రాజ్యసభ సభ్యుడు మోపిదేవి
రేపల్లె రూరల్/ చెరుకుపల్లి: రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో అఖండ మెజార్టీతో మరోమారు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యమని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు ధీమా వ్యక్తం చేశారు. రేపల్లె పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం సెంటరులో జరిగిన ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. రేపల్లెలో వైఎస్సార్ సీపీ జెండా ఎగుర వేయడం ఖాయమని తెలిపారు. డాక్టర్ ఈవూరు గణేష్ను గెలిపించుకుని రేపల్లె అసెంబ్లీ స్థానాన్ని జగనన్నకు కానుకగా అందిద్దామని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నవరత్న పథకాలతో పేదల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచారని పేర్కొన్నారు. రేపల్లె నియోజకవర్గంలోనే వివిధ సంక్షేమ పథకాల ద్వారా అవినీతికి తావునివ్వకుండా రూ.1,545 కోట్లకు పైగా నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో జమ అయ్యాయని వెల్లడించారు. ఇంత సంక్షేమం గతంలో ఏ ప్రభుత్వ హయాంలో జరిగిన దాఖలాలు లేవని తెలిపారు. రేపల్లె ప్రచార సభకు వచ్చిన అశేష జనవాహినిని చూస్తుంటే గణేష్ విజయం ముందుగానే ఖరారైనట్లుందని పేర్కొన్నారు. ఇదే ఉత్సాహంతో ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మోపిదేవి పిలుపునిచ్చారు.
రానున్నది జగనన్న ప్రభుత్వమే