్ (జగపతిబాబు) పాతికవేల కోట్ల వ్యాపారానికి అధిపతి. భార్య (సుకన్య), తమ్ముడు (సుబ్బరాజు), మేనల్లుడు కార్తీక్ (రాహుల్ రవీంద్ర) - ఇలా చాలా పెద్ద ఫ్యామిలీ. అంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. ఇంత కుటుంబానికీ, వ్యాపారానికీ ఒకే ఒక్క వారసుడు... హర్ష (మహేశ్బాబు). తండ్రికేమో కొడుకు తన లైన్లోకొచ్చేసి, వ్యాపారం చూసుకోవాలని! కానీ, కొడుకు ఆలోచన వేరు. ‘లెట్ మీ ఎర్న్ సమ్ రెస్పెక్ట్’ అంటాడు. డబ్బును పెంచుకొనే కన్నా ఇన్నేళ్ళుగా సంపాదించుకున్న అనుబంధాలనూ, ఆత్మీయతనూ పంచుకోవాలంటాడు. పెంచుకోవాలంటాడు! బెంజ్ కార్లున్నా స్టయిలిష్ సైకిల్ వాడే టైపు! ఆఫీస్ స్టాఫ్ చేసుకొనే శ్రీరామనవమి ఉత్సవానికి తండ్రి ఎగ్గొట్టినా, తాను వెళ్ళి ‘రామ రామ...’ అంటూ రామాయణ గీతం పాడి, ఆడి వచ్చే రకం. అందుకే, తండ్రికీ, కొడుకుకూ మధ్య ఒక చిన్న గ్యాప్. ఇంతలో హీరోకు చారుశీల (శ్రుతీహాసన్) తారసపడుతుంది. ఎం.బి.ఏ. చదివి, రూరల్ డెవలప్మెంట్ కోర్స్ చేస్తుంటుంది. ‘చాలా ఇచ్చింది మా ఊరు.ఎంతో కొంత తిరిగిచ్చేయాలి’ అంటూ ఉంటుంది. ఆమె ప్రభావంతో హీరో కూడా రూరల్ డెవలప్మెంట్ కోర్సులో చేరతాడు. ‘జత కలిసే జత కలిసే...’, ‘చారుశీలా స్వప్నబాలా...’ అని పాడుకుంటూ, ప్రేమలో పడతాడు. అతను ఫలానా డబ్బున్నవాళ్ళ కుర్రాడని తెలియక, ఆమే ప్రేమించేస్తుంది. మరోపక్క కేంద్ర మంత్రి వెంకట రత్నం (ముఖేశ్ ఋషి) కథ. హైవేల విస్తరణ కాంట్రాక్ట్ కోసం అతని కొడుకు (హరీష్ ఉత్తమన్) వచ్చి, హీరో తండ్రిని బెదిరిస్తాడు. విషయం తెలిసి, హీరో రంగంలోకి దిగుతాడు. విలన్ల బెండు తీస్తాడు. ఉత్తరాంధ్రలోని దేవరకోట గ్రామం ఆ కేంద్రమంత్రిది. అతని తమ్ముడు శశి (‘మిర్చి’ ఫేమ్ సంపత్రాజ్) ఆ ప్రాంతాన్నీ, ప్రజల్నీ పట్టి పీడిస్తుంటాడు. ఆ ఊరికి సరైన రోడ్డు లేదు. బడి లేదు. వ్యవసాయానికీ, తాగునీటికీ ఆధారమైన చెరువు కూడా మద్యం ఫ్యాక్టరీ నడిపే విలన్ల చేతిలోనే. వ్యవసాయం గిట్టుబాటు కాక రైతుల ఆత్మహత్యలు... ఒక్కో కుటుంబం హైదరా బాద్కు వలసలు... హీరోయిన్దీ ఆ గ్రామమే. శ్రీమం తుల బిడ్డ అయిన హీరోవాళ్ళదీ ఆ ఊరేనని హీరోయిన్ తెలుసుకుంటుంది. ‘మీ ఊరేదో తెలుసా? ఊరొదిలి వచ్చేసిన మీ నాన్న ఆ ఊరికేం చేశారు’ అంటూ హీరోని నిలదీస్తుంది. హీరో ఆలోచనలో పడతాడు. మూలాలు వెతుక్కుంటూ ఊరి బాట పడతాడు. అక్కడ ఇంటర్వెల్ బ్లాక్. ఇంటర్వెల్ అయిన తరువాత నుంచి కథ ఊళ్ళో తిరుగుతుంది. ఊరికి వెళ్ళిన హీరో తానెవరో బయటపెట్టడు. ఊరి బాగు కోసం సిద్ధపడతాడు. అదే ఊరిలో పుట్టి పెరిగి, ఊరొదిలేసి పట్నానికి వచ్చేసిన తన తండ్రి ఫ్లాష్బ్యాక్ తెలుస్తుంది. ఇవాళ ఇంత కమర్షియల్ బిజినెస్మ్యాన్గా తన తండ్రి ఎందుకు మారాడో అర్థమవుతుంది. ఇంతకీ హీరో తండ్రి జీవితంలో ఉన్న మానని గాయం ఏమిటి? కన్నతల్లి లాంటి ఊరిని అతనెందుకు వదిలేశాడు. పది నిమిషాల ఈ ఫ్లాష్బ్యాక్తో అంతా తెలుసుకున్న హీరో ఆ ఊరికి వెనక్కి ఏమిచ్చాడు? ఊరిని వేధిస్తున్న విలన్లు హీరో కోస్టల్ కారిడార్ రానున్న ఉత్తరాంధ్రలోని వేలకొద్దీ పొలాల్ని బలవంతంగా రాయించుకోవాలన్న విలన్ల ప్లాన్ ఏమైంది? హీరోకూ, అతని తండ్రికీ మధ్య సయోధ్య కుదిరిందా? హీరో ఏ రూట్ తొక్కాడు? ఇదంతా వెండితెరపై వచ్చే ‘శ్రీమంతుడు’ మిగతా కథ. టీమ్ వర్క్ అమెరికాలో డిస్ట్రిబ్యూటర్స్గా పేరు తెచ్చుకొన్న ముగ్గురు మిత్రులు (నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్) నిర్మాతలై, తొలిసారిగా చేసిన ప్రయత్నమిది. ‘భద్ర’, ‘ఒక్కడున్నాడు’, ‘బృందావనం’ తదితర చిత్రాల రచయితగా మొదలైన కెరీర్ కొరటాల శివది. దర్శకుడిగా ప్రభాస్తో ‘మిర్చి’ లాంటి సూపర్హిట్ తీసిన ఆయనకు డెరైక్టర్గా ఇది రెండో ఫిల్మ్. రచయితగా తన స్ట్రెంత్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూనే, అలవాటైన కెమెరామన్ (‘మిర్చి’ ఫేమ్ మది), అనుభవజ్ఞుడైన ఎడిటర్ (కోటగిరి వెంకటేశ్వరరావు), మ్యూజిక్ డెరైక్టర్ (దేవిశ్రీప్రసాద్) అండ తీసుకున్నారు. మహేశ్బాబు లాంటి సీజన్డ్ ఆర్టిస్ట్ అండ ఉండనే ఉంది. ఐటమ్ సాంగ్స్ లాంటి హంగామాలూ, కథలో కలవని సెపరేట్ కామెడీ ట్రాక్లూ, వినోదం పేరిట వెకిలి డైలాగ్లూ సినిమాలో కనిపించవు. రెండు సినిమాల తర్వాత... నిజానికి, మహేశ్ నటించిన గత రెండు సినిమాలూ - ‘1... నేనొక్కడినే’, ‘ఆగడు’ అంచనాల్ని అందుకోలేదు. ప్రేక్షకులు, ఫ్యాన్సే కాదు... మహేశ్ కూడా డిజప్పాయింటెడ్. అందుకే ఇప్పుడు ‘శ్రీమంతుడు’పై ఆశలు, అంచనాలు. ‘బాహుబలి’తో ప్రేక్షకులు, పరిశ్రమ మంచి జోష్ మీద ఉన్న టైమ్లో మహేశ్ కరెక్ట్గా మళ్ళీ తెరపైకొచ్చారు. ఎక్కడ ఉండి సినిమా చూస్తున్నవాళ్ళకైనా... కన్నతల్లి లాంటి సొంత ఊరిని గుర్తు చేశాడు! కమర్షియల్ హీరోలు తటపటాయించే ఇలాంటి స్టోరీలైన్ను ఓకె చేయడం, నటిస్తూనే ప్రొడక్షన్లో పార్ట్నర్ కూడా కావడం - మహేశ్ గొప్పే! ఇలాంటి కథ... మధ్య మధ్యలో ‘ఊరు చాలా ఇచ్చింది. ఎంతో కొంత వెనక్కి ఇచ్చేయాలి. లేకపోతే లావైపోతాం’ లాంటి మంచి డైలాగులు... మొత్తం మీద ఒక మంచి కాన్సెప్ట్ను మాస్కు చేరవేయడంలో కొరటాల శివ ప్రయత్నం కూడా మెచ్చుకొని తీరాల్సిందే! సొంత ఊరిని బాగుచేయడమనే కాన్సెప్ట్ కె. విశ్వనాథ్ - బాలకృష్ణల ‘జననీ జన్మభూమి’ నాటి నుంచి ఉన్నదే. అయితే, ఊరును దత్తత చేసుకొని, బాగు చేయాలంటూ ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ప్రచారానికి తగ్గట్లు ఇప్పటికి ఇది గుడ్ కమర్షియల్ ఎటెంప్ట్ ఆన్ సిల్వర్స్క్రీన్! తమిళ, మలయాళ సీమల్లోనూ శుక్రవారమే తమిళ వెర్షన్ రిలీజైంది. క్లీన్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఆశించే ఆడియన్స్ అభిమానధనం ఇప్పటికి ఈ ‘శ్రీమంతుడు’ సొంతం! మీకు తెలుసా? ► అన్నయ్య రమేశ్, అక్కయ్య మంజుల నిర్మాతలైన చిత్రాల్లో గతంలో మహేశ్ పాలుపంచుకున్నారు. ఇప్పుడు తొలిసారిగా ‘మహేశ్బాబు ఎంటర్టైన్ మెంట్ ప్రై.’ పెట్టి, ‘శ్రీమంతుడు’ పార్ట్నరయ్యారు. ►‘రామ రామ’లో హీరోయిన్ పూర్ణ డ్యాన్స్ చేశారు. ►ఒకప్పటి సూపర్హిట్ ‘పెద్దరికం’ జంట సుకన్య, జగపతిబాబు చాలా ఏళ్ల తర్వాత కలిసి నటించారు. మహేశ్ అమ్మానాన్న పాత్రలు చేశారు. ►‘శంకరాభరణం’ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తనయుడు, ‘స్వరకల్పన’ తదితర చిత్రాల్లో హీరోగా నటించిన ఏడిద శ్రీరామ్ చాలా ఏళ్ల విరామం తర్వాత ఇందులో ఓ పాత్ర చేశారు. ► ఇంతకు ముందు కూడా మహేశ్ సినిమాలు తమిళంలోకి డబ్ అయ్యాయి. అయితే తెలుగుతో పాటే తమిళంలోనూ అదే రోజు రిలీజైన తొలి సినిమా ఇదే. తమిళ వెర్షన్ పేరు ‘సెల్వందన్’. ► ఈ సినిమాకు సింగిల్ కార్డ్ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి. ‘రామ... రామ’ పాటలో ముందు వచ్చే సాకీ పాడుతూ, ఆయన తెరపై కనిపిస్తారు. ► ఇందులో మహేశ్ ఉపయోగించిన సైకిల్ ఖరీదు సుమారు 4 లక్షల రూపాయలు. ఆటోమేటిక్ గేర్స్ ఉండడం దీని స్పెషాల్టీ. ముందు ఏమనుకున్నారంటే... ► ఈ కథను మహేశ్ కన్నా ముందు ఇంకో హీరోకి చెప్పారట దర్శకుడు కొరటాల శివ. ఆ హీరో ఆసక్తి చూపకపోవడంతో ప్రాజెక్ట్ మహేశ్ దగ్గరకొచ్చింది. ► ‘శ్రీమంతుడు’ కన్నా ముందు ‘ఊరికి మొనగాడు’, ‘మగాడు’ లాంటి టైటిల్స్ ప్రచారమయ్యాయి. ఎక్కడెక్కడ తీశారంటే... ► హైదరాబాద్, ఆర్ఎఫ్సీ, పొల్లాచ్చి, కారైక్కుడి, పుణే, మలేసియా ► మొత్తం వర్కింగ్ డేస్... సుమారు 120 రోజులు బిజినెస్ ఖబర్ ‘శ్రీమంతుడు’ రూ. 60 కోట్ల నిర్మాణవ్యయంతో తయారైనట్లు ప్రచారం. విడుదలకు ముందే నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ మిగిల్చింది. ‘శ్రీమంతుడు’ శాటిలైట్ రైట్స్ ‘జీ తెలుగు’ సొంతం చేసుకుంది. రైట్స్ దాదాపు రూ. 10 కోట్ల పైగా మొత్తం పలికినట్లు వ్యాపారవర్గాల భోగట్టా. శాటిలైట్ రైట్స్ రేట్లు రూ. 10 కోట్ల పై మాట పలకడం తెలుగు సినీ చరిత్రలో తొలి సారి. (‘బాహుబలి’ రైట్స్ తుది రేటు ఇంకా చర్చల్లోనే ఉంది). రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు అధికారికంగానే బాగా పెంచేశారు. దీంతో సినిమా నికరవసూళ్లు బాగా పెరుగుతాయి. - రెంటాల జయదేవ -
తమిళంలో సెల్వేందన్గా శ్రీమంతుడు
ప్రిన్స్గా, సూపర్స్టార్గా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్న మహేశ్బాబు నటించిన తాజా చిత్రం శ్రీమంతుడు. మిర్చి వంటి విజయవంతమైన చిత్రం తరువాత కొరటాల శివ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. అందాల తార శ్రుతిహాసన్ కథానాయికి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, వై రవిశంకర్, మోహన్ సంయుక్తంగా నిర్మించిన ఈ భారీ, క్రేజీ చిత్రానికి చిత్ర కథానాయకుడు మహేశ్బాబు సహనిర్మాతగా వ్యవహరించడం విశేషం. దేవీశ్రీప్రసాద్ సంగీత బాణీలు అందించారు. కాగా ఈ చిత్రాన్ని తమిళంలో సెల్వేందన్ పేరుతో భద్రకాళీ ఫిలింస్ అధినేత ప్రసాద్ రూపొందిస్తున్నారు. తమిళ వెర్షన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం నగరంలోని ఒక నక్షత్ర హోటల్లో నిర్వహించారు.చిత్ర యూనిట్తో పాటు పలువురు తమిళ సినీ ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముందుగా నటుడు జగపతిబాబు మాట్లాడుతూ 22 ఏళ్ల క్రితం చెన్నైలో ఉన్నప్పుడు పెద్దరికంలో హీరోగా నటించానని అందులో హీరోయిన్గా సుకన్య నటించారని గుర్తు చేశారు. 22 ఏళ్ల తరువాత ఇప్పుడు అదే సుకన్యతో కలిసి ఈ చిత్రంలో మహేశ్బాబుకు తల్లిదండ్రులుగా నటించినట్లు తెలిపారు. ప్రేక్షకులు సెల్వేందన్ చిత్రాన్ని విజయవంతం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. తమిళ నిర్మాతల మండలి కార్యదర్శి టి శివ మాట్లాడుతూ తెలుగులో తన మోస్ట్ పాపులర్ హీరో మహేశ్బాబు అని అన్నారు. మరో కార్యదర్శి పీఎల్ తేనప్పన్ ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే సూపర్స్టార్ చిత్ర ట్రైలర్ చూసినట్లుందన్నారు. నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ ఇది సొంత చిత్ర కార్యక్రమంలా ఉందన్నారు. ఇది మంచి ఎంట్రీ. మహేశ్బాబు తమిళంలో మరిన్ని చిత్రాలు చెయ్యాలని ఎడిటర్ మోహన్ ఆకాంక్షించారు. మహేశ్బాబు తమిళనాట శ్రీమంతుడిగా మారతారు. బాహుబలి తరువాత సెల్వేందన్ పెద్ద హిట్ అవుతుందని ఏఎం రత్నం అన్నారు. మహేశ్ తండ్రి కృష్ణ నటించిన రామ్ రాబర్ట్ రహీమ్ చిత్రాన్ని చెన్నైలో విడుదల చేసి చాలా సంపాదించానని,ఆ తరువాత తాను నిర్మించిన కందసామి చిత్రంలో కృష్ణగారు ముఖ్య పాత్ర పోషించారనని తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్ థాను తెలిపారు.అద్భుతంగా అభినయించే మహేశ్ను ఎర్ర తివాచీతో కోలీవుడ్కు ఆహ్వానిస్తున్నామని అన్నారు. చాలా సంతోషంగా ఉంది చివరిగా మహేశ్బాబు మాట్లాడుతూ తన లైఫ్లో ఫస్ట్ టైమ్ తన చిత్రం తెలుగు,తమిళ భాషల్లో ఏక కాలంలో విడుదలవుతోంది.చాలా సంతోషంగా ఉందన్నారు. చాయాగ్రాహకుడు మది సూచన మేరకే శ్రీమంతుడు చిత్రాన్ని తమిళంలోనూ విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్ర ఆడియో ఆంధ్రాలో విశేష ఆదరణ పొందింది.తమిళ ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. దేవిశ్రీప్రసాద్ చాలా మంచి సంగీత బాణీలు అందించారని మహేశ్ అభినందించారు. చిత్ర నిర్మాత భద్రకాళీ ప్రసాద్ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. -
బ్లాక్ లో 'శ్రీమంతుడు' సినిమా టికెట్లు
విశాఖపట్టణం: మహేశ్ బాబు హీరోగా నటించిన 'శ్రీమంతుడు' సినిమా టికెట్లును బ్లాక్ లో విక్రయిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అభయ బ్రాడ్ బాండ్ కార్యాలయంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం దాడి చేసి బ్లాక్ టిక్కెట్ల విక్రయాన్ని అడ్డుకున్నారు. 800 టిక్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. రూ. 200 టిక్కెట్ ను రూ.1000 అమ్ముతున్నారని టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. సినిమా టిక్కెట్లు బ్లాక్ అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. 'శ్రీమంతుడు' సినిమా శుక్రవారం విడుదలకానుంది. -
మహేశ్ అందంగా ఉంటే మంచిదే కదా!
శ్రుతీహాసన్ చాలా స్ట్రాంగ్! ఇండిపెండెంట్.. ఇంటెలిజెంట్! ఆమె దృష్టిలో గ్లామర్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్! ఎక్కడ ఎటాచ్ కావాలో... ఎప్పుడు డిటాచ్ కావాలో...ఆమెకు బాగా తెలుసు గ్రేట్ యాక్టర్ కమల్హాసన్ కూతురిగా గోల్డెన్ స్పూన్తో పెరిగినా లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అన్నీ చూసేశారామె.తెలుగు, తమిళ, హిందీ భాషల్లో శ్రుతి ‘మోస్ట్ వాంటెడ్’ హీరోయిన్. మహేశ్బాబుతో ‘శ్రీమంతుడు’లో చారుశీలగా క నబడిన శ్రుతి చెప్పిన ముచ్చట్లు... *** సినిమా సినిమాకీ మీ అందం పెరుగుతోందనిపిస్తోంది... ఏంటా రహస్యం? థ్యాంక్స్ అండి. చెప్పాలంటే నేను ప్రత్యేకంగా ఏమీ చేయడంలేదు. వయసుతో పాటు మెచ్యూర్టీ వస్తుంది కదా.. అప్పుడు అందం కూడా పెరుగుతుంది. *** అందంగా ఉంటే ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుందా? అలా ఏం లేదు. స్టయిల్గా కనిపించడం కోసం జుత్తుకు రంగేసుకోవడం, ఆకర్షణీయంగా కనిపించడం కోసం పెదాలకు రంగు వేసుకోవడం ముఖ్యం కాదు. లోపల మనం స్ట్రాంగ్గా లేకపోతే పై పైన ఎన్ని మెరుగులు దిద్దుకున్నా పేలవంగా కనిపిస్తాం. మన మీద మనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉంటే అప్పుడు అందంగా లేకపోయినా అందంగానే కనిపిస్తాం. బాహ్య సౌందర్యం అనేది దేవుడి ఇచ్చేది. ఇన్నర్గా స్ట్రాంగ్గా ఉండటం అనేది మన చేతుల్లోనే ఉంది. అందంగా లేకపోయినా ఫర్వాలేదు... ఆత్మవిశ్వాసం లేకపోతే ఏమీ చేయలేం. *** మీ ప్రొఫెషన్ అందంతో ముడిపడింది కాబట్టి, చాలా కేర్ తీసుకోవాలిగా? అఫ్కోర్స్ అది నిజమే. మాది గ్లామరస్ ఫీల్డ్ కాబట్టి, కేర్ తీసుకోవాలి. లేకపోతే ప్రేక్షకులు డిజప్పాయింట్ అవుతారు. అలాగని బ్యూటీ కేర్ కోసం నేను గంటలు గంటలు కేటాయించను. ఎంత తీసుకోవాలో అంతే. *** స్ర్కీన్పై గ్లామరస్గా కనిపించే మీరు.. రియల్గా కూడా అలానే ఉండాలనుకుంటారా? నా పర్సనల్ లైఫ్లో నేను గ్లామరస్గా ఉండను. చాలా నిరాడంబరంగా ఉంటాను. వీలైనంతవరకూ మేకప్ జోలికి వెళ్లను. సింపుల్గా డ్రెస్ చేసుకుంటాను. హెయిర్ స్టయిల్ కూడా చాలా మామూలుగా ఉంటుంది. మొత్తం మీద చాలా కంఫర్టబుల్గా ఉండాలనుకుంటాను. *** తెలుగులో మీ తొలి సినిమా ‘అనగనగా ఓ ధీరుడు’ టైమ్లో కంటే... ఇప్పుడు నూతన నాయికల తాకిడి ఎక్కువైంది... పోటీ బలంగానే ఉంది కదా? నేను పోటీనీ పట్టించుకోను. ఎవరి సినిమాలు వాళ్లకి ఉంటాయి. అయినా ఏడాదికి 20 సినిమాలు వస్తే... అన్నింటిలో నేనే నటించలేను కదా. ఎన్ని చేయగలనో అన్నే చేస్తున్నాను. *** ఒకేసారి నాలుగైదు సినిమాలు చేయడంవల్ల విశ్రాంతి తీసుకునే వీలు చిక్కడంలేదేమో? చేతి నిండా పని ఇస్తున్నందుకు థ్యాంక్స్ టు గాడ్. విశ్రాంతి లేకపోతేనేం ఆనందంగా ఉన్నాను. *** మరి పెళ్లెప్పుడు చేసుకుంటారు? ఎప్పుడో ఒకసారి చేసుకోవాల్సిందే. ఎప్పుడని చెప్పలేను. ఎందుకంటే, దాని గురించి అస్సలు ఆలోచించడంలేదు. *** ఓకే... త్వరలో విడుదల కానున్న మీ ‘శ్రీమంతుడు’ సినిమా విషయానికొద్దాం.. మహేశ్బాబుతో ‘ఆగడు’ కోసం ఐటమ్ సాంగ్ చేసినప్పుడు ఈ సినిమా సెట్ అయ్యిందా... అంతకుముందేనా? ‘శ్రీమంతుడు’ గురించి డిస్కషన్స్ జరుగుతున్నప్పుడే ‘ఆగడు’ ఐటమ్ సాంగ్ చేశాను. ఆ పాట బాగుంటుంది. డ్యాన్స్కి స్కోప్ ఉంది కాబట్టి చేశాను. *** మహేశ్బాబు గురించి ఏం చెబుతారు? మంచి నటుడు. ఆయన ప్రవర్తన చాలా బాగుంటుంది. క్రమశిక్షణ గల వ్యక్తి. లొకేషన్లో తనతో పాటు పని చేసే వ్యక్తులు అసౌకర్యానికి గురయ్యేలా చేయరు. *** మహేశ్ బాగా జోక్స్ వేస్తారని దర్శకుడు కొరటాల శివ చెప్పారు. మరి మీరేమంటారు? అవును. అది నిజమే. జోక్స్ వేస్తారు. కరెక్ట్గా చెప్పాలంటే ఈ యూనిట్ మొత్తం చాలా సరదాగా ఉండేది. షూటింగ్ ఎలా పూర్తయ్యిందో తెలియనంత వేగంగా జరిగింది. *** మామూలుగా మహేశ్బాబు మంచి అందగాడు కాబట్టి, ఆయన సరసన నటించే నాయికలు పెద్దగా ఎలివేట్ కారనే టాక్ ఉంది... ఏవండీ... ఇదేమైనా ‘మిస్ ఇండియా’ పోటీనా? మేమంతా కలిసి సినిమా చేస్తున్నాం. మహేశ్ అందంగా ఉంటే మంచిదే కదా. హీరో, హీరోయిన్లిద్దరూ చూడచక్కగా ఉంటే సినిమాకి ప్లస్ అవుతుంది. *** ఈ చిత్రంలో మీరు చేసిన ‘చారుశీల’ పాత్ర గురించి? చారుశీల చాలా స్ట్రాంగ్... ఇండిపెండెంట్... ఇంటలిజెంట్. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలన్నిటికన్నా భిన్నంగా ఉంటుంది. మామూలుగా నేను ఏ కొత్త పాత్ర అంగీకరించినా నా గత పాత్రలకు భిన్నంగా ఉండేలా చూసుకుంటాను. ఎందుకంటే, చేసిన పాత్రనే చేస్తే నాకు బోర్ కొడుతుంది. ఒకే రకమైన పాత్రలో నన్ను చూసి ప్రేక్షకులకూ బోర్ కొట్టేస్తుంది. *** కొరటాల శివ గురించి? సెన్సిబుల్ డెరైక్టర్. కామ్గా ఉండే స్వీటెస్ట్ టీచర్ అని చెప్పొచ్చు. నేను డెరైక్టర్స్ ఆర్టిస్ట్ని. వాళ్లకి ఎలా కావాలంటే అలా నటిస్తా. *** తెలుగు బాగా మాట్లాడుతున్నారు కదా.. మరి మీ పాత్రకు మీరు డబ్బింగ్ చెప్పుకోవచ్చు కదా? చెప్పాలనే ఉందండి. ‘ఎందుకు శ్రుతీతో డబ్బింగ్ చప్పించడంలేదు’ అని మీరు దర్శకులను అడగండి. నాక్కూడా హ్యాపీగా ఉంటుంది. *** మామూలుగా మీరు ఏ సినిమాలో నటించినా అందులో ఒక్క పాట అయినా పాడతారు కదా.. మరి ‘శ్రీమంతుడు’లో ఎందుకు పాడలేదు? ఈ ప్రశ్న కూడా మీరు కొరటాల శివ, దేవిశ్రీ ప్రసాద్ని అడగాలి. సినిమాలో పాడించలేదు కాబట్టే, ఆడియో ఫంక్షన్ రోజున స్టేజి మీద పాడించారేమో (నవ్వుతూ). *** కమల్హాసన్ కూతురు కాబట్టి, సినిమా ఫీల్డ్లో మీ దారి రహదారి అనుకోవచ్చా? అలా ఏమీ లేదండి. బ్యాగ్రౌండ్ ఉంది కాబట్టి, డోర్ ఓపెన్గా ఉంటుంది. అవకాశం ఈజీగా వస్తుంది. ఒకవేళ నేను బాగా నటించలేదనుకోండి... కమల్హాసన్ కూతురే కదా అని రెండో అవకాశం ఇవ్వరు. నేను నటించాలి. కొత్తవాళ్లకి ఉండే ప్రెజర్స్ వాళ్లకుంటాయి. మాకుండేవి మాకుంటాయ్. రెండో సినిమాకే మా తల్లిదండ్రుల్లా గొప్ప నటన కనబర్చాలనుకుంటారు. అది ఎంత ఒత్తిడిగా ఉంటుందో మీరే ఊహించండి. *** మీ చెల్లెలు అక్షరతో కలిసి సినిమా చేస్తారా? కథ కుదిరితే తప్పకుండా చేస్తా. *** అక్షరకు ఎలాంటి సలహాలిస్తుంటారు? మా అమ్మా నాన్న నాకెలాంటి సలహాలివ్వలేదు. ‘నీ లైఫ్ నీ ఇష్టం. తెలివిగా నిర్ణయాలు తీసుకో’ అని చెప్పారు. ఎప్పుడైనా అవసరమైతే సలహాలిస్తారు. నేను కూడా నా చెల్లెలికి సలహాలివ్వను. అవసరమైనప్పుడు మాత్రం కచ్చితంగా ఇస్తా. *** ఒక పాత్ర చేస్తున్నప్పుడు మీరు ఆ మూడ్లో ఎంతసేపు ఉంటారు? కెమెరా ముందు ఉన్నంతవరకే ఆ మూడ్లో ఉంటాను. ఆ తర్వాత కటాఫ్ చేసేస్తాను. ‘నేనివాళ సీరియస్ సీన్ చేస్తున్నాను కాబట్టి, నాతో ఎవరూ మాట్లాడొద్దు. నేను సీరియస్గా ఉండాలి’ అని ఎవరితోనూ అనను. హాయిగా నవ్వుతు ఉంటాను. కెమెరా ముందుకెళ్లాక సీరియస్ అయిపోతా. ఎటాచింగ్, డిటాచింగ్ రెండూ తెలియాలి. ఆ క్షణంలో నేనేం చేస్తున్నానో దానికి పూర్తిగా ఎటాచ్ అయిపోతా. ఆ పని పూర్తయ్యాక డిటాచ్ అయిపోతా. *** ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మీరు మోస్ట్ వాంటెడ్... ఎలా అనిపిస్తోంది? అనందంగానే ఉందండి. అదే విధంగా ఇది నిరంతరం కాదని కూడా నాకు తెలుసు. నా చిన్నప్పుడు నాన్నగారి కెరీర్ గురించి నాకు చాలా విషయాలు తెలిసేవి. ఆయన మంచి మంచి సినిమాలు చేసినప్పుడు అభినందించేవారు. ఫ్లాప్ సినిమా చేసినప్పుడు పెదవి విరిచేసేవారు. అందుకే, సక్సెస్ని నెత్తికెక్కించుకోకుండా నా పని నేను సిన్సియర్గా చేసుకుంటూ వెళుతున్నాను. *** మంచి మంచి సినిమాలు చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు మీది గోల్డెన్ లెగ్ అనుకోవచ్చా? గోల్డెన్, సిల్వర్, ఐరన్ లెగ్ అనుకోవడానికి ఇదేమన్నా జ్యువెలరీ షాపా! అలా ఏమీ ఉండదండి. అయినా నా కాలు ఎప్పటిలానే ఉంది (నవ్వుతూ). కాకపోతే ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు ఏదేదో అంటారు. హిట్ వచ్చాక గోల్డెన్ లెగ్ అంటారు. వాటితో నాకు సంబంధం లేదు. *** ఫైనల్లీ.. మీ కెరీర్ని విశ్లేషించుకుంటే ఏమనిపిస్తోంది? నేనేదీ ప్లాన్ చేయలేదు. అంతా ఆ దేవుడే ప్లాన్ చేశాడు. ఆ ప్రకారం వెళ్లిపోతున్నాను. ఏది ఏమైనా మంచి పాత్రలు చేసే అవకాశం వస్తోంది. వాటికి న్యాయం చేయడానికి వంద శాతం కృషి చేస్తున్నా. ప్రస్తుతం నా కెరీర్ హ్యాపీగా ఉంది. - డి.జి.భవాని -
మహేష్కి అదే మైనస్ పాయింట్
-
ఆ నవ్వు కోసమే...మళ్లీ మహేశ్ డేట్స్..!
► తొలి చిత్రం ‘మిర్చి’తోనే స్టయిలిష్ డెరైక్టర్ అనిపించుకున్నారు కొరటాల శివ. ► స్టోరీ వేల్యూకి స్టార్ వేల్యూ యాడ్ అయితే వండర్స్ సృష్టించొచ్చునంటున్న శివ, ►‘శ్రీమంతుడు’తో బాక్సాఫీస్ని కొల్లగొడతామని కాన్ఫిడెంట్గా చెబుతున్నారు. ► వచ్చే నెల 7న విడుదలకు సిద్ధమవుతోన్న ‘శ్రీమంతుడు’ గురించి ► కొరటాల శివ మీడియాతో ముచ్చటిస్తూ పలు విషయాలు ప్రస్తావించారు. ‘బాహుబలి’ కారణంగా మీ ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని వాయిదా వేయాల్సి వచ్చినందుకు నిరుత్సాహపడ్డారా? అలాంటిదేంలేదు. ఒక రకంగా చెప్పాలంటే పోస్ట్ ప్రొడక్షన్కి ఓ మూడు వారాలు టైమ్ దొరికింది. ’బాహుబలి’ అంటే రెస్పెక్ట్ ఉంది. చాలా పెద్ద సినిమా. వాయిదా వేయడం ద్వారా మేమేదో ఫేవర్ చేసినట్లు చెప్పడంలేదు. వాళ్లు మూడేళ్లు కష్టపడి చేశారు. మా హీరో మహేశ్బాబు, నేను, నిర్మాతలు... మేమందరం ‘బాహుబలి’ యూనిట్ హ్యాపీగా ఉండాలని కోరుకున్నాం. నిజంగానే ఆ సినిమా మంచి విజయం సాధించడంతో మేమంతా హ్యాపీ. ‘బాహుబలి’ అంత బడ్జెట్తో తీయకపోయినా.. తదుపరి విడుదలయ్యే ప్రతి సినిమా వసూళ్లను ఆ చిత్రం వసూళ్లతో కంపేర్ చేస్తుంటారు కదా? నేనసలు వసూళ్ల గురించి పట్టించుకోను. సినిమా బాగుందని ప్రేక్షకులు అన్నాక ఆటోమేటిక్గా వసూళ్లు బాగుంటాయి. నా స్వార్థం ఎంతసేపూ ఏంటంటే.. అందరూ సినిమా బాగుంది అనాలి. బాగున్న సినిమాకి వసూళ్లు ఆగమన్నా ఆగవు. గత రెండు చిత్రాలు నిరుత్సాహపరిచాయని, ఈసారి అలా కాకూడదని మహేశ్బాబు ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు మీతో అన్నారా? బయట మనకు కనిపించే మహేశ్బాబు సీరియస్గా ఉంటారు. కానీ, నిజానికి ఆయనంత సరదా మనిషి ఎవరూ ఉండరు. డిసప్పాయింట్మెంట్స్ని కూడా ఆయన సీరియస్గా కాకుండా కామెడీగా చూస్తారు. ‘ఏదో మంచి ప్రయత్నం చేయాలని చేశాం అండీ.. పక్కకు నెట్టేశారు’ అని సరదాగా అంటారు. చాలా లైట్ హార్టెడ్. హ్యూమర్ని బాగా ఇష్టపడతారు. మహేశ్ బాగా జోక్స్ వేస్తారట కదా? ఆయన జోక్స్ బాగా పేలుస్తారు. మొదటి రోజు నుంచీ సినిమా పూర్తయ్యే వరకూ క్షణానికో జోక్ వినిపించేది. అలా మాట్లాడి ఇలా తిరిగే లోపు ఓ పంచ్ వదులుతారు. వాళ్లు వీళ్లూ అని కాదు.. లైట్ బోయ్స్తో కూడా జోక్లేసి నవ్వుతుంటారు. ఉదయం లొకేషన్కి రావడమే నవ్వుతూ వస్తారు. ఇక, రోజంతా ఆ నవ్వు కంటిన్యూ అవుతుంది. మరో రెండు రోజుల్లో షూటింగ్ అయిపోతుందంటే నిర్మాతలు ‘ఈ నవ్వు మిస్ అయిపోతామండి. ఆ నవ్వు కోసమే మళ్లీ మహేశ్ డేట్స్ ఇస్తే బాగుండు’ అన్నారు. దాన్నిబట్టి ఎంత బాగా షూటింగ్ చేశామో ఊహించుకోవచ్చు. ఈ చిత్రంలో మహేశ్ ఏడు రకాల లుక్స్లో కనిపిస్తారట? ‘దశావతారం’లా గెటప్స్లో కనిపించరు. టీ షర్ట్, పంచె, హెడ్ బ్యాండ్.. ఇలా సీన్కి తగ్గట్టుగా కనిపిస్తారు. వాటినే ఏడు రకాల లుక్స్ అని డిజైనర్స్ చెప్పి ఉంటారు. ‘శ్రీమంతుడు’గా కనిపించడానికి ఫిజికల్గా వర్కవుట్ చేసినట్లు అనిపిస్తోంది? ఏమీ లేదు. స్వతహాగానే ఆయన ఫిట్నెస్ ఫ్రీక్. ఈ క్యారెక్టర్కి ఫిట్గా, నీట్గా కనిపించాలనన్నాను.. అంతే. సినిమాలో వేల కోట్ల అధిపతి అయినా సింపుల్గా కనిపించే క్యారెక్టర్. మహేశ్బాబు గొప్పతనం ఏంటంటే.. పాత్రకు తగ్గట్టుగా మౌల్డ్ అయిపోతారు. ఈ సినిమాకి ఓ నిర్మాతగా కూడా మహేశ్ వ్యవహరించారు... మరి బడ్జెట్ విషయంలో రాజీపడాలని చెప్పారా? అసలలాంటిది ఆయనకు తెలియదు. రాజీపడరు. వాస్తవానికి ఆడియో ఫంక్షన్ రోజున మహేశ్బాబు ‘ఎంబి’ బేనర్ లాంచ్ని మేం గ్రాండ్గా ప్లాన్ చేశాం. మహేశ్బాబు సంస్థలో రూపొందిన మొదటి సినిమా మాది కావడం మాకు ఆనందంగా అనిపించింది. అందుకే, బేనర్ లాంచ్ని గ్రాండ్గా చేయాలనుకున్నాం. అదే విషయం మహేశ్బాబుతో అంటే, ‘ఒక బేనర్ పెట్టాం. టైటిల్ కార్డ్స్లో ‘ఎంబి’ అని వస్తుంది. అది చాలు. లాంచ్ ఎందుకు? అలాగే నాన్నగారి 50 ఏళ్ల సన్మానం కూడా సింపుల్గా చాలు’ అన్నారు. ఈ సింప్లిసిటీ అంతా కృష్ణగారి దగ్గర్నుంచే వచ్చిందనిపించింది. కృష్ణగారు కూడా చాలా సింపుల్గా ఉంటారు.. క్లుప్తంగా మాట్లాడతారు. ‘శ్రీమంతుడు’ అంటే టాలీవుడ్లో మహేశ్బాబు మాత్రమే పనికొస్తారా? ‘ఇండియాలో మహేశ్బాబు వన్నాఫ్ ది బెస్ట్ యాక్టర్స్’. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకలా అనిపించింది. ఈ సినిమాకి మహేశ్బాబు బెస్ట్ చాయిస్. అది మాత్రం చెప్పగలను. పర్ఫెక్ట్ ఆర్టిస్ట్. నేను చెప్పిన సీన్కి ప్రాణం పోశారు. ప్రేక్షకులు చూసే ముందు ఓ దర్శకుడిగా ఈ సినిమా చూసే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. మహేశ్బాబు బెస్ట్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు.. ఇంటెలిజెంట్ ఆర్టిస్ట్. కో ఆర్టిస్ట్కు ఎంత కంఫర్ట్ ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఊరిని దత్తత తీసుకోవడం అనే ఈ సినిమా కాన్సెప్ట్ని రియల్గా కూడా మహేశ్ ఆచరించడం పట్ల మీ అభిప్రాయం? వాస్తవానికి ‘ఆగడు’ టైమ్లోనే నేనీ కాన్సెప్ట్ అనుకున్నా. ఈ కథకు ఎలాంటి ఇన్స్పిరేషన్ లేదు. మరి.. మహేశ్బాబు గ్రామాన్ని దత్తత తీసుకోవాలనుకోవడానికి ఏ విషయం ఆదర్శంగా నిలిచిందో నాకు తెలియదు. ఏదేమైనా మంచి విషయం కాబట్టి, హ్యాపీగా ఉంది. ఆ సంగతలా ఉంచితే, ఈ చిత్రకథ వినగానే టెక్నిషియన్స్ ఎవరు? అనడిగారు. అంతగా నచ్చిందాయనకు. జగపతిబాబు చేసిన తండ్రి పాత్ర గురించి? ఇందులో తండ్రి పాత్ర చాలా స్టయిలిష్గా ఉంటుంది. చాలా రిచ్గా కనిపించాలి. ఎవరైతే బాగుంటారా? అనుకుంటున్నప్పుడు ‘లెజెండ్’ విడుదలైంది. విలన్గా చేశారు కదా, క్యారెక్టర్ నచ్చితే ఈ సినిమా ఒప్పుకుంటారేమో అనిపించింది. ఆ హుందాతనం, రిచ్నెస్ జగపతిబాబుగారిలో ఉన్నాయి. తండ్రి పాత్రకు ఆయన్ను అడుగుదామని మహేశ్బాబుతో అంటే, ‘ఆయనకన్నా బెస్ట్ ఎవరు? అన్నారు. జగపతిబాబుగారు కథ వినగానే ఓకే చెప్పేశారు. తమిళంలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు కదా... అక్కడి నేటివిటీకి తగ్గట్టుగా కూడా ఈ చిత్రం ఉంటుందా? ఈ కథ యూనివర్శల్. ఎవరికైనా నచ్చుతుంది. తమిళంలో ‘సెల్వందన్’ పేరుతో విడుదల చేస్తున్నాం. తమిళ డైలాగ్స్ పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకున్నాం. మీ తదుపరి రెండు, మూడు కథలు రెడీ చేశాను. ఎవరితో చేస్తానన్నది తర్వాత చెబుతాను. ప్రభాస్, మహేశ్బాబు వంటి స్టార్స్తోనేనా? కొత్తవాళ్లతో కూడా చేస్తారా? కొత్తవాళ్లతో చేయాలని ఉంది. ‘సీతాకోక చిలుక’ వంటి లవ్స్టోరీ తీయాలనే ఆకాంక్ష ఉంది. ‘మిర్చి’ హిందీ రీమేక్కి దర్శకత్వం వహించే అవకాశం వస్తే, మీరు ఒప్పుకోలేదు. ఒకవేళ ఈ సినిమాకి అవకాశం వస్తే? నాకు రీమేక్స్ మీద పెద్దగా ఆసక్తి ఉండదు. ఒకసారి చూపించిన కథను మళ్లీ చూపించడమా? అనుకుంటాను. అందుకే ‘మిర్చి’ అంగీకరించలేదు. కొత్త కొత్త కథలు చూపించడం ఎక్కువ ఇష్టం. మరీ తప్పదనుకుంటే అప్పుడు రీమేక్ గురించి ఆలోచిస్తా. -
'మహేశ్ మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయా'
చెన్నై: ప్రిన్స్ మహేశ్ బాబు తమిళంలో మాట్లాడుతుంటే విస్మయంతో చూస్తుండిపోయానని నటుడు హరీశ్ ఉత్తమన్ వెల్లడించారు. 'శ్రీమంతుడు' సినిమాలో హరీశ్ విలన్ గా నటించాడు. 'మొదటిరోజు మా మధ్య కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. షాట్ ముగిసిన తర్వాత మానిటర్ దగ్గర కూర్చున్న మహేశ్ పక్కన కూర్చున్నా. సడన్ గా ఆయన తమిళంలో మాట్లాడడం మొదలు పెట్టారు. ఆయన తమిళంలో మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయాను' అని హరీశ్ పేర్కొన్నాడు. 'మీకు తమిళం ఎలా తెలుసు అని మహేశ్ ను అడగ్గా... తాను చెన్నైలోచదువుకున్నానని ఆయన సమాధానమిచ్చారని చెప్పాడు. మహేశ్ స్నేహశీలిని ప్రశంసించాడు. షూటింగ్ సమయంలో భాషాపరమైన సమస్యలు అధిగమించడానికి ఆయనెంతో సహకరించారని వెల్లడించాడు. తన కోసం 50 టేకులు చేయడానికి కూడా ఆయన వెనుకాడలేదని తెలిపాడు. ఇంటర్వెల్ లో తనకు, మహేశ్ మధ్య వచ్చే ఫైట్ హైలెట్ గా నిలుస్తుందన్నాడు. 'శ్రీమంతుడు' సినిమాతో తెలుగులో తనకు అవకాశాలు పెరుగుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'శ్రీమంతుడు'లో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, సంపత్ రాజ్, సుకన్య, ముఖేష్ రిషి ముఖ్యపాత్రల్లో నటించారు. -
శేఖర్ కమ్ములతో మహేశ్?
హీరో మహేశ్బాబు ఇప్పుడు మంచి జోరు మీద ఉన్నారు. ఒకపక్క ‘శ్రీమంతుడు’ సినిమా షూటింగ్లో పాల్గొంటూనే, మరోపక్క తరువాత సినిమాల ప్లానింగ్ స్పీడ్గా చేసేస్తున్నారు. ఆగస్టు తొలి వారంలో మహేశ్ జన్మదిన కానుకగా ‘శ్రీమంతుడు’ రిలీజ్కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంతలోనే తరువాత నటించే రెండు చిత్రాల ప్లానింగ్ సిద్ధమైంది. ‘శ్రీమంతుడు’ పూర్తవుతూనే, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ సినిమా రెగ్యులర్ షూటింగ్లో మహేశ్ పాల్గొననున్నారు. ఇప్పుడు తాజా కబురేమిటంటే, దర్శకుడు శేఖర్ కమ్ములతో మరో సినిమాకు కూడా ఈ ప్రిన్స్ సిద్ధమవుతున్నారట! అందుకు తగ్గట్లే శేఖర్ కమ్ముల, మహేశ్ల మధ్య చర్చలు జరిగాయనీ, ప్రాథమికంగా సినిమా చేయడానికి అంగీకారం కుదిరిందనీ కృష్ణానగర్ కబురు. ‘ఆనంద్’, ‘లీడర్’ లాంటి సెన్సిబుల్ సినిమాలు తీసిన శేఖర్ కమ్ముల, హీరో మహేశ్బాబుల కాంబినేషన్లో సినిమాకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. నిజానికి, ‘గోదావరి’ సినిమాను మహేశ్తోనే తీయాలని అప్పట్లో శేఖర్ కమ్ముల భావించారు. ఆ ప్రయత్నం సఫలం కాకపోయినప్పటికీ, శేఖర్తో సినిమాకు మహేశ్ ఆసక్తి చూపుతూ వచ్చారు. కానీ, ఆ ప్రయత్నం అలా అలా వాయిదా పడుతూనే వచ్చింది. ఇది ఇలా ఉండగా, గత ఏడాది మొదట్లో రిలీజైన మహేశ్ సినిమా ‘1... నేనొక్కడినే’ పోస్టర్ వ్యవహారం వారి మధ్య కొంత గ్యాప్ను పెంచినట్లు సినీజనం చెవులు కొరుక్కున్నారు. ఆ పోస్టర్ ఆడవారిని ఆత్మాభిమానం దెబ్బతీసేలా ఉందంటూ నటి సమంత చేసిన వ్యాఖ్యను శేఖర్ కమ్ముల కూడా సమర్థించారు. ఆ వ్యవహారంతో సంబంధాలు కొంత దెబ్బతిన్నప్పటికీ, క్రమంగా మళ్ళీ సత్సంబంధాలు నెలకొన్నాయట! ప్రస్తుతం మహేశ్తో శేఖర్ సినిమాకు గ్రీన్సిగ్నల్ వచ్చిందట! ఆ స్క్రిప్ట్ పనిలో శేఖర్ కమ్ముల బిజీగా ఉన్నారట! ‘బ్రహ్మోత్సవం’లో నిర్మాణ భాగస్వామి కూడా అయిన మహేశ్ ఈ సినిమా ఎప్పుడు చేస్తారన్న క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఈ కొత్త సినిమాకు కూడా మహేశ్ నిర్మాణంలో పాలుపంచుకుంటారా? సెన్సిబుల్ ఫీల్ గుడ్ స్టోరీలు తెరకెక్కించే శేఖర్ కమ్ములకూ, కమర్షియల్ హీరో మహేశ్కు లంకె కుదిర్చే ఆ స్క్రిప్ట్ ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ప్రస్తుతానికి సస్పెన్సే! -
ఆగస్టు 7న 'శ్రీమంతుడు' విడుదల
హైదరాబాద్: ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం 'శ్రీమంతుడు' విడుదల తేదీ మారింది. ఆగస్టు 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. జూలై 18న ఆడియో ఆవిష్కరించనున్నారు. జూలై రెండో వారంలో ఈ సినిమా విడుదల చేయాలని మొదట భావించారు. అయితే అదే వారంలో 'బాహుబలి' చిత్రం విడుదలకానుంది. ఒకే వారంలో రెండు పెద్ద సినిమాలు విడుదలయితే నిర్మాతలు నష్టపోయే అవకాశముందని, అందుకే 'శ్రీమంతుడు' విడుదల తేదీని ఆగస్టు 7కు మార్చినట్టు సమాచారం. నిర్మాతల మధ్య కుదిరిన పరస్పర అంగీకారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 'శ్రీమంతుడు' కోసం మహేష్ బాబు అభిమానులు ఆగస్టు వరకు ఆగాల్సిందే. కాగా రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాను జూలై 10న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. -
శ్రీమంతులున్న పెద్దదేశాల్లో భారత్ది 4వ స్థానం
న్యూయార్క్: అధిక సంపన్న కుటుంబాలు (ఆల్ట్రా-హై-నెట్-వర్త్ హౌస్హోల్డ్స్-యూహెచ్ఎన్డబ్ల్యూ) ఉన్న 4వ అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. బోస్టన్కు చెందిన కన్సల్టింగ్ గ్రూప్ విడుదల చేసిన ‘గ్లోబల్ వెల్త్ 2015: విన్నింగ్ ద గ్రోత్ గేమ్’ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. నివేదిక ప్రకారం.. ఆర్థిక వృద్ధి కారణంగా చైనా, భారత్లో సంపద పెరుగుతోంది. గతేడాది అధిక సంపన్న కుటుంబాలను కలిగి దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో (5,201) ఉంది. దీని తర్వాతి స్థానాల్లో చైనా (1,037), యూకే (1,019), భారత్ (928), జర్మనీ (679) ఉన్నాయి. భారత్ లో సంపన్న కుటుంబాల సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. 2013లో 284గా ఉన్న సంపన్న కుటుంబాల సంఖ్య గతేడాది 928కి చేరింది. గతేడాది అంతర్జాతీయ ప్రైవేట్ ఫైనాన్షియల్ వెల్త్ 12 శాతం వృద్ధితో 164 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇది 6 శాతం వార్షిక వృద్ధిరేటుతో 2019 నాటికి 222 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. -
మహేష్ ”శ్రీమంతుడు” టీజర్ విడుదల
-
మహేష్ సరసన ఛాన్స్ కొట్టేసిన సమన్శెట్టీ
-
స్పీడ్ పెంచిన మహేష్ బాబు!
స్టార్ హీరోల సినిమాలు ఏడాదికి ఒకటి రావడమే అరుదు. ఎందుకంటే స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ అనే రూల్ని మనవాళ్ళు పక్కాగా ఫాలో అవుతుంటారు. ఈ విషయంలో సూపర్స్టార్ మహేష్ బాబు ముందుంటారు. అయితే ఏమనుకున్నారో ఏమో ఈసారి ఆయన రూటు మార్చారు. వరుసపెట్టి సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ హార్ట్స్ దిల్ ఖుష్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దాంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. గత ఏడాది నుంచే మహేష్ తన దూకుడు చూపిస్తున్నారు. రెండు సినిమాలతో ఫ్యాన్స్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆశించిన విజయాలు సాధించలేకపోయారు. ప్రిన్స్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'శ్రీమంతుడు' చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు సరసన శ్రుతిహాసన్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో పాటు శ్రీకాంత్ అడ్డాలతో సినిమా చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ రెండిటితో పాటు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు. అంటే ఈ ఏడాది మహేష్ మొత్తం మూడు సినిమాలతో రాబోతున్నట్లు సమాచారం. అంతే కాక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమా చేసేందుకు కూడా మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ టాక్. త్రివిక్రమ్ చెప్పిన కథ నచ్చడంతో ఆయనతో చేయడానికి మహేష్ అంగీకరించారని సినీవర్గాల సమాచారం. అయితే ఈ సినిమా ఈ ఏడాదా? లేక వచ్చే ఏడాదా? అనేది తెలియడంలేదు. ఏది ఏమైనా ప్రిన్స్ స్పీడ్ పెంచేశారు. అభిమానులకు పండుగే!