●అంతులేని ‘పచ్చ’పాతం ●తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి
సాక్షి ప్రతినిధి అనంతపురం: రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ లేని దారుణ పరిస్థితులు ‘తాడిపత్రి’లో నెలకొన్నాయి. కూటమి సర్కారు కొలువుదీరినప్పటి నుంచి అటు జేసీ వర్గీయుల ఆగడాలు, ఇటు పోలీసుల నిరంకుశ వైఖరితో నియోజకవర్గంలో సామాన్యులకు రక్షణ లేకుండా పోయింది. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై దాడులు జరిగి.. ఫిర్యాదు చేయడానికి వెళితే రివర్స్ కేసులు బనాయించి జైల్లో వేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదంతా ఒకెత్తయితే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలోకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్న తీరు వారి నిరంకుశ వైఖరికి అద్దం పడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
8 నెలలుగా...
2024 మే 13న సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.ఆ సమయంలో తాడిపత్రిలో అల్లర్లు జరగడంతో జేసీ ప్రభాకర్రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఇరువురూ కొన్ని రోజులు తాడిపత్రి నియోజకవర్గంలోకి వెళ్లకూడదని కోర్టు ఆంక్షలు విధించింది. ఆ తర్వాత ఇద్దరికీ బెయిలు రాగా, జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రికి వెళ్లారు. ఇదే క్రమంలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లాలని ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు. ఇక.. అప్పటి నుంచి ఆయన తాడిపత్రికి బయలుదేరితే చాలు అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారు.
అడుగులకు మడుగులొత్తుతూ..
కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నారన్న సమాచారం అందగానే టీడీపీ కార్యకర్తలను జేసీ ప్రభా కర్ రెడ్డి రెచ్చగొడుతున్నారు. వాట్సాప్ల ద్వారా మెసేజ్లు పంపి పట్టణంలో అలజడులు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో శాంతిభద్రతల పేరుతో జేసీ అడుగులకు మడుగులొత్తుతూ పోలీసులు పెద్దారెడ్డిని అడ్డుకుంటుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఒక మాజీ ఎమ్మెల్యేను 8 నెలలుగా తాడిపత్రిలోకి రానివ్వడం లేదంటే ‘పచ్చ’ నేతకు ఖాకీలు ఎంతలా దాసోహమయ్యారో అర్థం చేసుకోవచ్చు. సోమవారం కూడా తాడిపత్రికి బయలుదేరిన పెద్దారెడ్డిని యల్లనూరు మండలంలోని ఆయన స్వగ్రామం తిమ్మంపల్లిలో గృహ నిర్బంధం చేశారు. బలగాలను మోహరించి బయటకు రానివ్వలేదు.అంతే కాకుండా తాడిపత్రిని అష్టదిగ్బంధనం చేశారు. పట్టణం చుట్టూ చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్రజలను భయాందోళనకు గురి చేశారు.
కోర్టు కేసు సాకుతో...
మాజీ ఎమ్మెల్యే అయిన తనకు తాడిపత్రిలోకి వెళ్లే అవకాశం కల్పించడంతో పాటు పోలీసు రక్షణ కల్పించాలని పెద్దారెడ్డి కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో కోర్టులో కేసు ఉందన్న సాకుతో పోలీసులు ఆయన్ను పట్టణానికి వెళ్లనివ్వడం లేదు. గత వైఎస్సార్ సీపీ హయాంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి నిత్యం తాడిపత్రిలోనే ఉండేవారు. అప్పట్లో ఆయనపై ఎన్నడూ ఇలాంటి ఆంక్షలు విధించలేదు. కానీ నేడు శాంతిభద్రతల పేరుతో పెద్దారెడ్డిని అడ్డుకుంటుండటం గమనార్హం. కోర్టు అనుమతి ఇచ్చేవరకూ మాజీ ఎమ్మెల్యేకు పోలీసులు రక్షణ కల్పించలేరా అన్న సందేహాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. తాడిపత్రిలో ఇటీవల గంజాయి విక్రయాలకు, మట్కాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతుండటంతో నిత్యం భయంభయంగా గడపాల్సిన పరిస్థితి. అసాంఘిక శక్తుల పీచమణచడంపై కాకుండా పోలీసులు పచ్చ నేతల సేవలో తరిస్తుండటంతోనే ఈ దుస్థితి దాపురించిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
పెద్దారెడ్డిని పిలిచి మాట్లాడతా
శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతోనే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి పంపించడం లేదు. పోలీసు రక్షణ కోసం ఆయన కోర్టుకు వెళ్లి ఉన్నారు. కోర్టు తీర్పు కోసం వేచి చూస్తున్నాం. అయినా ఆయనను పిలిచి మాట్లాడతా. సమస్య పరిష్కారమయ్యేలా చూస్తా.
–జగదీష్, ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment