Tractor rally
-
బండెనక బండికట్టి..
రామచంద్రపురం: ప్రకృతి విపత్తులు, తెగుళ్ల మూలంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అత్యధికంగా పంటల బీమాను అందజేస్తుండటాన్ని పురస్కరించుకుని కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో అన్నదాతలు మంగళవారం వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలిపారు. 500 ట్రాక్టర్లతో 22 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గంలో గత ఖరీఫ్ సీజన్లో తుపాను వల్ల రైతులు అత్యధికంగా నష్టపోయారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రత్యేకంగా అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ఈనేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గతంలో ఎన్నడూ రాని విధంగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద ఈ నియోజకవర్గానికి రూ.130 కోట్లు విడుదలయ్యాయి. దీంతో రైతులు కె.గంగవరం మండలం పామర్రు నుంచి గొల్లపాలెం వరకు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. కష్టకాలంలో ప్రభుత్వం తమకు అండగా నిలిచిందని కొనియాడారు. మంత్రి తనయుడు నరేన్ ఈ ర్యాలీని ప్రారంభించారు. -
రైతులకు మద్దతుగా రాహుల్ ట్రాక్టర్ ర్యాలీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు. ఐదో రోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఆయన స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యకతిరేకతంగా రైతులు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. రైతుల ట్రాక్టర్ ర్యాలీకి రాహుల్ గాంధీ మద్దతు పలికారు. అయితే పాస్ ఉన్న వాహనాలకు మాత్రమే పార్లమెంట్ భవనంలోకి అనుమతి ఉండటంతో రాహుల్ గాంధీ ట్రాక్టర్ను లోపలకి అనుమతించలేదు. ఈ క్రమంలో ఆయన ట్రాక్టర్ మీద నుంచే మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు సంబంధించిన సమస్యను పార్లమెంట్ దృష్టికి తీసుకువెళ్లిందని, కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను ఉభయ సభల్లో చర్చించడానికి అనుమతించడం లేదని మండిపడ్డారు. దేశంలోని రైతులు తీవ్రంగా అణచివేయబడుతున్నారని, అందుకే తాను రైతుల చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీకి మద్దతుగా పాల్గొన్నానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు.. నల్ల చట్టాలని వాటిని వెంటనే కేంద్రం వెనక్కు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కేంద్రం ఈ చట్టాలను రైతుల కోసం కాకుండా కొంతమంది కార్పొరేట్ వ్యాపారుల కోసం తీసుకువచ్చిందని దుయ్యబట్టారు. ఈ నల్ల చట్టాలను ఎందుకు తీసుకువచ్చారో దేశంలోని ప్రజలకు తెలుసన్నారు. పార్లమెంట్ ముందు నిరసన తెలిపిన కాంగ్రెస్ నాయకులు రణదీప్ సుర్జేవాలా, బీవీ శ్రీనివాస్లను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో రణ్దీప్ సుర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ.. రైతుల సమస్యలపై స్వరం పెంచిన ప్రతి ఒక్కరినీ మోదీ ప్రభుత్వం అణిచివేస్తుందని మండిపడ్డారు. ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రాబోయే తరాల కోసం పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం అరెస్టులు చేసినా చట్టాలను వెనక్కి తీసుకునేంతవరకు నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. -
బెంగళూరుని ముట్టడిద్దాం
శివమొగ్గ (కర్ణాటక): కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం ఆగదని రైతు నాయకుడు రాకేశ్ తికాయత్ తేల్చి చెప్పారు. బెంగళూరుని కూడా ట్రాక్టర్లతో ముట్టడించాలని రైతులకు పిలుపునిచ్చారు. ‘‘ఢిల్లీని ముట్టడించిన మాదిరిగా బెంగళూరుని కూడా నిర్బంధించాలి. మీ ట్రాక్టర్లు తీసుకొని నగరం నలుమూలల నుంచి రండి’’ అని అన్నారు. కర్ణాటకలోని శివమొగ్గలో జరిగిన మహాపంచాయత్లో తికాయత్ మాట్లాడుతూ ఢిల్లీలో చేసిన ర్యాలీ మాదిరిగా అందరూ ట్రాక్టర్ల మీదే రండి, నగరంలోని 25 వేల పాయింట్లను బ్లాక్ చేస్తూ ఉద్యమించాలని అన్నారు. కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్తో గత మూడు నెలలకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో సింఘు, తిక్రి, ఘజియాపూర్లలో రైతన్నలు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. మూడు చట్టాలను వెనక్కి తీసుకొని, కనీస మద్దతు ధరపై చట్టం చేసేదాకా తమ ఉద్యమం ఆగదని అన్నారు. రైతుల్ని వ్యవసాయ కూలీలుగా మార్చే ఈ చట్టాలతో పాటుగా పాలు, విద్యుత్, విత్తనాలు, పురుగుల మందులకు సంబంధించిన చట్టాలు కూడా చేస్తున్నారని, ఇవన్నీ రైతులతో పాటు ప్రజలపై మోయలేని భారాన్ని వేస్తాయని అన్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణ వల్ల రైతులు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా తీసుకున్న రుణాలు చెల్లించలేకపోతే భూముల్ని ధారాదత్తం చేయాల్సి ఉంటుందని అన్నారు. వచ్చే 20 ఏళ్లలో రైతుల భూములన్నింటినీ ఏదో ఒక రకంగా లాగేసుకోవడానికి కేంద్రం కుట్ర పన్నుతోందని రాకేశ్ తికాయత్ ఆరోపించారు. కేంద్రం దిగి రాకపోతే ఇక దేశవ్యాప్తంగా అన్ని నగరాలను ముట్టడిస్తామని చెప్పారు. -
ఢిల్లీలో 26నాటి ఘటనపై న్యాయ విచారణ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 26వ తేదీన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరిపించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. అప్పటి ఘటనలకు సంబంధించి ప్రభుత్వం రైతులపై తప్పుడు ఆరోపణలతో కేసులు బనాయించిందని ఆరోపించాయి. సింఘు వద్ద సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నేతలు శనివారం మీడియాతో మాట్లాడారు. పోలీసు నోటీసులు అందుకున్న రైతులు నేరుగా వారి వద్దకు వెళ్లకుండా, అవసరమైన సాయమేదైనా రైతు సంఘాల న్యాయ విభాగాల నుంచి పొందాలని సూచించారు. జనవరి 26వ తేదీ నాటి హింసాత్మక ఘటనలకు, రైతులపై తప్పుడు కేసులు నమోదు చేయడం వెనుక కుట్ర దాగుందని ఎస్కేఎం న్యాయ విభాగం సభ్యుడు కుల్దీప్ సింగ్ ఆరోపించారు. ఈ ఘటనలపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న 16 మంది రైతుల ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదన్నారు. ఆ ఘటనలపై నమోదైన మొత్తం 44 ఎఫ్ఐఆర్లలో 14 ఎఫ్ఐఆర్లకు సంబంధించి 122 మంది రైతులను పోలీసులు అరెస్టు చేశారని, వారందరికీ న్యాయ, ఆర్థిక సాయం అందజేస్తామని మరో నేత రవీందర్ సింగ్ తెలిపారు. కొందరు రైతులపై దోపిడీ, హత్యాయత్నం వంటి కేసులు కూడా పెట్టారన్నారు. భోజనం ఖర్చుల కోసం జైలులో ఉన్న రైతులకు రూ.2 వేల చొప్పున ఎస్కేఎం అందజేస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు జైలులో ఉన్న 10 మంది రైతులకు బెయిల్ మంజూరు కాగా, మరో ఐదుగురి బెయిల్కు దరఖాస్తు చేశామన్నారు. తీవ్ర సెక్షన్ల కింద కేసులు నమోదు కాని వారిపై మొదట దృష్టి పెట్టినట్లు చెప్పారు. తీహార్ జైలులో ఉన్న 112 మంది రైతులను తమ న్యాయ విభాగం కలిసిందని వెల్లడించారు. ఇలా ఉండగా, ట్రాక్టర్ పరేడ్ సమయంలో ఎర్రకోట వద్ద జరిగిన ఘటనలకు కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న నటుడు దీప్ సిద్దు, ఇక్బాల్ సింగ్ అనే మరో వ్యక్తిని దర్యాప్తులో భాగంగా ఢిల్లీ నేర విభాగం పోలీసులు శనివారం ఘటనాస్థలికి తీసుకువచ్చి, సీన్ రిక్రియేట్ చేయించారు. గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో 500 మంది పోలీసులు గాయపడగా, ఒక ఆందోళనకారుడు చనిపోయిన విషయం తెలిసిందే. రైతుల ఆందోళనకు గాంధీజీ మనవరాలు మద్దతు ఘజియాబాద్: మహాత్మాగాంధీ మనవరాలు తారా గాంధీ భట్టాచార్జీ(84) రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపారు. గాంధీ నేషనల్ మ్యూజియం చైర్ పర్సన్ కూడా అయిన భట్టాచార్జీ శనివారం ఘాజీపూర్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్ నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులతో మాట్లాడారు. నిరసనలు శాంతియుతంగా కొనసాగించాలని వారిని కోరిన ఆమె.. రైతులపట్ల శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘రాజకీయ కార్యక్రమంలో భాగంగా మేం ఇక్కడికి రాలేదు. మనల్ని పోషిస్తున్న రైతుల కోసం మాత్రమే వచ్చాం. అన్నదాతల కష్టాన్ని విస్మరించరాదు. రైతులకు లబ్ధి దేశానికే లబ్ధి’అని ఆమె అన్నారని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) తెలిపింది. ఆమె వెంట మహాత్మా స్మారక్ నిధి చైర్మన్ రామచంద్ర రాహి, ఆల్ ఇండియా సర్వ్ సేవా సంఘ మేనేజింగ్ ట్రస్టీ అశోక్ సరన్, గాంధీ స్మారక్ నిధి డైరెక్టర్ సంజయ్ సింఘా, నేషనల్ గాంధీ మ్యూజియం డైరెక్టర్ అన్నామలై ఉన్నారు. -
‘40 లక్షల ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తాం’
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశ రాజధానిలో 70 రోజులకు పైగా ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నాయకుడు రాకేశ్ తికాయత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు ఉద్యమాన్ని దేశమంతా విస్తారమని తెలిపారు. హర్యానా, కురుక్షేత్ర జిల్లాలోని పెహోవాలో నిర్వమించిన 'కిసాన్ మహాపాంచాయతీ'లో ప్రసంగిస్తూ రైతు నాయకుడు ఈ ప్రకటన చేశారు. రాకేశ్ తికాయత్ మాట్లాడుతూ.. ‘‘ప్రధాని మోదీ ఇంతవరకు ఒక్క ఆందోళనలో కూడా పాల్గొనలేదు. ఆయన చేసే పని ఏంటంటే దేశాన్ని విడగొట్టడం మాత్రమే. ఆందోళన జీవుల గురించి ఆయనకు అసలు ఏం తెలుసు. భగత్ సింగ్ నుంచి బీజేపీ నాయుకులు ఎల్కే అద్వానీ వరకు ప్రతి ఒక్కరు ఆందోళనలో పాల్గొన్నారు. మోదీ ఇలాంటి వాటికి దూరం. అందుకే ఆయనకు దీని గురించి తెలియదు’ అంటూ మండిపడ్డారు. ఈ ఏడాది అక్టోబర్ 2 వరకు రైతుల ఆందోళనను కొనసాగిస్తామని ప్రకటించారు రాకేశ్ తికాయత్. ‘‘ఆ తర్వత కూడా ఉద్యమం ఆగిపోదు. విడతల వారిగా రైతులందరం దీనిలో పాల్గొని ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తాం. ఇక తర్వలోనే నలభై లక్షల ట్రాక్టర్లు.. మీరు విన్నది కరెక్టే.. నాలుగు కాదు 40,00,000 లక్షల ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తాం’’ అని తెలిపారు. చదవండి: మేం రెడీ.. డేట్ ఫిక్స్ చేయండి: అన్నదాతలు -
సుప్రీంలో ‘ట్రాక్టర్ ర్యాలీ’ పిటిషన్లు తిరస్కరణ
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజు రైతులు చేపట్టిన గణతంత్ర రైతు పరేడ్ (ట్రాక్టర్ ర్యాలీ)లో చెలరేగిన హింసపై దాఖలైన పిటిషన్లను దేశ అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ట్రాక్టర్ ర్యాలీలో హింసపై విచారణ జరపాలని దాఖలైన పిటిషన్లు తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. పిటిషన్లను తిరస్కరించిన సీజేఐ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనంసున్నితమైన అంశంలో కేంద్రం చట్టపరంగా స్పందిస్తుందని తెలిపింది. దీంతో ఈ పిటిషన్లను ఉపసంహరించుకోవాలని పిటిషనర్లకు సీజేఐ సూచించారు. జనవరి 26వ తేదీన రైతుల గణతంత్ర పరేడ్ (ట్రాక్టర్ ర్యాలీ) హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. రైతులు బారికేడ్లు తెంచుకుని.. పోలీసుల అడ్డంకులను దాటి ఎర్రకోటపై జెండా ఎగురవేశారు. ఈ హింసాత్మకంగా మారిన ఘటనలపై న్యాయవాదులు విశాల్ తివారీ, మనోహర్ లాల్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మరికొన్ని పిటిషన్లు కూడా దాఖలవడంతో బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణ్యన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆ పిటిషన్లన్నింటిని తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. ఇది సున్నితమైన అంశమని.. దీనిపై కేంద్ర ప్రభుత్వం చట్టపరంగా స్పందిస్తుందని ధర్మాసనం తెలిపింది. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లాలని పిటిషన్లకు న్యాయస్థానం సూచించింది. -
తిరంగాకు అవమానం.. తీవ్ర విచారకరం
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజు దేశ రాజధాని ఢిల్లీలో మువ్వన్నెల జాతీయ జెండాకు జరిగిన అవమానాన్ని చూసి దేశం యావత్తూ తీవ్ర విచారంలో మునిగిపోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జనవరి 26న రైతుల ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా ఎర్రకోట వద్ద మత జెండాను ఎగురవేయడాన్ని ఉదహరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ‘మన్ కీ బాత్’లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. వ్యవసాయ రంగం ఆధునీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఈ దిశగా ఎన్నో చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ బోయిన్పల్లిలోని కూరగాయల మార్కెట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. మన వ్యాక్సినేషన్.. ప్రపంచానికి ఆదర్శం ‘‘మనం గత ఏడాది అంతులేని సహనం, ధైర్యం ప్రదర్శించాం. అదే కొనసాగించాలి. లక్ష్యాలు, తీర్మానాలను సాధించడానికి కష్టపడి పనిచేయాలి. మన దేశాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలి. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్లో అమలవుతోంది. ఇతర దేశాల కంటే మిన్నగా మన ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందజేస్తున్నాం. 15 రోజుల్లో 30 లక్షల మంది కరోనా యోధులకు వ్యాక్సిన్ ఇచ్చాం. 30 లక్షల మందికి ఈ టీకా ఇవ్వడానికి అమెరికాకు 18 రోజులు, యూకేకు 36 రోజులు పట్టింది. కరోనా మహమ్మారిపై మన పోరాటం ప్రపంచానికే ఒక ఉదాహరణగా నిలిచింది. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న కరోనా టీకాలను చాలా దేశాలకు సరఫరా చేస్తున్నాం. ప్రాణాధార ఔషధాలు, టీకాల ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి సాధించింది. ఈ ఏడాది 75వ స్వాతంత్య్ర వేడుకలను అమృత్ మహోత్సవ్గా దేశం జరుపుకోనుంది. మీ ప్రాంతంలో జరిగిన పోరాట ఘట్టాలను వెలుగులోకి తీసుకురండి. పుస్తకాలు రాయండి. మీ రచనలే మన స్వాతంత్య్ర పోరాట యోధులకు గొప్ప నివాళి. అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషల్లో పుస్తకాలు రావాలి. ఈ దిశగా యువతను ప్రోత్సహిస్తాం’’అని ప్రధాని తెలిపారు. ‘‘రోడ్డు ప్రమాదాలు దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. రహదారి భద్రత కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘లేట్ మిస్టర్’గా కాకుండా ‘మిస్టర్ లేట్’గా ఉండడమే ఉత్తమం అంటూ రహదారులపై కనిపిస్తున్న నినాదాలు చాలా ప్రభావవంతంగా ఉంటున్నాయి. రహదారి భద్రతపై ఇలాంటి నినాదాలను ప్రభుత్వానికి పంపించండి. మన యోగాకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తోంది. చిలీ దేశ రాజధాని శాంటియాగోలో 30కి పైగా యోగా స్కూళ్లు ఉన్నాయని తెలిస్తే మీరు చాలా సంతోషిస్తారు. చిలీ సెనేట్లోని ఉపాధ్యక్షుడి పేరు రవీంద్రనాథ్ క్వింటేరోస్. మన రవీంద్రనాథ్ ఠాగూర్ స్ఫూర్తితోనే ఆయనకు ఆ పేరు పెట్టారు’’ అని తెలిపారు. బోయిన్పల్లి మార్కెట్ భేష్ హైదరాబాద్లోని బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ బాధ్యతలు నెరవేర్చే విధానం చాలా సంతృప్తినిచ్చింది. మార్కెట్లలో చాలా కారణాల వల్ల కూరగాయలు చెడిపోవడం మనం చూశాం. వీటితో మార్కెట్లలో అపరిశుభ్రత నెలకొంటోంది. కానీ, బోయిన్పల్లి మార్కెట్లో ఇలా రోజువారీ పాడైన కూరగాయలతో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారు చేయడం వినే ఉంటారు. ఇది నవకల్పన శక్తి. బోయిన్పల్లి మార్కెట్లో వ్యర్థాల నుంచి సంపద సృష్టి జరుగుతోంది. ఇది వ్యర్థాల నుంచి బంగారం తయారు చేసే దిశగా సాగుతున్న ప్రయాణం. అక్కడ రోజుకు 10 టన్నుల వ్యర్థాలు తయారవుతున్నాయి. వాటిని సేకరించి, ప్లాంట్లో రోజూ 500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇది మార్కెట్కు వెలుగులు పంచుతోంది. దాదాపు 30 కిలోల జీవ ఇంధనం కూడా ఉత్పత్తి అవుతోంది. దీంతో మార్కెట్ క్యాంటీన్లో ఆహారాన్ని తయారు చేస్తున్నారు. -
రైతు పోరాటం ఉధృతం
ట్రాక్టర్ పరేడ్లో హింస తర్వాత కొంత వెనక్కు తగ్గినట్లు కనిపించిన రైతు పోరాటం మళ్లీ ఉధృతం అవుతోంది. ఇప్పటివరకు పంజాబ్, హరియాణా రైతులే ఉద్యమంలో కీలకంగా వ్యవహరించగా.. ఇప్పుడు పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్తాన్ రైతులు కూడా వీరికి జత కలిశారు. ఘజియాబాద్/న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ట్రాక్టర్ పరేడ్లో హింస చోటుచేసుకున్న తర్వాత కొంత బలహీనపడినట్లు కనిపించిన రైతు పోరాటం మళ్లీ తీవ్రతరమవుతోంది. ప్రధానంగా పంజాబ్, హరియాణా రైతులే ఇప్పటివరకు ఈ పోరాటంలో కీలకంగా వ్యవహరిస్తుండగా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్తాన్ రైతులు కూడా తోడవుతున్నారు. ఢిల్లీ–మీరట్ రహదారిపై ఉన్న ఘాజీపూర్ మరో ప్రధాన కార్యక్షేతంగా మారిపోయింది. ఢిల్లీలో హింస తర్వాత స్వస్థలాలకు తిరిగి వెళ్లిన పంజాబ్, హరియాణా రైతులు మళ్లీ వెనక్కి వస్తున్నారు. సింఘు, టిక్రీ బోర్డర్ పాయింట్లకు చేరుకుంటున్నారు. రైతుల నిరసన కేంద్రాల్లో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పారా మిలటరీ దళాలనుమోహరించారు. ఢిల్లీలో రైతులు సాగిస్తున్న పోరాటానికి మద్దతుగా ఢిల్లీ–ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని ముజఫర్నగర్లో శనివారం మహాపంచాయత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా రైతు సంఘాల నాయకులు శనివారం ‘సద్భావన దివస్’గా పాటించారు. సింఘు, టిక్రీ, ఘాజీపూర్ బోర్డర్ పాయింట్ల వద్ద నిరాహార దీక్షలు చేపట్టారు. ఘాజీపూర్లో బీకేయూ నేత రాకేశ్ తికాయత్ రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. రెండు నెలలకుపైగా తమ పోరాటం కొనసాగుతోందని, ఇక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రైతుల ఉద్యమం బలంగా ఉందని బీకేయూ మీరట్ జోన్ అధ్యక్షుడు పవన్ ఖటానా చెప్పారు. రైతుల శాంతియుత పోరాటానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందన్నారు. ఇది రాజకీయ పోరాటం కాదని స్పష్టం చేశారు. సర్కారు వైఖరి మారాలి రైతుల ఆందోళన నానాటికీ బలం పుంజుకుంటోందని సంయుక్త కిసాన్ మోర్చా సీనియర్ సభ్యుడు అభిమన్యు కోహర్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఎంతోమంది తమ పోరాటంలో భాగస్వాములవుతారని చెప్పారు. ఫిబ్రవరి 2వ తేదీ నాటికి భారీ సంఖ్యలో రైతులు ఢిల్లీకి చేరుకుంటారని అంచనా వేస్తున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్(రాజేవాల్) అధ్యక్షుడు బల్బీర్సింగ్ రాజేవాల్ పేర్కొన్నారు. ఆయన చండీగఢ్లో మీడియాతో మాట్లాడారు. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరాఖండ్ నుంచి రికార్డు స్థాయిలో రైతులు దేశ రాజధానికి వస్తారని వెల్లడించారు. తమ ఉద్యమం శాంతియుతంగా కొనసాగుతోందని ఉద్ఘాటించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం దారుణమని విమర్శించారు. జనవరి 26 నాటి హింసాత్మక దృశ్యాలను ప్రభుత్వం పదేపదే చూపుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోందని రాజేవాల్ మండిపడ్డారు. కేంద్ర సర్కారు ఇప్పటికైనా మొండి వైఖరి వీడాలని, కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని హితవు పలికారు. మళ్లీ చర్చల కోసం ప్రభుత్వం పిలిస్తే తప్పకుండా వెళ్తామన్నారు. ఢిల్లీలో జరిగిన హింసపై పోలీసులు జారీ చేసిన నోటీసుకు సమాధానం ఇస్తామని చెప్పారు. తికాయత్ కన్నీళ్లు కదిలించాయి ప్రముఖ రైతు, ఉద్యమ నాయకుడు మహేంద్రసింగ్ తికాయత్ తనయుడు, భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ నేతృత్వంలో పశ్చిమ ఉత్తరప్రదేశ్ రైతాంగం సంఘటితమవుతోంది. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు అవిశ్రాంతంగా సాగిస్తున్న ఆందోళనలు, నిరసనలు, ఢిల్లీలో హింస తదితర పరిస్థితుల నేపథ్యంలో గురువారం రాత్రి ఘాజీపూర్ వద్ద భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కన్నీళ్లు వేలాది మంది రైతులను కదిలించాయి. తికాయత్కు మద్దతుగా శనివారం ఆయన సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్తోపాటు పంజాబ్, రాజస్తాన్, ఉత్తరాఖండ్ నుంచి భారీ సంఖ్యలో రైతులు ఘాజీపూర్కు తరలివచ్చారు. గురువారం రాత్రి తికాయత్ విలపించిన తర్వాత తమ కళ్లల్లోనూ నీళ్లు వచ్చాయని, ఆ రాత్రంతా తాము నిద్రపోలేదని, టీవీలకే అతుక్కుపోయామని చారౌర గ్రామ పెద్ద పంకజ్ ప్రధాన్ చెప్పాడు. తికాయత్ కన్నీళ్లే తనను ఇక్కడికి తీసుకొచ్చాయని యూపీలోని బులంద్షహర్కు చెందిన అనిల్ చౌదరి తెలిపాడు. 1,700 వీడియో క్లిప్స్, సీసీటీవీ ఫుటేజీ రిపబ్లిక్ డే రోజు రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో హింసాకాండపై ప్రజల నుంచి పోలీసులకు ఇప్పటిదాకా 1,700 వీడియో క్లిప్స్, సీసీటీవీ ఫుటేజీ అందాయి. ఫోరెన్సిక్ నిపుణులు వీటిని విశ్లేషిస్తున్నారు. నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ హింసాకాండకు సంబంధించి 9 కేసులు నమోదుచేశారు. వీటిపై క్రైం బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. ఫోన్ కాల్స్ డేటాను పరిశీలిస్తున్నారు. ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ నెంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ట్రాక్టర్ పరేడ్ను 9 డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు. ఫొటోలు తీశారు. వీటిపై అధికారులు దృష్టి పెట్టారు. ఇంటర్నెట్ బంద్ దేశ రాజధానిలో జనవరి 26న హింస చోటుచేసుకున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తుగా ఢిల్లీ సరిహద్దులోని రైతుల నిరసన కేంద్రాలైన సింఘు, టిక్రీ, ఘాజీపూర్ బోర్డర్ పాయింట్లతోపాటు సమీప ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. జనవరి 29 రాత్రి 11 గంటల నుంచి 31వ తేదీ రాత్రి 11 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ప్రజా భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. హరియాణా ప్రభుత్వం 14 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను ఇప్పటికే రద్దు చేసింది. -
10కోట్ల మంది రైతులకు లబ్ధి
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలతో దేశవ్యాప్తంగా రైతులకు లాభమే తప్ప ఎలాంటి నష్టం ఉండదని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉద్ఘాటించారు. వివాదాస్పదంగా మారిన ఈ చట్టాలను ఆయన గట్టిగా సమర్థించారు. వీటి అమలుతో 10 కోట్ల మంది సన్నకారు రైతులు తక్షణమే ప్రయోజనం పొందుతారని తెలి పారు. గణతంత్ర దినోత్సవం రోజు దేశ రా జధాని ఢిల్లీలో హింస చోటుచేసుకోవడం, రై తుల ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా మువ్వన్నెల జాతీయ జెండాకు అవమానం జరగడం చా లా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రా రంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. వాస్తవాధీన రేఖ(ఎల్ఏ సీ) వద్ద శాంతికి పొరుగు దేశం విఘాతం కలి గిస్తోందంటూ పరోక్షంగా చైనాపై మండిపడ్డా రు. కోవింద్ ప్రసంగం ఆయన మాటల్లోనే... ► సరిహద్దులో యథాతథ స్థితిని మార్చడానికి కొన్ని దేశాలు చేస్తున్న కుట్రలను మన సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. ►పేదలు, సన్నకారు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు ప్రారంభించింది. ఆర్థిక, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక రంగాల పురోగతికి కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ► కొత్త సాగు చట్టాలతో రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుంది. గతంలో వివిధ పార్టీలు ఈ చట్టాలకు మద్దతునిచ్చాయి. ► రాజ్యాంగం మనకు భావప్రకటనా స్వేచ్ఛను ఇచ్చింది. అదే సమయంలో చట్టాలను గౌరవించాలని, రాజ్యాంగ నియమ నిబంధనలను పాటించాలని రాజ్యాంగం బోధించిందన్న సంగతి మరచిపోవద్దు. ► మూడు కొత్త సాగు చట్టాల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం కచ్చితంగా గౌరవిస్తుంది. కోర్టు ఆదేశాలతో ఈ చట్టాల అమలును ప్రభుత్వం నిలిపివేసింది. ► సన్న, చిన్నకారు రైతుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వారి పెట్టుబడి సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.1.13 లక్షల కోట్లను బదిలీ చేసింది. ► కరోనా వ్యాప్తి సమయంలో ప్రభుత్వం 80 కోట్ల మంది పేదలకు 8 నెలలపాటు ఉచి తంగా నిత్యావసరాలను సరఫరా చేసింది. ► కరోనా కల్లోల సమయంలోనూ భారత్ పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలిచింది. 2020 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 36 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. బహిష్కరించిన ప్రతిపక్షాలు రాష్ట్రపతి తన ప్రసంగంలో గత ఏడాది మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తదితరులకు నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీతో సహా 20 ప్రతిపక్షాలు బహిష్కరించాయి. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న పోరాటానికి మద్దతుగానే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించినట్లు ఆయా పార్టీలు ప్రకటించాయి. పార్లమెంట్లో రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతుండగా కొందరు ప్రతిపక్ష ఎంపీలు జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. -
ఎవరినీ వదలం: ఢిల్లీ పోలీస్ చీఫ్
‘ట్రాక్టర్ పరేడ్ను అనుమతించిన మార్గంలో, నిర్దేశించిన సమయంలో నిర్వహించలేదు. హింసకు, విధ్వంసానికి పాల్పడ్డారు. దోషులెవరినీ వదలం’అని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీ వాస్తవ స్పష్టం చేశారు. ఢిల్లీ ఆందోళనలకు సంబంధించి ఇప్పటివరకు 25 కేసులు నమోదు చేశామన్నారు. ఢిల్లీ పోలీసులు అత్యంత సంయమనం పాటించడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. ఆందోళనకారులు పోలీసుల నుంచి టియర్ గ్యాస్ షెల్స్ను ప్రయోగించేందుకు వాడే తుపాకులను లాక్కున్నారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ తరహా తుపాకీ ఎర్రకోటలో ఒక ఆందోళనకారుడి దగ్గర కనిపించిందన్నారు. ఎర్రకోటలోకి ఒక్కసారిగా ప్రవేశించిన ఆందోళనకారుల్లో కొందరు మద్యం సేవించారని, కత్తులు, పదునైన ఆయుధాలతో తమపై దాడి చేశారని కేసు విచారిస్తున్న నార్త్ ఢిల్లీ డీసీపీ సందీప్ తెలిపారు. అక్కడ హింసకు పాల్పడుతున్న సమూహాన్ని నియంత్రించడం తమకు కష్టమైందన్నారు. అయితే, ఎర్రకోటలోకి ప్రవేశించిన ఆందోళనకారులను 3 గంటల్లో అక్కడి నుంచి పంపించివేశామన్నారు. కాగా, తాజాగా ఎర్రకోట వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సహా ఇతర భద్రతా దళాలను బుధవారం భారీగా మోహరించారు. డ్రోన్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. నకిలీవార్తల కట్టడికి ట్విట్టర్ రంగంలోకి దిగింది. ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నాయన్న అనుమానంతో సుమారు 550 ఖాతాలను ట్విట్టర్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ప్రజా ఉద్యమంగా మారింది: బి. వెంకట్ సాగు చట్టాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన రైతు ఉద్యమం ఇప్పుడు ప్రజా ఉద్యమంగా మారిందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. ఈ చట్టాలతో రైతులతో పాటు యావత్తు ప్రజానీకానికి నష్టం కలుగుతుందని ఆయన బుధవారం విడుదల చేసిన బహిరంగ లేఖలో వ్యాఖ్యానించారు. చట్టాల రద్దుకై ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శాసనసభలో తీర్మానాలు చేస్తే కేంద్రప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు అవకాశం ఉంటుందని, అలాగే ఈనెల 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో తెలుగు రాష్ట్రాల పార్లమెంటు సభ్యులంతా ఈ చట్టాల రద్దు కోసం కృషి చేయడం రైతు ఉద్యమానికి ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. -
రైతు ఉద్యమంలో చీలికలు
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ సుమారు గత 2 నెలలుగా ఆందోళన చేస్తున్న రైతు ఉద్యమంలో చీలికలు ప్రారంభమయ్యాయి. రైతు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు రెండు రైతు సంఘాలు ప్రకటించాయి. ఢిల్లీలో మంగళవారం జరిగిన ఘటనలకు నిరసనగా రైతు ఆందోళనల నుంచి విరమించుకుంటున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్(భాను), రాష్ట్రీయ కిసాన్ ఆందోళన్ సంఘటన్ బుధవారం ప్రకటించాయి. మరోవైపు, బడ్జెట్ను ప్రకటించే ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటుకు తలపెట్టిన పాదయాత్రను రద్దు చేస్తున్నట్లు 41 రైతు సంఘాల వేదిక ‘సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)’ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం రోజు రైతులు ఢిల్లీలో నిర్వహించిన ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా చెలరేగిన అల్లర్లకు సంబంధించి సుమారు 200 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేధాపాట్కర్, యోగేంద్ర యాదవ్లతో పాటు మొత్తం 37 మంది రైతు నేతల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. మంగళవారంనాటి ఢిల్లీ నిరసనల్లో 394 మంది పోలీసులు గాయపడ్డారు. రైతు నేతలపై సమయపూర్ బద్లి పోలీసు స్టేషన్లో ఐపీసీ 147(అల్లర్లు, విధ్వంసం), 148(అల్లర్లు, విధ్వంసం), 307(హత్యాయత్నం), 120బీ(నేరపూరిత కుట్ర) సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం హింసాత్మక ఘటనలు జరిగిన ఎర్రకోటను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ సందర్శించారు. విద్రోహ శక్తుల కుట్ర రైతు ఉద్యమంలో లేని కొందరు సంఘ విద్రోహ శక్తులే ఢిల్లీలో మంగళవారం జరిగిన అల్లర్లకు, ఎర్రకోట ఘటనకు కారణమని రైతు నేతలు ఆరోపించారు. నటుడు దీప్ సిద్ధు వంటి విద్రోహ శక్తులు శాంతియుతంగా సాగుతున్న ఉద్యమాన్ని నాశనం చేసే ఉద్దేశంతో ఈ కుట్ర చేశాయన్నారు. ప్రభుత్వం, ఇతర రైతు ఉద్యమ వ్యతిరేక శక్తులు చేస్తున్న ఈ ప్రయత్నాలను సాగనివ్వబోమని సంయుక్త కిసాన్ మోర్చా స్పష్టం చేసింది. ‘శాంతియుతంగా సాగుతున్న మా ఉద్యమాన్ని ప్రభుత్వం తట్టుకోలేకపోయింది. అందుకే కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ, ఇతర విద్రోహ శక్తులతో కలిసి ఈ కుట్రకు తెరతీసింది. మా ఉద్యమం ప్రారంభమైన 15 రోజులకు ఈ సంస్థలు వేరేగా నిరసన వేదికను ఏర్పాటు చేసుకున్నాయి. మా ఐక్య ఉద్యమంతో వారికి సంబంధం లేదు’అని సంయుక్త కిసాన్ మోర్చా బుధవారం ఒక ప్రకటనలో వివరించింది. జనవరి 30న దేశవ్యాప్తంగా నిరాహార దీక్షలు, బహిరంగ సభలు నిర్వహిస్తామని వెల్లడించింది. ‘దీప్ సిద్ధూ ఆరెస్సెస్ మనిషి. ఎర్రకోటలో మత జెండాను ఎగరేసిన తరువాత అక్కడినుంచి వెళ్లిపోయేందుకు ఆయనను పోలీసులు అనుమతించారు’అని రైతు నేత దర్శన్ పాల్ ఆరోపించారు. ‘ 99.9% రైతులు అనుమతించిన మార్గంలోనే శాంతియుతంగా పరేడ్లో పాల్గొన్నారు’అని రైతు నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఘటనలపై తీవ్రంగా ఆవేదన చెందుతున్నామని, అందువల్ల రైతు ఉద్యమం నుంచి వైదొలగుతున్నామని చిల్లా బోర్డర్ వద్ద నిరసన తెలుపుతున్న భారతీయ కిసాన్ యూనియన్(భాను) అధ్యక్షుడు భాను ప్రతాప్ సింగ్ ప్రకటించారు. ఇకపై రైతు ఉద్యమంలో తాము భాగం కాదని ఘాజీపూర్ సరిహద్దులో రైతు ఉద్యమంలో పాల్గొన్న రాష్ట్రీయ కిసాన్ ఆందోళన్ సంఘటన్ నేత వీఎం సింగ్ స్పష్టం చేశారు. ► ట్రాక్టర్ పరేడ్లో హింస చెలరేగిన నేపథ్యంలో దేశ రాజధానిలో శాంతి, భద్రతల పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం సమీక్షించారు. హోం శాఖ కార్యదర్శి అజయ్భల్లా, ఢిల్లీ పోలీస్ విభాగం ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ► రైతుల ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా ఢిల్లీలో చెలరేగిన అల్లర్లపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో, మరో ఇద్దరు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులు సభ్యులుగా త్రి సభ్య విచారణ కమిషన్ను వేయాలని కోరుతూ బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజధానిలో జరిగిన హింసకు, జాతీయ పతాకానికి జరిగిన అవమానానికి కారణమైన వ్యక్తులు, సంస్థలపై కేసు నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాలని కూడా న్యాయవాది విశాల్ తివారీ ఆ పిటిషన్లో కోరారు. ► ఇండియన్ నేషనల్ లోక్దళ్ నేత అభయ్సింగ్ చౌతాలా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. హరియాణా అసెంబ్లీలో ఐఎన్ఎల్డీకి ఉన్న ఏకైక సభ్యుడు చౌతాలానే. కేంద్రం తీసుకువచ్చిన వివాదాస్పద సాగు చట్టాలను సమర్ధిస్తూ హరియాణా అసెంబ్లీలో అధికార బీజేపీ తీర్మానం చేయడాన్ని నిరసిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అనుచరులతో కలిసి అసెంబ్లీకి ట్రాక్టర్పై వెళ్లి ఆయన రాజీనామా సమర్పించారు. ► ఢిల్లీ ఆందోళనల నేపథ్యంలో రైతు సంఘాల నేతలతో చర్చలు ముగిశాయని ఎన్నడూ ప్రభుత్వం చెప్పలేదని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. తదుపరి విడత చర్చలపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని, ఆ నిర్ణయం తీసుకోగానే తెలియజేస్తామని బుధవారం మీడియాకు వెల్లడించారు. చిల్లా సరహద్దులో టెంట్లను తొలగిస్తున్న రైతులు -
పెళ్లి వేడుక జరుపుకుందామని వచ్చి.. నేలకొరిగిన రైతుబిడ్డ
రాంపూర్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొని మృత్యువాత పడిన నవ్రీత్ సింగ్ గ్రామంలో విషాదం అలుముకుంది. ఇటీవలే ఆస్ట్రేలియాలో పెళ్ళి చేసుకున్న 27 ఏళ్ళ నవ్రీత్ సింగ్, తన సొంత గడ్డపై పెళ్ళి వేడుకని జరుపుకునేందుకు ఆస్ట్రేలియా నుంచి ఉత్తరప్రదేశ్, బిలాస్పూర్లోని తన స్వగ్రామమైన డిబ్డిబాకి వచ్చారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఆందోళనకు మద్దతుగా తన సమీప బంధువులతో కలిసి ట్రాక్టర్ ర్యాలీకి హాజరయ్యారు. రైతుల ట్రాక్టర్ పెరేడ్ సందర్భంగా సెంట్రల్ ఢిల్లీలోని ఐటీఓ వద్ద పోలీసు బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో ట్రాక్టర్కింద పడి నవ్రీత్ సింగ్ మరణించారని పోలీసులు చెప్పారు. పోలీసు కాల్పుల్లో నవ్రీత్ మరణించాడన్న పుకార్లు వచ్చాయని, అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో ఏ కాల్పులూ రికార్డు కాలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం నవ్రీత్ భౌతిక కాయాన్ని ఆయన స్వగ్రామానికి చేర్చారు. ఆయన పెళ్ళి వేడుకకు ఒక రోజు ముందు నవ్రీత్ సింగ్ మృత్యువాత పడడం అందర్నీ విషాదంలో ముంచింది. నవ్రీత్ గ్రామంలో శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. నవ్రీత్ సింగ్ని అమరవీరుడిగా పేర్కొన్న అతని కుటుంబ సభ్యులు నవ్రీత్ ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్ళి, ఇటీవలే అక్కడ వివాహం చేసుకున్నారని చెప్పారు. ఈ ఘటన జరిగిన తరువాత రైతులు నవ్రీత్ సింగ్ భౌతిక కాయంపై త్రివర్ణపతాకాన్ని కప్పి ఢిల్లీలోని ఐటివో క్రాస్రోడ్లో ఉంచి ఆందోళనకు దిగారు. వేగంగా దూసుకు రావడం తోనే ట్రాక్టర్పైనుంచి కిందపడి నవ్రీత్ మరణించాడని పోలీసులు చెపుతుండగా, రైతులు మాత్రం పోలీసుల వాదనను ఖండించారు. నవ్రీత్ పోలీసు కాల్పుల్లోనే మరణించినట్టు స్పష్టం చేశారు. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించగా, అది నవ్నీత్ తలపై పడి మరణించాడని ఆరోపిస్తున్నారు. -
చేయి దాటకముందే మేలుకోవాలి
పరిష్కరించలేని సమస్య అంటూ ఏదీ లేదు. నివారించలేని యుద్ధం అంటూ ఏదీ ఉండదు. మనిషి వివేకం కోల్పోయినప్పుడే సమస్యలు తలెత్తుతాయి. క్షమాగుణం కరువైనప్పుడే ద్వేషాలు ప్రబలుతాయి. ఐదు నెలలుగా శాంతియుతంగా సాగుతున్న రైతు ఉద్యమం ఒక్కసారిగా హింసారూపం దాల్చింది. ఉద్యమాన్ని అప్రతిష్టపాలు చేయడానికే కుట్రపూరితంగా కొందరు హింసకు పాల్పడ్డారని రైతు సంఘాలు చెబుతున్నాయి. ఏమైనా పరిస్థితి ఇలా చేయిదాటడం అటు నిర్మాణాత్మకంగా సాగే ఉద్యమాలకూ మంచిది కాదు; ఇటు నవభారతాన్ని నిర్మించాల్సిన ప్రజాస్వామ్యానికీ పనికొచ్చేది కాదు. నేను గతవారం రాసిన ‘వ్యవసాయ చట్టాల వివాదాన్ని లోక్ అదాలత్కు రిఫర్ చేయ వచ్చా?’ అనే వ్యాసంలో ‘‘ఇంతవరకు రైతులు శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో రైతులను అభినందించింది. అందుకే వీలైనంత తొందరగా సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు, రైతు సంఘాలు, మేధావులు కృషి చేస్తారని ఆశిద్దాం’’ అని రాశాను. కానీ తరువాత జరిగిన పరిణామాలను చూస్తే సమస్యను పరిష్కరించే దిశగా కాకుండా వైరుధ్యాన్ని పెంచే విధానాన్ని అనుసరించారని స్పష్టమవుతుంది. అనివార్యమైన యుద్ధమంటూ ఏదీవుండదు, మనిషిలో విజ్ఞత లోపించినప్పుడే యుద్ధం వస్తుంది అన్నాడు బ్రిటన్ మాజీ ప్రధాని ఆండ్రూ బోనార్ లా. ‘ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్’. సరియైన సమయంలో కుట్టు వేస్తే తొమ్మిది చినుగులను అరికట్టవచ్చు. అది వ్యక్తి ఆరోగ్యం కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, ప్రజల, రైతుల సమస్యలు కావచ్చు లేదా ప్రజా ఆందోళనల విషయంలో ప్రభుత్వ వైఖరి కావచ్చు. ఎవరు ఏ సమయంలో ఏం చేయాలో అది చేయగలిగితే తొంభై శాతం సమస్యలను పరిష్కరించవచ్చు. అరాచక శక్తుల కుట్ర గణతంత్ర దినోత్సవం రోజు జరిగిన రైతుల ట్రాక్టర్ ర్యాలీలో ఒక రైతు మరణించడం, అనేక మంది రైతులు, పోలీసులు గాయపడటం వంటి విషాదకర సంఘటనలు జరిగాయి. ఎర్రకోటపై రైతులు జెండాలు ఎగురవేశారు. అయితే ఈ ఉద్యమంలోకి విద్రోహకర శక్తులు ప్రవే శించాయా? గతంలో బీజేపీతో సన్నిహితంగా ఉన్నవారే కొందరు రైతులను ఎర్రకోట వైపు మరల్చారనీ, వారే ఎర్రకోటపై జెండా ఎగుర వేశారనీ కొందరు రైతు సంఘ నాయకులు ఆరోపించారు. పంజాబీ గాయకుడు, నటుడు దీప్ సిద్ధూ ఒకప్పుడు ప్రధాని మోదీతో, నటుడు సన్నీ దేవళ్తో ఫొటోలు దిగిన వ్యక్తి. ఆయనే స్వయంగా ఎర్రకోటపై జెండా ఎగుర వేశానని బహిరంగంగా ఫేస్ బుక్లో ప్రకటించాడు. అయితే ప్రభుత్వం ఇది ఖలిస్తాన్ వాదుల పని అనీ, ఎగరేసింది ఖలిస్తాన్ జెండా అనీ అసత్యాలను ప్రచారం చేస్తు న్నది. శాంతియుత రైతు ఉద్యమాలను అప్రతిష్టపాలు చేయడానికి కుట్రపూరితంగా కొందరు హింసకు పాల్పడ్డారని, ఎర్రకోట వైపు వెళ్లేలా కొంతమందిని రెచ్చగొట్టారని రైతు సంఘాలు చెబుతున్నాయి. ఏదిఏమైనా పరిస్థితి చేజారిపోయింది. ఇప్పటికైనా ఇటు ప్రభుత్వం, అటు రైతు సంఘాలు కళ్ళు తెరిచి శాంతియుతంగా సమస్యలు పరిష్క రిస్తారని ఆశిద్దాం. పదవుల నుంచి విరమణ చేసినవారు సలహాలు చెబుతుంటారు, వినాలా వద్దా? అంటే ఎవరి ఇష్టం వారిది. చెప్పడమే మా ధర్మం, వినకపోతే నీ ఖర్మం అని శ్రీకృష్ణుడే అన్నాడు. మహాభారత యుద్ధంలో దాదాపు కౌరవుల్లోని వీరాధివీరులు, కర్ణుని వంటి దాన శీలి, యావత్ కౌరవ వంశము, లక్షలాది మంది సైనికులు చనిపోయారు. అయితే కౌరవ వంశం నాశనం కాకూడదని విదురుడు, భీష్ముడు, ద్రోణా చార్యుడు మొదలైనవారు ధృతరాష్ట్రునికి, దుర్యోధనునికి ఎన్నోతీర్లుగా సలహాలు ఇచ్చారు. కానీ దుర్యోధనాదులు వినలేదు. ఫలితం అనుభ వించారు. ఒక పేరు మోసిన ఫ్యాక్షనిస్టు కుటుంబ సభ్యులను హత్య చేయడం, దానితో ఆ ఫ్యాక్షనిస్టు ప్రతీకార హత్యలకు పూనుకోవడం జరిగింది. ఈ పరిస్థితులు అన్నింటినీ గమనించి నేను హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు అతనికి బెయిల్ మంజూరు చేశాను. ఆ ఆర్డర్లో ఇక నుంచైనా నేర ప్రవృత్తిని మానుకుని శాంతియుత జీవితం కొనసాగిం చాలని చెప్పాను. అతడు ఒక రెండు మూడు నెలలు శాంతియుతంగా గడిపినా, మళ్లీ నేర ప్రవృత్తిని మానుకోలేకపోయాడు. ఫలితం ఏమైంది? కొద్దిరోజుల్లోనే అతను కూడా హత్యకు గురయ్యాడు. హింసతో హింసను, పగతో పగను, కక్షలతో కక్షలను ఎన్నడూ దూరం చేయలేము. ఒక కంటిలో పొడిచినవాడి కంటిలో మనమూ పొడుచు కుంటూ వెళితే ఈ ప్రపంచంలో ఎవరికీ కళ్లు ఉండవు. హింసకు ప్రతిహింస సమాధానం కాదు ఏ సమస్య అయినా ప్రశాంతంగా ఆలోచించి సరైన పరిష్కార మార్గం దిశగా అందరితో గౌరవంగా, ప్రేమగా మాట్లాడి అందరికీ న్యాయం జరిగే సూచనలు చేసినట్లయితే ఆ ప్రతిపాదనలను వారు అంగీకరించే అవకాశం ఉంది. నేను నెల్లూరు, ప్రకాశం జిల్లా జడ్జిగా పనిచేస్తున్న రోజుల్లో ఎన్నో గ్రామాల్లో ప్రజలందరితో మాట్లాడి వారందరూ మళ్లీ కలిసి మెలిసి ఉండేటట్లు వారి మధ్య ఉన్న సివిల్ క్రిమినల్ కేసులను పరిష్కరించాను. ఎన్నో గ్రామాలను ఎలాంటి తగాదాలు లేని గ్రామా లుగా మార్చాము. అలా పరిష్కరించామన్న తృప్తి కలిగింది. ఏ సమస్య అయినా ఆ సమస్య తీవ్ర దశకు చేరుకోక ముందే పరిష్క రించాలి. నీటిని వేడి చేస్తున్నాం అనుకుందాం. 98, 99 డిగ్రీల వరకు వేడి చేశాక కూడా ఇంకా వేడి చేస్తూ నీరు ఆవిరి కాకూడదు అంటే కాకుండా ఉంటుందా? నీటి కాలువకో, చెరువు గట్టుకో, ప్రాజెక్టుకో నెర్రెలు వచ్చినప్పుడు సకాలంలో రిపేరు చేస్తే ఆ కాలువ, చెరువు, లేదా ప్రాజెక్టు తెగిపోదు. అదే రోజుల తరబడి నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒక రోజు తెగిపోతుంది. ఊళ్లకు ఊళ్లు మునిగి పోతాయి. సర్వనాశనం జరుగు తుంది. అది క్షయ కావచ్చు, మరో వ్యాధి కావచ్చు. మొదటి దశలోనే పూర్తి చికిత్స తీసుకుంటే 99 శాతం కేసుల్లో ఆ వ్యాధి నుంచి నివారణ పొందవచ్చు. మొదటి, రెండవ దశలను నిర్లక్ష్యం చేస్తే జరగబోయే పరిణామాలు చెడుగా ఉండవచ్చు. నెలల తరబడి రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇంతవరకు ఏ రోజూ హింసకు పాల్పడలేదు. ఎప్పుడైతే ఆందోళన రోజుల తరబడి కొనసాగుతుందో ప్రజల ఓపిక నశించవచ్చు. లేదా అసంతృప్తి చెందిన కొందరు తమ అసంతృప్తిని చాటడానికి బల ప్రయోగానికి దిగవచ్చు. సుశిక్షితులైన పార్టీ కార్యకర్తలు ఉండి ఎక్కడ ఎలాంటి శక్తులు ఉద్యమం లోకి వస్తున్నాయో గమనించి వాళ్లను నివారించగలిగితే మేలు. అలాంటి నిర్మాణయుత సంస్థ ఉద్యమాలు చేపట్టడం వేరు. ఎంతో ఉన్నత లక్ష్యంతో ప్రారంభించబడిన ఉద్యమాలను కూడా చీల్చడానికి, బలహీనపరచడానికి వ్యతిరేక శక్తులు అరాచకవాదులను అందులోకి పంపుతాయి. అందుకే ఉద్యమనేతలు జాగ్రత్తగా ఉండాలి. మహాత్మా గాంధీ జరిపిన ఉద్యమంలో ఎక్కడ హింస చెలరేగినా వెంటనే ఉద్య మాన్ని ఆపివేసేవారు. అనేక ఉద్యమాలు శాంతియుతంగా మొదలైనా చివరకు హింసాత్మకంగా మారిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందుకే చరిత్ర నుండి గుణపాఠాలు నేర్చుకోవాలి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో జలియన్వాలాబాగ్ ఉదంతం తరు వాతనే బ్రిటిష్ అధికారుల మీద దాడులు జరిగాయి. భగత్సింగ్ ఉరితీత తరువాతనే సైనిక తిరుగుబాటుకు ఆలోచనలు బలపడ్డాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వాన అజాద్ హింద్ ఫౌజ్ ఏర్పడింది. సిక్కుల స్వర్ణ దేవాలయంలో రక్తం పారిన తరువాతనే ఇందిరా గాంధీని హత్య చేయాలనే కుట్ర జరిగింది. శ్రీలంకలో తమిళ ఈలం దళాలపై దాడులు జరిగిన తర్వాతనే రాజీవ్ గాంధీ హత్యకు రూపకల్పన జరిగింది. ఢిల్లీలో సిక్కుల ఊచకోత తర్వాతనే ఖలిస్తాన్ వాదం బలపడింది. చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవాలి నేను హింసను సమర్థించడం లేదు. హింస వల్ల ఏ సమస్యా పరి ష్కారం కాదు. కానీ ఒకరు హింసకు పాల్పడితే ఆ హింస వల్ల ఏర్పడిన పరిస్థితి ప్రతిహింసకు దారితీస్తుంది. అనేక మత కలహాల్లో, కుల విద్వేషాల్లో ఎందరో అమాయకులు బలయ్యారు. హింస వల్ల విలు వైన ప్రాణాలు పోతాయి. ఏదైనా తిరిగి వస్తుంది. కానీ ప్రాణం రాదు కదా! ప్రాణానికి విలువ ఇవ్వాలంటే హింసను మానుకోవాలి. ఇటు ప్రభుత్వం, అటు సంఘాలు, మరోవైపు కోర్టులు కక్షపూరిత ధోరణితో కాకుండా ప్రశాంతంగా ఆలోచనకు పూనుకోవాలి. క్షమాగుణం అలం కరించుకుని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. ఈరోజు కుల విద్వేషాలు, మత విద్వేషాలు పెరుగుతున్నాయి. ఈ విద్వేషాలను తగ్గించకపోతే భవిష్యత్తు చీకటిమయం కాక తప్పదు. ఇప్పటికే పేదరికం, నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, మహిళలపై అత్యాచారాలు, కల్తీ, అవినీతి... ఇలా ఎన్నో సమస్యలతో దేశం సత మతమవుతోంది. వీటికి తోడు శాంతిభద్రతల సమస్య కూడా ఉత్పన్న మైతే అభివృద్ధి మొత్తంగా కుంటుపడుతుంది. అందుకే సత్వరం మేలు కోవాలి. వివేకంతో మసులుకోవాలి. చేతులు కాలక ముందే ఆకులు పట్టుకుంటారని ఆశిద్దాం. జస్టిస్ బి. చంద్రకుమార్ వ్యాసకర్త హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి మొబైల్ : 79974 84866 -
వైరల్: 15 అడుగులో గోతిలో దూకిన పోలీసులు
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. రైతులను నియంత్రించే క్రమంలో పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలకు మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బారికేడ్లను తోసుకుంటూ రైతులు ముందుకు కదిలారు. కొందరు నిరసనకారులు పోలీసులపైకి కర్రలతో దాడి చేయగా, ఆ దాడి నుంచి తప్పించుకోవడానికి పోలీసులు ఎర్రకోట సమీపంలోని 15 అడుగుల లోతున్న కందకంలోకి దూకారు. మరికొందరు పట్టుకోల్పోయి దానిలోకి జారి పడిపోయారు. (విషాదకరం...దురదృష్టకరం) రైతుల నుంచి తప్పించుకునేందుకు పోలీసులు పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. పోలీసులు-రైతులకు మధ్య జరిగిన ఘర్షణల్లో దాదాపు 153 మంది పోలీసులు గాయపడ్డారు. ఇప్పటికే ఈ దాడులకు సంబంధించి 13 కేసులను పోలీసులు నమోదు చేశారు. రైతుల ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన తెలుపుతున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసింది. అలాగే, భారీగా పారామిలటరీ బలగాలను మోహరించింది. ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలను కూడా అలర్ట్ చేసింది. (హింసను ఖండించిన రైతు సంఘాలు) -
విషాదకరం...దురదృష్టకరం
మువ్వన్నెల జెండా రెపరెపలాడాల్సిన గణతంత్ర దినోత్సవంనాడు దేశ రాజధాని నగరం చవి చూసిన హింస కనీవినీ ఎరుగనిది, దురదృష్టకరమైనది. సాగు సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు చట్టాలను తక్షణం ఉపసంహరించుకోవాలంటూ గత రెండు నెల లుగా ఢిల్లీ నగరం వెలుపల బైఠాయించి ఉద్యమిస్తున్న రైతులు కూడా వాంఛించని పరిణామం ఇది. ‘జై జవాన్... జై కిసాన్’ అన్న నినాదాలు ప్రతిధ్వనించాల్సిన రోజున జవాన్లు, కిసాన్ల మధ్య ఘర్ష ణలు చోటుచేసుకోవటం ఎంతో విషాదకరం. ఒకచోట ఆందోళనకారులు పోలీసులను లోతైన గొయ్యిలోకి నిర్దాక్షిణ్యంగా నెట్టడం, మరోచోట వారిపైకి ట్రాక్టర్లను శరవేగంతో పోనిచ్చి భయ భ్రాంతులకు గురిచేయటం లాంటి దృశ్యాలు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ర్యాలీలోకి పాకిస్తాన్ ప్రేరేపిత ఖలీస్తానీ శక్తులు చొరబడే ప్రమాదం వున్నదని నాలుగురోజులక్రితం పోలీసులు తెలిపారు. కానీ ప్రశాంతంగా ర్యాలీ నిర్వహించుకుంటామన్న హామీపై షరతులతో అనుమతించారు. వాటి ప్రకారం పెరేడ్ ముగిశాకగానీ ర్యాలీ ఢిల్లీలో ప్రవేశించకూడదు. అంటే ఢిల్లీ వెలుపల ఏడు ప్రాంతాల్లో బైఠాయించిన ఉద్యమకారులు ఉదయం 11 గంటలకు మాత్రమే తమ తమ స్థానాల నుంచి బయ ల్దేరాలి. కానీ అందుకు భిన్నంగా 8 గంటల ప్రాంతంలోనే ర్యాలీలు ఎలా మొదలైనాయో, పోలీసులు ఎక్కడికక్కడ ఎందుకు నిలువరించలేకపోయారో అనూహ్యం. ముందనుకున్న విధంగా జరిగివుంటే అంతా ప్రశాంతంగా ముగిసిపోయేది. కానీ అది కాస్తా అదుపు తప్పి పోలీసులకూ, ఉద్యమకారులకూ మధ్య ఘర్షణలుగా పరిణమించింది. దాదాపు డజను చోట్ల నిర్దేశించిన మార్గాన్ని కాదని ఉద్యమకారుల్లో కొందరు బారికేడ్లను ధ్వంసం చేశారని పోలీసులు అంటుండగా... అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి అడ్డంకులు సృష్టించారని రైతుల ఆరోపణ. నిజానిజాల మాటెలావున్నా ఆందోళనకారులను నిలువరించటం పోలీసు బలగాలకు సాధ్యం కాలేదు. అనేకచోట్ల లాఠీచార్జిలు జరిగాయి. బాష్పవాయుగోళాలు ప్రయోగించాల్సివచ్చింది. వీటన్నిటినీ దాటుకుని ఆందోళనకారులు ఎర్రకోటలోకి ప్రవేశించి బురుజులెక్కి రైతు ఉద్యమ పతాకనూ, ఖల్సా జెండాను ఎగరేసిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తుంది. వేగంగా ట్రాక్టర్ నడిపి బారికేడ్లను ఢీకొట్టి, ఆ క్రమంలో ప్రమాదం జరిగి ఒక యువకుడు మరణించగా, రాళ్లు రువ్విన ఘటనలు, ఇతరత్రా దౌర్జన్యాల్లో 86మంది పోలీసులు గాయపడ్డారు. పోలీసులు సంయమనం పాటించకపోయివుంటే మరెన్ని దుర దృష్టకర ఘటనలు చోటుచేసుకుని వుండేవో ఊహించలేం. ముందు పోలీసులే రెచ్చగొట్టే చర్యలకు దిగారని కొందరు ఆందోళనకారులు చేస్తున్న వాదన సమంజసం కాదు. అదే నిజమైతే, తమలో ఎవరూ రెచ్చిపోకుండా చూడవలసిన బాధ్యత ర్యాలీకి నాయకత్వంవహిస్తున్నవారిదే. కొన్ని రోజుల క్రితం ఉద్యమ నేతలు కూర్చున్న ప్రాంతంలోకి చొరబడి ఒక వ్యక్తి ఖలిస్తాన్ అనుకూల నినాదా లిచ్చినప్పుడు వారిలో కొందరు వెంటనే అతన్ని గుర్తించి, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇప్పుడు కూడా అదే మాదిరి అప్రమత్తత పాటిస్తూ అవాంఛనీయ ఘటనలు జరకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఎక్కువుంది. హింసకు పాల్పడిన బృందాలకు నాయకత్వంవహించిన కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ(కెఎంఎస్సీ) నేతలు తమ కమిటీలో ఎప్పుడూలేరని ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న 40కి పైగా రైతు ఉద్యమ సంస్థలకు చెందిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నాయకులు అంటున్నారు. ఇలాంటివి జరిగే అవకాశమున్నదని అంచనా వేసుకుని ఎస్కేఎం నేతలు తమ వంతు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఈ విషయంలో వారు విఫలమయ్యారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మూల స్తంభాలుగా రూపొందిన రాజ్యాంగాన్ని ఆవిష్కరించుకుని, గణతంత్ర వ్యవస్థగా ప్రకటించుకున్నరోజైన జనవరి 26 జాతి యావత్తుకూ అత్యంత ప్రాముఖ్యమైన సందర్భం. దీన్ని పురస్కరించుకుని ఏటా అత్యంత ఘనంగా త్రివిధ దళాల పాటవ ప్రదర్శన, విన్యాసాలు వుంటాయి. దేశ చరిత్ర, సంస్కృతి, వైవిధ్యత చాటేలా శకటాలను ప్రదర్శిస్తారు. ఈసారి వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రావలసివున్నా స్వదేశంలో కరోనా వైరస్ తీవ్రత కారణంగా ఆయన విరమించుకున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా యధావిధిగా వేడుకలు జరిగాయి. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గౌరవవందనం స్వీకరించారు. ప్రధాని మొదలుకొని మంత్రులు, అధికారులు, వివిధ పార్టీల నేతలుసహా 25,000మంది జనం ఈ పెరేడ్ను తిలకించారు. కానీ పెరేడ్ అనంతరం జరిగిన ఘటనలు ఈ వేడుకలను మసకబార్చాయి. సాధారణ దినాల్లోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుండే ఎర్రకోట ప్రాంతానికి గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం వంటి జాతీయ వేడుకల సందర్భాల్లో మరింత భద్రత వుంటుంది. అయినా కూడా ఇవి చోటుచేసుకోవటం నిఘా విభాగాల వైఫల్యమే. ఇంతవరకూ ఏ ఉద్యమమూ హింస, దౌర్జన్యాలతో విజయం సాధించిన ఉదంతాలు మన దేశంలో లేవు. స్వాతం త్రోద్యమం మొదలుకొని ఇందుకెన్నో ఉదాహరణలున్నాయి. గత నాలుగైదు నెలలుగా కేంద్రం తీసు కొచ్చిన సాగు బిల్లులపై గానీ, ఆ తర్వాత వాటిని చట్టాలుగా మార్చటంపైగానీ రైతులోకం ఆందోళన చేస్తోంది. ముఖ్యంగా పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల రైతులు ఈ చట్టాలు రద్దు చేయాల్సిందేనని గత రెండు నెలలుగా ఢిల్లీ వెలుపల బైఠాయించి ఆందోళన సాగిస్తున్నారు. అదెంతో క్రమశిక్షణతో, సంయమనంతో సాగటం అన్ని వర్గాల ప్రశంసలూ పొందుతోంది. కానీ గణ తంత్ర దినోత్సవంనాడు చోటుచేసుకున్న ఘటనలు ఆ ఉద్యమం ఇన్నాళ్లూ సాధించుకున్న ప్రతి ష్టనూ, విశ్వసనీయతనూ దెబ్బతీశాయి. దీనిపై ఉద్యమ నేతలు సమీక్షించుకోవాలి. ప్రభుత్వం సైతం అవసరమైతే మరొక మెట్టు దిగైనా ఈ సమస్య పరిష్కారానికి పూనుకోవాలి. -
ఉద్యమంలో అసాంఘిక శక్తులు చొరబడ్డాయి
సాక్షి, న్యూఢిల్లీ: నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రిపబ్లిక్ డే నాడు రైతులు చేపట్టిన ట్రాక్టర్ పరేడ్లో హింస చెలరేగిన నేపథ్యంలో.. రైతు సంఘాల నేతలు స్పందించారు. తాము శాంతియుతంగా చేపట్టిన ర్యాలీలో అసాంఘిక శక్తులు చొరబడ్డాయని వారు ఆరోపించారు. హింసకు పాల్పడిన వ్యక్తులు రైతులు కాదని వారు వెల్లడించారు. రైతుకు వ్యవసాయం చేయడం మాత్రమే తెలుసని, హింసకు రైతులు ఎప్పుడూ వ్యతిరేమేనని బీకేయూ నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. కాగా, మంగళవారం ఉదయం రైతులు తమకు కేటాయించిన రూట్లలో కాకుండా ఇతరత్రా మార్గాల్లో ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించి సెంట్రల్ ఢిల్లీలోకి దూసుకొచ్చారు. ఈ ఆందోళనలో ట్రాక్టర్ అదుపు తప్పడంతో ఓ రైతు మృతి చెందాడు. ఆ తర్వాత వారు ఏకంగా ఎర్రకోటపైకి దూసుకెళ్లి, త్రివర్ణ పతాకం స్థానంలో తమ జెండాను ఎగుర వేశారు. రైతులను అదుపు చేయడానికి పోలీసులు శత విధాల ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కొందరు రైతులు చూపిన అత్యుత్సాహానికి ఢిల్లీ అట్టుడికిపోయింది. ప్రధాన రోడ్డు మార్గాలు మూసివేత.. ఢిల్లీలో అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రధాన రహదారులను మూసివేశారు. పార్లమెంట్, విజయ్చౌక్, రాజ్పథ్, ఇండియాగేట్ వైపు వెళ్లే దారులను డైవర్ట్ చేయడంతో ఇతర మార్గాల్లో భారీ రద్దీ నెలకొంది. -
కదంతొక్కిన కమ్యూనిస్టులు..
కరీంనగర్: నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఆందోళనకు సంఘీభావంగా కరీంనగర్లో కమ్యూనిస్టులు కదంతొక్కారు. జిల్లా నలుమూలల నుంచి సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్లతో కరీంనగర్కు చేరుకొని నగరంలో భారీ ర్యాలీని నిర్వహించారు. నగర పురవీధుల గుండా సాగిన ర్యాలీలో.. కమ్యూనిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని, కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విడనాడి, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నెలల తరబడి ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతోనే నేడు ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన ఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళన ప్రజా ఉద్యమంగా మారితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నూతన వ్యవసాయ చట్టాలు మూడింటిని రద్దు చేయాలని ఉభయ కమ్యునిస్టులు డిమాండ్ చేశారు. -
న్యూఢిల్లీ: రణరంగమైన ట్రాక్టర్ల పరేడ్
-
నేడే కిసాన్ గణతంత్ర పరేడ్
న్యూఢిల్లీ: ఒకవైపు గణతంత్ర దినోత్సవాలు, మరోవైపు మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కిసాన్ గణతంత్ర పరేడ్.. దేశ రాజధాని ఢిల్లీలో ఒకేరోజు రెండు ముఖ్యమైన కార్యక్రమాలు. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు జరిగే రాజ్పథ్లో, రైతులు ట్రాక్టర్ పరేడ్ తలపెట్టిన మార్గాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ్పథ్లో అధికారిక గణతంత్ర వేడుకలు ముగిసిన తర్వాతే ట్రాక్టర్ పరేడ్ ప్రారంభిస్తామని, సెంట్రల్ ఢిల్లీలోకి ప్రవేశించబోమని రైతు సంఘాల నాయకులు సోమవారం ప్రకటించారు. ఈ పరేడ్లో దాదాపు 2 లక్షల ట్రాక్టర్లు, రైతుల శకటాలు పాల్గొంటాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీ సరిహద్దులోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్ బోర్డర్ పాయింట్ల నుంచి పరేడ్ మొదలవుతుందన్నారు. ► రిపబ్లిక్ డే వేడుకలు జరిగే రాజ్పథ్లో 6,000 మంది భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ► పరేడ్లో పాల్గొనే రైతులు 24 గంటలకు సరిపడా ఆహార పదార్థాలను వెంట తెచ్చుకోవాలని రైతు నాయకులు సూచించారు. ► ఆయుధాలు, మద్యం, అనుచిత బ్యానర్లు ప్రదర్శించవద్దని చెప్పారు. ► సింఘు బోర్డర్ నుంచి ప్రారంభమయ్యే ట్రాక్టర్ పరేడ్ 63 కిలోమీటర్లు, టిక్రీ బోర్డర్ నుంచి మొదలయ్యే పరేడ్ 62 కిలోమీటర్లు, ఘాజీపూర్ బోర్డర్ నుంచి నిర్వహించే పరేడ్ 68 కిలోమీటర్లు కొనసాగుతుంది. రైతులకు బెస్ట్ ఆఫర్ ఇచ్చాం మూడు కొత్త వ్యవసాయ చట్టాల అమలును ఒకటి నుంచి ఒకటిన్నర సంవత్సరాలపాటు నిలిపివేస్తామంటూ ప్రభుత్వం తరపున రైతులకు ‘బెస్ట్ ఆఫర్’ ఇచ్చామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సోమవారం చెప్పారు. ఈ ఆఫర్ను రైత సంఘాల నేతలు త్వరలోనే పునఃపరిశీలించి, వారి నిర్ణయాన్ని తమకు తెలియజేస్తారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. రైతు సంఘాలు సానుకూలంగా స్పందిస్తే దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. కొత్త సాగు చట్టాలను రైతులే రద్దు చేస్తారు ముంబై: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో తన మెజార్టీని అడ్డం పెట్టుకొని రాజ్యాంగాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొస్తోందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత,శరద్ పవార్ మండిపడ్డారు. ఆయా చట్టాలను ప్రభుత్వం రద్దు చేయకపోతే ప్రజలే ఆ పని పూర్తిచేస్తారని, అధికార పార్టీని కూల్చేస్తారని హెచ్చరించారు. అక్కడ కేవలం పంజాబ్ రైతులే ఉన్నారని కొందరు అంటున్నారని, పంజాబ్ ఏమైనా పాకిస్తానా? అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని అవమానించారు పార్లమెంట్లో సమగ్రమైన చర్చ జరగకుండానే వ్యవసాయ బిల్లులను ఆమోదించారని శరద్ పవార్ తప్పుపట్టారు. పూర్తిస్థాయిలో చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇలా చేయడం రాజ్యాంగాన్ని అవమా నించడమే అవుతుందన్నారు. బడ్జెట్ రోజు పాదయాత్ర న్యూఢిల్లీ: మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటంలో ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్ వరకూ పాదయాత్ర చేపట్టనున్నట్లు రైతు సంఘాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. నూతన వ్యవసాయ చట్టాల రద్దు దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుంచి పార్లమెంట్ దాకా పాదయాత్ర చేపట్టనున్నట్లు క్రాంతికారి కిసాన్ యూనియన్ నేత దర్శన్ పాల్ సోమవారం చెప్పారు. కొత్త చట్టాలను పూర్తిగా రద్దు చేయాలన్న తమ డిమాండ్లో ఎలాంటి మార్పు లేదన్నారు. -
రైతు సంఘాల ట్రాక్టర్ ర్యాలీకి లైన్ క్లియర్
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీపై దేశవ్యాప్తంగా అనేక సందేహాలు నెలకొన్న నేపథ్యంలో.. ఈ ర్యాలీకి షరతులతో కూడిన అనుమతులిస్తూ ఢిల్లీ పోలీసులు ఎన్ఓసీ జారీ చేశారు. ఢిల్లీ పోలీసులు ప్రతిపాదించిన 37 నిబంధనలను రైతు సంఘాల నేతలు ఒప్పుకోవడంతో శాంతియుతంగా ర్యాలీ చేసుకునేందుకు వారికి అనుమతులు జారీ చేశారు. రెండు నెలలకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో సాగుతున్న రైతుల ఆందోళనలు ట్రాక్టర్ ర్యాలీతో మరింత ఉధృతంగా మారతాయన్న అనుమానాన్ని వ్యక్తం చేసిన ఢిల్లీ, హర్యాణా పోలీసులు.. మొదట్లో ఈ ర్యాలీకి ససేమిరా అన్నారు. రైతుల ట్రాక్టర్లలో డీజిల్ పోయొద్దని పెట్రోల్ బంకులకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో శాంతియుతంగా చేయాలనుకున్న ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి రావడంపై రైతు సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతు సంఘాలు ముందే అనుకున్న విధంగా సింఘు, టిక్రీ, ఘాజీపూర్ బోర్డర్ల నుండి రేపు ర్యాలీగా వెళ్లేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. రైతు ర్యాలీ సందర్భంగా ఢిల్లీ నగరవాసులు ఆయా రూట్లలో ప్రయాణించరాదని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కాగా, రైతులు చేపట్టబోయే ఈ ట్రాక్టర్ ర్యాలీ మొత్తం 170 కిలోమీటర్ల పరిధిలో సాగుతుందని, అందులో 100 కిలోమీటర్ల మేర ఢిల్లీ భూభాగం ఉంటుందని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. -
రైతుల ట్రాక్టర్ ర్యాలీ.. యోగీ ప్రభుత్వంపై అఖిలేష్ ఫైర్
లక్నో: రేపు ట్రాక్టర్ ర్యాలీకీ డీజిల్ ఇవ్వద్దంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇచ్చిన అదేశాలను సమాజ్వాది పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ ఖండించారు. ట్రాక్టర్లకు డీజిల్ పంపిణి చేయోద్దనడం ఇది కుట్ర పూరిత చర్య అని ఆయన ఆరోపించారు. రేపు గణతంత్ర దినోత్సవం రోజున రైతులు చేపట్టే కిసాన్ మార్చ్ ట్రాక్టర్ల భారీ ర్యాలీకి డీజిల్ను నిషేధిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ పంపులకు యోగి ప్రభుత్వం ఆదేశించింది. ఈ సందర్భగా అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ యూపీ ప్రభుత్వంపై ట్వీటర్ వేదికగా ధ్వజమెత్తారు. సోమవారం ఆయన ట్వీట్ చేస్తూ.. ‘రేపు రిపబ్లిక్ డే రోజున ట్రాక్టర్లకు డీజిల్ను నిషేధించాలని యూపీ సర్కారు అన్ని పెట్రోల్ పంపులను ఆదేశించిందని విన్నాము. ఒకవేళ దీనిపై రైతులు స్పందిస్తూ బీజేపీని అడ్డుకుంటే యోగి ప్రభుత్వం ఏం చేస్తుంది. ఇది రైతులపై బీజేపీ కుట్ర’ అని ఆయన పేర్కొన్నారు. (చదవండి: రైతుల ట్రాక్టర్ల ర్యాలీకి గ్రీన్ సిగ్నల్) అయితే అదే రోజున నిరసనలో ఉన్న రైతులంత దేశ రాజధానీలోని కవాతులో కూడా పాల్గొనవలసి ఉంది. కాగా జనవరి 26న దేశ రాజధానిలో జరిగే ‘కిసాన్ పరేడ్’కు ఢిల్లీ పోలీసుల అనుమితినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు దేశ రాజధాని మూడు సరిహద్దుల్లో బ్యారికేడ్లు తొలగించి, మంగళవారం నాటి ర్యాలీకి మార్గం సుగమం చేశారు. కాగా కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతలు సుదీర్ఘ కాలంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు ట్రాక్టర్ల పరేడ్ ద్వారా తమ నిరసన తెలియజేయాలని నిశ్చయించుకున్నారు. అయితే తొలుత ఇందుకు నిరాకరించిన పోలీసులు ట్రాక్టర్ల సంఖ్యపై పరిమితి విధించాలని భావించారు. (చదవండి: రైతుల ట్రాక్టర్ ర్యాలీ.. శాంతిభద్రతల అంశం) -
కిసాన్ పరేడ్కు గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గణతంత్ర వేడుకలకు భంగం కలిగించకుండా కిసాన్ గణతంత్ర పరేడ్ నిర్వహించుకోవచ్చని ఢిల్లీ పోలీసులు ఆదివారం సాయంత్రం చెప్పారు. రైతుల డిమాండ్ల పట్ల ఉన్న గౌరవంతోనే ఈ కార్యక్రమానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. రైతులు మంగళవారం ఢిల్లీ నగరంలోకి ప్రవేశించవచ్చని, అయితే, గణతంత్ర దినోత్సవాలకు ఎలాంటి విఘాతం కలిగించరాదని షరతు విధించారు. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు. రైతులు వాటిని కచ్చితంగా పాటించాలన్నారు. రాజ్పథ్లో పరేడ్ ముగిసిన తర్వాతే రైతుల ట్రాక్టర్ పరేడ్ ప్రారంభమవుతుందన్నారు. పోలీసు అధికారులు తాజాగా రైతు సంఘాల నేతలతో భేటీ అయ్యారు. శాంతియుతంగా ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తామని నేతలు స్పష్టం చేశారు. దీంతో పోలీసులు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చారు. ట్రాక్టర్ ర్యాలీకి అనుమతిపై తుది నిర్ణయం ఢిల్లీ పోలీసులదే అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ర్యాలీ కోసం పోలీసులు బహుళ మార్గాలను సూచించారు. సింఘు, టిక్రీ, ఘాజీపూర్ బోర్డర్ పాయింట్ల నుంచి బయలుదేరే ట్రాక్టర్లు వేర్వేరు మార్గాల్లో ప్రయాణించి, కూండ్లీ మానేసర్ పాల్వాల్ ఎక్స్ప్రెస్ వే వద్ద కలుసుకుంటాయని వెల్లడించారు. ర్యాలీ సందర్భంగా జాతి వ్యతిరేక నినాదాలు చేయరాదని, అనుచితమైన, రెచ్చగొట్టే రాతలతో కూడిన పోస్టర్లు ప్రదర్శించరాదని ఆంక్షలు విధించారు. రైతు సోదరులపై తమకు నమ్మకం ఉందని, కిసాన్ గణతంత్ర పరేడ్ను శాంతియుతంగా నిర్వహిస్తారని విశ్వసిస్తున్నట్లు ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ట్రాక్టర్ పరేడ్పై పాక్ కుతంత్రం రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ పరేడ్లో అలజడి సృష్టించేందుకు పాకిస్తాన్ కుట్రలు పన్నుతున్నట్లు ఢిల్లీ పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఈ పరేడ్పై రెచ్చగొట్టే ప్రచారం సాగించి, ప్రజలను తప్పుదోవ పట్టించి, తద్వారా హింసను ప్రేరేపించడానికి పాకిస్తాన్లో జనవరి 13 నుంచి 18వ తేదీ వరకు 300 ట్విట్టర్ ఖాతాలను సృష్టించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పరేడ్ ప్రశాంతంగా జరగడానికి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ట్రాక్టర్ పరేడ్ విషయంలో పుకార్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ట్రాక్టర్ పరేడ్లో రైతు శకటాలు ట్రాక్టర్ పరేడ్లో శకటాలను ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. గ్రామీణ జీవితం, సంప్రదాయ, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పశు పోషణ, మహిళా రైతుల భాగస్వామ్యం, భారత్లో రైతు ఉద్యమాల చరిత్ర, రైతన్నల ఆత్మహత్యలు, కొత్త సాగు చట్టాల వల్ల జరిగే నష్టాలు తదితర కీలక అంశాలను ప్రతిబింబించే శకటాలు పరేడ్లో ప్రధాన ఆకర్షణగా మారనున్నాయని వెల్లడించారు. అన్ని రాష్ట్రాల నుంచి ట్రాక్టర్లు తరలివస్తాయని, ఇందులో 30 శాతం శకటాలే ఉంటాయని పేర్కొన్నారు. ► మహారాష్ట్రలోని విదర్భలో రైతుల ఆత్మహత్యలు అధికం. ఈ అంశంపై శకటం రూపొందించేందుకు ఆ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల పిల్లలు సన్నద్ధమవుతున్నారు. ► ప్రతి ట్రాక్టర్, శకటంపై మూడు రంగుల జాతీయ జెండా ఉంటుంది. ► ట్రాక్టర్ పరేడ్లో రైతులను ఉత్తేజపర్చడానికి జానపద, దేశభక్తి గీతాలను వినిపిస్తారు. ► ట్రాక్టర్ ర్యాలీని సమన్వయం చేసుకోవడానికి ప్రతి నిరసన ప్రాంతం వద్ద ఒక వార్రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో వార్రూమ్లో 40 మంది సభ్యులను నియమిస్తున్నారు. వీరిలో డాక్టర్లు, సెక్యూరిటీ –సిబ్బంది, సోషల్ మీడియా మేనేజర్లు ఉంటారు. ► ట్రాక్టర్ పరేడ్ జరిగే మార్గంలో వేర్వేరు చోట్ల 40 అంబులెన్స్లను సిద్ధంగా ఉంచుతారు. ర్యాలీలో పాల్గొనేవారు అస్వస్థతకు గురైతే వెంటనే వైద్య సేవలు అందిస్తారు. ► మెకానిక్ల బృందాన్ని కూడా రంగంలోకి దించుతున్నారు. ర్యాలీలో ఎక్కడైనా వాహనం ఆగిపోతే వెంటనే మరమ్మతు చేస్తారు. ► వలంటీర్లకు బ్యాడ్జ్లు, గుర్తింపు కార్డులు అందజేస్తారు. ► భద్రతను పర్యవేక్షించడానికి మాజీ సైనికుల సేవలను వాడుకోనున్నారు. ► వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రైతులు ఢిల్లీ నగరంలోకి ప్రవేశించడానికి వీలుగా సింఘు, టిక్రీ బోర్డర్ పాయింట్ల వద్ద బారికేడ్లను తొలగించడానికి పోలీసులు అంగీకరించారు. రివర్స్గేర్లో పంజాబ్ నుంచి ఢిల్లీకి.. ఢిల్లీలో జనవరి 26న ర్యాలీలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో రైతులు ట్రాక్టర్లపై తరలివస్తున్నారు. వివా దాస్పద కొత్త వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పంజాబ్కు చెందిన ఓ రైతు ట్రాక్టర్ను రివర్స్ గేర్లో వెనక్కి నడుపుతూ ఢిల్లీకి బయలుదేరాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రివర్స్ గేర్లో వెళ్తున్న ట్రాక్టర్ నేడు ముంబైలో భారీ ర్యాలీ ముంబై: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించేందుకు రంగం సిద్ధమయ్యింది. రైతుల ర్యాలీ జరిగే ఆజాద్ మైదాన్లో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్, అధికార మహా వికాస్ అఘాడీ నేతలు ఈ ర్యాలీలో పాల్గొని, రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం రైతు సంఘాల నాయకులు రాజ్భవన్కు చేరుకొని గవర్నర్కు వినతిపత్రం సమర్పిస్తారు. సాగు చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని కోరుతారు. రైతుల పోరాటానికి ఎంవీఏ భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ర్యాలీలో పాల్గొనే అన్నదాతలకు ఆహారం సరఫరా చేసేందుకు కార్మిక సంఘాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చాయి. సం యుక్త షేట్కారీ కామ్గార్ మోర్చా ఆధ్వర్యంలో ఆజాద్ మైదాన్లో జనవరి 26వ తేదీ వరకు బైఠాయించాలని, గణతంత్ర దినో త్సవం సందర్భంగా అక్కడే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించారు. ముంబైలో ఆదివారం జరిగిన ర్యాలీ దృశ్యం -
నేతలను చంపేందుకు కుట్ర
న్యూఢిల్లీ/చండీగఢ్: తమ నేతలను చంపేందుకు, ట్రాక్టర్ పరేడ్ను భగ్నం చేసేందుకు కుట్ర పన్నాడని ఆరోపిస్తూ రైతులు పట్టుకున్న ఓ వ్యక్తిని హరియాణా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సింఘు సరిహద్దుల్లో ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులు సదరు వ్యక్తిని పట్టుకుని శుక్రవారం రాత్రి మీడియాకు చూపారు. రిపబ్లిక్ డే రోజు పోలీసు మాదిరిగా లాఠీ పట్టుకుని రైతు సంఘాలు చేపట్టే ట్రాక్టర్ పరేడ్లో లాఠీ చార్జి చేయాలంటూ తోటి వారు తనకు చెప్పారని ఆ యువకుడు మీడియాకు వెల్లడించాడు. ట్రాక్టర్ పరేడ్ సమయంలో పోలీసులపై కాల్పులు జరిపేందుకు కూడా పథకం వేసినట్లు అతడు చెప్పాడు. శనివారం ఆందోళనల్లో పాల్గొంటున్న నలుగురు రైతు సంఘాల నేతలను కాల్చి చంపాలని పథకం వేసినట్లు తెలిపాడు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న ఆందోళనలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రైతు నేత కుల్వంత్ సింగ్ సంధు ఆరోపించారు. కాగా, ట్రాక్టర్ పరేడ్కు భగ్నం కలిగించేందుకు కుట్ర జరుగుతోందంటూ వస్తున్న ఆరోపణలపై ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని హరియాణా పోలీసులు తెలిపారు. సోనిపట్ ఎస్పీ జషన్దీప్ సింగ్ రన్ధావా శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. సింఘు వద్ద రైతులు అప్పగించిన వ్యక్తిని సోనిపట్కు చెందిన యోగేశ్ రావత్(21)గా గుర్తించామన్నారు. తమను వేధిస్తున్నాడంటూ రైతు వలంటీర్లు తీవ్రంగా కొట్టడంతో వాటి నుంచి తప్పించుకునేందుకు అతడు అబద్ధాలు చెబుతున్నట్లు తేలిందన్నారు. యోగేశ్ వద్ద ఎలాంటి పేలుడు పదార్థాలు కానీ, మారణాయుధాలు కానీ లభ్యం కాలేదన్నారు. ట్రాక్టర్ పరేడ్కు గ్రీన్ సిగ్నల్ గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో ట్రాక్టర్ పరేడ్కు ఢిల్లీ పోలీసులు అనుమతించినట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. ఢిల్లీ సరిహద్దుల్లోని ఘాజీపూర్, సింఘు, తిక్రిల నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలు ఖరారు కావాల్సి ఉందని రైతు నేత అభిమన్యు కొహార్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత 5 మార్గాల ద్వారా రాజధానిలోకి ప్రవేశించే ట్రాక్టర్ పరేడ్లో సుమారు 2 లక్షల మంది పాల్గొంటారని మరో నేత గుర్నామ్ సింగ్ చదుని చెప్పారు. ఇందుకోసం 2,500 మంది వలంటీర్లను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లను ఈ నెల 26వ తేదీన పోలీసులు తొలగించనున్నారు. -
ట్రాక్టర్ల ర్యాలీ: పోలీసుల కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: రైతుల ట్రాక్టర్ల ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అనుమతినిచ్చారు. ఈ మేరకు దేశ రాజధాని మూడు సరిహద్దుల్లో బ్యారికేడ్లు తొలగించి, మంగళవారం నాటి ర్యాలీకి మార్గం సుగమం చేశారు. కాగా కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతలు సుదీర్ఘ కాలంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు ట్రాక్టర్ల పరేడ్ ద్వారా తమ నిరసన తెలియజేయాలని నిశ్చయించుకున్నారు. అయితే, ఇందుకు తొలుత ఇందుకు నిరాకరించిన పోలీసులు ట్రాక్టర్ల సంఖ్యపై పరిమితి విధించాలని భావించారు. (చదవండి: రైతుల ట్రాక్టర్ ర్యాలీ.. శాంతిభద్రతల అంశం) కానీ రైతులతో చర్చల అనంతరం తాజాగా అనుమతినిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు గుర్నం సింగ్ చౌదుని మాట్లాడుతూ.. ర్యాలీ సమయంలో కమిటీ నియమనిబంధనలు పాటిస్తూ, క్రమశిక్షణతో ముందుకు సాగాలని రైతు సోదరులకు విజ్ఞప్తి చేశారు. ఇక ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ శాంతిభద్రతకు సంబంధించిన అంశమని పేర్కొన్న సుప్రీంకోర్టు... ఢిల్లీలోకి ఎవరిని అనుమతించాలన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది ఢిల్లీ పోలీసులేనని ఇది వరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. (చదవండి : ‘వాయిదా’కు ఓకే అంటేనే చర్చలు) -
‘వాయిదా’కు ఓకే అంటేనే చర్చలు
సాక్షి, న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులతో జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో జరిగిన 11వ దఫా చర్చలు సుమారు నాలుగున్నర గంటల పాటు జరుగగా, అందులో ఇరుపక్షాలు కేవలం 30 నిమిషాలపాటే ముఖాముఖి భేటీ అయ్యాయి. 10వ దఫా చర్చల సందర్భంగా వ్యవసాయ చట్టాల అమలును 18 నెలల పాటు వాయిదా వేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని, చట్టాల రద్దుకు ప్రత్యామ్నాయం లేదని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేయడంతో చర్చలు మళ్లీ వాయిదా పడ్డాయి. అయితే ఈ సారి తదుపరి చర్చల విషయంలో తమ వైఖరిని ప్రభుత్వం రైతుల ముందు స్పష్టంచేసింది. తమ ప్రతిపాదనకు ఒప్పుకుంటేనే తదుపరి చర్చలు జరుగుతాయని రైతు సంఘాలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తేల్చిచెప్పారు. దీంతో ఈ నెల 26న నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని కచ్చితంగా నిర్వహించి తీరుతామని వ్యవసాయ సంఘాల నాయకులు చర్చల అనంతరం తెలిపారు. సాగు చట్టాలలో ఎటువంటి సమస్యలు లేనప్పటికీ, రైతుల నిరసనలపై గౌరవంతో వాటిని తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వం ముందుకొచ్చిందని తోమర్ తెలిపారు. చట్టాల అమలును నిలిపివేసే ప్రభుత్వ ప్రతిపాదనపై చర్చించాలనుకుంటేనే మరో సమావేశానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రైతు సంఘాలకు తోమర్ స్పష్టం చేశారు. సమావేశం తరువాత కిసాన్ మజ్దూర్ సంఘర్‡్ష కమిటీకి చెందిన ఎస్ఎస్ పంఢేర్ మీడియాతో మాట్లాడారు. చర్చలకు ఆహ్వానించి వ్యవసాయ మంత్రి తమను మూడున్నర గంటలపాటు వేచి ఉండేలా చేయడం అవమానకరమన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను అంగీకరించాలని మంత్రి కోరడంతో తాము నిరసనగా సమావేశం నుంచి బయటికి వచ్చామని వివరించారు. ఈ దఫా చర్చల్లోనూ సాగు చట్టాల రద్దుడిమాండ్ను రైతు సంఘాల నేతలు ముందుకు తేగా ప్రభుత్వం మాత్రం చట్టాల సవరణకు సిద్ధంగా ఉందని చెప్పిందని రైతు నాయకుడు శివ కుమార్ కక్క తెలిపారు. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను పరిశీలించాలని మంత్రి తమను కోరినప్పుడు, తమ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలించాలని తాము కోరామని, మంత్రి సమావేశం నుంచి వెళ్ళిపోయారని శివకుమార్ పేర్కొన్నారు. అంతకుముందు, రైతు నాయకుల అంతర్గత సమావేశాల్లో.. ప్రభుత్వానికి మరో కొత్త ప్రతిపాదన ఇవ్వాలన్న చర్చ సైతం జరిగింది. చట్టాల అమలును ఏడాదిన్నర కాకుండా, మూడేళ్ల పాటు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కొందరు నేతలు సూచించారు. అంతేగాక వ్యవసాయ రుణ పరిమితిని ఎకరానికి రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని, పాత వడ్డీ రేటును కొనసాగించాలని ప్రతిపాదించారు. 26న ట్రాక్టర్ ర్యాలీ జరుగుతుంది: రాకేశ్ టికైత్ ప్రభుత్వంతో 11వ దఫా చర్చలు అసంపూర్తిగా ముగిసిన తర్వాత భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికైత్ మీడియాతో మాట్లాడారు. ముందుగా నిర్ణయించినట్లుగా, జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అయితే ట్రాక్టర్ పరేడ్కు సంబంధించిన అనుమతి కోసం పోలీసులు, రైతులు మధ్య గురువారం జరిగిన మూడో రౌండ్ సమావేశం అసంపూర్తిగా ముగిసిన విషయం తెలిసిందే. రైతుల పరేడ్కు అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. కుండ్లి–మనేసర్–పాల్వాల్ ఎక్స్ప్రెస్ వే పై పరేడ్ జరపాలని పోలీసులు సూచించారు. అందుకు రైతులు అంగీకరించలేదు. -
కేంద్రం ప్రతిపాదనకు రైతు సంఘాలు నో
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాల అమలును 18నెలల పాటు నిలిపివేయడంతో పాటు చర్చల కోసం ఇరుపక్షాల నుంచి జాయింట్ కమిటీ ఏర్పాటు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. ఆ ప్రతిపాదనలు తమకు ఆమోదయోగ్యం కాదని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. గురువారం ఎస్కేఎం సర్వసభ్య సమావేశం జరిగిందని, ఇందులో కేంద్రం బుధవారం ప్రకటించిన ప్రతిపాదనను తిరస్కరించడం జరిగిందని ఎస్కేంఎం ప్రకటించింది. చట్టాలు సంపూర్ణంగా ఉపసంహరించేవరకు వెనక్కు తగ్గమని తేల్చిచెప్పింది. అయితే 41 యూనియన్లలో ఒకటైన భారతీయ కిసాన్ యూనియన్(సింధ్పూర్) నేత జగ్జిత్ సింగ్ దలేవాల్ మాత్రం భిన్నంగా స్పందించారు. కేంద్రం ప్రతిపాదనలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. కొందరు నేతలు ఇంకా చర్చిస్తూనే ఉన్నారన్నారు. కానీ మిగిలిన నేతల్లో ఎక్కువమంది ప్రతిపాదనలను తిరస్కరించామనే చెప్పారు. కాగా, 26న జరపతలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని ఢిల్లీ వెలుపల నిర్వహించుకోవాలని పోలీసులు సూచించగా సాధ్యం కాదని తాము తిరస్కరించినట్లు స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్ తెలిపారు. రైతు సంఘాలతో సంప్రదింపులు షురూ సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ రైతు సంఘాలతో సంప్రదింపుల ప్రక్రియను మొదలుపెట్టింది. ప్యానెల్లో సభ్యులుగా ఉన్న మహారాష్ట్ర షేట్కారీ సంఘటన్ అధ్యక్షుడు అనిల్ ఘన్వత్, వ్యవసాయ ఆర్థికవేత్తలు అశోక్ గులాటి, ప్రమోద్ కుమార్ జోషి గురువారం 8 రాష్ట్రాలకు చెందిన 10 రైతు సంఘాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంప్రదింపుల ప్రక్రియలో తెలంగాణ, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్కు చెందిన పది రైతు సంఘాలు పాల్గొన్నాయని కమిటీ పేర్కొంది. పాల్గొన్న రైతు సంఘాల నాయకులు చట్టాల అమలు మెరుగుçకు సూచనలు కూడా ఇచ్చాయని తెలిపారు. -
రైతుల ట్రాక్టర్ ర్యాలీ.. శాంతిభద్రతల అంశం
న్యూఢిల్లీ: మూడు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ 26న ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ శాంతిభద్రతకు సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఢిల్లీలోకి ఎవరిని అనుమతించా లన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది ఢిల్లీ పోలీసులేనంది. 26న ట్రాక్టర్ ర్యాలీ లేదా ఇతర నిరసన ప్రదర్శనలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన విజ్ఞాపనపై సుప్రీంకోర్టు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి ఇచ్చే లేదా నిరాకరించే విషయంలో పోలీసులకు పూర్తి అధికారం ఉందని పేర్కొంది. ‘‘పోలీసుల అధికారాలను సుప్రీంకోర్టు గుర్తుచేయాలా? వాటిని ఎలా ఉపయోగించాలో న్యాయస్థానం చెప్పాలా? ఏం చేయాలో మేము మీకు చెప్పబోవడం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేంద్ర సర్కారు విజ్ఞాపనపై తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి(బుధవారం) వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ రైతులకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. శాంతియుతంగా ఈ ర్యాలీ నిర్వహిస్తామని, వేలాది మంది రైతన్నలు పాలుపంచుకుంటారని తెలిపారు. రైతులు రాజ్పథ్లో ర్యాలీ చేయబోరని చెప్పారు. పదో దఫా చర్చలు రేపటికి వాయిదా సాగు చట్టాలపై రైతు సంఘాల నేతలు, కేంద్ర ప్రభుత్వం మధ్య మంగళవారం జరగాల్సిన పదో దఫా చర్చలు బుధవారానికి వాయిదా పడ్డాయి. ఈ చర్చలు 19వ తేదీకి బదులుగా 20వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతాయని కేంద్ర వ్యవసాయ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. రైతుల తరపున 41న రైతు సంఘాల నాయకులు ఈ చర్చలకు హాజరు కానున్నారు. ఇతర సిద్ధాంతాలున్న వ్యక్తుల వల్లే జాప్యం చట్టాలపై ప్రతిష్టంభన తొలగిపోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పరిషోత్తం రూపాల చెప్పారు. అయితే, ఇతర సిద్ధాంతాలున్న కొందరు వ్యక్తుల వల్లే జాప్యం జరుగుతోందని విమర్శించారు. రైతు సంఘాల నాయకులు కాకుండా రైతులే నేరుగా తమతో చర్చిస్తే సమస్య ఎప్పుడో పరిష్కారమయ్యేది స్పష్టం చేశారు. -
పంతం వీడండి
న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలపై రైతులు మొండిపట్టు వీడి, ప్రభుత్వంతో అంశాల వారీగా చర్చలకు రావాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కోరారు. కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించినందున, రైతులు పంతానికి పోవడంలో అర్థం లేదన్నారు. 19వ తేదీన రైతు సంఘాలతో పదో విడత చర్చలు జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మధ్యప్రదేశ్లోని మోరెనాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సమస్యను పరిష్కరించేం దుకు ప్రభుత్వం ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తోంది. ఎటువంటి దాపరికాలు లేకుండా మనస్ఫూర్తిగా చర్చలకు ఆహ్వానిస్తోంది. ప్రభుత్వం కొన్ని రాయితీలను ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది. రైతులు మాత్రం చట్టాల రద్దుపైనే పట్టుదలకు పోతున్నారు’అని చెప్పారు. ‘దేశం మొత్తానికి వర్తించే విధంగా ప్రభుత్వం చట్టాలు తీసుకువచ్చింది. వీటికి రైతులు, నిపుణులు, సంబంధిత వర్గాల మద్దతు ఉంది’అని తెలిపారు. ‘మండీలు, వ్యాపారుల రిజిస్ట్రేషన్ తదితర సమస్యలను పరిష్కరించేందుకు అంగీకరిస్తూ రైతు సంఘాలకు ప్రతిపాదనలు పంపాం. పంట వ్యర్థాల దహనం, విద్యుత్ వంటి వాటిపైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపాం. రైతు సంఘాలు మాత్రం సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతున్నాయి. అంశాల వారీగా చర్చల్లో సంఘాల అభ్యంతరాలు సరైనవే అని తేలితే, ప్రభుత్వం పరిశీలించడానికి సిద్ధంగా ఉంది’అని చెప్పారు. కాగా, కొత్త సాగు చట్టాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ఈ నెల 19వ తేదీన మొట్టమొదటి సమావేశం జరపనుంది. పూసా క్యాంపస్లో ఈ సమావేశం ఉంటుందని కమిటీ సభ్యుడు అనిల్ ఘన్వత్ తెలిపారు. భవిష్యత్ కార్యాచరణను ఈ భేటీలో నిర్ణయిస్తామన్నారు. కమిటీలోని నలుగురు సభ్యుల్లో ఒకరు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సాగు చట్టాలపై దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు జరపనున్న విచారణ సందర్భంగా కమిటీ సభ్యుడు వైదొలగిన విషయం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి. దీంతోపాటు, 26న ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీకి అనుమతివ్వరాదంటూ ఢిల్లీ పోలీసుల ద్వారా కేంద్రం వేసిన పిటిషన్ కూడా విచారణకు రానుంది. ట్రాక్టర్ పరేడ్ కొనసాగుతుంది 26న గణతంత్ర దినోత్సవం రోజున ముందుగా ప్రకటించిన విధంగానే ట్రాక్టర్ పరేడ్ కొనసాగుతుందని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. సింఘు వద్ద ఆదివారం రైతు సంఘం నేత యోగేంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడారు. ‘మా ర్యాలీ ప్రశాంతంగా సాగుతుంది. రిపబ్లిక్ డే పరేడ్కు ఎటువంటి ఆటంకం కలిగించం. రైతులు తమ ట్రాక్టర్లపై జాతీయ జెండాలను ప్రదర్శిస్తారు’అని వివరిం చారు. రైతుల ఆందోళనల్లో పాల్గొంటున్న /మద్దతు పలికిన నిషేధిత సిక్కు సంస్థకు చెందిన రైతు నేతకు ఎన్ఐఏ నోటీసులు జారీ చేయడాన్ని మరో నేత దర్శన్ పాల్ సింగ్ తీవ్రంగా ఖండించారు. 2024 మే వరకు పోరుకు సిద్ధం నాగపూర్: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 2024 మే వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ అన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతు ఆందోళనలను సైద్ధాంతిక విప్లవంగా ఆయన అభివర్ణించారు. పంటలకు కనీస మద్దతు ధరను చట్టపరమైన హామీగా రైతులు భావిస్తున్నారన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుని ప్రభుత్వం ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలన్నారు. అప్పటి వరకు వెనక్కి తగ్గబోమని గ్రామీణ ప్రాంతాల నుంచి వేర్వేరు సంఘాల నుంచి వచ్చిన రైతులు కోరుకుంటున్నారని చెప్పారు. లోక్సభ ఎన్నికలు 2024 ఏప్రిల్/మే నెలలో జరగనున్నాయి. -
1900 ట్రాక్టర్లతో ప్రగతి నివేదన సభకు ర్యాలీ
-
ఖమ్మం నుంచి 1,890 ట్రాక్టర్లలో...
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రగతి నివేదన సభలో పాల్గొనేందుకు ఖమ్మం జిల్లా రైతాంగం, టీఆర్ఎస్ శ్రేణులు సభకు 2 రోజుల ముందే వినూత్న రీతిలో బయలుదేరారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 1,890 ట్రాక్టర్లతో ప్రదర్శనగా శుక్రవారం మధ్యాహ్నం ఖమ్మం నుంచి హైదరాబాద్కు ప్రయాణమయ్యారు. శ్రీనివాసరెడ్డి రైతులతో కలసి ట్రాక్టర్ను నడుపుతూ ప్రదర్శనగా రాజధానికి బయలుదేరారు. దాదాపు 30 కిలోమీటర్లకు పైగా పొడవు గల ఈ ప్రయాణాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ ట్రాక్టర్ల ప్రదర్శనకు ముందు గుమ్మడికాయ కొట్టారు. ట్రాక్టర్ల ప్రదర్శనతో ఖమ్మంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. పోలీసులు జోక్యం చేసుకొని వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. నాలుగున్నరేళ్ల పాటు రైతు సేవలో నిమగ్నమై ఉన్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పేందుకు జిల్లా రైతాంగం పెద్దెత్తున ప్రగతి నివేదన సభకు బయలుదేరడం అభినందనీయమని మంత్రి అన్నారు. రైతుల కోసం అహర్నిశలు శ్రమించే కేసీఆర్కు జిల్లా రైతాంగం తెలుపుతున్న కృతజ్ఞతే ట్రాక్టర్ల ప్రదర్శన ద్వారా ప్రగతి నివేదన సభకు వెళ్లడమని శ్రీనివాసరెడ్డి అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ల ర్యాలీతో కదం తొక్కిన వైఎస్సార్సీపీ
-
రాజోలిబండ ఆనకట్ట కోసం పోరుబాట
-
కర్షక సమరం
కర్నూలు, న్యూస్లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునకు రైతులు కదంతొక్కారు. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహించి మద్దతు పలికారు. విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ నినాదాలతో హోరెత్తించారు. పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, పాణ్యం నియోజకవర్గ సమన్వయకర్త గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో కల్లూరులోని చెన్నమ్మ సర్కిల్ వద్ద జాతీయ రహదారిని రైతులు ట్రాక్టర్లతో గంట పాటు దిగ్బంధించారు. అనంతరం కృష్ణానగర్, బిర్లాగేట్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. నంద్యాలలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. మంత్రాలయంలో కర్నూలు-రాయచూరు రోడ్డుపై రాకపోకలను స్తంభింపజేశారు. అంతకుముందు పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రదీప్రెడ్డి, మండల కన్వీనర్ భీమిరెడ్డి, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు. నందికొట్కూరులో బండి జయరాజు, ఐజయ్యల ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ కొనసాగింది. ఆదోనిలో బీసీ సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ మధుసూదన్, స్థానిక నాయకులు ప్రసాదరావు, గురునాథరెడ్డి, చంద్రకాంతరెడ్డి, వెంకటేశ్వరరెడ్డిల నాయకత్వంలో చేపట్టిన ర్యాలీలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆళ్లగడ్డలో గంగాధరరెడ్డి ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టారు. ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త గుమ్మనూరు జయరాం, వైఎస్సార్సీపీ జిల్లా కమిటీ సభ్యుడు తెర్నేకల్ సురేందర్రెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజశేఖర్ ఆధ్వర్యంలో తెర్నేకల్లులో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. డోన్ నియోజకవర్గ సమన్వయకర్త బుగ్గన రాజారెడ్డి, స్థానిక నాయకులు ధర్మారం సుబ్బారెడ్డి, శ్రీరాములు ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. బనగానపల్లెలో నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రబోతుల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అవుకు మిట్ట నుంచి పాతబస్టాండ్ మీదుగా పెట్రోల్ బంకు కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. -
పులివెందులలో భారీ ట్రాక్టర్ ర్యాలీ
-
నేడు రైతులతో ట్రాక్టర్ల ర్యాలీ
పాణ్యం రూరల్, న్యూస్లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుతో బుధవారం రైతులతో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం మండల కేంద్రమైన పాణ్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మొదటి నుంచి పోరాడుతున్నది తమ పార్టీ మాత్రమేనన్నారు. తెలంగాణ ప్రకటనపై సీమాంధ్రలోని కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకపోవడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ప్యాకేజీలకు అమ్ముడుపోయిన ఎంపీలు, ఎమ్మెల్యేలు రానున్న ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తారని ప్రశ్నించారు. విభజన దిశగా కేంద్రం దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ముమ్మరం చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే బుధవారం నియోజకవర్గాల వారీగా పార్టీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో రైతులతో ట్రాక్టర్ల ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. పార్టీ శ్రేణులతో పాటు రైతులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
సమైక్య హోరు
సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో 62వ రోజు సోమవారం జోరుగా సాగింది. పామర్రు మండల సమైక్యాంధ్ర రైతు జేఏసీ ఆధ్వర్యంలో 150 ట్రాక్టర్లతో పామర్రు నుంచి బెజవాడ బెంజిసర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మొవ్వలో జనగళ గర్జన, వీరంకిలాకులో రైతుగర్జన సభలు జరిగాయి. ఏపీ గవ ర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నేతలు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ముట్టడించారు. సాక్షి, మచిలీపట్నం : సమైక్యాంధ్ర రైతు జేఏసీ ఆధ్వర్యాన రైతులు, ట్రాక్టర్ యజమానులు పామర్రు నాలుగు రోడ్ల కూడలి నుంచి 150 ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఉయ్యూరు, కంకిపాడుల మీదుగా ఈ ప్రదర్శన బెజవాడ బెంజిసర్కిల్కు చేరుకుంది. మండల కేంద్రం మొవ్వలో జరిగిన జనగళగర్జన కార్యక్రమంలో పలువురు నేతలు తమ ఉపన్యాసాల ద్వారా జనంలో ఉత్సాహం నింపారు. తూర్పు కృష్ణా ఎన్జీవోల సంఘం నాయకుడు ఉల్లి కృష్ణ అధ్యక్షత వహించారు. కైకలూరు 16వ వార్డులో మహిళలు భారీగా ర్యాలీ చేసి రోడ్డుపై ఆటలు ఆడారు. మండవల్లి జేఏసీ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు దీక్షలు చేశారు. కేసీఆర్ మాస్క్కు ఫినాయిల్తో పళ్ళు తోమి నిరసన తెలిపారు. కలిదిండిలో క్రైస్తవ సోదరులు రిలే దీక్షలు చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై పొయ్యిలు పెట్టి దోసెలు పోశారు. చల్లపల్లిలో సన్ఫ్లవర్ విద్యాసంస్థల అధ్యాపకులు, సిబ్బంది దీక్ష చేశారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు భిక్షాటన చేశారు. అవనిగడ్డలో సుగాలీ సామాజికవర్గానికి చెందిన పురుషులు, మహిళలు దీక్షలో పాల్గొన్నారు. ఘంటసాల జేఏసీ నాయకులు రహదారులు ఊడ్చి నిరసన తెలియజేశారు. నాగాయలంకలో తలగడదీవికి చెందిన మహిళలు దీక్ష చేశారు. జగ్గయ్యపేటలో జేఏసీ నాయకులు ఆటోలను శుభ్రం చేసి, కొబ్బరి బొండాలను కొట్టి నిరసన తెలిపారు. కేసీఆర్ వ్యాఖ్యలను నిరసనగా మున్సిపల్ సెంటర్లో సమైక్యవాదులు ఆందోళన చేశారు. పెనుగంచిప్రోలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను దంపతులు నిరాహారదీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఇబ్రహీంపట్నంలో ఎన్టీటీపీఎస్ వద్ద సోమవారం కార్మికులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. కంకిపాడులో దీక్షల సందర్భంగా కేసీఆర్ చిత్రపటాన్ని ముఖానికి తగిలించుకున్న వేషధారికి మహిళలు చీపుర్లు, వేపమండలతో బడితపూజ చేసి వినూత్న నిరసన చేపట్టారు. అనంతరం భారీ జాతీయ పతాకంతో జాతీయ రహదారిపై ప్రదర్శన చేపట్టి, మానవహారం నిర్వహించారు. నూజివీడు. చిన్నగాంధీబొమ్మ సెంటర్లో రిలేదీక్ష శిబిరంలో సోమవారం పాత్రికేయులు రిలేదీక్షలో పాల్గొన్నారు. బెజవాడలో.. పామర్రు నుంచి వచ్చిన ట్రాక్టర్లను బెంజిసర్కిల్ చుట్టూ ఉంచి ధర్నా చేశారు. ఎన్జీవో అసోసియేషన్ జిల్లా కన్వీనర్ విద్యాసాగర్ సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీ గవ ర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీని ముట్టడించారు. భారీ ర్యాలీ నిర్వహించి బెంజిసర్కిల్వద్ద మానవహారం నిర్మించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు, 13 జిల్లాల నుంచి వైద్యులు పాల్గొన్నారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెంజిసర్కిల్ నుంచి ఆటోనగర్ పంటకాల్వ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. నగరపాలక సంస్థ ఉపాధ్యాయ జేఏసీ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద టీచర్లు రిలే నిరాహార దీక్షలు జరిపారు. వన్టౌన్లో ఎయిడెడ్ ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. తెలంగాణకు చెందిన ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. పాలిటెక్నిక్ కళాశాల ప్రధాన ద్వారం వద్ద అధ్యాపకులు, సిబ్బంది దోసెలు వేసి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. సమైక్యాంధ్ర కోరుతూ ఉపాధ్యాయ జెఏసీ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద టీచర్లు రిలే నిరాహార దీక్షలు జరిపారు. -
రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్సార్సీపీ ట్రాక్టర్ ర్యాలీ : అంబటి రాంబాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగే వరకూ ఉధృతంగా పోరాటం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపు నిచ్చింది. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ అధ్యక్షతన జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి విసృ్తత సమావేశంలో తాజా పరిస్థితులను సమీక్షించారు. వచ్చే అక్టోబర్ 1 నుంచి ఆందోళనను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఉద్యమ కార్యాచరణను రూపొందించారు. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆ వివరాలను ఆ తర్వాత విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ పిలుపు నిచ్చిందని తెలిపారు. 13 జిల్లాల్లో ఎంత ఉద్యమం జరుగుతున్నా విభజనపై ముందుకు వెళుతున్నామని, తెలంగాణ ఏర్పాటుపై నోట్ తయారవుతోందని పదే పదే చెప్తున్న కాంగ్రెస్ పార్టీ మెడలు వంచైనా సరే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరతామన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనుకున్న ప్రతి ఒక్కరూ తమ ఆందోళనలో భాగస్వాములై ఉద్యమ ఉధృతికి తోడ్పడాలని అంబటి విజ్జప్తి చేశారు. పార్టీ నిర్ణయించిన ఉద్యమ కార్యాచరణ వివరాలు.. అక్టోబర్ 01: గుంటూరు నుంచి విజయవాడ వరకూ రైతులతో ట్రాక్టర్ల ర్యాలీ అక్టోబర్ 02: శాసనసభ నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇతర నేతలు నిరవధిక నిరాహారదీక్షల ప్రారంభం, ఆ తరువాత రిలే నిరాహారదీక్షలు అక్టోబర్ 07: మంత్రులు, కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామాలు చేయాలని కోరుతూ వారి నివాసాల ఎదుట శాంతియుత ధర్నా లు, ఆయా ప్రజాప్రతినిధులకు పార్టీ శ్రేణులు పూలు అందజేసి నిరసన అక్టోబర్ 10: అన్ని మండల కేంద్రాల్లో రైతుల ఆధ్వర్యంలో దీక్షలు అక్టోబర్ 17: శాసనసభా నియోజకవర్గ కేంద్రాల్లో ఆటోలు, రిక్షాలతో ర్యాలీ అక్టోబర్ 21: నియోజకవర్గ కేంద్రాల్లో మహిళలతో నిరసన కార్యక్రమాలు, మానవహారాలు అక్టోబర్ 24: అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువజనులతో బైక్ ర్యాలీలు అక్టోబర్ 26: జిల్లాల్లోని సర్పంచ్లు, సర్పంచ్కు పోటీ చేసిన అభ్యర్థులు జిల్లా కేంద్రాల్లో ఒక రోజు దీక్ష అక్టోబర్ 29: అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువకులతో శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు నవంబర్ 01: అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ, సమైక్యాంధ్రను కోరుతూ తీర్మానాలు