Uniform Civil Code
-
అందుకు వెనుకాడుతున్న సహజీవన జంటలు..!
డెహ్రాడూన్:ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్కోడ్(యూసీసీ) జనవరి 27న అమలులోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా అన్ని మతాల్లోని వ్యక్తులకు వివాహం,ఆస్తిహక్కులు తదితర అంశాల్లో ఒకే రకమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఏ మతంలోనూ బహుభార్యత్వాన్ని యూసీసీ అనుమతించదు. వీటికితోడు యూసీసీ కింద సహజీవనాలను సైతం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండే జంటలు దరఖాస్తు చేసుకుని తమ సహజీవనాన్ని నమోదు చేసుకోవాలి. అయితే సహజీవనాల నమోదుకు ఇప్పటివరకు 5 దరఖాస్తులు రాగా కేవలం ఒక సహజీవనం మాత్రమే రిజిస్టర్ అయింది. అయితే సహజీవనాల నమోదుకు పెద్దగా స్పందన లేదన్న వాదన కొంత మంది వినిపిస్తున్నారు. దీనిని మరికొంత మంది వ్యతిరేకిస్తున్నారు. చట్టంపై ప్రజల్లో అవగాహన రావడానికి సమయం పడుతుందంటున్నారు. సహజీవనాల నమోదుకు చాలా మంది ఇష్టపడడం లేదన్న వాదనా ఉంది. అయితే సహజీవనం నమోదు చేసుకోకపోతే యూసీసీ కింద జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది.సహజీవనాల నమోదును చాలా మంది వ్యతిరేకించినప్పటికీ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. శ్రద్దావాకర్ తరహా ఘటనలు పునరావృతం కావద్దంటే సహజీవనాల నమోదు తప్పనిసరన్న నిబంధనను తీసుకువచ్చింది. -
ప్రయోగాత్మక పౌరస్మృతి
దేశంలో తొలిసారిగా ఒక రాష్ట్రం ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలుకు శ్రీకారం చుట్టింది. గత ఏడాది ఫిబ్రవరిలో చట్టసభ ఆమోదించిన యూసీసీని ఉత్తరాఖండ్ ఆచరణలోకి తెచ్చింది. ఆ రాష్ట్ర సీఎం సోమవారం డెహ్రాడూన్లో యూసీసీ నియమావళి ప్రకటించి, పోర్టల్ను ప్రారంభించడంతో కొత్త కథ మొదలైంది. వివాదాస్పద యూసీసీ అమలు ‘దేవభూమి’ నుంచి ఆరంభమైందన్న మాటే కానీ, వివాదాల పెనుభూతం మాత్రం ఇప్పుడప్పుడే వదిలిపెట్టడం కష్టం. ఇదంతా చూపులకు... మతాలకు అతీతంగా అందరికీ ఒకే విధమైన వ్యక్తిగత చట్టాలుండేలా ప్రమాణీకరించే ఉద్దేశంతో చేపట్టిన ప్రయత్నంగా, సమానత్వం – సమన్యాయ సిద్ధాంతాలకు అనుగుణంగా గొప్పగా అనిపించవచ్చు. ఆధునిక విలువలకూ, లైంగిక సమానత్వ – న్యాయాలకూ జై కొట్టినట్టు కనిపించవచ్చు. కానీ, లోతుల్లోకి వెళితే – ఆచరణలో ఇది కీలకాంశాలను అందిపుచ్చుకోలేదు. అనేక లోటుపాట్లూ వెక్కిరిస్తాయి. ముఖ్యంగా... చట్టసభలో సమగ్ర చర్చ లేకుండానే, ఏకాభిప్రాయం సాధించకుండానే హడావిడిగా యూసీసీ తేవడం బీజేపీ పాలకుల తెర వెనుక ఉద్దేశాలకు ప్రతీకగా కనిపిస్తుంది. ఉత్తరాఖండ్లో ఇకపై పెళ్ళిళ్ళు, విడిపోవడాలు, భరణాలు లాంటివన్నిటికీ అన్ని మతాలకూ ఒకే చట్టం వర్తించనుంది. ఆ రాష్ట్రంలో పెళ్ళిళ్ళ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. చేయకపోతే, జరిమానాతో పాటు, వివాహాల రిజిస్ట్రేషన్ కానివారు ప్రభుత్వ ప్రయోజనాలకు పూర్తిగా అనర్హులు. అలాగే, విడాకుల కేసుల్లో భార్యాభర్తలకు ఒకే నియమావళి వర్తిస్తుంది. బహుభార్యాత్వంపై నిషేధమూ విధించారు. అదే సమయంలో, భిన్న సంస్కృతి, సంప్రదాయాలను అంటిపెట్టుకొని ఉండే షెడ్యూల్డ్ ట్రైబ్లను మాత్రం నిషేధం నుంచి మినహాయించారు. ప్రభుత్వ కొత్త ప్రతిపాదనలో కొన్ని అంశాలు నైతిక నిఘా అనిపిస్తున్నాయి. పెళ్ళి చేసుకున్నవారే కాదు, సహజీవనం చేస్తున్నవారూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనడం, అలా చేయకపోతే జైలుశిక్ష, జరిమానా అనడం బలవంతంగా అందరినీ దారికి తెచ్చుకోవడమే తప్ప, న్యాయపరిరక్షణ అనుకోలేం. అసలు విభిన్న మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలకు నెలవైన మన దేశంలో పెళ్ళి, విడాకులు, దత్తత, వారసత్వం, పిత్రార్జితం లాంటి అంశాల్లో అందరినీ ఒకే తాటిపైకి తీసుకు రావాలని సమష్టి వ్యక్తిగత చట్టాలు చేయడం సరైనదేనా అన్నది మౌలికమైన ప్రశ్న. ఎవరి మత ధర్మం వారికి ఉండగా, అందరినీ ఒకే గాటన కట్టి, మూకుమ్మడి పౌరస్మృతిని బలవంతాన రుద్దడ మేమిటని జమైత్ ఉలేమా ఇ–హింద్ లాంటివి అభ్యంతరం చెబుతున్నాయి. షరియాకూ, మతానికీ విరుద్ధమైన చట్టాన్ని ముస్లిమ్లు ఆమోదించలేరని కుండబద్దలు కొడుతున్నాయి. ఇలా ఉత్తరాఖండ్ యూసీసీపై ఒకపక్క దేశవ్యాప్తంగా వాడివేడి చర్చలు జరుగుతుండగానే, మరోపక్క గౌరవ ఉపరాష్ట్రపతి హోదాలోని వారు మాత్రం ‘ఇలాంటి చట్టం దేశమంతటా త్వరలోనే రావడం ఖాయమ’ని ఢంకా బజాయించడం విడ్డూరం. నిజానికి, ఉత్తరాఖండ్ యూసీసీలో లోటుపాట్లకు కొదవ లేదు. అందరూ సమానమే అంటున్నా, స్వలింగ వివాహాల ప్రస్తావన లేదేమని కొందరి విమర్శ. అలాగే, దత్తత చట్టాలపైనా యూసీసీ నోరు మెదపలేదని మరో నింద. అందరూ సమానం అంటూనే కొందర్ని కొన్ని నిబంధనల నుంచి మినహాయించడమేమిటని ప్రశ్న. ఎస్టీలకు సహేతుకంగా వర్తించే అదే మినహాయింపులు ఇతర వర్గాలకూ వర్తించాలిగా అన్న దానికి జవాబు లేదు. 44వ రాజ్యాంగం అధికరణం యూసీసీని ప్రస్తావించిందన్నది నిజమే. దీర్ఘకాలంగా యూసీసీపై అందరూ మాట్లాడుతున్నదీ నిజమే. కానీ, అది ఏ రకంగా ఉండాలి, లేదా ఉండకూడదన్న దానిపై ఇప్పటికీ ఎవరికీ స్పష్టత లేదు. పైగా, గందరగోళమే ఉందన్నదీ అంతే నిజం. ఆది నుంచి ఉమ్మడి పౌరస్మృతిని తారకనామంగా జపిస్తున్న కమలనాథులు ఇప్పుడు ఉత్తరాఖండ్లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారనుకోవాలి. యూసీసీ వల్ల జరిగే మంచి మాట దేవుడెరుగు, అసలిది చేయగలిగిన పనే అని ప్రపంచానికి చాటాలనుకున్నారు. అయితే, ఈ ఉత్తరాఖండ్ యూసీసీ రాజ్యాంగబద్ధత పైనా సందేహాలున్నాయి. ఒక రాష్ట్ర చట్టసభలో చేసిన చట్టాలు ఆ రాష్ట్ర పరిధికే వర్తిస్తాయని 245వ రాజ్యాంగ అధికరణ ఉవాచ. కానీ, రాష్ట్రం వెలుపల ఉన్న ఉత్తరాఖండీయులకూ యూసీసీ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇది హాస్యాస్పదం. అలాగే, సహజీవనాల రిజిస్ట్రేషన్ తప్పదంటున్నారే తప్ప, అలా చేసుకుంటే చట్టపరంగా ఆ భాగస్వాముల పరస్పర హక్కులకు రక్షణ లాంటివేమీ కల్పించ లేదు. వారి ప్రైవేట్ బతుకులు వ్యవస్థలో నమోదై నడిబజారులో నిలవడమే తప్ప, నిజమైన ప్రయో జనమూ లేదు. పైగా 21వ అధికరణమిచ్చిన గోప్యత హక్కుకు విఘాతమే! నిజానికి, గోప్యత హక్కులో సమాచార గోప్యత, స్వతంత్ర నిర్ణయాధికారం కూడా ఉన్నాయని జస్టిస్ పుట్టస్వామి కేసులో తొమ్మండుగురు న్యాయమూర్తుల సుప్రీమ్ కోర్ట్ ధర్మాసనం ఏనాడో తేల్చి చెప్పింది. ఇప్పుడీ యూసీసీ నిబంధన అచ్చంగా దానికి విరుద్ధమే. అలాగే, కులాంతర, మతాంతర వివాహాలపై విచ్చుకత్తులతో విరుచుకుపడి, ప్రాణాలు తీసే స్వభావం నేటికీ మారని సమాజంలో ఈ తరహా నిబంధనలు ఏ వెలుగులకు దారి తీస్తాయి? వెరసి, ఉత్తరాఖండ్ సర్కారు వారి యూసీసీ పైకి పెను సంస్కరణగా కనిపించినా, ఆఖరికి వేర్వేరు చట్టాల్లోని అంశాల్ని అనాలోచితంగా కాపీ చేసి అతికించిన అతుకుల బొంతగా మిగిలింది. ఇది ఏకరూపత పేరిట ప్రభుత్వం బల ప్రయోగం చేయడమే అవుతుంది. ఉత్తరాఖండ్ బాటలోనే ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలూ పయనించి, ఆఖరికి యూసీసీని దేశవ్యాప్తం చేస్తారన్న మాట వినిపిస్తున్నందున ఇకనైనా అర్థవంతమైన చర్చ అవసరం. -
ఉత్తరాఖండ్లో అమల్లోకి ఉమ్మడి పౌరస్మృతి
డెహ్రాడూన్: మతాలకతీతంగా మహిళలకు నిజమైన సాధికారతే లక్ష్యంగా, పౌరులందరికీ సమాన హక్కులు, బాధ్యతలు దఖలుపరిచే లక్ష్యంతో తీసుకొచ్చిన ఉమ్మడి పౌరస్మృతి చట్టం(యూసీసీ) ఉత్తరాఖండ్లో సోమవారం అమల్లోకి వచ్చింది. దీంతో దేశంలో యూసీసీని అమలుచేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రికార్టులకెక్కింది. అన్ని మతాల్లో లింగభేదం లేకుండా పౌరులందరికీ ఉమ్మడి చట్టం అమలుచేయడమే యూసీసీ ముఖ్యోద్దేశం. చట్టం అమలుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మతాల వారికి ఒకే తరహా వివాహ, విడాకుల, ఆస్తుల చట్టాలు అమలవుతాయి. ఇస్లామ్ను ఆచరించే వారికి ఇకపై విడిగా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ లాంటివి చెల్లుబాటుకావు. ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ అంటూ ఏకపక్షంగా ఇచ్చే విడాకులు చెల్లవు. షెడ్యూల్ తెగలను మాత్రం యూసీసీ నుంచి మినహాయించారు. వాళ్ల గిరిజన సంప్రదాయాలు, కట్టుబాట్లను ప్రభుత్వం గుర్తించి విలువ ఇస్తుంది. సోమవారం యూసీసీ రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందని డెహ్రాడూన్లోని అధికార నివాసంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు. కేబినెట్ మంత్రులు, నాటి యూసీసీ ముసాయిదా కమిటీ సభ్యుల సమక్షంలో ఆయన యూసీసీ పోర్టల్ను ప్రారంభించారు. వివాహాలు చేసుకున్నా, విడాకులు తీసుకున్నా, సహజీవనం చేసినా ప్రతీదీ ఈ పోర్టల్ ద్వారా ఖచ్చితంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కోసం నమోదుచేసుకోవాల్సిందే. పెళ్లికాకుండా సహజీవనం కారణంగా పుట్టిన పిల్లలకూ వారసత్వ హక్కులు దక్కేలా యూసీసీ చట్టంలో మార్పులుచేసి అమల్లోకి తెచ్చారు. పోర్టల్ ద్వారా ముఖ్యమంత్రి ధామీ తన వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నారు. పోర్టల్ ద్వారా జారీ అయిన తొలి డాక్యుమెంట్ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా సీఎం ధామీకి అందజేశారు. ‘‘ మతాలకతీతంగా పౌరులందరికీ యూసీసీ ద్వారా సమాన హక్కులు, బాధ్యతలు ఉంటాయి. మూడేళ్ల క్రితం యూసీసీపై మాటిచ్చా. ఇన్నాళ్లకు ఇది సాకారమైంది. ఈ ఘనత రాష్ట్ర ప్రజలదే. విభిన్న ఆచార వ్యవహారాలు, జీవనం సాగించే ఎస్టీలను యూసీసీ పరిధిలోకి తెచ్చి వారిని ఇబ్బంది పెట్టొద్దని నిర్ణయించుకున్నాం. అందుకే వారిని యూసీసీ నుంచి మినహాయించాం’’ అని సీఎం స్పష్టంచేశారు. చట్టం ప్రకారం ఇకపై ఉత్తరాఖండ్లో అన్ని మతాలకు చెందిన స్త్రీ, పురుషులకు కనీస వివాహ వయస్సు ఒకేలా ఉంటుంది. అన్ని మతాల్లో బహుభార్యత్వం విధానాన్ని నిషేధించారు. హలాల్ విధానాన్ని సైతం రద్దుచేశారు. ‘‘ యూసీసీ అమలుతో భారత రాజ్యాంగ చరిత్రలో మరో సువర్ణాధ్యాయాన్ని లిఖించాం’’ అని సీఎం అన్నారు. -
నేటి నుంచే ఒకే చట్టం.. ఉత్తరాఖండ్లో యూసీసీ అమలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో నేటి ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమలు కాబోతోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ప్రకటించారు. స్వతంత్ర భారతదేశంలో యూసీసీని అమల్లోకి తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రికార్డు సృష్టించబోతున్నట్లు తెలిపారాయన.ఉత్తరాఖండ్లో నేటి నుంచి యూసీసీ అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సంబంధిత అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామని, ఉమ్మడి పౌరస్మృతి అమలుకు సంబంధించిన నిబంధనలను కేబినెట్ ఆమోదించినట్లు సీఎం ధామీ వెల్లడించారు. సమాజంలో ప్రజలందరి మధ్య సమానత్వం కోసం యూసీసీ అవసరమని ఉద్ఘాటించారు. దీంతో అందరికీ సమాన హక్కులు, సమాన బాధ్యతలు లభిస్తాయని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా, సామరస్యం, స్వయం సమృద్ధితో కూడిన దేశంగా తీర్చిదిద్దడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహా యజ్ఞం చేస్తున్నారని, ఇందులో తమ వంతు పాత్రగా యూసీసీని అమలు చేయబోతున్నామని పేర్కొన్నారు. ఎన్నికల హామీ అమలుఅధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామన్న 2022 ఎన్నికల హామీని బీజేపీ నిలుపుకుంటోంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజన్ ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో 2022 మే 27న నిపుణుల కమిటీ ఏర్పాటయ్యింది. 2024 ఫిబ్రవరి 2న ముసాయిదా ప్రతిని ప్రభుత్వానికి సమర్పించింది. ఫిబ్రవరి 7న యూసీసీ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందింది. నెల తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టంగా మారింది. యూసీసీ చట్టం అమలుపై నియమ నిబంధనలు రూపొందించడానికి ఏర్పాటైన కమిటీ నివేదిక అందజేసింది.దేశమంతటా యూసీసీ: ధామిసామరస్యపూర్వకమైన సమాజానికి ఉమ్మడి పౌరస్మృతి బలమైన పునాది అవుతుందని సీఎం ధామీ ఆదివారం పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ ప్రజలకు ఇచ్చిన హామీని సోమవారం నుంచే అమలు చేయబోతున్నామని వెల్లడించారు. వివక్షకు తావులేని సామరస్యపూర్వకమైన సమాజాన్ని సృష్టించాలన్నదే బీజేపీ ధ్యేయమని తెలిపారు. ఎన్నో గొప్ప నదులు ఉత్తరాఖండ్లో పుట్టాయని, అలాగే యూసీసీ గంగోత్రి కూడా దేశమంతటా ప్రవహించబోతోందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ కూడా ఈ మేరకు హామీ ఇచ్చారన్నారు.యూసీసీపై ఉత్తరాఖండ్ మోడల్ బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో యూసీసీ అమల్లోకి వస్తుండడంతో మిగతా బీజేపీ పాలత రాష్ట్రాలూ అదే బాటలో నడిచే అవకాశం కనిపిస్తోంది. అస్సాం ఇప్పటికే యూసీసీ అమలుపై ఆసక్తి వ్యక్తంచేసింది. వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవనం తదితర వ్యవహారాల్లో కులమతాలతో సంబంధం లేకుండా అందరికీ ఒకే చట్టం వర్తించడమే ఉమ్మడి పౌరస్మృతి. యూసీసీతో బాహు భార్యత్వంపై నిషేధమూ అమల్లోకి వస్తుంది. అన్ని వర్గాల్లోని పురుషులు గానీ, స్త్రీలు గానీ ప్రభుత్వం నిర్దేశించిన వయసు కంటే ముందే పెళ్లి చేసుకోవడం నేరమవుతుంది. అన్ని రకాల పెళ్లిలు, సహజీవనాలను రిజిస్ట్రేషన్ చేయడం తప్పనిసరి. ఆన్లైనలో రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పెళ్లి చేసుకోని జంటలకు జన్మించే బిడ్డలకు సైతం యూసీసీతో చట్టబద్ధమైన హక్కులు లభిస్తాయి. -
ఇది హిందుస్తాన్
ప్రయాగ్రాజ్: దేశంలో మెజారిటీ ప్రజల ఇష్టానుసారం పాలన కొనసాగాలని చెప్పేందుకు మాత్రం సంకోచించనని అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ డాక్టర్ శేఖర్ యాదవ్ వ్యాఖ్యా నించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఆదివారం అలహాబాద్ హైకోర్టు లైబ్రెరీ హాల్లో విశ్వహిందూ పరిషత్ హైకోర్టు యూనిట్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అంశంపై ఆయన మాట్లాడారు. ‘‘మెజారిటీ ప్రజల అభీష్టం మేరకే చట్టం నడుచుకోవాలి. కుటుంబంగా చూసినా, సమాజంగా చూసినా మెజారిటీ ప్రజల సంక్షేమం, సంతోషమే ముఖ్యం’’ అన్నారు. ముస్లింలలో ఉన్న బహుభార్యత్వం, త్రిపుల్ తలాఖ్, హలాలా వంటి విధానాలను జడ్జి పరోక్షంగా విమర్శించారు. ‘‘ మా పర్సనల్ లా వీటికి అంగీకరిస్తోందని అది ఏమాత్రం ఆమోదనీయం కాదు. మన శాస్త్రాలు, వేదాల్లో స్త్రీని శక్తిస్వరూపిణిగా భావించారు. నలుగురు భార్యలను కల్గి ఉంటాను, హలాలా, త్రిపుల్ తలాఖ్ను పాటిస్తానంటే కుదరదు. సామరస్యం, లింగ సమానత, సామ్యవాదమే యూసీసీ ధ్యేయం. అంతే తప్ప వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్, హిందూయిజాలను అది ప్రోత్సహించదు’’ అన్నారు. -
వన్ నేషన్ వన్ ఎలక్షన్.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
అహ్మాదాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి సందర్భంగా.. జాతీయ ఐక్యతా దినోత్సవంతోపాటు దీపావళి పండుగ కూడా జరుపుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈసారి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి చాలా ప్రత్యేకమైనదని అన్నారు. గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి మోదీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మోదీ ప్రసంగించారు.‘‘దీపావళి పండగ.. భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో అనుసంధానం చేయడం ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బుధవారం వైట్హౌస్లో 600 మందికి పైగా ప్రముఖ భారతీయ అమెరికన్లతో దీపావళిని జరుపుకున్నారు. అనేక దేశాల్లో దీపావళి జాతీయ పండుగగా జరుపుకుంటున్నారు. ‘‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’’ త్వరలో సాకారమవుతుంది. దేశంలోని అన్ని ఎన్నికలను ఒకే రోజు లేదా నిర్దిష్ట కాలవ్యవధిలో నిర్వహించటమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనకు త్వరలో లైన్ క్లియర్ అవుతుంది. ఈ ప్రతిపాదనకు ఈ ఏడాది ప్రారంభంలో కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపాదన సమర్పించనున్నాం.#WATCH | On 'Rashtriya Ekta Diwas', Prime Minister Narendra Modi says "...We are now working towards One Nation One Election, which will strengthen India's democracy, give optimum outcome of India's resources and the country will gain new momentum in achieving the dream of a… pic.twitter.com/vUku6ZCnVv— ANI (@ANI) October 31, 2024 మేం ప్రస్తుతం ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ దిశగా పని చేస్తున్నాం. ఇది భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. భారతదేశ వనరుల సరైన ఫలితాన్ని ఇస్తుంది. అభివృద్ధి చెందిన భారతదేశం కలను సాధించడంలో సాయపడుతుంది. భారతదేశం.. నేషన్ వన్ సివిల్ కోడ్, సెక్యులర్ సివిల్ కోడ్ కలిగి దేవంగా అవతరించనుంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేశాం. దానిని శాశ్వతంగా పాతిపెట్టాం. రాజ్యాంగాన్ని గురించి మాట్లాడేవారే ఎక్కువగా అవమానిస్తున్నారు’’ అని అన్నారు. -
PM Narendra Modi: లౌకిక పౌరస్మృతి!
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం మతపరమైన పౌరస్మృతి అమల్లో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘దాన్ని 75 ఏళ్లుగా భరిస్తున్నాం. ఆ స్మృతికి చరమగీతం పాడి దాని స్థానంలో దేశ ప్రజలందరికీ సమానంగా వర్తించే ‘లౌకిక’ పౌరస్మృతిని రూపొందించుకోవాల్సిన సమయం వచ్చింది’’ అని కుండబద్దలు కొట్టారు. ‘‘రాజ్యాంగ స్ఫూర్తి కూడా అదే. దేశమంతటికీ ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) ఉండాలని ఆదేశిక సూత్రాలు కూడా స్పష్టంగా చెబుతున్నాయి. దాని ఆవశ్యకతను సుప్రీంకోర్టు కూడా పలుమార్లు నొక్కిచెప్పింది. ఆ మేరకు తీర్పులు వెలువరించింది’’ అని గుర్తు చేశారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం మోదీ ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేయడం ఆయనకిది వరుసగా పదకొండోసారి కావడం విశేషం. బీజేపీ ఎజెండా అంశాల్లో, ప్రధాన ఎన్నికల ప్రచార నినాదాల్లో ఒకటైన యూసీసీని వీలైనంత త్వరగా అమల్లోకి తెస్తామని ఈ సందర్భంగా ప్రధాని స్పష్టమైన సంకేతాలిచ్చారు. ‘‘ప్రస్తుత పౌరస్మృతి ఒకవిధంగా మతపరమైనదన్న అభిప్రాయం సమాజంలోని మెజారిటీ వర్గంలో ఉంది. అందులో వాస్తవముంది. ఎందుకంటే అది మతవివక్షతో కూడినది. అందుకే దాన్నుంచి లౌకిక స్మృతివైపు సాగాల్సి ఉంది. తద్వారా రాజ్యాంగ నిర్మాతల కలను నిజం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. అది తక్షణావసరం కూడా’’ అని పేర్కొన్నారు. ‘ఒక దేశం–ఒకే ఎన్నిక’ కూడా దేశానికి చాలా అవసరమని మోదీ అన్నారు. ‘‘2047 కల్లా అభివృద్ధి చెందిన భారత్ కలను సాకారం చేసుకుందాం. అందుకు 140 కోట్ల పై చిలుకు భారతీయులంతా భుజం భుజం కలిపి కలసికట్టుగా సాగుదాం’’ అని పిలుపునిచ్చారు. రంగాలవారీగా తమ పాలనలో దేశం సాధించిన ప్రగతిని 98 నిమిషాల పాటు వివరించారు. తద్వారా అత్యంత ఎక్కువ సమయం పాటు పంద్రాగస్టు ప్రసంగం చేసిన ప్రధానిగా సొంత రికార్డు (94 నిమిషాల)నే అధిగమించారు. కొత్తగా 75,000 వైద్య సీట్లు ‘‘వైద్య విద్య కోసం మన యువత విదేశీ బాట పడుతోంది. ఇందుకోసం మధ్యతరగతి తల్లిదండ్రులు లక్షలు, కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. అనామక దేశాలకు కూడా వెళ్తున్నారు’’ అని మోదీ ఆవేదన వెలిబుచ్చారు. వచ్చే ఐదేళ్లలో 75 వేల వైద్య సీట్లను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ‘‘ఉన్నత విద్య కోసం యువత భారీగా విదేశాలకు వెళ్తోంది. దీన్ని సమూలంగా మార్చేస్తాం. విదేశాల నుంచే విద్యార్థులు మన దగ్గరికొచ్చే స్థాయిలో విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తాం. అలనాటి నలంద విశ్వవిద్యాలయ స్ఫూర్తితో 21వ శతాబ్దపు అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దుతాం. నూతన విద్యా విధానానిది ఇందులో కీలక పాత్ర కానుంది.కిరాతకులకు వణుకు పుట్టాలి మహిళలపై హింసకు తక్షణం అడ్డుకట్ట వేయాల్సిందేనని మోదీ అన్నారు. ‘‘మహిళలపై అకృత్యాలకు తెగించేవారికి కఠినాతి కఠినమైన శిక్షలు విధించాలి. ఉరి తప్పదన్న భయం రావాలి. మహిళలను ముట్టుకోవాలంటేనే వణుకు పుట్టే పరిస్థితి కలి్పంచడం చాలా ముఖ్యం. ఇలాంటి కేసుల్లో పడ్డ శిక్షల గురించి అందరికీ తెలిసేలా మీడియాలో విస్తృత ప్రాచుర్యం కల్పించాలి. అప్పుడే ప్రజల్లో తిరిగి విశ్వాసం పాదుగొల్పగలం’’ అన్నారు. కోల్కతాలో వైద్యురాలిపై దారుణ హత్యాచారం దేశమంతటినీ కుదిపేస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘మహిళల భద్రత బాధ్యత కేంద్రంపై, రాష్ట్రాలపై, ప్రజలందరిపై ఉంది. కోల్కతా ఘోరంపై దేశమంతా తీవ్రంగా ఆక్రోశిస్తున్న తీరును అర్థం చేసుకోగలను. నాదీ అదే మనఃస్థితి. నేనెంత బాధ పడుతున్నానో మాటల్లో చెప్పలేను. ఆ కేసు విచారణను సత్వరం ముగించి దోషులను కఠినంగా శిక్షించాలి. ఇలాంటి నీచకృత్యాలు పదేపదే జరుగుతుండటం బాధాకరం’’ అన్నారు. బంగ్లాలో పరిస్థితులు ఆందోళనకరం కల్లోల బంగ్లాదేశ్లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడుల పట్ల 140 కోట్ల పై చిలుకు భారతీయుల్లో ఆందోళన నెలకొందని మోదీ అన్నారు. అక్కడ త్వరలో శాంతియుత పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వెలిబుచ్చారు. అందుకు భారత్ అన్నివిధాలా సహకారం అందిస్తుందని చెప్పారు.లక్ష మంది యువత రాజకీయాల్లోకిరాజకీయ రంగంలో కుల, కుటుంబవాదాలకు అడ్డుకట్ట వేయాలని మోదీ అన్నారు. అందుకోసం ఏ రాజకీయ నేపథ్యమూ లేని లక్ష మంది యువతీ యువకులు ప్రజా జీవితంలోకి రావాలని పిలుపునిచ్చారు. ‘‘వారికి నచి్చన పారీ్టలో చేరి అన్ని స్థాయిల్లోనూ ప్రజాప్రతినిధులుగా మారాలి. కొత్త ఆలోచనలతో కూడిన ఆ కొత్త రక్తం మన ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయగలదు’’ అన్నారు.ప్రతికూల శక్తులతో జాగ్రత్త దేశ ప్రగతిని కొందరు ఓర్వలేకపోతున్నారని విపక్షాలనుద్దేశించి మోదీ విమర్శించారు. ‘‘ప్రతిదాన్నీ ధ్వంసం చేయాలని వాళ్లు కలలుగంటున్నారు. అవినీతిని ఘనకార్యంగా ప్రచారం చేసుకుంటున్నారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. అలాంటి ప్రతికూల శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి’’ అన్నారు. అంతర్గతంగా, బయటి నుంచి భారత్ లెక్కలేనన్ని సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు.రాజస్తానీ రంగుల తలపాగా ఎప్పట్లాగే ఈ పంద్రాగస్టు సందర్భంగా కూడా మోదీ ప్రత్యేక తలపాగాతో మెరిసిపోయారు. పసుపు, ఆకుపచ్చ, కాషాయ రంగులతో కూడిన రాజస్తానీ సంప్రదాయ లెహరియా తలపాగాతో ఆకట్టుకున్నారు. తెల్ల కుర్తా, చుడీదార్, నీలిరంగు బంద్గలా ధరించారు. -
మళ్లీ తెరపైకి పౌరస్మృతి
వరసగా మూడోసారి గద్దెనెక్కిన తర్వాత ఎర్రకోట బురుజులపై నుంచి చేసిన తొలి ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలకమైన అంశాలు ప్రస్తావించారు. అందులో ప్రధానమైనది ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ). ఇప్పుడున్న ‘మతతత్వ పౌరస్మృతి’ స్థానంలో ‘సెక్యులర్ పౌరస్మృతి’ రావా ల్సిన అవసరం ఉందన్నది మోదీ నిశ్చితాభిప్రాయం. నిజానికి ఇదేమీ కొత్త కాదు. ఇంతక్రితం సైతం పలు సందర్భాల్లో యూసీసీ గురించి ఆయన మాట్లాడారు. నిరుడు జూన్లో మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన బీజేపీ కార్యకర్తల సదస్సులో దీనిపై ఆయన గొంతెత్తారు. ఆ మాటకొస్తే పూర్వపు జనసంఘ్ నుంచీ బీజేపీ దీన్ని తరచూ చెబుతోంది. కనుక ఇందులో కొత్త ఏమున్నదని అనిపించవచ్చు. అయితే గతంలో ప్రస్తావించటానికీ, ఇప్పుడు మాట్లాడటానికీ మధ్య మౌలికంగా వ్యత్యాస ముంది. గత పదేళ్ల నుంచి ఆయన ఎన్డీయే ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నా బీజేపీకి సొంతంగానే పాలించగల సత్తా ఉండేది. ఇప్పుడు కూటమి పక్షాలపై ఆధారపడక తప్పనిస్థితి వచ్చింది. ప్రధాని తాజా ప్రసంగంలో ఇంకా అవినీతి, మహిళల భద్రత, ఒకే దేశం–ఒకేసారి ఎన్నికలు వంటివి కూడా చోటుచేసుకున్నాయి. నిజానికి ఎర్రకోట బురుజు ప్రసంగం లాంఛనమైన అర్థంలో విధాన ప్రకట నేమీ కాదు. కానీ రాగల అయిదేళ్ల కాలంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చేయదల్చుకున్నదేమి టన్న విషయంలో ఆయన స్పష్టతతో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. మనం పూర్తి స్థాయి సెక్యులర్ దేశంగా మనుగడ సాగించాలని తొలి ప్రధాని నెహ్రూ మొదలు కొని స్వాతంత్య్రోద్యమ నాయకులందరూ భావించారు. యూసీసీ గురించి రాజ్యాంగ నిర్ణాయక సభలో లోతైన చర్చే జరిగింది. రాజ్యాంగసభ అధ్యక్షుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సైతం యూసీసీ ఉండితీరాలని కోరుకున్నారు. సభ్యుల్లో కొందరు వ్యతిరేకిస్తే... అనుకూలంగా మాట్లాడినవారిలో సైతం కొందరు ఇది అనువైన సమయం కాదన్నారు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు భిన్నమై నవి. దేశ విభజన సమయంలో ఇరుపక్కలా మతోన్మాదులు చెలరేగిపోయారు. నెత్తురుటేర్లు పారించారు. పరస్పర అవిశ్వాసం, అపనమ్మకం ప్రబలటంతో ఇళ్లూ, వాకిళ్లూ, ఆస్తులూ అన్నీ వదిలి లక్షల కుటుంబాలు ఇటునుంచి అటు... అటునుంచి ఇటూ వలసబాట పట్టారు. అదే సమయంలో పాకి స్తాన్ ఆవిర్భావానికి కారకుడైన మహమ్మద్ అలీ జిన్నా మరింత రెచ్చగొట్టే ప్రకటన చేశారు. భారత్లో ముస్లింలకు మనుగడ ఉండబోదని, వారిని అన్ని విధాలా అణిచేస్తారని దాని సారాంశం. అలాంటి సమయంలో యూసీసీని తీసుకొస్తే అనవసర అపోహలు బయల్దేరి పరిస్థితి మరింత జటిలమవుతుందని అందరూ అనుకున్నారు. అందువల్లే హక్కుల్లో భాగం కావాల్సిన యూసీసీ కాస్తా 44వ అధికరణ కింద ఆదేశిక సూత్రాల్లో చేరింది. ఆ సూత్రాలన్నీ ప్రభుత్వాలు నెరవేర్చాల్సిన అంశాలు. అయినా ఇతర అధికరణాల అమలు కోసం వెళ్లినట్టుగా కోర్టుకు పోయి వాటి అమలుకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరటం సాధ్యం కాదు. అందువల్లే సుప్రీంకోర్టు వివిధ తీర్పుల్లో యూసీసీని తీసుకురావలసిన అవసరాన్ని పాలకులకు గుర్తుచేసి ఊరుకుంది. చిత్రమేమంటే పర స్పర పూరకాలు కావలసిన హక్కులూ, ఆదేశిక సూత్రాలూ కొన్ని సందర్భాల్లో విభేదించుకుంటాయి. ఉదాహరణకు 25 నుంచి 28వ అధికరణ వరకూ పౌరులకుండే మత స్వేచ్ఛ గురించి మాట్లాడ తాయి. ఆదేశిక సూత్రాల్లో ఒకటైన యూసీసీపై చట్టం తెస్తే సహజంగానే అది మత స్వేచ్ఛను హరించినట్టవుతుంది. కనుక ఈ రెండింటి మధ్యా సమన్వయం సాధించాలి. గతంలో చాలా సందర్భాల్లో ఇలా చేయకతప్పలేదు. ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ ప్రభావితం కాని రీతిలో ఆ పని చేయాలి. ఆ సంగతలా ఉంచి యూసీసీ తీసుకురాదల్చుకుంటే ఇస్లామ్ను అనుసరించేవారికి మాత్రమే కాదు... హిందూ, క్రైస్తవ, పార్సీ మతస్థులపైనా ప్రభావం పడుతుంది. కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చుగానీ దాదాపు అన్ని మతాలూ స్త్రీల విషయంలో వివక్షాపూరితంగానే ఉన్నాయి.ముఖ్యంగా వ్యక్తిగత (పర్సనల్) చట్టాలకొచ్చేసరికి ఇది బాహాటంగా కనబడుతుంది. వీటి మూలాలు వందలు, వేల ఏళ్ల నుంచి పరంపరగా వస్తూవున్న సంప్రదాయాల్లో ఉండటం, మారు తున్న కాలానికి అనుగుణంగా సవరించుకోవటానికి సిద్ధపడకపోవటం సమస్య. వివాహం, విడా కులు, పునర్వివాహం, వారసత్వం, ఆస్తి హక్కు, బహుభార్యాత్వం వంటి అంశాల్లో స్త్రీలకు వివక్ష ఎదురవుతోంది. అయితే రాజ్యాంగం హామీ ఇచ్చిన లింగసమానత్వం లేని పక్షంలో అలాంటి చట్టా లను సుప్రీంకోర్టు కొట్టివేసిన సందర్భాలున్నాయి. పార్శీల్లో అన్య మతస్థుణ్ణి పెళ్లాడిన మహిళలకు వారసత్వ ఆస్తిలో భాగం ఇవ్వరు. పార్శీ పురుషుడికి అది వర్తించదు. అన్ని అంశాలనూ సవివరంగా చర్చించేందుకూ... అన్ని మతాచారాల వివక్షను తొలగించటానికీ సిద్ధపడుతున్నారన్న అభిప్రాయం కలిగిస్తే యూసీసీ రూపకల్పన సమస్యేమీ కాదు. దానికి ముందు మైనారిటీల విశ్వాసం పొందాలి. కోల్కతాలో ఇటీవల మహిళా జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య నేపథ్యంలో మహిళల భద్రత అంశాన్ని మోదీ ప్రస్తావించారు. ఇక భారత్లో అవినీతి పెచ్చుమీరిందని గణాంకాలు వెల్లడి స్తున్న నేపథ్యంలో కఠినంగా ఉంటామన్న సంకేతాలిచ్చారు. కానీ అలాంటి ఆరోపణలున్న నేతలు బీజేపీలోనో, దాని మిత్రపక్షంగానో ఉన్నప్పుడూ... వారిపై కేసుల దర్యాప్తు మందగిస్తున్నప్పుడూ దీన్ని జనం ఎంతవరకూ విశ్వసించగలరన్నది ఆలోచించుకోవాలి. మొత్తానికి యూసీసీ అంశాన్ని ప్రధాని మరోసారి తెరపైకి తెచ్చారు. ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఎటువంటి స్పందన వస్తుందో, ఎన్డీయే కూటమిలోని ఇతర పక్షాల వైఖరి ఏ విధంగా ఉంటుందో మున్ముందు తెలుస్తుంది. -
ప్రధాని మోదీ వ్యాఖ్యలు అవమానకరం: జైరాం రమేశ్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 78వ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా తప్పు పట్టింది. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ గురువారం ‘ఎక్స్’ వేదికగా మోదీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘యూసీసీ గురించి మోదీ మాట్లాడుతూ ఇప్పటివరకు మనకు కమ్యూనల్ సివిల్ కోడ్ ఉందనటం చాలా అవమానకరం. ఇలాంటి వ్యాఖ్యలు చేసి మోదీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను అవమానపరిచారు. చరిత్రను కించపర్చటంలో ప్రధాని మోదీకి ఎటువంటి హద్దు లేకుండా పోయింది. 1950లో అంబేద్కర్ హిందూ చట్టాల్లో గొప్ప సంస్కరణలు తీసుకువచ్చారు. అప్పుడు ఆ సంస్కరణలను ఆర్ఎస్ఎస్, జన్ సంఘ్ తీవ్రంగా వ్యతిరేకించాయి’అని అన్నారు. మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసగంలో.. ‘దేశంలో సెక్యులర్ సివిల్ కోడ్ ఉండాల్సిన అవసరం చాలా ఉంది. తనం మతపరమైన సివిల్ కోడ్తో 75 ఏళ్లు జీవించాం. ఇప్పుడు మనం సెక్యులర్ సివిల్ కోడ్ వైపు వెళ్లాలి. అప్పుడే దేశంలో మతపరమైన వివక్ష అంతం అవుతుంది. దీంతో సామాన్య ప్రజల మధ్య విభజన పరిస్థితులు దూరం అవుతాయి’అని అన్నారు.మరోవైపు.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం మీడియాతో మట్లాడారు. బీజేపీ ప్రభుత్వం విభజన ఆలోచనలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. ‘‘భిన్నత్వంలో ఏకత్వం మన దేశ బలమే తప్ప బలహీనత కాదు. మనకు స్వాతంత్య్రం తేలికగా వచ్చిందని కొందరు ప్రచారం చేస్తారు. కానీ, లక్షల మంది త్యాగాలు చేస్తేనే స్వాతంత్రం వచ్చింది’’అని అన్నారు. -
యూసీసీ కింద నమోదైతే పోలీసు రక్షణ
నైనిటాల్: సహజీవనం చేస్తున్న ఓ జంట తమకు రక్షణ కల్పించాలంటూ వేసిన పిటిషన్పై ఉత్తరాఖండ్ హైకోర్టు వెలువరించిన తీర్పు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) ఇంకా అమల్లో రాలేదు. అయినప్పటికీ ఈ చట్టం కింద 48 గంటల్లోగా రిజిస్టర్ చేసుకున్న పక్షంలో పిటిషన్దారుగా ఉన్న జంటకు ఆరు వారాలపాటు రక్షణ కల్పించాలంటూ పోలీసు శాఖను ఆదేశిస్తూ జస్టిస్ మనోజ్ కుమార్ తివారీ, జస్టిస్ పంకజ్ పురోహిత్ల డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. ఈ పరిణామంపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ‘పిటిషన్పై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున జూనియర్ న్యాయవాది హాజరయ్యారు. రాష్ట్రంలో యూసీసీ అమలుపై ప్రభుత్వం నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదనే విషయం ఆయనకు తెలియదు. అవగాహనా లోపం వల్ల ఇలా జరిగింది. దీనిపై హైకోర్టులో రీ కాల్ పిటిషన్ వేస్తాం. హైకోర్టు ఈ తీర్పును సవరించి, మళ్లీ ఉత్తర్వులు జారీ చేస్తుంది’అని చెప్పారు. అదే సమయంలో, ఆ జంటకు పోలీసులు రక్షణ కల్పిస్తారని కూడా ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. వేర్వేరు మతాలకు చెందిన తమ కుటుంబాల నుంచి ముప్పుందంటూ సహజీవనం చేస్తున్న 26 ఏళ్ల హిందూ మహిళ, 21 ఏళ్ల ముస్లిం యువకుడు వేసిన పిటిషన్ ఈ మొత్తం వ్యవహారానికి కారణమైంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రతిపాదించిన యూసీసీ ప్రకారం యువ జంటలు తాము సహజీవనం చేస్తున్న రోజు నుంచి నెల రోజుల్లోగా అధికారుల వద్ద నమోదు చేసుకోకుంటే జరిమానా విధించొచ్చు. -
కులగణనపై కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: కేంద్రమంత్రి, ఎల్జేపీ(రామ్ విలాస్) పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ దేశవ్యాప్త కులగణనపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా కులగణన చేసి వాటి వివరాలు బహిర్గతం చేస్తే సమాజంలో విభజనకు దారి తీస్తుందని అన్నారు. కులగణన వివరాలు వెల్లడిస్తే జరిగే పరిణామాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చిరాగ్ పాశ్వాన్ పీటీఐ ఎడిటర్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు.లోక్సభ ఎన్నికల సందర్బంగా బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిన.. దేశంలో ఒకే ఎన్నిక, ఉమ్మడి పౌరస్మృతి అమలు వంటి హామీలపై ఎటువంటి చర్చలు ఎన్డీయే కూటమిలో జరగటం లేదని స్పష్టం చేశారు. ‘మా ముందుకు ఇప్పటికీ ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన ముసాయిదా రాలేదు. మేము ఆ ముసాయిదాను పరిశీలించాలి. ఎందుకంటే భారత్ భిన్నత్వం ఏకత్వం గల దేశం కావున, మాకు కొన్ని ఆందోళనలు ఉన్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో భాష, సంస్కృతి, జీవనశైలిలో చాలా వ్యత్యాలు ఉంటాయి. అందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనుకోవటంపై నాకు ఆశ్చర్యం కలుగుతోంది. .. అయితే ఉమ్మడి పౌరస్మృతి అంశం చర్చకు వచ్చినప్రతిసారి హిందూ, ముస్లింల వ్యవహారంగా కనిస్తోంది. కానీ, ఇది అందరి మత విశ్వాసాలు, సంప్రదాయాలు, వివాహ పద్దతులకు సంబంధించింది. హిందు, ముస్లింలను వేరు చేసింది అస్సలే కాదు. ఇది అందరినీ ఏకం చేసేది మాత్రమే’ అని అన్నారు.మరోవైపు.. ‘ప్రభుత్వం కులాల వారీగా చేపట్టే సంక్షేమ పథకాలకు కులగణన ఎంతో ఉపయోగపడుతంది. కోర్టులు కూడా కులాల వారీ జనాభా డేటాను పలసార్లు ప్రస్తావించింది. అయితే ఈ డేటాను ప్రభుత్వం తన వద్దనే ఉంచుకోవాలి. బయటకు విడుదల చేయవద్దు. అయితే కులగణన డేటాను బహిర్గతం చేయడాన్ని మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఆలా చేయటం వల్ల సమాజంలో కులాల మధ్య విభజనకు దారి తీస్తుందనే ఆందోళన కలుగుతోంది’ అని కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ అన్నారు. -
ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వస్తుందని ఆశిస్తున్నా: మేఘ్వాల్
కోల్కతా: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమల్లోకి వస్తుందని ఆశిస్తున్నట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ చెప్పారు. ఇప్పటికే ఈ దిశగా కొన్ని రాష్ట్రాలు చర్యలు ప్రారంభించాయని గుర్తుచేశారు. ఆదివారం కోల్కతాలో మాట్లాడారు. బీజేపీ మేనిఫెస్టోలో యూసీసీని ప్రస్తావించామని ఆయన గుర్తు చేశారు. -
Amit Shah: మేం అలాగే చేస్తాం
న్యూఢిల్లీ: విపక్షాల విమర్శలకు జడిసేదిలేదని బీజేపీ అగ్రనేత అమిత్ షా స్పష్టంచేశారు. ఆరి్టకల్ 370 రద్దు, ఉమ్మడి పౌర స్మృతి, ముస్లింలకు కోటాను వ్యతిరేకిస్తూ ఎన్నికల ప్రచారంలో బీజేపీ మతం అంశాన్ని ముందుకు తెస్తోందని విపక్షాలు విమర్శించినాసరే తాము అలాగే చేస్తామని కుండబద్దలు కొట్టారు. ఆదివారం పీటీఐతో ఇంటర్వ్యూలో షా వెల్లడించిన విషయాలు, ప్రస్తావించిన అంశాలు ఆయన మాటల్లోనే.. మేం అప్పుడు ఓడిపోయాం కదా! ‘‘రాజ్యాంగంలో లేనివిధంగా మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు విపక్షాలు ఇస్తామంటే వ్యతిరేకిస్తున్నాం. ఆరి్టకల్ 370ని రద్దుచేశాం, ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొచ్చాం. చేసిన పనులనే చెప్పుకుంటున్నాం. వద్దు అని విపక్షాలు అన్నాసరే మేం అలాగే చేస్తాం. కావాలనే పోలింగ్ శాతాలను ఈసీ ఆలస్యంగా వెల్లడిస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని విపక్షాలు అంటున్నాయి. ఈవీఎంలను బీజేపీ తమకు అనుకూలంగా మార్చేస్తోందని విపక్షాల చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదు. తెలంగాణ, పశి్చమబెంగాల్, హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలప్పుడూ ఈసీ ఇలాగే చేసింది. అప్పుడు ఆ రాష్ట్రాల్లో మేం ఓడిపోయాంకదా. ఆ ఎన్నికలు పారదర్శకంగా జరిగితే ఈ ఎన్నికలు కూడా అంతే పారదర్శకంగా జరుగుతున్నట్లే లెక్క. ఓడిపోతానని రాహుల్ గాంధీ ఊహించారు. అందుకే ముందే ఏడ్చేసి, ఏవో కారణాలు చెప్పేసి విదేశాలకు వెళ్లిపోతారు. జూన్ 6న విదేశాలకు వెళ్తారేమో. అందుకే ఏదో ఒకటి చెప్తున్నారు’’ ‘400’ అనేది నినాదం కాదు ‘‘ మేం 399 సీట్లు సాధిస్తే ‘ మీకు 400 రాలేదుగా’ అని విపక్షాలు విమర్శిస్తే అది వారి విజ్ఞతకే వదిలేస్తా. ఈసారి 400 సీట్లు గెలుస్తాం అనేది మా నినాదం కాదు. విజయావకాశాలను లెక్కగట్టి చెప్పిన సంఖ్య అది. కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల వల్లే మేం ఈసారి ఎక్కువ స్థానాల్లో గెలవబోతున్నాం. పేద కుటుంబమహిళకు ఏటా రూ.1 లక్ష ఇస్తామని కాంగ్రెస్ అమలుచేయలేని వాగ్దానాలిస్తోంది. 2–3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలిస్తోంది. రూ.1 లక్ష సంగతి దేవుడెరుగు గతంలో హామీ ఇచి్చనట్లు(హిమాచల్ ప్రదేశ్లో) రూ.1,500 అయినా ఇస్తారేమో చూద్దాం. బెంగాల్, ఒడిశాలోనూ మాదే హవా ‘‘పశ్చిమబెంగాల్లో 24–30 సీట్లు, ఒడిశాలో 16–17 సీట్లు గెలుస్తాం. తమిళనాడులోనూ ఓటు షేర్ పెంచుకుంటాం. ఈసారి కేరళలో ఖాతా తెరుస్తాం. వచ్చే ఐదేళ్లలో దేశమంతటా ఉమ్మడి పౌరస్మతి అమలుచేస్తాం. మండే ఎండాకాలంలో కాకుండా వేరే కాలంలో ‘ఒకే దేశం–ఒకే ఎన్నికలు’ అమలుచేస్తాం. సంబంధిత బిల్లునూ పార్లమెంట్లో ప్రవేశపెడతాం. ఆర్మీలో యువత కోసం అగి్నవీర్ను మించిన అద్భుత పథకం లేదు. నాలుగేళ్ల సర్వీస్ తర్వాత చక్కని ప్రతిభ కనబరిచిన వారికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఉంది కదా’’. -
‘తృణమూల్’ మేనిఫెస్టో రిలీజ్.. కీలక హామీలివే..
కలకత్తా: లోక్సభ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మేనిఫెస్టో విడుదల చేసింది. మేనిఫెస్టోలో టీఎంసీ పశ్చిమబెంగాల్ ప్రజలకు 10 హామీలిచ్చింది. బీజేపీ ప్రధాన హామీలైన సీఏఏ, యూనిఫామ్ సివిల్ కోడ్లతో పాటు ఎన్ఆర్సీలను బెంగాల్లో అమలు చేయబోమని మేనిఫెస్టోలో తెలిపింది. పేద కుటుంబాలకు ఉచితంగా ఏడాదికి 10 వంట గ్యాస్ సిలిండర్లు, పేద కుటుంబాలకు ఉచిత ఇల్లు, రేషన్కార్డుదారులకు ఇంటి వద్దే రేషన్, పెట్రోలియం ఉత్పత్తుల ధరల స్థిరీకరణకు ప్రత్యేక ఫండ్ ఏర్పాటు లాంటి హామీలు టీఎంసీ మేనిఫెస్టోలో ఉన్నాయి. మేనిఫెస్టో విడుదల సమయంలో టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ అస్సాంలో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సీఏఏ, ఎన్ఆర్సీలను రద్దు చేస్తాం. మళ్లీ నరేంద్రమోదీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం, ఎన్నికలు ఉండవు. ఇంత ప్రమాదకర ఎన్నికలను నేనుఎప్పుడూ చూడలేదు. బీజేపీ దేశం మొత్తాన్ని డిటెన్షన్ క్యాంపుగా మార్చేసింది’అన్నారు. కాగా, బెంగాల్లో ఏప్రిల్ 19న తొలి దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇదీ చదవండి.. బీజేపీ 150 సీట్లకే పరిమితం.. రాహుల్ -
యూసీసీ అమలుపై 'పీయూష్ గోయల్' కీలక ప్రకటన
ముంబై: త్వరలో జరగనున్న ఎన్నికల్లో విజయ కేతనం ఎగురవేయడానికి దేశంలోని చిన్నా, పెద్దా.. పార్టీలు జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారం చేజిక్కించుకోవడానికి బీజేపీ అగ్రనేతలు కూడా రంగంలోకి దూకారు. ఈ తరుణంలో ముంబై నార్త్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేయడానికి సిద్దమైన 'పీయూష్ గోయల్' కీలక ప్రకటనలు చేశారు. దేశంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే.. యూనిఫాం సివిల్ కోడ్ (UCC)అమలు చేస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. మహారాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ మేనిఫెస్టోపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను కూడా తోసిపుచ్చారు. యూనిఫాం సివిల్ కోడ్ అనేది భారతదేశంలో పౌరుల కోసం వ్యక్తిగత చట్టాలను రూపొందించి అమలు చేయడానికి అవసరమైన ఒక ప్రతిపాదన. ఇది వారి మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ సమానంగా వర్తిస్తుంది. ప్రస్తుతం, వివిధ సంఘాల వ్యక్తిగత చట్టాలు వారి మత గ్రంథాలచే నిర్వహించబడుతున్నాయి. దేశంలో యూసీసీని అమలు చేయాలని బీజేపీ నిర్చయించుకుందని, ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత తప్పకుండా అమలు చేస్తామని పీయూష్ గోయల్ అన్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పటికే దీనిపై కసరత్తు చేసిందని కూడా పేర్కొన్నారు. అంతే కాకుండా వికసిత్ భారత్ కేవలం నరేంద్ర మోదీతోనే సాధ్యమని అన్నారు. -
Uttarakhand Ucc: ‘యూసీసీ’కి రాష్ట్రపతి ఆమోదముద్ర
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఫిబ్రవరిలో ఆమోదించిన యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం(మార్చ్ 13) ఆమోదముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడటంతో యూసీసీ బిల్లు చట్టంగా మారింది. వివాహం, విడాకులు, వారసత్వ హక్కులు వంటి పర్సనల్ చట్టాలన్నింటిని ఒకే గొడుగుకు కిందకు తీసుకువచ్చి ఉత్తరాఖండ్ ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ రూపొందించింది. తాజాగా ఈ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయడంతో యూసీసీ అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రికార్డు సృష్టించింది. యూసీసీ బిల్లు ముస్లింల సంప్రదాయ హక్కులను కాలరాసే విధంగా ఉందని, ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. సీఎం స్టాలిన్కు ఆ అధికారం లేదు -
ఆ బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం చరిత్రాత్మక నిర్ణయానికి వేదికైంది. స్వాతంత్య్రానంతరం దేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. యూసీసీ బిల్లుకు ( UCC Bill Uttarakhand ) ఆ రాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి సమక్షంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలంతా స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. తీవ్ర చర్చనీయాంశంగా మారిన.. ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఇక నుంచి ఆ రాష్ట్రంలో మతాలకు అతీతంగా పౌరులందరికీ ఒకే తరహా వివాహ, విడాకుల, భూమి, ఆస్తి, వారసత్వ చట్టాలు వర్తిస్తాయి. సహ జీవనంలో పుట్టిన పిల్లలకు కూడా చట్టపరమైన గుర్తింపును కల్పించడం... సహ జీవనాన్ని రిజిస్టర్ చేసుకోకపోతే 6 నెలల జైలు శిక్ష వంటి అంశాలను ఈ బిల్లులో పొందుపరిచారు. అలాగే.. షెడ్యూల్డ్ తెగలను బిల్లు పరిధి నుంచి తప్పించారు. #WATCH | Dehradun: Uttarakhand Assembly MLAs celebrate and share sweets as the Uniform Civil Code 2024 Bill, introduced by Chief Minister Pushkar Singh Dhami-led state government was passed in the House today. pic.twitter.com/eDq6cZbf4H — ANI (@ANI) February 7, 2024 ఇదిలా ఉంటే.. యూసీసీ బిల్లు రూపకల్పనలో అక్కడి బీజేపీ ప్రభుత్వం రాజకీయ విమర్శలు ఎదుర్కొంది. విపక్షాల ఆందోళనల నడుమే మంగళవారం ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి దీన్ని ప్రవేశపెట్టారు. ఆపై గందరగోళ పరిస్థితుల నడుమ సభ వాయిదా పడగా.. చివరకు చర్చ జరిపిన అనంతరం ఓటింగ్ నిర్వహించగా.. ఆమోదం లభించింది. స్వాతంత్య్రానంతరం దేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. దేశంలో.. గోవాలో పోర్చుగీసు పాలన నుంచి ఉమ్మడి పౌరస్మృతి ఉంది. #WATCH | Dehradun: In the Uttarakhand Assembly, CM Pushkar Singh Dhami speaks on UCC, "... After the independence, the makers of the Constitution gave the right under Article 44 that the states can also introduce the UCC at appropriate time... People have doubts regarding this.… pic.twitter.com/KDfLUdtBbG — ANI (@ANI) February 7, 2024 రెండేళ్ల కసరత్తు తర్వాత.. ఇదిలా ఉంటే.. యూసీసీని ఉత్తరాఖండ్ బీజేపీ 2022 ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చేర్చింది. అధికారంలోకి రాగానే.. సీఎం పుష్కర్సింగ్ ధామి ఇందుకోసం ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రెండేళ్ల పాటు సుదీర్ఘ కసరత్తులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 70కి పైగా సమావేశాలు నిర్వహించి 60వేల మందితో మాట్లాడింది. ఆన్లైన్లో వచ్చిన 2.33లక్షల సలహాలు, సూచనలను పరిశీలించింది. అనంతరం ముసాయిదాను రూపొందించి ఇటీవల సీఎంకు సమర్పించింది. -
Uttarakhand Ucc Bill: యూసీసీపై ఒవైసీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ ప్రభుత్వం తాజాగా అక్కడి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) పూర్తిగా హిందూ కోడ్ అని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అభివర్ణించారు. ఈ విషయమై బుధవారం ఢిల్లీలో ఆయన స్పందించారు. హిందువుల కోడ్ అయిన యూసీసీని ముస్లింలతో పాటు ఇతర మతాల వాళ్లకు వర్తింపజేస్తున్నారని ఒవైసీ మండిపడ్డారు. కోడ్లో హిందూ అవిభక్త ఫ్యామిలీ(హెచ్యూఎఫ్)ను ఎందుకు ముట్టుకోలేదని ప్రశ్నించారు. ఇతర మతాల వాళ్ల సంప్రదాయాలను ముస్లింలు ఆచరించాలని చట్టంలో పేర్కొనడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. రాజ్యాంగం ప్రకారం తమకు తమ మతాచారాలను ఆచరించే హక్కు ఉందని గుర్తు చేశారు. ఈ చట్టం అందరికీ ఒకేలా ఉండాలన్నప్పుడు గిరిజనులకు ఎందుకు మినహాయింపు ఇచ్చారో చెప్పాలన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం దివాళా తీసే పరిస్థితుల్లో ఉన్నపుడు అక్కడి సీఎం పుష్కర్ సింగ్ యూసీసీ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి సమస్యను పక్కదారి పట్టించడంపై ఒవైసీ విమర్శలు గుప్పించారు. వదరలు వచ్చి రాష్ట్ర ప్రజలు చాలా సమస్యల్లో ఉంటే పుష్కర్ సింగ్కు యూసీసీ ఎందుకు ప్రాధాన్యత కలిగిన అంశంగా కనిపిస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి.. ఉత్తరాఖండ్లో ఈడీ రెయిడ్స్.. ఆ పార్టీ నేతే టార్గెట్ -
‘ఉమ్మడి పౌరస్మృతి’.. ఎవరిపై ఎంత ప్రభావం?
యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ).. అంటే ఉమ్మడి పౌరస్మృతిపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఉత్తరాఖండ్లోని ధామి ప్రభుత్వం అసెంబ్లీలో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టింది. బిల్లును ప్రవేశపెడుతున్న సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు భారత్ మాతాకీ జై, వందేమాతరం, జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ బిల్లుకు స్వాగతం పలికారు. అయితే దీనిపై సమగ్ర చర్చ జరగాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలన్నీ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లు ఇంకా చర్చల దశలోనే ఉంది. యూనిఫాం సివిల్ కోడ్ ఏ మతంపై ఎలాంటి ప్రభావం చూపనున్నదో ఇప్పుడు తెలుసుకుందాం. హిందువులు ఉత్తరాఖండ్లో ‘ఉమ్మడి పౌరస్మృతి’ అమలైన పక్షంలో హిందూ వివాహ చట్టం (1955), హిందూ వారసత్వ చట్టం (1956) తదితర ప్రస్తుత చట్టాలను సవరించాల్సి ఉంటుంది. ఇది కాకుండా హిందూ అవిభక్త కుటుంబం (హెచ్యూఎఫ్)పై కూడా దీని ప్రభావం పడనుంది. ముస్లింలు ప్రస్తుతం ముస్లిం పర్సనల్ (షరియత్) అప్లికేషన్ చట్టం 1937 ముస్లింలకు అమలువుతోంది. దీనిలో వివాహం, విడాకులు తదితర నియమాలు ఉన్నాయి. అయితే యూసీసీ అమలైతే బహుభార్యత్వం, హలాలా తదితర పద్ధతులకు ఆటకం ఏర్పడుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరాఖండ్లో ముస్లిం జనాభా 13.95 శాతం ఉంది. సిక్కు కమ్యూనిటీ 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరాఖండ్లో సిక్కు జనాభా 2.34%. ఆనంద్ వివాహ చట్టం 1909 సిక్కుల వివాహాలకు వర్తిస్తుంది. అయితే ఇందులో విడాకులకు ఎలాంటి నిబంధన లేదు. అటువంటి పరిస్థితిలో విడాకుల కోసం సిక్కులకు హిందూ వివాహ చట్టం వర్తిస్తుంది. అయితే యూసీసీ అమలులోకి వచ్చిన పక్షంలో అన్ని వర్గాలకు ఒకే చట్టం వర్తిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆనంద్ వివాహ చట్టం కనుమరుగు కావచ్చు. క్రైస్తవులు క్రైస్తవ సమాజానికి చెందిన ప్రజలు కూడా ఉత్తరాఖండ్లో నివసిస్తున్నారు. ప్రస్తుతం క్రిస్టియన్ విడాకుల చట్టం 1869లోని సెక్షన్ 10A(1) ప్రకారం పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకునే ముందు భార్యాభర్తలు కనీసం రెండేళ్లపాటు విడిగా ఉండటం తప్పనిసరి. ఇది కాకుండా 1925 వారసత్వ చట్టం ప్రకారం క్రైస్తవ మతంలోని తల్లులకు వారి మరణించిన పిల్లల ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండదు. అయితే యూసీసీ రాకలో ఈ నిబంధన ముగిసే అవకాశం ఉంది. ఆదివాసీ సముదాయం ఉత్తరాఖండ్లోని గిరిజనులపై యూసీసీ ప్రభావం ఉండదు. ఉత్తరాఖండ్లో అమలు కాబోయే యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు.. ఇందులోని నిబంధనల నుండి గిరిజన జనాభాకు మినహాయింపు ఇచ్చింది. ఉత్తరాఖండ్లో గిరిజనుల జనాభా 2.9 శాతంగా ఉంది. -
Uttarakhand UCC Bill: ఆచరణ సాధ్యమేనా?!
ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) బిల్లును మంగళవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టి దేశంలోనే ఆ దిశగా తొలి అడుగేసిన రాష్ట్రమైంది. ఉమ్మడి పౌరస్మృతిపై బీజేపీ ఆరాటం ఎవరికీ తెలియంది కాదు. ఆవిర్భావం నుంచీ బీజేపీ ఆ మాట చెబుతూ వస్తోంది. 2014 లోక్సభ ఎన్నికల్లో యూసీసీ ఆ పార్టీ వాగ్దానాల్లో కీలకాంశం. రాష్ట్రాల్లో అంతకుముందూ, ఆ తర్వాతా బీజేపీ అధికారం అందుకున్నా ఎక్కడా ఉమ్మడి పౌరస్మృతి ఇలా బిల్లు రూపంలో చట్టసభ ముందుకొచ్చిన వైనం లేదు. మధ్యప్రదేశ్, అస్సాం, గుజరాత్లలో బీజేపీ ప్రభుత్వాలే వున్నా ఈ విషయంలో పెద్దగా పురోగతి లేదు. ఆ రకంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి ఇతరులకన్నా చాలా ముందున్నట్టు లెక్క. దేశంలో ప్రస్తుతం ఒక్క గోవాలో మాత్రమే యూసీసీ అమల్లో వుంది. అయితే అది 1867లో అప్పటి పోర్చుగీస్ పాలకులు తెచ్చిన చట్టం. రాజ్యాంగ నిర్ణాయక సభలో సైతం యూసీసీ గురించి చర్చ జరిగింది. దాన్ని ప్రాథమిక హక్కుల్లో చేర్చాలని కొందరు సభ్యులు అభిప్రాయపడగా మైనా రిటీ వర్గాల సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించటంతో అంతకుమించి ముందుకు కదల్లేదు. చివరకది రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో 44వ అధికరణ అయింది. దేశంలోని పౌరులందరికీ వర్తించేలా ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావటానికి రాజ్యం కృషి చేయాలని ఆ అధికరణ నిర్దేశించింది. ఆదేశిక సూత్రాలు రాజ్యం అమలు చేసి తీరాల్సినవి కాదు గనుక న్యాయస్థానాల తీర్పుల్లో ఉటంకించటానికి మాత్రమే ఆ అధికరణ పనికొచ్చింది. 1985లో షాబానో కేసులోనూ, 1995లో సరళా ముద్గల్ కేసు లోనూ వెలువరించిన తీర్పుల్లో ఉమ్మడి పౌరస్మృతి దేశ సమైక్యతకూ, సమగ్రతకూ తోడ్పడుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనాలు అభిప్రాయపడ్డాయి. 21వ లా కమిషన్ ఉమ్మడి పౌరస్మృతిపై భిన్నవర్గాల అభిప్రాయాలు సేకరించి, న్యాయనిపుణులతో కొన్ని నెలలపాటు చర్చించి ‘ఈ దశలో అది అవసరమూ కాదు, వాంఛనీయమూ కాద’ని తేల్చింది. చిత్రమేమంటే ఆ తర్వాత ఏర్పడ్డ 22వ లా కమిషన్ యూసీసీపై ప్రజాభిప్రాయాన్ని తెలపాలంటూ ప్రకటనలు విడుదల చేసింది. అది జరిగి మూడేళ్లు గడిచింది కాబట్టి ప్రజల తాజా అభిప్రాయమేమిటో తెలుసుకోదల్చుకున్నామని లా కమిషన్ సమర్థించుకుంది. ఉమ్మడి పౌరస్మృతి చుట్టూ మొదటినుంచీ వివాదాలు అల్లుకుంటూనే వున్నాయి. దాన్ని తీసుకు రావటం, సజావుగా అమలు చేయటం భిన్న మతాల, సంస్కృతులకు నిలయమైన భారత్లో సాధ్యంకాదన్నది కొందరి అభిప్రాయం. ముఖ్యంగా వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత తది తర వ్యవహారాలతో ముడిపడివుండే అంశాల్లో వేర్వేరు మతాలకు వేర్వేరు సంప్రదాయాలున్నాయి. దాదాపు అన్ని పర్సనల్ చట్టాలూ మహిళలపై వివక్ష ప్రదర్శిస్తున్నాయి. ఈ దశలో అందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనుకోవటం అంత సులభం కాదు. 50వ దశకంలో హిందువులకు వర్తించేలా అయిదు చట్టాలు– హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టం, హిందూ మైనర్ల సంరక్షకత్వ చట్టం, హిందూ దత్తత, మనోవర్తి చట్టం, హిందూ ఆస్తి స్వాధీనతా చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టాలే సిక్కు, బౌద్ధ, జైన మతస్తులకు కూడా వర్తిస్తున్నాయి. ముస్లిం, క్రైస్తవ, పార్సీ మతస్తులకు వేర్వేరు పర్సనల్ చట్టాలున్నాయి. ఆ మతాల్లో కూడా కొన్ని అంశాల్లో ఏకరూపత లేదు. సంప్ర దాయాల పరంగా చూస్తే వివాహాలకు సంబంధించి హిందూమతంలోనే భిన్నమైన ఆచరణలు న్నాయి. అవిభాజ్య హిందూ కుటుంబాలకు వర్తించే పన్ను రాయితీల వంటివి వేరే మతస్తులకు వర్తించవు. ఇక ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయ, మిజోరంలలో స్థానిక సంప్రదాయాలను పరిరక్షించాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. రాజ్యాంగంలోని 25వ అధికరణ పౌరులందరికీ ఏ మతా న్నయినా ఆచరించే, ప్రచారం చేసుకునే హక్కును ఇస్తున్నది. ఇన్ని అవరోధాలను దాటుకుని అందరికీ వర్తించే ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావటం అంత సులభమేమీ కాదు. 2019లో కేంద్రం తీసుకొచ్చిన మోటారు వాహనాల చట్టానికి ఏమైందో మన కళ్లముందే వుంది. అందులోని కఠిన నిబంధనల కారణంగా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ చట్టాన్ని అమలు చేయలేమని చేతులెత్తేశాయి. తమ అవసరాలకు తగినట్టు చట్టానికి సవరణలు తీసుకొచ్చాయి. వలస పాలకుల హయాంలో రూపొంది ఇంతవరకూ అమల్లోవున్న సాక్ష్యాధారాల చట్టం, కాంట్రాక్టు చట్టం, ఆస్తి బదలాయింపు చట్టం వగైరాలకు దాదాపు అన్ని రాష్ట్రాలూ వందల సవరణలు చేసుకున్నాయి. కనుక ‘ఒకే దేశం–ఒకే చట్టం’ ఆదర్శనీయమైనంతగా ఆచరణసాధ్యం కాదు. ఉమ్మడి పౌరస్మృతి బిల్లుపై చర్చ, ఆమోదం మంగళవారమే ఉంటాయని ప్రభుత్వం చెప్పినా మరింత సమయం అవసరమన్న విపక్షాల వినతితో అసెంబ్లీ స్పీకర్ దాన్ని సవరించారు. ఆ సంగ తలా వుంచితే ఒక్క ఆదివాసీలు మినహా అన్ని మతాలవారికీ వివాహం, విడాకులు, ఆస్తి హక్కు వగైరా అంశాల్లో ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయని బిల్లు చెబుతోంది. ఆఖరికి సహజీవనం చేసే జంటలు సైతం తమ బంధాన్ని రిజిస్టర్ చేయించుకోవాల్సిందేనని బిల్లు నిర్దేశిస్తోంది. సహజీవనంలోకి వెళ్లిన నెలలోగా రిజిస్టర్ చేసుకోవాలనీ, అలా చేయకపోతే మూడునెలల కారాగారం తప్పదనీ హెచ్చరిస్తోంది. రిజిస్టర్ చేయించుకున్న సహజీవనం ద్వారా జన్మించే సంతానాన్ని మాత్రమే సక్రమ సంతానంగా గుర్తించటం సాధ్యమంటున్నది. ఉత్తరాఖండ్లో నివసించే వేరే రాష్ట్రాలవారికి సైతం ఇది వర్తిస్తుందని చెబుతోంది. ఇలా పౌరుల వ్యక్తిగత అంశాల్లోకి రాజ్యం చొరబడటం సబబేనా? అసలు దేశమంతటికీ వర్తించే ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని 44వ అధికరణ నిర్దేశిస్తుండగా, ఒక రాష్ట్రం అలాంటి చట్టం తీసుకురావటం రాజ్యాంగబద్ధమేనా? -
రిజిస్ట్రేషన్ లేకుండా ‘లివ్ ఇన్’లో ఉంటే జైలుకే?
ఉత్తరాఖండ్.. యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలు చేసే తొలి రాష్ట్రం కానుంది. దీంతో ఆ రాష్ట్రంలో పలు నూతన నిబంధనలు అమలులోకి రానున్నాయి. లివ్ ఇన్ రిలేషన్లో ఉండాలనుకుంటున్న జంటలు ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. ‘లివ్-ఇన్’లో ఉంటూ, ఆ సంబంధాన్ని రిజిస్ట్రేషన్ చేయించకపోతే ఆ జంటకు ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ. 25,000 జరిమానా లేదా రెండూ విధించే అవకాశాలున్నాయి. ‘లివ్ ఇన్’లో ఉంటున్న జంట ఈ రిజిస్ట్రేషన్తో స్వీకరించే రసీదు ఆధారంగానే అద్దె ఇల్లు, హాస్టల్ లేదా పీజీ సౌకర్యాన్ని పొందగలుగుతారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇటీవల సీఎం ధామీ ప్రభుత్వానికి సమర్పించిన యూసీసీ ముసాయిదాలో ఈ నిబంధన గురించి పేర్కొన్నారు. ‘యూసీసీ’లో ‘లివ్-ఇన్’ సంబంధం గురించి స్పష్టమైన వివరణ ఇచ్చారు. దీని ప్రకారం ఒక వయోజన పురుషుడు, ఒక వయోజన మహిళ మాత్రమే లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉండగలుగుతారు. అలాంటివారు ఇప్పటికే వివాహం చేసుకోకూడదు లేదా మరొకరితో లివ్-ఇన్ రిలేషన్షిప్లో లేదా నిషేధిత సంబంధాలలో ఉండకూడదు. లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్న ప్రతి వ్యక్తి తప్పనిసరిగా రిజిస్టర్డ్ వెబ్ పోర్టల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇటువంటి రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్నాక రిజిస్ట్రార్ వారికి రిజిస్ట్రేషన్ రసీదుని అందజేస్తారు. ఆ రశీదు ఆధారంగా ఆ జంట ఇల్లు లేదా హాస్టల్ లేదా పీజీని అద్దెకు తీసుకోవచ్చు. అయితే ‘లివ్ ఇన్’ కోసం రిజిస్ట్రార్ రిజిస్టర్ చేయించుకున్న జంట ఆ విషయాన్ని తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు తప్పనిసరిగా తెలియజేయాలి. ‘లివ్ ఇన్’లో ఉంటున్న సమయంలో ఆ జంటకు పుట్టిన పిల్లలు ఆ జంటకు చెందిన చట్టబద్ధమైన పిల్లలుగా గుర్తింపు పొందుతారు. అలాంటి పిల్లలు వారి తల్లిదండ్రుల ఆస్తులపై అన్ని హక్కులను పొందుతారు. ‘లివ్-ఇన్’ రిలేషన్షిప్లో ఉంటున్నవారు విడిపోవాలనుకున్నా, తిరిగి ఆ పోర్టల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. -
అసెంబ్లీలో యూసీసీ బిల్లు.. విపక్షాల రగడ.. సభ వాయిదా!
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి డెహ్రాడూన్లోని రాష్ట్ర అసెంబ్లీలో యూనిఫాం సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ 2024 బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సమయంలో రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ‘వందేమాతరం, జై శ్రీరామ్’ నినాదాలు చేశారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ సమావేశాల రెండో రోజైన మంగళవారం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి యూసీసీ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విపక్ష ఎమ్మెల్యేలు రచ్చ చేశారు. దీనిపై పలు ప్రశ్నలు సంధించారు. యూనిఫాం సివిల్ కోడ్పై చర్చించేందుకు సభను మధ్యాహ్నం 2:00 గంటలకు వాయిదా వేశారు. అంతకుముందు అసెంబ్లీ స్పీకర్ రీతూ ఖండూరి భూషణ్ అధ్యక్షతన జరిగిన వ్యాపార సలహా సమావేశంలో సభలో ప్రశ్నోత్తరాల సమయం ఉండదని నిర్ణయించారు. యూసీసీపై చర్చతోపాటు రాష్ట్ర ఆందోళనకారులకు రిజర్వేషన్లపై సెలెక్ట్ కమిటీ నివేదికను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. దీంతో ఆగ్రహం చెందిన ప్రతిపక్ష నేత యశ్పాల్ ఆర్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రీతమ్ సింగ్ వ్యాపార సలహా కమిటీకి రాజీనామా చేశారు. యూసీసీపై చర్చకు సమయం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత యశ్పాల్ ఆర్య మాట్లాడుతూ తాము యూసీసీ బిల్లును వ్యతిరేకించడం లేదని అన్నారు. అయితే రాజ్యాంగ ప్రక్రియ, నిబంధనల ప్రకారం సభ పనిచేయాలని కోరుకుంటున్నామన్నారు. కాగా అసెంబ్లీ సమావేశాల తొలి రోజైన సోమవారం ఆరుగురు ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేల మృతికి సభలో నివాళులర్పించారు. -
UCC Bill: నేడు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూసీసీ బిల్లు
దేశంలో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)ను అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుంది. యూసీసీపై బిల్లును తీసుకురావడానికి ఉత్తరాఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ రోజు (మంగళవారం) రెండవ రోజున అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. పోర్చుగీస్ పాలనా కాలం నుండి గోవాలో యూసీసీ అమలులో ఉంది. యూసీసీ కింద వివాహం, విడాకులు, భరణం, భూమి, ఆస్తి, వారసత్వానికి సంబంధించిన చట్టాలు రాష్ట్రంలోని పౌరులందరికీ వారి మతంతో సంబంధం లేకుండా వర్తిస్తాయి. మంగళవారం సభలో ఈ బిల్లుపై చర్చ జరగనుంది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు చర్చల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కోరారు. యూసీసీ గురించి ఇటీవల మాట్లాడిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దీనివలన అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. బిల్లుపై సభలో సానుకూలంగా చర్చించాలని ఇతర పార్టీల సభ్యులను అభ్యర్థించారు. ఆదివారం రాష్ట్ర మంత్రివర్గం యూసీసీ ముసాయిదాను ఆమోదించి, ఫిబ్రవరి 6న బిల్లుగా సభలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. నాలుగు సంపుటాలలో 740 పేజీలతో కూడిన ఈ ముసాయిదాను సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి రంజన్ ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ శుక్రవారం ముఖ్యమంత్రికి సమర్పించింది. 2022లో జరిగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో యూసీసీపై చట్టం చేసి, రాష్ట్రంలో దానిని అమలు చేస్తామని బీజేపీ హామీనిచ్చింది. 2000లో ఏర్పడిన ఉత్తరాఖంఢ్లో వరుసగా రెండోసారి బీజేపీ అధికారాన్ని దక్కించుకుంది. 2022 మార్చిలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో యూసీసీ అమలుపై హామీనిచ్చింది. కాగా మంగళవారం అసెంబ్లీలో యూసీసీపై చర్చ జరగనున్న సందర్భంగా అవాంఛనీయ పరిస్థితులు చోటు చేసుకుంటే, వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నట్లు సమాచారం. -
యూసీసీ అమలుపై ఢిల్లీ హై కోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూ ఢిల్లీ : యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలుపై ఢిల్లీ హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యూసీసీని అమలు చేయాలని దాఖలైన పిటిషన్లను విచారించేందుకు కోర్టు తిరస్కరించింది. కొత్త చట్టాలు చేయడం, వాటిని అమలు చేయడం వంటి విషయాలు పార్లమెంటు పరిధిలోకి వస్తాయని పిటిషన్ల తిరస్కరణ సందర్భంగా హై కోర్టు వ్యాఖ్యానించింది. యూసీసీ అమలు విషయంలో ఈ ఏడాది మార్చిలో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఢిల్లీ హై కోర్టు ఉటంకించింది. యూసీసీ అమలు చేయాలన్న పిటిషన్లను అప్పట్లో సుప్రీం కోర్టు కూడా తిరస్కరించింది. చట్టం చేయాలని పార్లమెంటును ఆదేశించేందుకు మాండమస్ రిట్ను జారీ చేయలేమని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో అమలవతున్న పర్సనల్ లా చట్టాలన్నింటిని కలిపి అందరికీ ఒకే చట్టంగా యూసీసీని తీసుకురావాలనేది బీజేపీ ఆలోచన. ఇదే విషయాన్ని పార్టీ తన మేనిఫెస్టోలో కూడా పేర్కొంటూ వస్తోంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశంలో మత ఆచారాల ఆధారంగా పర్సనల్ చట్టాలు అమల్లో ఉన్నాయి. ఇలా కాకుండా అందరికీ వర్తించేలా ప్రతిపాదనలో ఉన్న చట్టమే యూసీసీ. ఇదీచదవండి..బిగ్బాస్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయితే: నాపై ట్రోలింగ్, బెదిరింపులు -
రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్) అమలు చేస్తామనే హామీని ఆ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరచనున్నట్టు పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. రోహింగ్యాలు, అక్రమ వలస దారులను వెనక్కి పంపడం, అన్ని పంటలకూ బీమా, ప్రీమియం సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందజేత, ఐదేళ్లలో మహిళలకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 10 లక్షల ఉద్యోగాల కల్పన, వృద్ధులకు కాశీ, అయోధ్యలకు ఉచిత ప్రయాణం వంటి అంశాలను ఇందులో ప్రస్తావించనున్నట్టు తెలిసింది. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను రూపొందించినట్టు తెలుస్తోంది. శనివారం సాయంత్రం బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా దీనిని విడుదల చేయనున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు కమిషన్ ఏర్పాటు, తెలంగాణలో 4 శాతం ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేత, 5 ఏళ్లకు రూ.లక్ష కోట్లతో బీసీ అభివృద్ధి నిధి ఏర్పాటు, ఆడబిడ్డ భరోసా పథకం కింద 21 ఏళ్లు వచ్చే సరికి రూ. 2 లక్షలు ఇచ్చే ఏర్పాటు, మహిళా రైతు కార్పొరేషన్ ఏర్పాటు, ఫీజుల నియంత్రణకు నిరంతర పర్యవేక్షణ వంటి అంశాలను దశ(పది) దిశ పేరుతో రూపొందించిన మేనిఫెస్టోలో పొందుపరిచినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో మరికొన్ని ఇలా... ♦ ధరణి స్థానం లో మీ భూమి యాప్, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ, గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ, ♦ సబ్సిడీ పై విత్తనాలు, వరి పై బోనస్, ఆడబిడ్డ భరోసా పథకం కింద 21 యేళ్లు వచ్చే సరికి రూ.2 లక్షల ఇచ్చే ఏర్పాటు, ఉజ్వల గ్యాస్ లబ్దిదారులకు ఉచితంగా నాలుగు సిలిండర్ లు అందజేత, బడ్జెట్ స్కూల్స్ కు పన్ను మినహాయింపులు, ప్రతి జిల్లా కేంద్రంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు, పీఆర్సీపై సమీక్ష, అయిదేళ్లకోసారి పీఆర్సీ ఏర్పాటు, జీఓ 317 పై పునః సమీక్ష, గల్ఫ్ దేశాల్లో తెలంగాణ భవన్ల ఏర్పాటు, ♦ అన్ని పంటలకు బీమా.