‘పచ్చ’ కుట్రకే పురం పీఠం
సాక్షి, పుట్టపర్తి/హిందూపురం: ఫిరాయింపు రాజకీయం తమకు కొత్త కాదని టీడీపీ మరోసారి రుజువు చేసింది. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను సంతలో పశువులు కొన్నట్లు కొనడం తమకే సాధ్యమని నిరూపించింది. అధికారం అండతో చైర్మన్ పీఠం దక్కించుకుంది.
క్యాంపు నుంచి నేరుగా కౌన్సిల్కు...
హిందూపురం మున్సిపల్ చైర్మన్ స్థానం కోసం సోమవారం జరిగిన ఎన్నికలో అధికార టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఆరుగురు సభ్యులతో చైర్మన్ పీఠం కోసం పోటీ పడిన టీడీపీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా సీఎం బావమరిది, స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ చైర్మన్ ఎన్నికలో అన్నీతానై నడిపించారు. అప్పటికే తమవైపు లాక్కున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లతో పాటు టీడీపీ, ఎంఐఎం, బీజేపీ కౌన్సిలర్లను ఐదురోజుల ముందే క్యాంప్నకు తరలించారు. సోమవారం ఉదయం సరిగ్గా ఎన్నిక సమయానికి కౌన్సిల్కు తీసుకువచ్చారు. అంతేకాకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారం అధికారులపై ఒత్తిడి తెచ్చి వైఎస్సార్సీపీ విప్ కూడా పరిగణనలోకి తీసుకోకుండా అడ్డుకుంటూ కుట్రలు చేశారు.
టీడీపీ గెలిచిందిలా..
సోమవారం జరిగిన చైర్మన్ ఎన్నికలో టీడీపీ తరఫున 6వ వార్డుకు చెందిన డీఈ రమేష్ బరిలో నిలవగా, వైఎస్సార్ సీపీ 3వ వార్డు కౌన్సిలర్ లక్ష్మిని పోటీలో నిలిపింది. ఎన్నిక ప్రారంభించగానే టీడీపీ సభ్యులు ఆరుగురు, బీజేపీ, ఎంఐఎం అభ్యర్థితో పాటు వైఎస్సార్ సీపీ నుంచి ఫిరాయించిన మరో 13 మంది కౌన్సిలర్లు టీడీపీ అభ్యర్థి రమేష్కు మద్దతు తెలిపారు. అలాగే ఎక్స్అఫీషియో సభ్యుల హోదాలో ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా మద్దతు తెలపగా టీడీపీ అభ్యర్థి రమేష్కు 23 ఓట్లు వచ్చాయి. పార్టీ ఫిరాయింపుదారులు పోగా వైఎస్సార్ సీపీకి 17 మంది కౌన్సిలర్లు ఉండగా... ఎన్నికకు ఇద్దరు గైర్హాజరయ్యారు. మరో కౌన్సిలర్ ఆలస్యంగా వచ్చి ఓటు వేసినా.. చెల్లదని అధికారులు ప్రకటించారు. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి లక్ష్మికి 14 ఓట్లు పోల్ కాగా, టీడీపీ అభ్యర్థి డీఈ రమేష్ చైర్మన్గా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అఽధికారి, ఆర్డీఓ ఆనంద్కుమార్ ప్రకటించారు.
అధికారానికి తలొగ్గిన యంత్రాంగం..
హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా యంత్రాంగమంతా అధికార పార్టీకి తలొగ్గింది. పోలీసులు ఆదివారం సాయంత్రానికే పట్టణాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. సోమవారం పట్టణంలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు చేశారు. సోమవారం ఉదయం ముందుగానే మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు మున్సిపల్ కార్యాలయం వైపు ఎవరూ వెళ్లకుండా కట్టడి చేశారు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లతో పాటు నాయకులు రాగా... గేటు వద్దే నాయకులను నిలిపివేశారు. చివరకు మీడియా ప్రతినిధులను సైతం కౌన్సిల్ హాలు వరకు వెళ్లకుండా అడ్డుకున్నారు. కానీ టీడీపీ కౌన్సిలర్ల వెంట ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే, ఎంపీ పీఏలు వెళ్తున్నా..ఏ మాత్రం అడ్డుచెప్పలేకపోయారు. అనుమతిలేని వారులోనికి ప్రవేశించరాదని అప్పటి వరకూ హంగామా చేసిన పోలీసులు...టీడీపీ నేతలకు వంగి వంగి సలాములు చేయడం చూసి జనం తప్పుపట్టారు.
మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ అడ్డదారులు
దగ్గరుండి ప్రలోభ రాజకీయం నడిపిన ఎమ్మెల్యే బాలకృష్ణ
అధికారానికే అండగా నిలిచిన యంత్రాంగం
Comments
Please login to add a commentAdd a comment