చీరాల: నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి అరాచకాలను అడ్డుకోవాలని, ఓట్లు కొనుగోలుకు పాల్పడుతున్నారని చీరాలకు చెందిన నాయుడు నాగార్జునరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనాకు సోమవారం విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 9న పందిళ్లపల్లిలోని ఆమంచి నివాసంలో జరిగిన సమావేశంలో మత్స్యకార గ్రామ పెద్దలను లోబరుచుకుని 1700 ఓట్లు ఉన్న గ్రామాన్ని రూ.64 లక్షలకు కొనుగోలు చేశానని ఆమంచి ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. గత 10 ఏళ్లుగా విద్యుత్ బకాయిలు రూ.3.50 కోట్లు చెల్లించకుండా ఆ శాఖ అధికారులను బెదిరించారని పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికలలో కూడా ప్రభుత్వ అధికారులను బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ తన రాజకీయ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గత పది సంవత్సరాలుగా ఆమంచి కృష్ణమోహన్ అవినీతి, అక్రమాలు బహిర్గతం చేసిన తనపై కక్షగట్టి కొంతమంది పోలీసు అధికారుల సహకారంతో తనపై పలుమార్లు హత్యా ప్రయత్నాలకు పాల్పడ్డారని చెప్పారు. సుమారు 15 సార్లు భౌతిక దాడులకు చేశారని ఫిర్యాదులో తెలిపారు.
ఓట్లు కొనుగోలుపై చర్యలు తీసుకోవాలి ఈసీకి ఫిర్యాదు చేసిన నాగార్జునరెడ్డి