భద్రాచలం/బూర్గంపాడు : పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద నిరంతర తనిఖీ చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లో అక్రమ మద్యం, నగదు రవాణాకు అవకాశం ఇవ్వొద్దని ఎన్నికల పరిశీలకులు రచిత్రాజ్ అన్నారు. భద్రాచలంలోని కూనవరం రోడ్డులో ఏర్పాటుచేసిన ఎఫ్ఎస్టీ అంతర్రాష్ట్ర చెక్పోస్టును గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చెక్పోస్టుల వద్ద సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు నిర్వహించే ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్షోలను తప్పనిసరిగా రికార్డు చేయాలన్నారు. ఎన్నికల సంఘం సూచన మేరకు ప్రచార ఖర్చులు, ఇతర వ్యయాల నమోదుకు రిజిస్టర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. సెలవు రోజుల్లో కూడా పటిష్ట నిఘా ఉండాలని, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా తనిఖీలు చేపట్టాలని సూచించారు. అంతకుముందు బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర వద్ద ఐటీడీఏ పీఓ ప్రతీక్జైన్ రచిత్రాజ్కు ఘనంగా స్వాగతం పలికారు. ఆయా కార్యక్రమాల్లో భద్రాచలం ఆర్డీఓ దామోదర్ రావు, ఏఈఓ వేల్పుల శ్రీనివాసరావు, తహసీల్దార్లు రాఘవరెడ్డి, ముజాహిద్, ఎంపీడీఓ జమలారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల పరిశీలకులు రచిత్రాజ్
స్వాగతం పలికిన ఐటీడీఏ పీఓ