రేపల్లె రూరల్: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్ని ప్రశాంత వాతావరణంలో ప్రణాళికాబద్ధంగా, సమర్థంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. రేపల్లె పట్టణంలోని ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం పంపిణీ కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే ఎన్నికల నిర్వహణ సరళిపై సంబంధిత అధికారులు, పీవోలు, ఏపీవోలకు దిశా నిర్దేశంతో పాటు శిక్షణ తరగతులు నిర్వహించామని చెప్పారు. జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. గత ఎన్నికల అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని అల్లర్లు జరిగిన గ్రామాలు, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్ని గుర్తించి ఎన్నికల కమిషన్కు నివేదించామని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక పోలీసు బలగాల పహారాతో పాటు ఓటింగ్ సరళిని లైవ్ వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తామని వివరించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు బుధవారం వరకు అవకాశం కల్పించామని తెలిపారు. అనంతరం ఆర్వో కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రాన్ని, మండలంలోని పేటేరులోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు జారీ చేశారు. ఆయన వెంట రేపల్లె ఎన్నికల రిటర్నింగ్ అధికారి హెలా షారోన్ తదితరులున్నారు.
జిల్లా ఎన్నికల అధికారి,
కలెక్టర్ రంజిత్ బాషా